బ్లాగర్ల ఆత్మీయ సమావేశం

కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్లో తెలుగు వ్రాయటం లేక చదవటం ఇప్పుడు అత్యంత సాదారణమైన విషయం. టెక్నాలజీ గురించి పెద్దగా అవగాహన లేని వాళ్ళు కూడా వాడగలిగేంత సరళమైన ప్రక్రియ. కానీ 10 ఏళ్ళ క్రితం టెక్నాలజీలో పని చేసే వాళ్ళకు కూడా తెలుగుని ఇంత విరివిగా కంప్యూటర్‌లో వాడుకోవచ్చనే అవగాహన లేదు. అసలు ఇంత విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని ఎవరూ ఊహించలేదు.

కానీ ఈ మార్పులు ఒక్క రాత్రిలో వచ్చేయలేదు. తెలుగు టైపింగ్ అంటే డిటిపి చేసే వాళ్ళకి ఇవ్వాలి, సాఫ్ట్‌వేర్లు కొనుక్కోవాలి అనే రోజుల నుండి సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో సునాయాసంగా తెలుగు టైప్ చేసే రోజులకు వచ్చేసాం. దీని వెనుక ఎందరో ఔత్సాహికుల కృషి ఉంది.

IMG_0113

గూగుల్‌లో వెతికితే తెలుగు సమాచారం ఏమీ దొరకని రోజుల్లో అందరినీ తెలుగు వాడేలా ప్రోత్సాహించి, అవగాహన సదస్సులు నిర్వహించి దీన్ని ఒక ఉద్యమంగా నడిపిన e-తెలుగు గూర్చి ఈ రోజున తెలుగు టైప్ చేస్తున్న వారిలో ఎందరికి తెలుసు?

IMG_1571

కంప్యూటర్‌లో తెలుగు ఉంది చూడండి అని ప్రచారం చేసి, చేయిపట్టి అక్షరాలు దిద్దించినట్టుగా యూనికోడ్‌లో తెలుగు టైపింగ్ నేర్పించి, అవసరమైన సాఫ్ట్‌వేర్లను సిడిల్లో ఎక్కించి ఉచితంగా పంచిపెట్టి అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి ఎంతో కృషి చేసిన సంస్థ e-తెలుగు. సంస్థ సభ్యులు తమ సొంత డబ్బులు పెట్టుకుని ఏ లాభాపేక్షలేకుండా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించారు. వీళ్ళందరీనీ నడిపించిన చైతన్యం ఒకటే భాష మీదున్న అభిమానం.

ప్రతి ఏడాది హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఒక స్టాల్‌ని నిర్వహించి తెలుగులో బ్లాగుల వ్యాప్తికి ప్రోత్సహించటమే కాకుండా మెయిల్ ఐడి ఉన్న ప్రతి ఒక్కరికి అక్కడికక్కడే ఒక బ్లాగు క్రియేట్ చేసి, దాని నిర్వహణ మీద అవగహాన కల్పించేవారు. కేవలం బ్లాగులే కాదు, తెలుగు వికీపీడియా వ్యాసాల అభివృద్దిలో కూడా పాలుపంచుకోమని ప్రచారం చేసేవారు. ప్రొపరైటరీ ఫాంట్స్ వాడే తెలుగు వార్తాపత్రికలకు, వెబ్‌సైట్స్‌కి యూనీకోడ్ వల్ల లాభాలు వివరించి, యూనికోడ్‌కి మారేలా ప్రోత్సహించారు. ఈ స్టాల్ నిర్వహణ కోసం సభ్యులు ఆఫీస్‌కి సెలవు పెట్టి మరీ వచ్చేవారు. ఈ కార్యక్రమాల్లో నేను కూడా నా వంతు పని చేసానని చెప్పడానికి గర్వపడతున్నా.

ఈ విషయాలన్నీ తెలుగు బ్లాగుల్లో పాతపోస్టుల్లో ఎక్కడో మరుగునపడిపోయాయి. ఒక సౌకర్యవంతమైన నేటి వెనుక ఎందరిదో ఎన్నో రోజుల కృషి ఉంటుంది. అప్పుడప్పు ఇలా గుర్తు చేసుకోకపోతే, వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకోకపోతే లావైపోతాం.

