పొద్దుటినిండి గేటు కాడే నిలబడిపోయేను నేను. సినమాయ్యొచ్చి పెద్దోళొస్తన్నారు బయటెవ్వరునేరు ఎళ్ళిసూడమంటె వచ్చుండిపోయాను. కాన్మెంటు నాని, మూర్తిమేష్టారాలొచ్చేరు. నన్ను చూసి “ఓరి నువ్వు అమ్రికాలోనున్నావన్నారు? నువ్వెప్పుడొచ్చేవు?” అని అడిగి లోపలికెళ్ళేరు. తెలిసినోళ్ళందరొస్తన్నారు.
బయటున్నాను కాని తెలిసిన ముఖాలొచ్చినప్పుడు వేణు చినాన్న ఏడుపు ఇనిపిస్తంది. “ఎలిపోయేడు నాయినా, మారాజు ఎలిపోయేడు, మా అక్కకి అన్యాయం సేసి ఎలిపోయేడు. సూడండి మళ్ళ కనిపిస్తాదేటి ముఖమూ సూడండి నాయినా” అని శోకాలు తీస్తన్నాడు వేణు చినాన్న. చినాన్న అంటావు కానీ అమ్మమ్మకి తమ్ముడు, తాతవుతాడు. పక్కనే కూర్సున్న పరిమిశెట్టోల పెద్దోడు “ఓరొల్లకోరా ఏణు, ఆడోల్లందరు ఇప్పుడే అగినారు నువ్వు మళ్ళీ మొదలెట్టిసేవు” అని ఆపినా ఆగలేదు. ఈధిలో ఏ ఇంటిలో ఏదొచ్చినా పరిమిశెట్టోల పెద్దోడొచ్చి సేతిలో పనిలాగీసుకుని నేసేత్తాలేరా అని దూరిపోతాడు. ఆనక సాయిం సేసేడు కదా అని ఒక యాభై ఇస్తే ఎళ్ళి నాలుగు సుక్కలేసుకొచ్చేత్తాడు. పెదమాయ్యొచ్చి “నువ్వింక ఆపుతావా లేదా? పిల్లలు బయపడిపోతన్నారు” అని వేణు చిన్నాన్నని కసిరీసేడు. “ఆపిస్తానులే నాయిన ఆపిస్తానులే. మళ్ళరేపీయాలకొచ్చి ఏడుస్తానా? ఆపిస్తానులే” అని మూలుగుతున్నాడు.
“ఏనాడయిన ఒక్క మాటన్నోరేనా? ఇళ్లల్లో ఇంతమంది పెళ్ళాలిని తిట్టీవోళ్ళని సూసాం కాని ఏనాడయిన మహానుభావుడు నోరు జారేరా? పోని జరుగుబాటుకి ఏదైన లోటు సేసేరా? చివర్లో నేనిసిగిపోయి అనీసేను కాని. ఇంటిలోన ఈ ఒంటేలేటి మనిషికి తెలివి లేకుండా. ఈ రొచ్చులో నన్నుండమన్నారా? చావమన్నారా? అనిస్తే నవ్వీసి పొనలాగే నీ అన్నదమ్ముల దగ్గిరికెళిపోతావేటి అనీవోరు కాని తగువేసుకునీవోరు కాదు” అని పంతులమ్మగోరితో అమ్మమ్మ సెబుతుంటే, పంతులమ్మగోరు అమ్మమ్మ సెయ్యి పట్టుకుని గుమ్మం దగ్గర కూర్సుండిపోయారు.
“నువ్వనీస్తవమ్మా. ఎందుకనీవు? నోరులేని మనిషిని పట్టుకుని అనీస్తవుగాని. నీ అన్నదమ్ముల్ని కాని, నీ పిల్లల్ని కాని అనీమను. ఏటున్నదని అనీటానికి? ఏలు పెట్టి సూపించే మనిషేటి? మాయమ్మ నొరు నీకొచ్చి నువ్వందరినీ అనీస్తవు.” అని వేణు చిన్నాన్న శోకాలు పెడుతూనే ఉన్నాడు.
