రాము ఓ దేవుడు

Vodka with Varma

Vodka with Varma

టైటిల్ చూసాక హా ఏముందిలే రామూ భజనపరుడి వ్యాసం అని చాలామంది ఇగ్నోర్ చేసి పేజ్ మార్చేసుంటారు. క్షమించాలి నాకు భజన చేసే ఆసక్తి, ఓపిక రెండూ లేవు. కేవలం రాము పేరు చూసి నా ఇష్టం, వోడ్కా విత్ వర్మ పుస్తకాలు కొని, చదివిన పాపానికి డబ్బు, టైం రెండూ నష్టపోయినవాడిగా, రామూని కసి తీరా తిట్టాలని వ్రాస్తున్నా. కానీ దెయ్యం, రాక్షసుడు, డెవిల్, రావణాసురుడూ, ధుర్యోధనుడు వంటి బిరుదుల్ని ఆనందంగా ఆభరణాలుగా ధరించేవాడిని ఏమని తిట్టాలి? అందుకే రామూ దేవుడు అని తిడుతున్నా. మా నాన్నగారు నాస్తికులు, నాశిష్యులు యమనాస్తికులు, నేను పుట్టు నాస్తికుడ్ని అని చెప్పుకునే రామూకి ఇంతకంటే పెద్దతిట్టు ఏముంటుంది. అందుకే కసితీరా తిడుతున్నా రామూ ఓ దేవుడు.

దేవుడు రాయి రూపంలో ఏ చెట్టు కిందో, పుట్టలోనో కనిపించి తన ఉనికిని చాటుకోగానే దేవుడి పని అయిపోతుంది. ఆపైన ఆయన కదలకుండా కూర్చుని ఉంటే మిగిలిన హడావుడంతా చేసేది భక్తులే. ఆలయాలు కట్టినా, ట్రస్టులు పెట్టినా దోచుకున్నోడికి దోచుకున్నంత. ఇక్కడా అంతే రామూ తనకున్న సినీ పరిజ్ఞానంతో కొంత, తనకున్న తిక్కతో మరింత, మీడియాలో చేసే కాంట్రవర్సీలతో మరికొంత ఇమేజ్‌ని సంపాదించుకుని ఒక మూల మందు తాగుతూ ముసిముసిగా నవ్వుతూ కూర్చున్నాడు. ఇప్పుడా ఇమేజ్‌ని వాడుకోవటంలో ఎవడి సత్తా వాడు చాటుకుంటున్నాడు.

నా ఇష్టం పుస్తకం రామూ ఐడియానో, లేక ఎమెస్కో వారి ఐడియోనో నాకు తెలియదు కానీ అది తెలుగు ప్రింట్ పుస్తకాల మార్కెట్లో అప్పటి వరకూ ఉన్న రికార్డులు మార్చేసింది. రామూ అనే పేరుకున్న మార్కెట్ డిమాండ్ బయటపడింది. ఆ డిమాండ్‌ని ఉపయోగించుకోవటం కోసం ఎమెస్కో వారు రాము పై మరిన్ని పుస్తకాలకు తెర తీసారనిపిస్తుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్‌లో హైదరాబాద్‌లో రెండువారాల పాటూ జరిగే పుస్తక ప్రదర్శనని ఉపయోగించుకుంటే తమ మార్కెట్‌కి సరైన కిక్ స్టార్ట్ లభిస్తుందని అర్ధం చేసుకుని గత ఏడాది నా ఇష్టం లానే ఈ ఏడాది వోడ్కా విత్ వర్మని పుస్తక ప్రదర్శనలో వదిలారు.

వోడ్కా విత్ వర్మ ట్రైలర్ రిలీజ్ కాక ముందు సిరాశ్రీ అనే పేరు ఎంతమందికి తెలుసు? కనీసం సినిమా రంగంలో ఆ వ్యక్తి ఎంతమందికి పరిచయం? కొద్దో గొప్పో తెలిసిన వారికి కూడా కేవలం గ్రేటాంధ్ర వ్యక్తిగా తెలిసుండొచ్చు. అది కూడా నేను ఖచ్చితంగా చెప్పలేను. కేవలం పుస్తకంలో రచయిత చెప్పిన విషయాల బట్టి ఆ మాత్రం తెలుసని అనుకుంటున్నా. ప్రముఖ వ్యక్తి కాదు, రచయితగా పూర్వానుభవంలేదు అలాంటి వ్యక్తి వ్రాస్తున్న మొదటి పుస్తకానికే లక్షల ప్రింట్లు వేయించటానికి ఎమెస్కో వారు సిద్దపడ్డారంటే అది రామూ ఆశీర్వాద చలవే. తన చుట్టూ చేరిన వారిలో చాలామందికి డైరెక్షన్ అవకాశాలిచ్చి రాత్రికి రాత్రే డైరెక్టర్లని చేసేసే అపర బోళాశంకరుడు రామూ, సిరాశ్రీకి ఇచ్చిన జీవితకాల సాఫల్యావకాశం ఈ పుస్తకం అని నా అభిప్రాయం.

ఇక పుస్తకం విషయానికి వస్తే టైటిల్, కవర్ పేజ్ ఈ పుస్తకానికి కొండంత అండగా నిలిచాయి. పుస్తకాల షాపులో తిరుగుతున్న ప్రతివాడు ఈ పుస్తకాన్ని ఒకసారి చేతుల్లోకి తీసి చూసాడంటే అది ఆ రెంటి చలవే. పబ్లిషర్ పుస్తకం గురించి అని చెప్పి వ్రాసిన మొదటి పేజీలో రామూ ఒక బ్రహ్మపధార్ధం, ఒక కొరుకుడు పడని గుండ్రాయి, అతడిని అర్ధం చేసుకునే చిన్న ప్రయత్నమే ఈ పుస్తకం అనే భారీ పసలేని పంచ్ డైలాగులతో పుస్తకం మొదలయ్యింది. ముందుమాట ఏ మాత్రం అవసరం లేని పుస్తకానికి ముందుమాట వ్రాసి పూరీ జగన్నాధ్ తేలిపోయాడు. అందులోనూ అత్యుత్సాహంతో

“ఆయన మాటలు వింటుంటే మనకి ఇంత వయసొచ్చినా ఇన్ని విషయాలు ఎలా తెలీలేదు సుమీ అనిపిస్తుంది.”
“ఈయనున్నాడనే ధైర్యంతో అయాన్ రాండ్ ని చదవడం మానేశాను”
“ఆయన సినిమాని కిందేసుకోని, మీదేసుకోని, పక్కలో ఏసుకోని పడుకుంటాడు”

వంటి మాటలతో తన స్థాయిని చాటుకున్నాడు.

పెగ్గులని పేరు పెట్టుకుని రచయిత మొదలెట్టిన చాప్టర్లు రౌండ్లు రౌండ్లు ముగుస్తున్నా విషయం చిక్కపడదు, చెప్పాలనుకున్న విషయం తేలదు. ఈ పుస్తకాన్ని ఆదర్శంగా తీసుకుని నిక్కరేసుకుని శివ పోస్టర్లు చూసిన కాలం నుండి రామూకి షేక్ హ్యాండిచ్చే దాకా సాగిన జీవితాన్ని పుస్తకాలుగా వ్రాయొచ్చు అని రాము ప్రత్యక్ష శిష్యులు, ఏకలవ్య శిష్యులంతా తీర్మానించేసుకుంటే పుస్తకాల షాపుల్లో ర్యాకులన్నీ “వోడ్కా విత్ వర్మ”ల తోనూ, “తడ్కా విత్ ఊర్మిళ” వంటి పుస్తకాలతోనూ నిండిపోతాయి.