ఎన్నోరోజుల తర్వాత ఆనాటి బ్లాగర్లు, e-తెలుగు సభ్యులు ఈ ఆదివారం (05-01-2020) కృష్ణకాంత్ పార్కులో సమావేశమయ్యారు. మళ్ళీ e-తెలుగు ని చైతన్యవంతం చేసేందుకు నిర్ణయించుకున్నారు. మరో ఉద్యమానికి ఇది నాంది కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.

blogmeet

మహానగరం e-బుక్

 

బ్లాగులో వ్రాయటం మొదలుపెట్టిన మహానగరం కథను, అనేక కారాణాల వల్ల మధ్యలోనే ఆపేసాను. తర్వాత పార్ట్ ఎప్పుడు వస్తుంది అని కామెంట్స్‌లో మిత్రులు అడుగుతూనే ఉన్నారు. కానీ పనుల ఒత్తిడిలో కొనసాగించలేకపోయాను.
ఇప్పటికి సమయం చిక్కి ఈ మహానగరాన్ని పూర్తి చెయ్యగలిగాను. మంచిపుస్తకం పబ్లిషర్స్ ఈ కథను పుస్తకంగా విడుదల చేసారు. పుస్తకంగా పబ్లిష్ చేసిన కారణంగా బ్లాగులో కథను కొనసాగించలేకపోతున్నాను. ఈ విషయంలో ఎవరినైనా డిజప్పాయింట్ చేసుంటే క్షమించాలి. మహానగరాన్ని మొదటి నుండి ఫాలో అయ్యి ప్రోత్సహించిన అందరికీ నా కృతజ్ఞతలు.

ఆసక్తి కలిగినవారు మహానగరం ప్రింట్ పుస్తకాన్ని ఇక్కడ ఆర్డర్ చేయవచ్చు.

కినిగె లో ఇప్పుడు e-బుక్‌గా అందుబాటులో ఉంది. e-బుక్ ఇక్కడ ఆర్డర్ చేయవచ్చు.

రాము ఓ దేవుడు

Vodka with Varma

Vodka with Varma

టైటిల్ చూసాక హా ఏముందిలే రామూ భజనపరుడి వ్యాసం అని చాలామంది ఇగ్నోర్ చేసి పేజ్ మార్చేసుంటారు. క్షమించాలి నాకు భజన చేసే ఆసక్తి, ఓపిక రెండూ లేవు. కేవలం రాము పేరు చూసి నా ఇష్టం, వోడ్కా విత్ వర్మ పుస్తకాలు కొని, చదివిన పాపానికి డబ్బు, టైం రెండూ నష్టపోయినవాడిగా, రామూని కసి తీరా తిట్టాలని వ్రాస్తున్నా. కానీ దెయ్యం, రాక్షసుడు, డెవిల్, రావణాసురుడూ, ధుర్యోధనుడు వంటి బిరుదుల్ని ఆనందంగా ఆభరణాలుగా ధరించేవాడిని ఏమని తిట్టాలి? అందుకే రామూ దేవుడు అని తిడుతున్నా. మా నాన్నగారు నాస్తికులు, నాశిష్యులు యమనాస్తికులు, నేను పుట్టు నాస్తికుడ్ని అని చెప్పుకునే రామూకి ఇంతకంటే పెద్దతిట్టు ఏముంటుంది. అందుకే కసితీరా తిడుతున్నా రామూ ఓ దేవుడు.

దేవుడు రాయి రూపంలో ఏ చెట్టు కిందో, పుట్టలోనో కనిపించి తన ఉనికిని చాటుకోగానే దేవుడి పని అయిపోతుంది. ఆపైన ఆయన కదలకుండా కూర్చుని ఉంటే మిగిలిన హడావుడంతా చేసేది భక్తులే. ఆలయాలు కట్టినా, ట్రస్టులు పెట్టినా దోచుకున్నోడికి దోచుకున్నంత. ఇక్కడా అంతే రామూ తనకున్న సినీ పరిజ్ఞానంతో కొంత, తనకున్న తిక్కతో మరింత, మీడియాలో చేసే కాంట్రవర్సీలతో మరికొంత ఇమేజ్‌ని సంపాదించుకుని ఒక మూల మందు తాగుతూ ముసిముసిగా నవ్వుతూ కూర్చున్నాడు. ఇప్పుడా ఇమేజ్‌ని వాడుకోవటంలో ఎవడి సత్తా వాడు చాటుకుంటున్నాడు.