ఊరిలో రాజికీయం సేసివోళ్ళొచ్చారు. నాన్న సప్లియర్సోలకి ఫోన్ చేసి తెప్పించేయించిన కుర్సీల్లో బడిపిల్లల్లాగ సేతులు కట్టీసుకుని కూర్సున్నారు. “నాగిస్సర్రావుగారూ, మీ మాయ్యగారని సెప్పుకోటమే కాని మనిషి ముఖం తెలియదండి. అదిగో ఆ రోడ్డంటెప్పుడయినా కోవటిపల్లెలుతుంటే పొలం దగ్గర నూర్పులు సేస్తుంటే సూసివోళ్లమంతే” అనీసి సెబుతున్నారు. నాన్న టీకొట్టు రవణని పిలిసి అందరికీ టీలిచ్చీమన్నారు. “బయిటికొచ్చీ మనిషి కాదండి. ఇంటికాడె కనిపెట్టుకునుండీవోరు. సిన్నపిల్లలందరికీ గొప్ప సేరిక. అదిగో మా పాప, మా బాబు దగ్గిరనుండి మా మరదలిగారి పిల్లలదాక అందరినీ ఆయినే ఆడించీవోరు.” అని సెబుతూ ఏదొ గుర్తొచ్చినట్టు “ఒరేయ్ భారతమ్మ పిల్లలు యాడదొకొచ్చేరు పోను కొట్టండి” అని కేకేసేరు. “పెద్దోడి కారులో వొస్తన్నారట కదా. రాజమండ్రి దాటీసేరంట” పెదనాన్న సెప్పేరు.
ఎవులో వొచ్చి “బాబు నీకేటవుతారేటి సిన్నారావు గారు?” అని అడిగారు. “మా తాతగారండి” అని సెప్పేను. “శామలమ్మ కొడుకువా? నువ్వల్లకడెక్కడో అమ్రికాలో ఉన్నావన్నారు. అందవనీసేరు.వొచ్చీసేవా” అన్నారు. “అందరూ వొచ్చీసేరు నాయినా, అందరినీ రప్పించీసుకున్నాడు రాజు. అందరు మనవళ్ళు కొడుకులతోటి జరిపించీసుకుంటున్నాడు. భోగమంటే నీదే నాయినా” అని వేణు చిన్నాన్న మళ్ళీ అందుకున్నాడు.
గంగులీధి కావెస్సర్రావొచ్చాడు. కావెస్సర్రావుకి తాతగారంటే గొప్ప ఇది. “ఇంటిలో సిన్నోడని సిన్నరావనిస్తారు కాని రాజారావండి మా మాయ్య పేరు” అని ఎవురితోనో మాట కలిపేడు కామెస్సర్రావు. గంగులీధి నుండి శంకర్రావు కొడుకు కబురు తెచ్చాడు. గంగులీదావిడ వద్దావనుకుంటుందంట రిక్షా పంపిస్తే వస్తానని కబురెట్టింది. కానయితే ఆవిడకి సేసే తంతంతా నాకూ సెయ్యాలని కండీషనెట్టిందట. ఆవిడంటే మా అమ్మమ్మ అనీసి. శంకర్రావు మా తాతగారికి అన్నియ్య కొడుకు. మాకు పెదనాన్న వరస. శంకర్రావు కొడుకు ప్రెసాదంటే నాకంటె రెండేళ్లు సిన్నోడే కాని గంగులీధిలో మనిషి పెద్దతరహా అనీసి, సదువుకున్నోడు అనీసి ఇలాంటి కబుర్లు సక్కబెట్టడానికి ఆడికే సెప్తారట.
ప్రెసాదు మా పెదమాయ్యని, సినమాయ్యని పిలిసి “మనిషి పోయినకాడ పట్టింపేటి సిన్నాన్న రిక్షా పంపించిస్తే ఆవిడ కూడా సూస్తది కదా” అని కర్ర ఇరక్కుండ సెప్పాననుకున్నాడు. “ఓరెనువ్వు ఆ ఈత్తరుపునొచ్చేవా, తాతని సూడ్డానికొచ్చేవా? ఏటిరా ఆయమ్మ గొప్ప? మనిషి పోయి మేమేడుస్తుంటే రిక్షా అంపాలా?” అని అందరూ తగిలీసుకున్నారు. పెదమాయ్యకసలే సెడకోపం “ఏటి బుర్రగాని తిరుగుతున్నాదేటిరా ముసిల్దానికి? మా అమ్మకి సేసినట్టు దానికి సెయ్యాలా?” అని ఎగిరిపోతుంటే ప్రెసాదుగాడు బిక్కయిపోయాడు. సినమాయ్యొచ్చి ప్రెసాదుగాడిని పక్కకి తీసుకెళ్ళి “ఒరేయ్ అమ్మతో మాట్టాడినాను. ఆయమ్మొచ్చి సూస్తే మాకేటి అబ్బింతరం లేదు. మావేటి అడ్డు సెప్పం. కాని రిక్షాలంపడాలాటివేట్నేవు.” అని కరాఖండిగా సెప్పిసేడు. ప్రెసాదుగాడు సైకిల్ స్టేండు తీసి గమ్మునెళ్ళిపోయేడు.