నాకు రాముని అడగలేని కొన్ని ప్రశ్నలున్నాయి వాటికి సమాధానం చెప్పగలవారు వీళ్ళే అని ప్రతి చాప్టర్లో చెప్పే రచయిత రామూ సన్నిహితులందరినీ ఒకే రకమైన ప్రశ్నలు వేసాడెందుకో? అందులోనూ ఫిల్మ్ మేకర్‌గా ఆయన పై మీ అభిప్రాయం, ఆయన సినిమాల్లో మీకు నచ్చినవి వంటి ప్రశ్నలు రామూయిజం స్థాయికి ఏ మాత్రం సరిపోనివి. రచయిత ఎంతో కష్టపడి సంపాదించాను అని చెప్పుకున్న రామూ వైఫ్, రామూ కూతురి ఇంటర్వ్యూల్లో ప్రశ్నలు వార్తాపత్రికల్లో తామే ప్రశ్న,సమాధానం వ్రాసుకునే శీర్షికల పంథాలో సాగాయి. ఎప్పుడూ మీడియా ముందుకి రాని వీరి అభిప్రాయాలు ఈ పుస్తకంలో ఉన్నాయని ఊదరగొట్టినందుకు, ఏవో అంచనలు పెంచుకున్న రామూ అభిమానులు నిరాశపడక తప్పదు. ప్రముఖ దర్శకులైన హరీష్ శంకర్, శివ నాగేశ్వరరావు, మధుర శ్రీధర్, దేవ కట్టా,  బివిఎస్ రవి వంటి వారి వ్యాసాలు కేవలం పేజీలు నింపటానికి మాత్రం పనికొచ్చాయి. వర్మ పెద్ద మేనమామ ప్రసాద్ రాజు గారి మాటల్లో ముక్కుసూటిదనం, మీడియా జర్నలిస్ట్ స్వప్న లాంటి వాళ్ళు చెప్పిన మాటల్లో బిట్వీన్ ద లైన్స్ వెతుక్కుంటే తప్ప పుస్తకం పాఠకుడికి మిగిల్చేదేమీ లేదు.

రచయిత తనకున్న రచనాసక్తిని, ప్రతిభని బయటకు తెచ్చే ప్రయత్నం ఎక్కడా చేసినట్టు కనపడదు. వర్మ తనని పూనాడని, తనూ వర్మలానే ఆలోచిస్తున్నాడని, తనూ వర్మలానే మాట్లాడుతున్నాడని చెప్పే ప్రయత్నమే ఎక్కువగా కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగా తను ఇతర ప్రముఖుల పట్ల చూపే నిర్లక్ష్యం, వాళ్ళని తేలికచేసే మాటలతో, కాంట్రవర్సరీలతో పేజీలు నింపేసాడు. వర్మ కిస్ థియరీ, ఒక వివాహిత రామూ గురించి చెప్పిన అభిప్రాయాలు వంటివి ఈ పుస్తకానికి ఏవిధంగా ఉపయోగపడతాయో నాకు అర్ధం కాలేదు. వర్మ అన్నాక కాస్త మసాలా లేకపోతే ఎలా అనుకుని వీటిని పెట్టారేమో.

ఒక స్నేహితునితో ఈ పుస్తకం గురించి మాట్లాడుతున్నప్పుడు, తాగినప్పుడు మనిషిలో ఉండే నిజమైన థియరీలు బయటకొస్తాయి, అందులోనూ తాగిన వ్యక్తి రామూ అయితే ఆ థియరీలు చాలా ఆసక్తిగా ఉంటాయి అలాంటి డ్రింక్స్ టైమ్ డిస్కషన్స్ ఇందులో ఉంటాయని ఆశించాను అని చెప్పాడు. తెలుగు పాఠకులు ఎగబడి కొనుక్కుని చదవాల్సిన పుస్తకాలు కరువైపోయిన ఈ కాలంలో సంచలనాత్మక పుస్తకాలకి కావాల్సినంత డిమాండ్ ఉంది. అందులోనూ వర్మలాంటి సంచలనాత్మక వ్యక్తి తోడయితే ఆ డిమాండ్ మరింత పెరుగుతుందని రుజువయిపోయింది. వర్మ బ్లాగు నుండి తెచ్చి పెట్టిన వ్యాసాలతో నింపిన నా ఇష్టం, ఇదివరకే జనాలందరికీ తెలిసిన విషయాలనే మరలా చెబుతూ వచ్చిన వోడ్కా విత్ వర్మ ఈ డిమాండ్‌ని వాడుకున్నాయే తప్ప ఎవరినీ సంతృప్తిపర్చలేదు. మరిన్ని పుస్తకాలు భవిష్యత్తులో రాబోతున్నాయనేది సుస్పష్టం. ఈసారి వ్రాసేవాడు మన డబ్బుకి న్యాయం చేసేవాడు కావాలని ఆశిద్దాం.

“తనని ఆకట్టుకోవాలంటే ఆడవాళ్ళయితే చాలా సెక్సీగా ఉండాలి, మగాళ్ళయితే మేధావులై ఉండాలి” అని చెప్పుకునే రామూ ఆ మాటకు కట్టుబడి ఉంటే ఈ పుస్తకంలో వ్యాసాలు వ్రాసిన చాలామంది ప్రముఖుల్ని జీవితంలో మరలా ఎప్పుడూ వోడ్కాకి పిలవడని, కలవడని నమ్ముతున్నా.

నోట్: కినిగె ఈ పుస్తకాన్ని 10% తగ్గింపు ధరకు అందిస్తుంది.

వోడ్కా విత్ వర్మ On Kinige

వర్షం

వాన వాకిటిలో, గొడుగు ఒడిలో

వాన వాకిటిలో, గొడుగు ఒడిలో

పసిపాపల దగ్గర నుండి పండు ముదుసలి వరకు అందరి మనసుల్ని ఆహ్లాదపరిచే దృశ్యాల్లో ఖచ్చితంగా మొదటి మూడు ఎంపికల్లో ఉండే దృశ్యం, వర్షం. తొలకరి చినుకులు పడటం మొదలవ్వగానే తన్మయత్వంతో ఆకాశం వైపు చూస్తూ, ఆ తడి మట్టివాసన ముక్కుపుటాలకు తగులుతూ ఉంటే ఒక్కసారిగా గుండెల నిండా గాలిని పీల్చుకుని ఆ వాసనను అనుభవించని జీవి జీవికాదు వాడి జీవితం జీవితమే కాదు. ఆరోగ్యపరంగా చల్లని వాతావరణం పనికిరాని వారు కూడా ఆ మట్టివాసన తగలగానే అన్ని మరిచిపోయి వానలోకి వచ్చేస్తారు. అందుకు పెద్ద ఉదాహరణ నేనే. జలుబో, జ్వరమో వస్తే రెండు రోజులు పడుకోటానికి సిద్దమే కాని తొలకరి చినుకుల్లో తడిచే అనుభూతిని మాత్రం వదులుకోను.

ఈ వానతో అనుభందం ఏనాటిదో సరిగ్గా చెప్పటం కష్టమే. కానీ వాన ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన మొదటి సందర్భం మాత్రం బాగా గుర్తుంది. బడిలో “వానా వానా వల్లప్ప వాకిలి తిరుగు చెల్లప్ప” నేర్చుకున్నరోజు మొదటిసారిగా అనిపించింది. ఇప్పుడు వానపడితే ఎంచక్కా ప్రయోగ పూర్వకంగా ఈ పాటను ప్రదర్శించొచ్చు కదా అని. చదువుకునే రోజుల్లో వానాకాలం సాయంత్రం బడి అవ్వగానే అక్క,నేను తడకుండా రావాలని ఒక గొడుగు కొనిచ్చారు. వర్షంలో వస్తుంటే గొడుగు నే పట్టుకుంటా అంటే, నేను పట్టుకుంటా అంటూ ఇద్దరం కొట్టుకునేవాళ్ళం. దానితో రోజుకొకరు పట్టుకోవాలనే నియమం పెట్టుకున్నాం. అవతలి వాళ్ళు పట్టుకున్నరోజు నాకు చోటివ్వవేంటి, సరిగ్గా పట్టుకో చూడు ఇటుపక్క తడిచిపోతున్నా అని గొడవ. ఇదికాక రోడ్డు మీద నీరు పారుతూ ఉంటే గెంతటం భలే సరదా.