నా ఇష్టం పుస్తకం రామూ ఐడియానో, లేక ఎమెస్కో వారి ఐడియోనో నాకు తెలియదు కానీ అది తెలుగు ప్రింట్ పుస్తకాల మార్కెట్లో అప్పటి వరకూ ఉన్న రికార్డులు మార్చేసింది. రామూ అనే పేరుకున్న మార్కెట్ డిమాండ్ బయటపడింది. ఆ డిమాండ్‌ని ఉపయోగించుకోవటం కోసం ఎమెస్కో వారు రాము పై మరిన్ని పుస్తకాలకు తెర తీసారనిపిస్తుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్‌లో హైదరాబాద్‌లో రెండువారాల పాటూ జరిగే పుస్తక ప్రదర్శనని ఉపయోగించుకుంటే తమ మార్కెట్‌కి సరైన కిక్ స్టార్ట్ లభిస్తుందని అర్ధం చేసుకుని గత ఏడాది నా ఇష్టం లానే ఈ ఏడాది వోడ్కా విత్ వర్మని పుస్తక ప్రదర్శనలో వదిలారు.

వోడ్కా విత్ వర్మ ట్రైలర్ రిలీజ్ కాక ముందు సిరాశ్రీ అనే పేరు ఎంతమందికి తెలుసు? కనీసం సినిమా రంగంలో ఆ వ్యక్తి ఎంతమందికి పరిచయం? కొద్దో గొప్పో తెలిసిన వారికి కూడా కేవలం గ్రేటాంధ్ర వ్యక్తిగా తెలిసుండొచ్చు. అది కూడా నేను ఖచ్చితంగా చెప్పలేను. కేవలం పుస్తకంలో రచయిత చెప్పిన విషయాల బట్టి ఆ మాత్రం తెలుసని అనుకుంటున్నా. ప్రముఖ వ్యక్తి కాదు, రచయితగా పూర్వానుభవంలేదు అలాంటి వ్యక్తి వ్రాస్తున్న మొదటి పుస్తకానికే లక్షల ప్రింట్లు వేయించటానికి ఎమెస్కో వారు సిద్దపడ్డారంటే అది రామూ ఆశీర్వాద చలవే. తన చుట్టూ చేరిన వారిలో చాలామందికి డైరెక్షన్ అవకాశాలిచ్చి రాత్రికి రాత్రే డైరెక్టర్లని చేసేసే అపర బోళాశంకరుడు రామూ, సిరాశ్రీకి ఇచ్చిన జీవితకాల సాఫల్యావకాశం ఈ పుస్తకం అని నా అభిప్రాయం.

ఇక పుస్తకం విషయానికి వస్తే టైటిల్, కవర్ పేజ్ ఈ పుస్తకానికి కొండంత అండగా నిలిచాయి. పుస్తకాల షాపులో తిరుగుతున్న ప్రతివాడు ఈ పుస్తకాన్ని ఒకసారి చేతుల్లోకి తీసి చూసాడంటే అది ఆ రెంటి చలవే. పబ్లిషర్ పుస్తకం గురించి అని చెప్పి వ్రాసిన మొదటి పేజీలో రామూ ఒక బ్రహ్మపధార్ధం, ఒక కొరుకుడు పడని గుండ్రాయి, అతడిని అర్ధం చేసుకునే చిన్న ప్రయత్నమే ఈ పుస్తకం అనే భారీ పసలేని పంచ్ డైలాగులతో పుస్తకం మొదలయ్యింది. ముందుమాట ఏ మాత్రం అవసరం లేని పుస్తకానికి ముందుమాట వ్రాసి పూరీ జగన్నాధ్ తేలిపోయాడు. అందులోనూ అత్యుత్సాహంతో

“ఆయన మాటలు వింటుంటే మనకి ఇంత వయసొచ్చినా ఇన్ని విషయాలు ఎలా తెలీలేదు సుమీ అనిపిస్తుంది.”
“ఈయనున్నాడనే ధైర్యంతో అయాన్ రాండ్ ని చదవడం మానేశాను”
“ఆయన సినిమాని కిందేసుకోని, మీదేసుకోని, పక్కలో ఏసుకోని పడుకుంటాడు”

వంటి మాటలతో తన స్థాయిని చాటుకున్నాడు.