“ఇంకేటి మిగిలిందావిడతోటి? మనిషికి సుస్తీ సేసిందని తెలిసిన్నాడు కూడా ఆస్థి ఎలాగమ్మీసుకుందామని సూసినావిడతోటి మాటలేటి? మీకు బుర్రలుగాని పోనాయ” అని వేణు చిన్నాన అందరిని కసిరిసేడు. గంగులీధినుండొచ్చిన కావెస్సర్రావు వీధావిడమీద నోరు జారితే వీధిలో ఏరయిపోతామని కామయిపోయేడు.
ఏటి జరుగుతుందో అర్ధంకాని ఎదురింటి రామరాజుగారొచ్చి “ఏటండి భోగట్టా? ఎవరాలు?” అని కామేశ్శర్రావునడిగాడు. దగ్గరలోని మా మావయ్యలు గానున్నారేమోనని సూసుకుని సిన్నగొంతుతో “ఏటినేదండి మా సిన్నారావు మాయ్య సంగతి మీకు తెలియందా, అసలే ఒకీధిలో ఉన్నోళ్ళు. మనిషి నిఖార్సయిన మనిషి. మప్పితం లేదు. టపీమని మొహమ్మీద సెపుతాడు కాని, ఇచ్ఛికాల కోసం బొంకడం తెలీదు. మరయితే మా మావయ్యకయితే ఆ రోజుల్లో ఒక పెళ్ళయిన మాట నిజం. ఎవురికీ తెలీదనుకోండి. ఇప్పుడయితే మీ ఈదిలో ఇల్లు కట్టీసుకున్నాడు కాని, మా గంగులీధిలో ఇప్పుడికీ మా మాయ్యకి ఇల్లుంది. మా ఈది పిల్లనే ఇచ్చి పెళ్ళి చేసిసేరు. కానయితే పెళ్ళయి నెల్లాళ్ళయిన పిల్ల కాపురానికొచ్చింది కాదు. సూసేరు సూసేరు ఇక వల్ల కాదనీసుకుని పెద్దోళ్లందరిని పిలిచీసి ఏటీ పేచి? పెళ్ళి చేసీసుకున్నాక కాపరానికి రాకపోడాలేటి. ఇక నాకీ పిల్లొద్దని సెప్పీసేడు మాయ్య.
ఈదంత ఒక్కటయిపోయి పిల్లనొగ్గీడవేటి? ఇదేవన్నా పెళ్ళనుకున్నావా? బొమ్మలాటనుకున్నావా? అని మా మాయ్య మీదకొచ్చీసేరు. గంగులీధంటే అందరూ సుట్టాలే. అన్నీ మా కుటుంబాలే. ఎవ్వరినీ వదులుకునే మనిషి కాదు మా సిన్నారావు మాయ్య. మనిషికి గొప్ప మమకారం, ఆపేక్ష. అలాంటి మనిషి మీదకి గొడవకొచ్చీసేరు. “సుట్టాలు సుట్టాలనుకుంటే ఈదంత ఒక్కటయిపోతారా? ఏం ఆ పిల్లే మీ రక్తమా? నేను మీ రక్తం కాదా? దాని బ్రతుకే గాని నాది బ్రతుకు కాదా?” అని అందరిని నిలేసి నేను ఈ ఈదిలోనే ఉండనని పంతం పట్టీసేడు. మనసిరిగిపోతె మా మాయ్య మనిషి కాడు.