వాన నీటిలో పడవ ప్రయాణం

వాన నీటిలో పడవ ప్రయాణం

ఇంటికొచ్చాక పడవల సరదా. అవసరమైనదో కాదో చూడకుండా పుస్తకాలు చింపేసి గబగబా పడవలు చేసి నీట్లో వదలటం, ఎవరి పడవ దూరం వెళుతుందో పోటీలుపెట్టుకోవటం తలుచుకుంటే మనసు ఇప్పటికీ కేరింతలు కొడుతుంది. పడవలంటే మరలా రోజూ ఒకేలాంటి పడవలంటే బోర్. పడవల్లో చాలా రకాలు ఉంటాయి సాదా పడవ, కత్తి పడవ, మరపడవ, గొడుగు పడవ అని బోలెడు ఉంటాయి. బడిలో ఎవడో ఒకడు మా మావయ్య ఈ రోజు నాకోసం కత్తి పడవ చేసార్రా అని చూపిస్తూ భుజాలు ఎగరేస్తే ఇంటికొచ్చి మాకూ అది చెయ్యటం నేర్పమని పైకెప్పు ఎగిరిపోయేలా ఏడుపు మొదలపెట్టేవాళ్ళం. పాపం మమ్మీ నాకు రాదు మొర్రో అన్నా వినిపించుకునే వాళ్ళం కాదు. స్కూల్ టీచర్‌వి నీకు పడవ చెయ్యటం కూడా రాదా అని ఏడుపు కొనసాగించేవాళ్ళం. మొత్తానికి ఎక్కడో నేర్చుకుని వచ్చి మాకు చెప్పేది. మరుసటిరోజు చూపుల్లోనే ఎక్కడలేని ఫోజు ప్రదర్శిస్తూ రకరకాల పడవల ఎగ్జిబిషన్ పెట్టేవాడ్ని. ఈ పడవల్లో అప్పుడప్పుడు చీమల్ని ఉంచి వాటికి నీటిలో బలవంతపు సాహసయాత్రలు చేయించటం మరో ప్రహసనం. 😛  వడగళ్ళ వాన పడిందంటే సండడే సందడి. వడగళ్ళు క్రిందపడగానే పరిగెట్టి వాకిట్లోకి వెళ్ళి వాటిని ఏరి తెచ్చి ఒక దగ్గర కుప్పగా పోసేవాళ్ళం. ఎవరు ఎక్కువ సేకరిస్తారు, ఎవరు పెద్దది సంపాదిస్తారు అని పోటి.

హైస్కూల్, కాలేజీ రోజుల్లో కావాలనే వర్షంలో తడిచి వచ్చేవాడ్ని. మొత్తం తడిచిపోయి వచ్చాక ఏం పిల్లడోనమ్మా కాస్త ఎక్కడన్నా వర్షం వెళ్ళే దాకా ఆగొచ్చుగా అని తిడుతూ తల తుడిచేది మమ్మీ. వస్తూ ఉంటే సడెన్‌గా పడిపోయింది, ఎలాగూ తడిచిపోయానుగా ఇంకెందుకులే అని వచ్చేసా అని ఎదో కధలు చెప్పేవాడ్ని.  కాలేజ్‌లో ఉన్నప్పుడు లంచ్ బ్రేక్‌కి వెళ్ళే ముందు వర్షం మొదలయితే పండగే. అందరం కావాలనే గొడుగులు ఉన్నా దాచేసి వర్షం తగ్గేదాక ఉండి, ప్రిన్సిపాల్ దగ్గరకి వెళ్ళి దీనంగా మొహాలుపెట్టి అందరం ఇక్కడే ఉండిపోయాం సార్, ఎవ్వరం భోజనం చేయలేదు మద్యాహ్నం రాలేము అని చెప్పి క్లాసులు క్యాన్సిల్ చేయించే వాళ్ళం 🙂

వర్షంతో పెనవేసుకున్న మరో అత్యంత కమ్మని జ్ఞాపకం ఉంది. వానాకాలంలో వర్షంలో ఇంటికి వచ్చేసరికి శెనక్కాయలు కానీ, జొన్నపొత్తులు కానీ ఉడికించి పెట్టేది మమ్మీ. ఇంటిలో అడుగుపెట్టగానే ఆ కమ్మని వాసన తగిలేసరికి కలిగే ఆనందం మరి దేనితోనూ సరిపోల్చలేం సుమా. వంటి నిండా దుప్పటి కప్పుకుని ఉడికించిన వేరు శెనక్కాయలు తింటూ, ఆకాశవాణిలో పాటలు వింటూ, రోడ్డు మీద పడుతున్న వర్షాన్ని,అటు ఇటూ పరుగులుపెడుతున్న జనాల్ని, కొమ్మల్లో దాక్కుని వంటి మీద తడిని దులుపుకుంటున్న పక్షుల్ని చూస్తూ ఉండటం మరలిరాని ఒక మధురానుభూతి. కాస్త పెద్దవాళ్ళమయ్యాక వర్షం పడితే పకోడి బండి దగ్గర చేరి వేడి వేడి టీతో వేడి వేడి పకోడీలు,బజ్జీలు ఆస్వాదిస్తూ తినటం ఇప్పటికీ అప్పుడప్పుదు కొనసాగిస్తున్నామనుకోండి. కానీ అప్పటి ఆకాశవాణిని నేటి ఎఫ్.ఎమ్.లతో పోల్చలేము కదా. ప్రశాంతంగా ఉండే వాతావరణం, చల్లని గాలి, క్రింద పారుతున్న నీటిలో చినుకులు పడుతూ చేసే శబ్ధం, మధ్య మధ్యలో ఉరిమే ఆకాశం, తళుక్కున మెరిసి మాయమయ్యే మెరుపు తీగలు, ఉండుండి గుండెల్లో గాభరా పుట్టించేలా ఢాం మని పడే పిడుగులు, అర్జునా ఫల్గుణా అనే అమ్మమ్మ వాహ్ అక్షరాలు ఆవిష్కరించలేని అనుభూతి.

వర్షం అంటే ఇష్టం కదా అని ఎలాపడితే అలా ఎప్పుడు పడితే అప్పుడు పడిపోతే ఒప్పుకుంటామేంటి. దానికో టైముండాలి, ఒక రిథమ్ ఉండాలి, ఒక ప్రోసెస్ ఉండాలి. కాస్త సాయంత్రమవుతూ ఉండగా చల్లనిగాలి మొదట శరీరాన్ని తాకాలి. ఆ గాలిలో తేమ మన శరీరాల్ని తాకగానే వళ్ళంతా ఒక జలదరింత కలుగుతుంది. అప్పుడు ఆకాశంలో వెలుగుని తరిమేస్తూ నల్లని మబ్బులు అత్యంత వేగంగా కదలటం కనిపించాలి. అలా కదులుతూ మధ్యలో ఉరుముతూ ఉండాలి. టప్ టప్ మని దూర దూరంగా ఒక్కో చినుకూ పడుతూ శబ్ధం చెయ్యాలి. మేడ మీద ఆరబెట్టిన వడియాలు, బట్టలు తెచ్చుకోవటానికి జనాలు పరుగులు మొదలుపెట్టాలి. రోడ్డు మీద నడుస్తున్నవాళ్ళు, బైకులమీద వెళుతున్న వాళ్ళు షెల్టర్ కోసం తొందరపడుతుండాలి. అప్పుడు ఒక్కపెట్టున ధారగా వర్షం మొదలవ్వాలి. అప్పుడే ఆ వర్షానికి ఒక అందం, మనకి ఆనందం.