పెగ్గులని పేరు పెట్టుకుని రచయిత మొదలెట్టిన చాప్టర్లు రౌండ్లు రౌండ్లు ముగుస్తున్నా విషయం చిక్కపడదు, చెప్పాలనుకున్న విషయం తేలదు. ఈ పుస్తకాన్ని ఆదర్శంగా తీసుకుని నిక్కరేసుకుని శివ పోస్టర్లు చూసిన కాలం నుండి రామూకి షేక్ హ్యాండిచ్చే దాకా సాగిన జీవితాన్ని పుస్తకాలుగా వ్రాయొచ్చు అని రాము ప్రత్యక్ష శిష్యులు, ఏకలవ్య శిష్యులంతా తీర్మానించేసుకుంటే పుస్తకాల షాపుల్లో ర్యాకులన్నీ “వోడ్కా విత్ వర్మ”ల తోనూ, “తడ్కా విత్ ఊర్మిళ” వంటి పుస్తకాలతోనూ నిండిపోతాయి.

నాకు రాముని అడగలేని కొన్ని ప్రశ్నలున్నాయి వాటికి సమాధానం చెప్పగలవారు వీళ్ళే అని ప్రతి చాప్టర్లో చెప్పే రచయిత రామూ సన్నిహితులందరినీ ఒకే రకమైన ప్రశ్నలు వేసాడెందుకో? అందులోనూ ఫిల్మ్ మేకర్‌గా ఆయన పై మీ అభిప్రాయం, ఆయన సినిమాల్లో మీకు నచ్చినవి వంటి ప్రశ్నలు రామూయిజం స్థాయికి ఏ మాత్రం సరిపోనివి. రచయిత ఎంతో కష్టపడి సంపాదించాను అని చెప్పుకున్న రామూ వైఫ్, రామూ కూతురి ఇంటర్వ్యూల్లో ప్రశ్నలు వార్తాపత్రికల్లో తామే ప్రశ్న,సమాధానం వ్రాసుకునే శీర్షికల పంథాలో సాగాయి. ఎప్పుడూ మీడియా ముందుకి రాని వీరి అభిప్రాయాలు ఈ పుస్తకంలో ఉన్నాయని ఊదరగొట్టినందుకు, ఏవో అంచనలు పెంచుకున్న రామూ అభిమానులు నిరాశపడక తప్పదు. ప్రముఖ దర్శకులైన హరీష్ శంకర్, శివ నాగేశ్వరరావు, మధుర శ్రీధర్, దేవ కట్టా,  బివిఎస్ రవి వంటి వారి వ్యాసాలు కేవలం పేజీలు నింపటానికి మాత్రం పనికొచ్చాయి. వర్మ పెద్ద మేనమామ ప్రసాద్ రాజు గారి మాటల్లో ముక్కుసూటిదనం, మీడియా జర్నలిస్ట్ స్వప్న లాంటి వాళ్ళు చెప్పిన మాటల్లో బిట్వీన్ ద లైన్స్ వెతుక్కుంటే తప్ప పుస్తకం పాఠకుడికి మిగిల్చేదేమీ లేదు.

రచయిత తనకున్న రచనాసక్తిని, ప్రతిభని బయటకు తెచ్చే ప్రయత్నం ఎక్కడా చేసినట్టు కనపడదు. వర్మ తనని పూనాడని, తనూ వర్మలానే ఆలోచిస్తున్నాడని, తనూ వర్మలానే మాట్లాడుతున్నాడని చెప్పే ప్రయత్నమే ఎక్కువగా కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగా తను ఇతర ప్రముఖుల పట్ల చూపే నిర్లక్ష్యం, వాళ్ళని తేలికచేసే మాటలతో, కాంట్రవర్సరీలతో పేజీలు నింపేసాడు. వర్మ కిస్ థియరీ, ఒక వివాహిత రామూ గురించి చెప్పిన అభిప్రాయాలు వంటివి ఈ పుస్తకానికి ఏవిధంగా ఉపయోగపడతాయో నాకు అర్ధం కాలేదు. వర్మ అన్నాక కాస్త మసాలా లేకపోతే ఎలా అనుకుని వీటిని పెట్టారేమో.