ఈదిలో పెద్దలు మనిషి ఎళ్ళిపోత నన్నాడన్న బాధ కూడా నేకుండా, అమ్మాయి సంగతేటన్నారు. ఆ ముక్కతో ఆ ఈది మీద, ఆ మనుషుల మీదున్న ప్రేమ సచ్చిపోయి అప్పుడుకప్పుడు సిన్నారావు మాయ్య నోటరీ సభాపతిగోరిని పిలిసీసి మా నాన్న నాకిచ్చిన పొలాలు, ఇల్లు ఆవిడ బ్రతికున్నదాక అనుభవించాడినికిన్నీ, అవిడ తదనంతరవూ అవి నా వారసులకి సెందాలని వ్రాసీసిచ్చిమని సెప్పి ఆ పూటే కట్టుబట్టలతో వీధి వదిలీసి వచ్చీసేడు.” అని కావెస్సర్రావు సెబుతుంటే జనాలు గుమిగూడీసి ఇంటన్నారు. ఎనకాలె ఉన్న సువ్వాడ గోపాలం “మాకు తెలీకపోవడమేటి బాబు, సిన్నరావుగారి పొలాలన్నీ మేవే సూసివోళ్ళం. గంగులీదావిడకి బాబొదిలిసిన పొలాలు మావే సేత్తన్నాం.” అని అందుకున్నాడు.
సువ్వాడ గోపాలం పక్కనే సువ్వాడ కిష్ణ, గౌరునాయుడు నిలబడి సూత్తన్నారు. గౌరునాయుడొచ్చి “ఎప్పుడొచ్చేరు బాబు? నాన్నో” అని అడిగాడు. నేను నాన్నని సూపించేను. నన్ను దాటుకుని గుమ్మంలోకెళ్ళి నిమ్మళంగ పడుకున్న తాతగారిని సూసి కాసేపలాగ నిలబడిపోయేడు. మా పొలాలన్నీ గౌరునాయుడే సూసివోడు.
కాపోతే గౌరినాయుడికి సిన్న దొంగబుద్దుందని తాతగారు సివర్లో మానిపించీసేరు. గౌరినాయుడి పెళ్ళాం లష్మి కోతలప్పుడు, నూర్పులప్పుడు వొచ్చి మిగిలిపోయిన పరకలేరుకున్న నెపాన మోపులోని పరకలు లాగీడం తాతగారు సూసి గెట్టిగ కేకలేస్సేరు. “ఓసిదేటి బాబూ, మిగిలిపోయిన పరకలేరుకోరా” అనుకుంట ఆ అమ్మి ఎళ్ళిపోయింది. రాతిరి కాపలాకి పోయి ఇంత కునుకు తీస్తే మోపులు మాయం సేస్సీవోరు. సూసి సూసి ఇసిగిపోయి “ఏవోయ్ గౌరినాయుడు రైతన్నోడు సెయ్యాల్సిన పనేనా? నమ్మి పొలాలు సెయ్యమని పిలిస్తే మాకే మట్టి కొడతారా? ఇక మనకి కుదర్దు గాని సాయంకాలం ఇంటికొచ్చి నీకు రావాల్సినవి తీసీసుకో. ఇంక నా మడిలోకి రాకు” అనీసేరు. “ఒసేటి బాబు, ఏనాటి నుండి సేత్తన్నారు వ్యవసాయము, ఈమాతరం గింజలు తియ్యని రైతెవుడీవూర్లో? దీనికే మడిలోకి రావుద్దనిసేరు” అని అడిగేడు కాని మా తాతగారయితే మళ్ళ గౌరినాయుడిని పిలిసింది కాని, సూసింది కాని లేదు.
పిన్ని పిల్లలు ఇంకా రానేదు. ఆల్లొచ్చి సూసీదాక ఏం నేదని అందరికీ చెప్పిసిందమ్మమ్మ. వచ్చినోలు టీలు తాగుతా సప్లియర్స్ కుర్సీల్లో కూకుండిపోయారు. వేణు సిన్నాన్న ఎళ్లి కావేస్సర్రావు పక్కనే కూర్సొని “కావెస్సర్రావు ఆవిడ పద్దతేటి? మా బావకి బాలేదని తెలిసిన్నాటి నుండి సూత్తన్నాం. అనుభవించమని ఒగ్గీసిన ఆస్థిని పడీసుకుని అన్నదమ్ముల పిల్లలికిచ్చిద్దమని తాపత్రయిమేటి? మా బావ బాగున్న రోజుల్లోనే ఎంతమందో సెప్పారు, ఆవిడకి ఎంతోకొంతిచ్చీసి ఆ పొలాలు, ఇల్లు తీసీసుకోమని. మాబావ దేవుడు మాట తప్పుతాడా? ఆ పొలాల మీద ఎంతొస్తుందో, ఆ ఇళ్ళు ఏటవుతుందో ఒక్కనాడైనా అడిగాడా? అలాంటి మారాజు సొమ్ము పడీసుకోటానికి అప్పుడే మధ్యవర్తులతో మాట్టాడీసిందంట.