వర్షం గురించి ఇన్ని చెప్పును కానీ ఒక్కటి మిగిలిపోయింది. అది రొమాన్స్. మన సినిమాలు చూసుకున్నా, కావ్యాలు, కధలు, కవితలు తీసుకున్నా వర్షంలో ఉండే రొమాన్స్‌ని ఎలుగెత్తిచాటారు. దాదాపుగా తెలుగు సినిమాల్లో వచ్చిన అన్ని వానపాటలు హిట్టేనేమో. “చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే చెంతన ఉంటే” ఏంటి అందరూ పాటని హమ్ చేయటం మొదలుపెట్టేసారా? నాకు తెలుసు 🙂 అంత మంచి పాట గుర్తొచ్చాక నేను చెప్పే రొమాన్స్ ఎక్కుతుందో లేదో కానీ నేను చెప్పకుండా మాత్రం ఆపను 🙂

చిటపట చినుకుల వేళ చేరువలో నేస్తం

చిటపట చినుకుల వేళ చేరువలో నేస్తం

మనసులో ప్రేమ ఇంకా చెప్పుకోని ప్రేమికులు వర్షంలో ఒకే గొడుగులో వెళ్తున్నప్పుడు లేదా,  వర్షంలో తడవకుండా ఏ చెట్టు క్రిందో ఆగినప్పుడు చోటుచేసుకునే గమ్మత్తైన రొమాన్స్ మనతో ఎప్పటికీ ఫ్రెష్‌గా ఉండిపోయే అనుభూతి. ఇద్దరూ అలా కాస్త సమయాన్ని గడిపే అవకాశం దొరికినందుకు లోలోన ఆనందపడుతున్నా బయటకి ప్రదర్శించరు. ఏంటో ఈ వర్షం కాస్త మనం ఇంటికి వెళ్ళే దాకా ఆగొచ్చుగా, ఎప్పటికి తగ్గుతుందో ఏమో అంటూ ఆకాశం వైపు చూస్తుంటారు కానీ నిజానికి ఇద్దరికీ ఆ వర్షం ఇంకాసేఫు పడాలనే ఉంటుంది. ఇంతలో అనుకోకుండా అమ్మాయి చేయి అబ్బాయికి తగిలిందనుకోండి అబ్బాయి ఉక్కిరిబిక్కిరి అయిపోతాడు. అమ్మాయి కూడా కొత్తగా ఉండే ఆ ఫీలింగ్‌ని ఆస్వాదిస్తున్నా బయటకి మాత్రం “సారీ” అని చెబుతుంది. అబ్బాయి కూడా తన ఫీలింగ్స్ బయటకి కనబడనివ్వకుండా ఇట్స్ ఓకే అంటాడు. ఇద్దరూ కాస్త జరిగి దూరంగా నిలబడతారు.

అబ్బాయి మనసులో కాసేపటికి మరలా తను తాకితే బాగుణ్ణు అనే ఫీలింగ్ చిన్నగా మొదలయ్యి, కాసేపటికి ఏదో ఒకటి చేసి తాకాల్సిందే అనే స్థాయికి చేరుకుంటుంది. అమ్మాయి కదిలితే తగిలేంత దగ్గరగా తను జరుగుతాడు. ఆ జరిగే ప్రక్రియ తాను కావాలనే చేస్తున్నట్టు బయటపడకుండా ఆటూ ఇటూ ఊగుతూ, ఆకాశాన్ని,దిక్కుల్ని చూస్తూ, రకరకాల భంగిమలు, హావభావాలు ప్రదర్శిస్తూ చేస్తాడు. అమ్మాయికి ఇదంతా తెలుస్తూనే ఉంటుంది. పక్కకు తిరిగి లోలోపల ముసిముసిగా నవ్వేసుకుంటుంది. కానీ మొహంలో మాత్రం ఏమీ కనపడనివ్వకుండా వర్షం త్వరగా తగ్గిపోతే బాగుండు అనే ఫాల్స్ ఫీలింగ్‌నే కంటిన్యూ చేస్తూ ఉంటుంది. వర్షం ఎప్పటికి తగ్గుతుందా అనే చూసే ప్రక్రియలో మరోసారి అమ్మాయి చేయి అబ్బాయికి తగులుతుంది. మరలా సేమ్ పైన జరిగిన ప్రాసెస్ రిపీట్ అవుతుంది. ఈ జరుగుతున్న ప్రహసనమంతా మాకు తప్ప ఇంకెవరికీ అర్ధంకాదు, ప్రపంచం మమ్మల్ని గమనించటంలేదు అనుకుంటారు.  కానీ ఒక మూల నాలాంటోడు ఒకడు ఉండి ముసిముసిగా నవ్వుకుంటున్నాడు అని ఎప్పటికీ తెలుసుకోరు 😉

కరి మబ్బును వీడి,
విరుల ఒడిలో ఒదిగే చినుకుల తడి వర్షం.
ఎదురుగానే ఉంటూ చేరువ కానీ నెచ్చెలి భూమికి,
ఆకాశం పంపే ముద్దుల తడి వర్షం.
దూరాన ఉన్న ప్రియునికోసం,
ప్రియురాలు పంపే తడికన్నుల రాయభారం వర్షం.
ఏకాంతంలో ఉన్న చెలికానికి,
చెలి సాన్నిత్యం గుర్తుచేసే తుంటరి అనుభూతి ఈ నా వర్షం.

తేట తేట తెలుగు

“నాకు తెలుగు సంస్కృతియన్న ఇష్టము. తెలుగు ప్రజలన్న ప్రాణము. తెలుగుభాషయందు మక్కువ ఎక్కువ.” అని చూపులు కలిసిన శుభవేళలో కోటా శ్రీనివాసరావు గారంటే మా సెడ్డ కామెడీ చేసాడ్రోయ్ అని నవ్వేసుకున్నాం కానీ ఆలోచించలేదు. మనం ఇలానే చూస్తూ ఊరుకుంటే ఇంకొన్నాళ్ళకు హిస్టరీ చానెల్లో “పదికోట్లకు పైగా జనాభా కలిగిన ఒక భాష తన ఉనికిని కోల్పోయిందంటే, ఆ జాతి ఎంత నిర్లక్ష్యం చేసింది. అభివృద్దిలో ఎన్నో జాతులుకంటే ముందున్న తెలుగుజాతి ఎందుకు తన భాషను నిలుపుకోలేకపోయింది” అనే డాక్యుమెంటరీని ఆసక్తిగా చూసే పరిస్థితుల్లో మన భావి తరాలు ఉంటాయి. తెలుగుభాష ఎంత మధురమయినదో, ఎంత ఉన్నతమైనదో మీకు నేను చెప్పాల్సిన పనిలేదు. చెప్పేటంతటి వాడిని కూడా కాదు. తెలుగు సాహిత్యం అమోఘం, అనంతం, అసామాన్యం. అంతటి గొప్ప భాష ఒక జీర్ణభాష కావల్సినదేనా?

మా తరానికి వచ్చేసరికే వాడుకభాష సృష్టిస్తున్న సునామీలో తెలుగు పదసంపద, పద్య సౌందర్యం కొట్టుకుపోయాయి. అంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు విధ్యాసంస్థల్లో చదువుతున్న విధ్యార్ధులు తెలుగు చదవలేని, పలకలేని స్థితిలో ఉన్నారు. మరో దశాబ్ధానికి మనం ఏ స్థితికి చేరుకుంటామో ఊహించొచ్చు.

మనందరికీ భాష అంటే అభిమానముంది. మన తెలుగు సంస్కృతంటే మక్కువుంది. దానికి మన బ్లాగులు, మన అభిరుచులే సాక్ష్యం. తెలుగుభాష కనుమరుగవుతుందేమో అనే బాధ కూడా మనలో ఉంది. కానీ మన వృత్తి,వ్యక్తిగత ఒత్తిడుల వలన ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నాము.

ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా, మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి అని సర్దిచెప్పుకుని ముందుకు సాగుతున్న మన e-తెలుగు మిత్రులను అభినందించాల్సిందే. e-తెలుగు సభ్యులంతా మనలానే వృత్తిపరంగా అనేక ఒత్తిడులతో సతమతమవుతున్నా, సంస్థ కార్యక్రమాలకి మాత్రం సమయాన్ని కేటాయిస్తునే ఉన్నారు. ఈ సభ్యులందరివీ మనలాంటి మధ్య తరగతి జీవితాలే, మనలాంటి నిత్య జీవనమే. వీళ్ళకున్నవీ మనలాంటి ఆశలు,ఆశయాలు,అభిరుచులే. ఈ కార్యక్రమాలవలన వారిలో ఎవరికీ వ్యక్తిగతంగా ఒరిగేదేమీ లేదు. కానీ భాషకోసం వారు తపిస్తున్నారు. వృద్ధాప్యంలో ఉన్న కన్నతల్లిని సాకుతున్నంత ప్రేమగా భాషకు సేవ చేస్తున్నారు. తమ వ్యక్తిగత జీవితంలో ఎంతో విలువైన సమయాన్ని ధారపోస్తున్నారు.

e-తెలుగు ఇన్నేళ్ళ ప్రయాణంలో ఎందరో ప్రముఖులు భుజం తట్టారే కానీ తోడుగా వెన్నంటి రాలేదు. ఏ కార్యక్రమానికీ స్పాన్సర్లు కానీ, భూరి విరాళాలు కానీ లేవు. సభ్యులు తమ సొంత డబ్బు పెట్టుకుని కార్యక్రమాలు నడిపారు. కొందరు సభ్యులు అప్పుచేసి మరీ డబ్బులు పెట్టిన సందర్భాలున్నాయి. ఇంత చేస్తే కనీసం కార్యక్రమంలో పాలుపంచుకోవటానికి కూడా ఏ ఒక్కరూ తీరిక చేసుకోలేదు. ఖర్చుపెట్టిన ధనమంతా బూడిదలో పోసినా పన్నీరే అయ్యింది. అయినా ఎవరూ నిరుత్సాహపడలేదు. బిందువు,బిందువు కలిసి ఏదో ఒకనాడు సింధువవుతుందనే నమ్మకంతో ముందుకు సాగుతున్నారు.

మన అమ్మ భాష కోసం కృషి చేస్తున్న వీళ్ళ శ్రమకు విలువ ఉందా? గౌరవం ఉందా? ఉండాలి. ఉండితీరాలి. ఆ గౌరవం మనమే కల్పించాలి. రండి కలిసి నడుద్దాం. మన చేయూతనిద్దాం. మన భాషను పరిరక్షించుకునే ఈ ఉద్యమానికి తోడ్పడి దీనిని ఒక మహాఉద్యమంగా మారుద్దాం.

తెలుగు భాషా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా e-తెలుగు సంస్థ తెలుగుబాట అనే కార్యక్రమాన్ని చేయ సంకల్పించింది. ఆగస్టు 29 పనిదినం కావటంతో ఆందరికీ వీలుగా ఉండేందుకు వారంతంలో చేయాలని నిర్ణయించారు. ఆదివారం, ఆగస్టు 28, 2011 నాడు ఉదయం 9 గంటల నుండి. తెలుగు లలిత కళా తోరణం నుండి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వరకు నడక. ఈ కార్యక్రమం మన భాషపైన మనకున్న మక్కువను ప్రపంచానికి చాటడానికి. మన భాష ఉనికిని కోల్పోతుంది దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఎలుగెత్తి చాటాడానికి. మన అందరి రాక వారికి మరింత ప్రోత్సాహాన్నిస్తుంది. మునుముందు మరింత కృషి చేసే బలాన్నిస్తుంది. ఇది తెలుగువారిగా మన బాధ్యత.

రామదండు నడిచి రాక్షస సంహారం చేసింది. మహాత్ముడు నడిచి సత్యాగ్రహం చేసాడు, స్వాతంత్ర్యం తెచ్చాడు. నాటి నుండీ నేటివరకు ఒకమంచిపనికోసం నడకసాగించిన ఎవరూ ఓడిపోలేదు. రండి e-తెలుగు నిర్వహిస్తున్న తెలుగుబాటలో కలిసి నడుద్దాం. తెలుగుభాష గొప్పతనాన్ని, భాష మీద మనకున్న అభిమానాన్ని ప్రకటించటానికి మనమంతా, కలిసి నడుద్దాం. ప్రపంచానికి తెలుగుభాష ఉనికిని చాటి చెబుదాం.
తెలుగుబాట – ఆగష్టు 28న హైదరబాద్‌లో టపా కూడా చూడండి.

తెలుగుబాటకు ఆర్ధిక సహాయం చేయాలనుకునే వారు ఈ క్రింది ఖాతాలో జమచెయ్యొచ్చు.
Name: e-Telugu, Hyderabad
A/C No: 111910100029862
Bank: Andhra Bank
Branch: Kukatpally, Hyderabad

బ్రాంచి చిరునామా ఇది (కూకట్ పల్లిలో మూణ్ణాలుగు బ్లాంచీలు ఉన్నాయి. అందుకని అయోమయం రాకుండా.)
Address :
H NO.10-32-2,PLOT NO.3&4 , VIVEKANANDA NAGAR COLONY , KUKATPALLY,
City : KUKATPALLY, State : Andhra Pradesh, Pin : 500072
IFSC Code :ANDB0001119

తెలుగుబాట – ఆగష్టు 28న హైదరబాద్‌లో

తెలుగుబాట

తెలుగుబాట

తెలుగుజాతి మనది. నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు,యాసలు,వేషాలు వేరయినా మన భాష తెలుగుభాష. పాశ్చాత్యులు మురిసి అధ్యయనం చేసిన ముత్యాలభాష. పొరుగురాజులు మెచ్చి “లెస్స”యని జేజేలు పలికిన సుందరభాష. కవులు కీర్తించిన కమ్మని భాష. లోకనీతిని ముచ్చటగా మూడు ముక్కల పద్యాల్లో చెప్పి, బాల్యాన్ని తీర్చిదిద్దిన గొప్పభాష.

ఇది నిన్న మొన్నొచ్చిన నడమంత్రపు సిరికాదు, తరతరాల వారసత్వంగా మనకొచ్చిన సంపద. వారసత్వంగా వచ్చిన ఆస్తులను మాత్రం భద్రపరచుకుని, భాషాసంపదను మాత్రం గాలికి వదిలేశాం. భాషాప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రంలో అధికారంకోసం కొట్టుకు చస్తూ, అందినది అందినట్టు దోచుకు తింటున్న మన నాయకులు భాషకి ఏనాడో తిలోదకాలిచ్చేసారు.అమ్మని “అమ్మా” అని పరిచయం చేసిన అమ్మభాషని నిర్లక్ష్యం చేయటం, ఏ అమ్మకి ఆనందాన్నిస్తుంది. ’బ్రతుకుతెరువులో అక్కరకురాని భాష’ అని ఎవరన్నా అంటే, జీవితమంటే బ్రతుకు తెరువే కాదని చెప్పాలి. భాష అంటే కేవలం ఒక అక్షరమాల,గుప్పెడు పదాలు కాదు. ఒక జాతి గుండె చప్పుడు. ఒకజాతి చరిత్ర,సంస్కృతి,సంప్రదాయం.ఆ జాతి జీవలక్షణం,అంతర్లీనంగా మెదిలే జీవశక్తి… అలాంటి భాషని వదులుకోవటం అంటే “నా” అనే అస్థిత్వాన్ని వదులుకోవటమే. అందరూ ఉన్న అనాధలుగా ఉండిపోవటమే.

మనపొరుగునే ఉన్న తమిళసోదరులు, కన్నడసోదరులు ఘనంగా వేడుకలు జరుపుకుని తమభాష గొప్పతనాన్ని చాటుకుంటున్నారు. ఇకనైనా నిద్రలేద్దాం. మనంకూడా ఒక మహోన్నత సంస్కృతికి వారసులమని ప్రకటించుకుందాం. “నేను తెలుగువాడిగా పుట్టినందుకు గర్విస్తున్నా” అని ఎలుగెత్తి చాటుదాం.