ఒక స్నేహితునితో ఈ పుస్తకం గురించి మాట్లాడుతున్నప్పుడు, తాగినప్పుడు మనిషిలో ఉండే నిజమైన థియరీలు బయటకొస్తాయి, అందులోనూ తాగిన వ్యక్తి రామూ అయితే ఆ థియరీలు చాలా ఆసక్తిగా ఉంటాయి అలాంటి డ్రింక్స్ టైమ్ డిస్కషన్స్ ఇందులో ఉంటాయని ఆశించాను అని చెప్పాడు. తెలుగు పాఠకులు ఎగబడి కొనుక్కుని చదవాల్సిన పుస్తకాలు కరువైపోయిన ఈ కాలంలో సంచలనాత్మక పుస్తకాలకి కావాల్సినంత డిమాండ్ ఉంది. అందులోనూ వర్మలాంటి సంచలనాత్మక వ్యక్తి తోడయితే ఆ డిమాండ్ మరింత పెరుగుతుందని రుజువయిపోయింది. వర్మ బ్లాగు నుండి తెచ్చి పెట్టిన వ్యాసాలతో నింపిన నా ఇష్టం, ఇదివరకే జనాలందరికీ తెలిసిన విషయాలనే మరలా చెబుతూ వచ్చిన వోడ్కా విత్ వర్మ ఈ డిమాండ్‌ని వాడుకున్నాయే తప్ప ఎవరినీ సంతృప్తిపర్చలేదు. మరిన్ని పుస్తకాలు భవిష్యత్తులో రాబోతున్నాయనేది సుస్పష్టం. ఈసారి వ్రాసేవాడు మన డబ్బుకి న్యాయం చేసేవాడు కావాలని ఆశిద్దాం.

“తనని ఆకట్టుకోవాలంటే ఆడవాళ్ళయితే చాలా సెక్సీగా ఉండాలి, మగాళ్ళయితే మేధావులై ఉండాలి” అని చెప్పుకునే రామూ ఆ మాటకు కట్టుబడి ఉంటే ఈ పుస్తకంలో వ్యాసాలు వ్రాసిన చాలామంది ప్రముఖుల్ని జీవితంలో మరలా ఎప్పుడూ వోడ్కాకి పిలవడని, కలవడని నమ్ముతున్నా.

నోట్: కినిగె ఈ పుస్తకాన్ని 10% తగ్గింపు ధరకు అందిస్తుంది.

వోడ్కా విత్ వర్మ On Kinige

బ్లాగు ప్రయాణంలో మూడేళ్ళు

బ్లాగు ప్రయాణంలో మూడేళ్ళు

బ్లాగు ప్రయాణంలో మూడేళ్ళు

చిరుఆశ అనే ఒక టపాతో చిరంజీవి రాజకీయప్రవేశం గురించి కాస్త పదాల అల్లికతో ఏదేదో వ్రాసి ఒకటపాగా వేసి బ్లాగు అనగానేమి అనే ప్రశ్న వెంట మొదలయిన నా ప్రయాణంలో మూడేళ్ళు నిండాయి. అసలు నేను వ్రాస్తే ఎవరన్నా చదువుతారా? స్పందిస్తారా? అభినందిస్తారా అనే అనుమానాలతో. ఆరాటలతో మొదలయిన నా బ్లాగు ప్రయాణంలో గుర్తుచేసుకోదగ్గ స్మృతులు ఎన్నో.ఈ మూడేళ్ళ నా ప్రయాణాన్ని కాస్త అవలోకనం చేసుకోవలనిపించింది. ఏముంది పెద్ద గొప్ప? అని ఎవరన్నా అంటే నా సమాధానం ఏ వ్యక్తీ గొప్పపనులు చెయ్యడు. కొందరు వ్యక్తులు చేసిన పనుల్ని సమాజం మాత్రం గొప్పగా భావిస్తుంది. నా దృష్టిలో గొప్పతనం సాధించేది కాదు కేవలం ఆపాదించబడేది. అందుకే ఈ టపా గొప్పతనాన్ని మాత్రమే సహించే గొప్పవాళ్ళ కోసం కాదు. ఇది నాలాంటి ఒక మాములు మేంగో మేన్ తన ఆలోచనలతో వ్రాసుకున్న బ్లాగు మరియు బ్లాగు ప్రయాణం పై ఒక విహంగ వీక్షణం.

మూడేళ్ళ క్రితం ల్యాప్‌టాప్ కొన్న కొత్తలో అంతర్జాలంలో చాటింగ్,మెయిలింగ్ తప్ప వేరే ఏమీ తెలియవు నాకు. తెలుగులో అందరూ పెట్టే మెసేజ్లు, స్టేటస్లు ఎలా వస్తున్నాయో తెలుసుకుందామనే ప్రయత్నంలో గూగులమ్మని ఆశ్రయించా. పేదరాసి పెద్దమ్మని కదిపితే కధలకి లోటా? అనగనగా ఒక వీవెన్ అనే రాజు తన రాజ్యంలో జనాలంతా పరభాషా వ్యామోహంలో కొట్టుకు పోతుంటే ఇలా అయితే మన గత కీర్తికి ఏం కాను అని భయపడినవాడై “దేశ భాషలందు తెలుగు లెస్స. కోడు భాషలందు యునీకోడ్ లెస్స” అని పలికి, వారికోసం “శ్రీ రాజీవ్ లేఖిని” (క్షమించాలి అలవాటులో పొరపాటు) లేఖిని అనే పధకాన్ని ప్రవేశపెట్టాడని తెలిసింది. మచ్చుకు కొన్ని బ్లాగుల్ని చూపించి వదిలింది.