లోకంలో ధర్మమేటి లేదనుకుందేటాయమ్మ. కట్టుబట్టలతో అన్నీ వొగ్గీసి వచ్చీసేడుగావల. ఆ బాబు కష్టం సేసి టాటా, జెంషేడుపూరు అని ఊర్లు ఊర్లు తిరిగి వ్యాపారం సేసి ఏదో సంపాదించి కాణీ దాసేడు కనకగాని లేకపోతె ఈ పిల్లల్ని ఎలా పెంచీవోడు? పిల్లలకింత దాసిపెట్టాలని పొలంలోనూ, సామిల్లులోనూ పనోళ్ళతోటి పనోడిలాగ మూటలెత్తీసి ఒక కష్టం పడ్డాడా? అలాటి బాబు దగ్గరా లాగీసుకుందామని సూస్తన్నారు?” అని దులిపేత్తుంటే ఊ కొడతన్నాడే కాని మారు మాట్టాడలేదు కావెస్సర్రావు.
పిన్నికొడుకులు వచ్చీసేరు. తాతగారిని ఎరిగినోళ్ళంతా వచ్చి పోటీపడి భుజాలకి ఎత్తుకున్నారు. పుట్టినాటి నుండి మాతోటే ఉన్న తాతగారు కళ్ళ ముందే కలలాగా కరిగిపోయేరు. కాలుతున్న కట్టెలు సూస్తుంటే కళ్ళల్లో నీళ్ళాగేయి కాదు. కానీ మరలా రేపు సూస్తామా? ముట్టుకుంటామా? గోడమీద పటంలో సూసుకోటానికి ముక్కూమొహం తెలియని దేవుడా? మమ్మల్ని ఎత్తుకునాడించిన తాతగారు.
పరిమిశెట్టోల పెద్దోడొచ్చి “ఇక కదలండిరా మీరందరూ. ఇంటికాడ చెయ్యాల్సిన పనులుంటాయి ఎళ్ళి సూడండి. ఈ సాకలోడు కిరసనాయిలికి కక్కుర్తిపడి సరిగ్గా కాలుస్తాడో లేదో, నేనిక్కడే ఉంటాను” అని సెప్పి పెదమాయ్య వైపు సణుగుతూ సూసేడు. వేణు చినాన్న పెదమాయ్యతోటి ఒక వొందిప్పించేడు. సాకలి రాము కూడా “మీరెళ్ళండి బాబు నేను సూసుకుంటాను” అని చెప్పి అందరిని పంపీసేడు.
తిరిగొచ్చిస్తుంటే గౌరినాయుడు కనిపించాడు. కాస్త దూరంలో నిలుసుని ఎగిరిపడుతున్న మంటల్ని సూస్తన్నాడు. “ఏమిరా గౌరినాయుడు ఇక్కడ నిలబడిపోయేవేమి?” అని అడిగాడు పరిమిశెట్టోల పెద్దోడు. మనిషికి మాటలేదు. ఎన్నేళ్ళు పనిసేసేడు మరి. ఏ జ్ఞాపకాలు కదిలాయో ఏటో.
పరిమిశెట్టోల పెద్దోడు ఆ రావిచెట్టు కింద కూర్సుని “ఓరి గౌరినాయుడు మనిషి సచ్చిపోయినంత మాత్రాన పంతం సచ్చిపోద్దా? ఆ గంగులీదావిడ సూడు మనిషి సచ్చిపోయిన కాడ కూడా నాకు పిలుపు రావాలి, రిక్షా రావాలి అన్నాది. సిన్నరావు గారితోటి పంతమా? పేనంలేని ఆయన శరీరం కూడా ఆమెను సూడకుండానే వెళ్ళిపోయింది సూసావా?
మనిషి మిగులున్న నాడే కాస్త మంచి మిగుల్సుకోవాలిరా. మనిషి పోయేక ఎన్ననుకుని ఏటి నాభం. నీ తప్పులు నా తప్పులు లెక్కలెయ్యటానికి దేవుడొస్తాడనుకున్నావేటిరా. ఇదిగో ఇలాటి మహానుభావులే వొచ్చి ఒరేయ్ ఇది తప్పురా అని సెప్పీసెళ్ళిపోతారు” అని సణుక్కుంటూ సీసా మూత తీసేడు