రండి e-తెలుగు నిర్వహిస్తున్న తెలుగుబాటలో కలిసి నడుద్దాం. రామదండు నడిచి రాక్షస సంహారం చేసింది. మహాత్ముడు నడిచి సత్యాగ్రహం చేసాడు, స్వాతంత్ర్యం తెచ్చాడు. నాటి నుండీ నేటివరకు ఒకమంచిపనికోసం నడకసాగించిన ఎవరూ ఓడిపోలేదు. తెలుగుభాష గొప్పతనాన్ని, భాష మీద మనకున్న అభిమానాన్ని ప్రకటించటానికి మనమంతా, కలిసి నడుద్దాం. ప్రపంచానికి తెలుగుభాష ఉనికిని చాటి చెబుదాం.

నేను నిర్లక్ష్యం చేసిన నా నేస్తం

మధురమైన ఏకాంతవేళ...

మధురమైన ఏకాంతవేళ...

ఎప్పుడూ నేనొక నేస్తాన్ని నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నా. నా పక్కనే తనుంటుందని తెలిసీ, చూసి చూడనట్టుగా తప్పించుకుపోతుంటాను. చూసి పలకరిస్తే తనకోసం కాస్త సమయం ఇమ్మంటుందని నా భయం. సమయం ఇస్తే మాత్రం ఏంపోతుంది? రోజుకి నేను సోది మాటల్లో వృధా చేసే కాస్త సమయం ఇవ్వొచ్చు. కానీ ఇస్తే తను నాలా డొంకతిరుగుడుగా మాట్లాడదు. నిక్కచ్చిగా నిగ్గదీసి నిజాన్ని మాట్లడుతుంది, నన్ను మాట్లాడమంటుంది. తీరా అన్నీ మాట్లాడాక తను విని వెళ్ళిపోతుంది. నేను మాత్రం రోజంతా ఆ మాటల్లో, ఆలోచనల్లో నన్ను నేను కోల్ఫోతాను. అందుకే ఈ తప్పించుకు తిరిగే ప్రవృత్తి.

కానీ తనెప్పుడూ చెబుతూ ఉంటుంది. నేనేరా నీ నిజమైన నేస్తాన్ని అని. నేనెప్పుడూ నిన్ను వదిలి ఉండలేదు, ఉండను అని.నాకు కూడా తెలుసు అదే నిజమని. కానీ ఆ నిజాన్ని అంగీకరిస్తే అమ్మో ఆ భయంకర భావాల్ని నేను భరించలేనేమో? అలా అని పూర్తిగా తనని వదిలి ఎప్పుడూ నేను కూడా ఉండలేదు. నా అవసరాల్లో, భాదల్లో తననే ఆశ్రయిస్తా. ఆనందాల్లో మాత్రం తనని మరిచిపోతా. అయినా ఇంతకాలం ఎప్పుడూ చిన్నబుచ్చుకోలేదు. నేను పట్టించుకోకపోయినా నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తనతో అవసరంపడి తనకోసం చూడగానే అర్ధం చేసుకుని వచ్చి వాలిపోతుంది. బయటకి ఎప్పుడూ చెప్పకపోయినా తనంటే నాకు చాలా ఇష్టం.

చల్లని సాయంత్రం సముద్రపు కెరటాలతో పోటీపడి నా పాదాలు పరిగెడుతున్నప్పుడు తను కావాలి. మనాలి మంచుకొండల్లో, ఆపిల్‌తోటలో బెంచిమీద కూర్చుని కాఫీ తాగుతున్నప్పుడు తను కావాలి. వారం మొత్తం ఎక్కువగా పనిచేసి అలిసిపోయినట్టుంటే వారంతంలో బద్దకంగా ఆలస్యంగా లేచి ఇళయరాజా పాటలు పెట్టుకుని వింటున్నప్పుడు తను కావాలి. ఏదయినా కవితో, బ్లాగులో టపానో వ్రాయాలనుకున్నప్పుడు తనుకావాలి. అన్నట్టు తన పేరు చెప్పలేదు కదా? తనపేరు ఏకాంతం. పేరు వినగానే ఎక్కడో విన్నట్టు కాదు కాదు మీకు కూడా నేస్తమే అనిపించిందా? అవును మరి ఏ కాంతాలేనివారికి, శాంతి లేనివారికి ఏకాంతమే నేస్తం. అసహనంలో ఉన్నప్పుడు, అశాంతిలో ఉన్నప్పుడు, ఆగ్రహంలో ఉన్నప్పుడు, అవమానం ఎదురయినప్పుడు మనల్ని ఓదార్చే నేస్తం ఏకాంతం.

ఏకాంతం ఓ గురువు

మనలో ఉన్న శక్తి మనకి తెలియజేస్తుంది.

ఏకాంతం ఒక నేస్తం

మనం చేసిన తప్పుల్ని ఒప్పుల్ని ఒకే దృష్టితో చూసి మనకు చెబుతుంది.

ఏకాంతం ఒక మౌని

మనకు సంయమనం నేర్పుతుంది.

ఏకాంతం మన శ్రేయోభిలాషి మనవాళ్ళెవరో తెలియజెబుతుంది. తల్లిలా ఒడిలో ఏడ్చే అవకాశమిస్తుంది. తండ్రిలా తలనిమిరి ధైర్యాన్నిస్తుంది. గురువుగా భుజంతట్టి ఓ మార్గం చూపుతుంది. ప్రియురాలిలా అపూర్వమైన మధురమైన క్షణాల్లో మౌనంగా నీతో కలిపి అనుసరిస్తుంది. అన్నింటికంటే నీ మనసనే నేస్తంతో నువ్వు ప్రతిసారీ మాట్లాడేది ఏకాంతంలోనే.ఏకాంతంలేనప్పుడు ఎన్ని ఉన్నా ఆత్మతృప్తి ఉండదు కదా!అదేంటో ఎప్పుడు రమ్మన్నా పరిగెట్టుకు వచ్చే ఏకాంతం ఇప్పుడు నీమీదే టపా వ్రాస్తున్నా నిజంగా ఇప్పుడూ నువ్వు కావాలి అన్నా నవ్వుతూ నిలబడిందే గాని రాదే?? మరి తనేం చెప్పిందో తెలుసా?

“నేనే కాదు బాబూ, నీకు నువ్వు తప్ప వేరెవ్వరూ నీతో లేకపోవటమే ఏకాంతం.”

తెలుగుబాట – ఆగష్టు 29న హైదరబాద్‌లో

తెలుగుబాట

తెలుగుబాట

తెలుగుజాతి మనది. నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు,యాసలు,వేషాలు వేరయినా మన భాష తెలుగుభాష. పాశ్చాత్యులు మురిసి అధ్యయనం చేసిన ముత్యాలభాష. పొరుగురాజులు మెచ్చి “లెస్స”యని జేజేలు పలికిన సుందరభాష. కవులు కీర్తించిన కమ్మని భాష. లోకనీతిని ముచ్చటగా మూడు ముక్కల పద్యాల్లో చెప్పి, బాల్యాన్ని తీర్చిదిద్దిన గొప్పభాష.

ఇది నిన్న మొన్నొచ్చిన నడమంత్రపు సిరికాదు, తరతరాల వారసత్వంగా మనకొచ్చిన సంపద. వారసత్వంగా వచ్చిన ఆస్తులను మాత్రం భద్రపరచుకుని, భాషాసంపదను మాత్రం గాలికి వదిలేశాం. భాషాప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రంలో అధికారంకోసం కొట్టుకు చస్తూ, అందినది అందినట్టు దోచుకు తింటున్న మన నాయకులు భాషకి ఏనాడో తిలోదకాలిచ్చేసారు.అమ్మని “అమ్మా” అని పరిచయం చేసిన అమ్మభాషని నిర్లక్ష్యం చేయటం, ఏ అమ్మకి ఆనందాన్నిస్తుంది. ’బ్రతుకుతెరువులో అక్కరకురాని భాష’ అని ఎవరన్నా అంటే, జీవితమంటే బ్రతుకు తెరువే కాదని చెప్పాలి. భాష అంటే కేవలం ఒక అక్షరమాల,గుప్పెడు పదాలు కాదు. ఒక జాతి గుండె చప్పుడు. ఒకజాతి చరిత్ర,సంస్కృతి,సంప్రదాయం.ఆ జాతి జీవలక్షణం,అంతర్లీనంగా మెదిలే జీవశక్తి… అలాంటి భాషని వదులుకోవటం అంటే “నా” అనే అస్థిత్వాన్ని వదులుకోవటమే. అందరూ ఉన్న అనాధలుగా ఉండిపోవటమే.