దొరికిన బ్లాగుల్ని పట్టుకుని వాటి వెంట పరిగెట్టి, అందులో కామెంటిన వారి బ్లాగుల్లోకి జంపింగులు చేస్తూ ఏకబిగిన పదమూడు పగల్లు, పదమూడు రాత్రులు గడిపాను. అఫీసులో అప్పటికే అఫ్లికేషన్ కంటే వికీ ఎక్కువ వాడతానని అపవాదు ఉంది. దానికి బ్లాగులు తోడయ్యాయి. దీనితో మన అప్రైజల్ కాస్త గోవిందా కొట్టింది. కానీ కొత్త దొంగోడు వేకువ ఎరుగడని (బాగా చెప్పానా? :)) నేను మాత్రం నా పంథా మార్చుకోలేదు. చదవగా చదవగా నిత్యరోగికి హాస్పిటల్ పెట్టేయాలని దురదపుట్టినట్టు నాకు కూడా ఒక బ్లాగు తెరవంగ మనంబున మిక్కిలి దురదపుట్టెన్.

ఏం వ్రాయాలో తెలియదు. ఏం వ్రాస్తే అందరూ చదువుతారో తెలియదు. అందర్నీ ఆకట్టు కోవటానికి ఆంధ్రలో అందరూ వాడే ఫార్ములా దొరికింది. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రావాల్సిందంతే అన్నటైపులో వ్రాసాను. వ్రాసి పోస్టు వేసి “వస్తాడు నారాజు ఈ రోజు” అని పాడుకుంటూ కామెంట్లకోసం ఎదురుచూసా. “రేయిగడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే” అని పాడి పాడి అలిసి సొలసి పడిపోయాకా అబ్రకదబ్రగారు డింగ్ మని ప్రత్య్క్షమయ్యారు. గూగుల్లో చూసి ఇటొచ్చా నాయన ఏంటీ వెర్రి రాతలు? సరే ఏదో ఒకటి ఏడు కానీ అమెరికా వెళ్ళాలనుకునేవాడివి శంషాబాద్ వెళ్ళాలి కానీ ఇలా అమీర్‌పేట్ చౌరస్తాలో దారి తప్పోయినోడిలా అయోమయంగా ఎదురుచూస్తే ఎట్టా అన్నారు. అంతా విని మూసినది పుష్కరాల్లో దారితప్పోయినోడిలా మొహం పెట్టి ఇంతకీ ఎటు వెళ్ళాలి అని అడిగా. “పార్ధాయ ప్రతిభోదితాం భగవత నారాయణీనస్వయం” అని చిరునవ్వు నవ్వి “పార్ధా, కనిపించే ఈ మూడు చౌరస్తాలు అమీర్‌పేట, కూకట్‌పల్లి, మూసపేట చౌరస్తాలయితే కనిపించని ఆ నాల్గవ చౌరస్తానే కూడలి.. కూడలి.. కూడలి” అని చెప్పి డింగుమన్నారు.ఆయనకి మొదటిగా ధన్యవాదాలు చెప్పుకోవాలి నేను.

కూడలిలో క్రూరమృగం నా మొదటి టపా. అప్పటికే బ్లాగులోకంలో సీనియర్లు సుజాతగారు, చావాగారు, కత్తి మహేష్‌గారు, బొల్లోజు బాబాగారు అభినందిస్తూ కమెంట్లుపెట్టారు. అటుపైన నా బ్లాగు కాస్త అందరి దృష్టిలో పడింది. చదివినవాళ్ళు సూచనలు, అభినందనలు ఇచ్చారు. “హ హా హాసిని, నేటికి నెరవేరిన మూషికవరం, బందరు మామయ్య – బంగారు బాతు, హాసిని కి పెళ్ళి చూపులోచ్…, జాజు – ఒక కాకి కధ, జావా జావా కన్నీరు” లాంటి సూపర్‌హిట్టు టపాలు వ్రాసాక బ్లాగులోకంలో నా బ్లాగు కూడా అందరికీ తెలిసింది..ఇందులో అత్యధిక టపాలకు కధావస్తువుగా నిలిచిన నా స్నేహితురాలు హాసినికి నా కృతఙ్ఞతలు. “భయంగా ఉంది నాన్న…, e-తెలుగు విజయవాడ పర్యటన పై నివేదిక” వంటి టపాలకు అందరి ప్రశంసలు అందుకున్నా.