మనపొరుగునే ఉన్న తమిళసోదరులు, కన్నడసోదరులు ఘనంగా వేడుకలు జరుపుకుని తమభాష గొప్పతనాన్ని చాటుకుంటున్నారు. ఇకనైనా నిద్రలేద్దాం. మనంకూడా ఒక మహోన్నత సంస్కృతికి వారసులమని ప్రకటించుకుందాం. “నేను తెలుగువాడిగా పుట్టినందుకు గర్విస్తున్నా” అని ఎలుగెత్తి చాటుదాం.

రండి e-తెలుగు నిర్వహిస్తున్న తెలుగుబాటలో కలిసి నడుద్దాం. రామదండు నడిచి రాక్షస సంహారం చేసింది. మహాత్ముడు నడిచి సత్యాగ్రహం చేసాడు, స్వాతంత్ర్యం తెచ్చాడు. నాటి నుండీ నేటివరకు ఒకమంచిపనికోసం నడకసాగించిన ఎవరూ ఓడిపోలేదు. తెలుగుభాష గొప్పతనాన్ని, భాష మీద మనకున్న అభిమానాన్ని ప్రకటించటానికి మనమంతా, కలిసి నడుద్దాం. ప్రపంచానికి తెలుగుభాష ఉనికిని చాటి చెబుదాం.


భయంగా ఉంది నాన్న…

 
11 డిసెంబర్ 2008 :

“రాణి, నీ పెళ్ళి ముహూర్తం కూడా నిర్ణయం అయిపోయింది. బట్టలు,నగలు కొనటానికి రేపే అమ్మ,నేను విశాఖపట్నం వెళ్తున్నాం. నీకేం కావాలో చెప్పమ్మా?”

“నాన్న, నీ ఒక్కగానొక్క కూతురి పెళ్ళి ఘనంగా చేస్తావుగా మరి. నన్ను కాదని ఫోజు కొట్టిన సాఫ్ట్ వేర్ బావల చూపులు ఆకాశం నుండి నేలకి దిగిరావాలి. మా కొడుకులే పుత్తడి, మీరు ఇత్తడి అన్న అత్తల డాబు దిగేలాగా బందువుల్ని,ఊరందర్ని పిలవాలి. నువ్వు అడిగిన విధంగా ఖర్చులన్నింటినీ వ్రాసిపెట్టా. 20 లక్షలకి దగ్గరగా వచ్చింది.”

“అంతా నీకు నచ్చినట్టే చేద్దాం. మేము పొద్దున్నే బయలుదేరి రాత్రికి వచ్చేస్తాం. నువ్వు నిదానంగా లేచినా పర్వాలేదు. వచ్చేంతవరకు జాగర్త తల్లి.”

“సరే నాన్న.”

12 డిసెంబర్ 2008:

“రాణీ! తల్లి ఎక్కడున్నావు రా. ఇదిగో చూడు నువ్వు అడిగిన దానికంటే అందంగా ఉన్న చీరలు, నగలు. నా చిట్టితల్లి దగదగా మెరిసిపోతుంది ఇవి వేసుకుంటే. ఎక్కడున్నావమ్మా?”

“అమ్మాయి గది తలుపు వేసి ఉంది. పడుకుందేమోనండి? రేపు చూస్తుంది లెండి.”

“ఒక్కసారి ఇవన్నీ చూపించి నా చిట్టి తల్లి కళ్ళలో అనందం చూడకుండా పడుకున్నా నాకు నిద్రపట్టదు. వెళ్ళి కిటికీ లోంచి పిలువు వినిపిస్తుంది.”

“అలాగే. చెబితే వినరుగా….. ఏవండీ! త్వరగా రండీ. అయ్యో చిట్టి తల్లీ ఎంత పని చేసావమ్మా. నీకే కష్టం వచిందమ్మా. మమ్మల్ని ఒంటరిని చేసి వెళ్ళిపోయావా తల్లీ….”

“అమ్మా…..” 

రాణి తనగదిలో చీరతో ఉరివేసుకుని కనిపించింది ఆ తల్లిదండ్రులకి. వాళ్ళ రోదన అలా కొనసాగుతూనే ఉంది. బందువులు, మితృలు, పోలీసులు అందరూ వచ్చివెళ్ళారు. తలా ఒకమాట అన్నారు. ఆ తల్లిదండ్రుల అజాగ్రత్తకు, అతిజాగ్రత్తకు మందలించారు, తోచిన సలహాలిచ్చారు. కొందరు కూపీలాగారు. కానీ ఈ సంఘటనలో వారు పోగొట్టుకున్నది ఎవరు తిరిగి తెచ్చి ఇవ్వలేదు. రాణి కూడా ఒక ఉత్తరమైనా వ్రాసిపెట్టలేదు. తను ఉత్తరం వ్రాయలనుకుని ఉంటే ఏమని వ్రాసేది…….

 

ఆత్మహత్యకి ప్రత్యమ్నాయం లేదా?

ఆత్మహత్యకి ప్రత్యమ్నాయం లేదా?

ప్రియమైన నాన్నగారికి,

నాన్న నీతో చాలా మాట్లాడాలని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటా కానీ నీ పెద్దరికానికి, పెద్ద పెద్ద ఆలోచనలకి నావి ఆకతాయి అల్లరి చేష్టల్లా ఉంటాయని కొట్టి పారేస్తావ్. ఈ ఒక్కసారికి విను నాన్న. ఎందుకంటే ఇకముందు ఇలా చెప్పే అవకాశం ఉండదేమో? నాన్న నువ్వెంత గొప్పవాడివో తెలుసా. బయటవాళ్ళకి నువ్వెవరో తెలియదు గాని నాకు మాత్రం నువ్వు దేవుడివి. నువ్వు నాకు ఏమి ఇవ్వలేదని నాన్న. జీవరాశుల్లోనే ఉత్తమమైన మానవ జన్మనిచ్చావ్, అడిగింది కాదనక అల్లారు ముద్దుగా పెంచావ్, చదువు చెప్పించావ్. ఇప్పుడు నా పెళ్ళికోసం కూడా ఎంత కష్టపడుతున్నావ్.

అసలు ప్రతీ మనిషి ఇంతేనేమో, పెళ్ళి కానంతవరకు తనకోసం బ్రతికి, తనకోసం సంపాదించేవాడు పెళ్ళి కుదిరిన మరుక్షణం నుంచే పిల్లలే జీవితంగా బ్రతుకుతారు. నువ్వు పొద్దున్న లేస్తూనే కష్టపడేది, సంపాదించేది, ఆదా చెసేది ప్రతీది నా కోసమేగా. నీ జీవితం లో నీకోసం పావువంతు బ్రతికి మిగిలిన జీవితమంతా నా కోసమే బ్రతికావు కదా!

మరి నాకోసమే ఇంతలా బ్రతికే నువ్వు, నాకు ఏమి కావాలన్నా ఇచ్చే నువ్వు, నా భవిష్యత్తుని నా వందేళ్ళ జీవితాన్ని నిర్ణయించే పెళ్ళి దగ్గర మాత్రం నా ఇష్టాలతో, ఆశలతొ, ఆశయాలతో, నా భవిష్యత్తు నిర్ణయాలతో పనిలేకుండా పరువు, ప్రతిష్ట అంటావేంటి నాన్న. ఈ పరువు, కుటుంబ ప్రతిష్ట అంటే ఏంటి నాన్న? ఆడపిల్ల పద్దతిగా లేకపోతే కుటుంబ పరువు పోతుందని రోజూ అమ్మకి చెబుతావ్, సమాజం లో తలదించుకొనే పరిస్థితి రాకూడదని రోజూ అంటావ్. అమ్మ సంగతి తెలుసుగా 5వ తరగతి చదువుతో ఆడదానికి కుటుంబమే సర్వస్వం, భర్తే దైవం అని తప్ప వేరే ఏది ఆలోచించలేదు. వ్రతాలు, గాజులు, చీరలు, ఆవకాయ, అప్పడాలు ఇవి తప్ప తన దగ్గర ఇంకేదన్నా చర్చిస్తే తనకి అర్ధం కాదు. అందుకే నీ పరువు కోసం నన్ను గడప దాటనివ్వదు. సమాజం లో నీ గౌరవం కోసం నన్ను ఎవరితోనూ స్నేహం చెయ్యనివ్వదు. నీ బాగు చూసి ఓర్వలేకపోతున్నారు బందువులు అని బలంగా నమ్మి ఎవరితోనూ మాట్లాడనివ్వదు.

నా ఆలోచనలు ఆకాశంలో విహరిస్తే, మీ అర్ధంలేని భయాలు నా ప్రపంచాన్ని చిన్నదిగా చేసాయి. నా వయస్సులోనే ఉన్న అక్కలు,అన్నయ్యలు,బావలు,వదినలు ఎందరో మన భందువుల్లో ఉన్నారు. ఒక్కరోజు ఎవరినీ కలిసే అవకాశం లేదు. మనసు విప్పి మాట్లాడే అవకాశంలేదు. వాళ్ళ భవిష్యత్తు ప్రణాలికలు తెలుసుకోవాలన్న నా కోరిక ఇప్పటికీ తీరలేదు. వాళ్ళు కంప్యూటర్ లో ప్రపంచాన్ని చూస్తుంటే, నేనుమాత్రం ఇల్లే ప్రపంచంగా బ్రతికాను. విశాలమైన మన ఇంటి గదుల్లో ఎంత ఇరుకుగా పెరిగానో నీకు తెలుసా నాన్న.

ఒకరోజున హఠాత్తుగా పెళ్ళిచూపులన్నారు, పెళ్ళన్నారు. వచ్చినవాడికి నేనంటే ఇష్టమా? మీరు ఇస్తానన్న కట్నం ఇష్టమా? నా ఆశలని,ఆలోచనలని అర్ధంచేసుకుంటాడా? లేక వండివార్చితే చాలనుకుంటాడో? ఏమీ తెలియదు. ఇవన్నీ పోని మిమ్మల్ని అడుగుదామంటే ఆడది చదివి చెడిందంటారు. అంతేగా? ఇంకెవర్ని అడగాలి? ఎవరితో పంచుకోవాలి. నాకు ఎవర్ని అందిచారు? ఎవర్ని మిగిల్చారు మీరు? నాకు నేను తప్ప ఎవరూ మిగలలేదు.

అసలు లోకులు,బందువులు ఎవరు నాన్న మన జీవితాల్ని శాసించటానికి? ఇప్పుడు రమ్మను వాళ్ళని కళ్ళు చల్లబడతాయి. ఇప్పుడూ నేను లేని లోటుని తీర్చగలరా వాళ్ళు. పశ్చాత్తాప పడి నేను కోల్పోయిన ప్రాణాన్ని తిరిగి ఇవ్వగలరా. నీ మనసులో గూడు కట్టుకు ఉన్న పరువుని, ప్రతిష్టని అడిగి సమాధానం చెప్పు.. ఇకచాలు నాన్నఇంత పెద్ద ప్రపంచంలో నాకు,నా ఆలోచనలకి స్వేచ్చని,స్థానన్ని ఇవ్వలేని సంకుచిత సమాజాన్ని ద్వేషిస్తూ వెళ్ళిపోతున్నా. నీ రూపం లో నా మెడని వంచి విజయాన్ని అందుకుందామన్నా విధిని పరిహసిస్తూ వెళ్ళిపోతున్నా. నా ఇష్టమయిన ఉయ్యాలని చివరిసారిగా ఊగాలని ఉరివేసుకుని ఊగి వెళుతున్నా.

అంతే నాన్న..  నేను చెప్పాలనుకున్నది అంతే…   ఇంకా చాలా చెప్పగలనేమో..  కానీ ఇప్పటికే జరగాల్సిన ఆలస్యం జరిగిపోయింది..  ఇంకా ఏవో చెప్పి ప్రయోజనం లేదు…

ఇన్ని మాటలు చెప్పాను కానీ నాన్న, భయంగా ఉంది నాన్న. చావాలంటే భయంగా ఉంది నాన్న. ఉరితాడు నా మెడకి బిగుసుకుంటూ ఉంటే ఊపిరాడక నొప్పిగా ఉంటుదేమో? నాన్న భయంగా ఉంది. చనిపోయాక ఎమవుతా నాన్న, అక్కడ ఆలోకంలో ఆకలయితే అన్నం పెట్టే వాళ్ళు ఉంటారా? ఒంటరిగా అందర్ని వదిలి వెళ్ళాలంటే చాలా భయంగా ఉందినాన్న. నన్ను మరిచిపోకండి నాన్న… ప్లీజ్

మీ నిర్భాగ్యురాలయిన కూతురు,

రాణి.  

(ఇది ఈమధ్య మా బందువుల్లోనే జరిగిన ఒక సంఘటన. కారణం ఎవరికీ తెలియదు. బందువుల్లో ఎవరితోనూ కలివిడిగా ఉండే అవకాశంలేదు. ఒక చిన్న పల్లెటూరిలోనే తన నిండు నూరేళ్ళు నిండిపోయాయి. తన చివరి క్షణాల్లో పడ్డ సంఘర్షణ ఆవిష్కరించాలని ఎంతగానో ప్రయత్నించా. కానీ తన ఆలోచనలు, నడవడిక, వ్యక్తిత్వం , గతం, భవిష్యత్తుకై తన ఆలోచనలు ఏమీ తెలియని నేను వ్రాసినవి కేవలం నా ఊహలేగాని వాస్తవాలు కావు. వాస్తవాలు తన మనస్సు అనే రహస్యపు పెట్టెలో శాశ్వతంగా దాచేసి తనతో తీసుకుపోయింది. నావాళ్ళకే నాతో కష్టాలు పంచుకునే చనువు ఇవ్వలేకపోయాను. అందుకేనేమొ ఈ సంఘటన నన్ను పదే పదే వెంటాడుతుంది. నాకిప్పుడు కొన్ని నిజాలు తెలియాలి. తను చనిపోవాల్సిన అవసరం ఏంవచ్చింది? తన  చావుకి నిజమయిన కారకులు ఎవరు? చనిపోయినప్పుడు తన ఆత్మసంఘర్షణ  ఏంటి? చావు తర్వాత ఏమవుతుందో ఇప్పటికీ మానవమేధస్సుకి తెలియదు. తను అసలు ఆవిషయం ఆలోచించిందా? ఉరివేసుకోవటానికి భయపడలేదా? బ్రతకటానికి ఏవయినా అవకాశాలు ఉన్నాయేమొ ఆలోచించలేదా? రేపటినుండి తాను ఏమవుతుంది, తనగది ఏమవుతుంది, తన బట్టలు, పుస్తకాలు, తనకిష్టమయిన వస్తువులు అన్నీ ఏమవుతాయి? ఇంకా కొన్ని వేల ప్రశ్నలు నా మనస్సుని తొలిచేస్తున్నాయి. ఇన్ని ప్రశ్నలు తనకి కలగలేదా? మరి ఏం సమాధానం చెప్పుకుంది. తనని తాను చావుకి మానసికంగా ఎలాసిద్దంచేసుకుంది. నా ప్రశ్నలకి ఎవరు సమాధానం చెప్పగలరు………………….)