చదివినవారందరూ గుర్తుంచుకోకపోయినా చాట్లోనో, కాల్ చేసో కొన్ని వాక్యాలు ఉటంకించి బాగున్నాయి అని చెప్పినప్పుడూ ఆనందపడ్డా. సవరణలు, టైపాట్లు చెప్పినప్పుడు సర్దుకున్నా. నా వరకు నాకు సంతృప్తినిచ్చి మరలా మరలా చదువుకునే టపాలు, వాక్యాలు ఎన్నో ఉన్నాయి. ఖాళీగా ఉన్నప్పుడు ఇప్పటికీ చాలాసార్లు నా టపాలు నేనే చదువుకుంటా. కాకిపిల్ల కాకి ముద్దు అని నవ్వి పోదురుగాక. కానీ భాదలో ఉన్నప్పుడు నా టపాలే నాకు కొన్నిసార్లు స్వాంతననిచ్చాయి, నిరాశలో ఉన్నప్పుడు ఉత్సాహాన్నిచ్చాయి. కొన్ని వాక్యాలు చదివినప్పుడు ఇంత గొప్ప భావం నాకేలా తట్టిందబ్బా అనుకున్న సందర్భాలూ ఉన్నాయి. బోస్టన్‌లో ఉండగా ఎవరో తెలియని వ్యక్తులు ఫోన్ చేసి నా టపాలు బాగున్నాయి అని చెప్పిన అనుభవాలూ ఉన్నాయి. భయంగా ఉంది నాన్న చదివినప్పుడు అమ్మమ్మ,ఇంకొంతమంది భందువులు కళ్ళనీళ్ళు పెట్టుకుని ఫోన్ చేసిన చేదు స్మృతులూ ఉన్నాయి. క్రమం తప్పకుండా మమ్మీ ఇప్పుడు నా బ్లాగు చదువుతుంది. బోస్టన్‌లో ఉండగా మా క్లైంట్ మేనేజర్ శంకర్ నా వ్రాతల కారణంగా ఇప్పటికీ నన్ను గుర్తుంచుకున్నారు. నా బజ్జులో క్రమం తప్పకుండా కామెంట్లు పెట్టి ప్రోత్సహిస్తున్నారు. భరణిగారు, దర్శకులు వంశీగారు వంటి కొందరు ప్రముఖులను కలిసే అవకాశం కూడా బ్లాగు వలనే కలిగింది నాకు. ఇంకా చెప్పాలంటే చాలా ఙ్ఞాపకాలు ఉన్నాయి. ఒకప్పుడు నా డైరీ అని పొదవిపట్టుకునేవారట. ఇది నా బ్లాగు మురళీగానం, అడవి లోని వెదురు పలికే స్వరాలు.

ఈ బ్లాగుతో అసలేం సాధించానని? తెలుగు సాహిత్యమనే సముద్రంలో చిన్న నీటిబొట్టుని కూడా కాలేను. కానీ ఎంత గొప్ప సాహితీవేత్తయినా “నీలా ఉండాలని ఆ చందమామకి ఎంత ఆశో! పాపం నువ్వే ఒక్కరోజు తనలా ఉండకూడదూ” అన్న నా చిరుకవితను విని “అర్భకా! ఈ భావం బాగుందిరా” అని అనకపోతారా? పైగా పప్పు,నిప్పు,ఉప్పు,తుప్పు అని ప్రాసలో పదాలు కూర్చటమే కవిత్వం, అనే అఙ్ఞానంలోనే ఉండిపోకుండా నాది అనే స్వరం కోసం అన్వేషణ సాగిస్తున్నా. అసలెప్పటికీ నా ఐడెంటిటీ సాధించలేకపోయినా ఈ అన్వేషణ చాలు నాకు తృప్తినివ్వటానికి. నన్ను ప్రపంచం తెలుసుకోవటానికి, నేను ప్రపంచాన్ని తెలుసుకోవాటానికి, అసలు నన్ను నేనే తెలుసుకోవటానికి బ్లాగులోకం ఉపయోగపడింది. నా ఆలోచనలు ఒక నిర్దిష్టతను సంతరించుకోవటంలోనూ, వివిధ వ్యక్తుల వ్యక్తిత్వాలు, వృత్తులు, ప్రవృత్తులు, భావజాలాలు, భేషజాలు, విపరీత భావాలు, మనస్తత్వాలు తెలుసుకొని ఒక అవగాహన ఏర్పరుచుకోవటంలో బ్లాగులోకంలో నా ప్రయాణం ఎంతో ఉపయోగపడింది. నా చేతల్లోనూ, వ్రాతల్లోనూ ఒక పరిణతికి ఉపయోగపడింది.

ఈ మూడేళ్ళలో బ్లాగులోకంలో ఎంతో మార్పు వచ్చింది.చిన్న కుటుంబం చింతలేని కుటుంబంలా ఉండేది ఒకప్పుడు. బ్లాగర్లంతా చాలా ఆత్మీయంగా ఒకే కుటుంబంలా ఉండేవారు. నేను వచ్చిన కొత్తలో నా చేయి పట్టుకు నడిపించారు. ఒకరిని ఒకరు ప్రోత్సహిస్తూ సహాయ సహకారలందిస్తూ స్నేహంగా ఉండేవారు. బ్లాగులోకం విస్తరించిన కొద్దీ ఎన్నో బిగ్ బాంగ్‌లు సంభవించాయి. విడి విడిగా పాలపుంతలు ఏర్పడ్డాయి వేటి స్వయం ప్రతిపత్తి వాటిది, వేటి మనుగడ వాటిది. ఏ వ్యవస్థలోనయినా మార్పు నియంత్రించలేనిది, అనివార్యమైనది.

నిన్నటిది నేటికి పాతబడుతున్న ప్రపంచంలో బ్లాగు పోయి, బజ్జు వచ్చే డాం డాం డాం అని మారుతున్న రోజుల్లో బ్లాగులు ఉంటాయో ఊడతాయో తెలియదు కానీ బ్లాగులోకంలో కొందరు సన్నిహితులు మాత్రం ఎప్పటికీ నా మనసులో అలానే ఉంటారు. కొందర్ని చూసినప్పుడు వీళ్ళు మురళీగాడి బ్లాగు ఫ్రెండ్స్‌రా అని నా స్నేహితులు అంటారు. అలా ఒక ప్రత్యేకమైన స్నేహవర్గం నాకు దొరికింది. మొదట్లో కామెడీ పోస్టుల ద్వారా దోస్తీ కట్టిన శ్రీవిద్య, మీనాక్షి, ఆశ్విన్ తో మొదలు, కవితలతో దోబూచులాడే క్రాంతి వరకూ అందరూ ఆప్తులే. తమ్ముడూ అని ఆప్యాయంగా పిలిచే సతీష్ అన్నయ్య, శ్రీనివాస్ కుమారన్నయ్య, నా ఫీజులేని డాక్టర్ కౌటిల్య, ఇప్పుడు అవినేని అన్నయ్య, టపాలు చదివి అభినందించటమే కాక కొన్ని మంచి మంచి చర్చలు చేసే విశాలగారు అందరూ అభిమానం చూపించినవారే.

e-తెలుగు సభ్యుడిగా సంస్థ నిర్వహించిన కార్యక్రమాల్లో నా ఉడుత సహాయం అందించాను. సమయంలేక ఇప్పుడు సంస్థ కార్యక్రమాల్లో హాజరుకాకపోయినా నన్ను ఏనాడు నిందించని కార్యవర్గానికి ఏ రూపంలో కృతఙ్ఞత చూపించాలో? సంస్థలో చురుకుగా పాల్గొనటం వలన చదువరిగారు, వీవెన్‌గారు, కశ్యప్‌గారు ఇలా నిర్ధిష్ట అభిప్రాయాలున్న వ్యక్తుల సాహచర్యం దొరికింది. వ్యక్తిగా వీరి వద్దనుండి నేర్చుకున్నది ఎంతో ఉంది. లాభాపేక్షలేని సంస్థకి తమ సమయాన్ని కేటాయిస్తూ, పదవులు, హోదాలు కూడా ఉత్సాహవంతులకు కట్టబెట్టి తాము మాత్రం కాడి భుజానికిఎత్తుకొంటారు. సి.బి.రావుగారు, శ్రీనివాసరాజు దాట్ల, చక్రవర్తిగారు, రవిచంద్ర ఇలా గత ప్రస్తుత కార్యవర్గ సభ్యులు, e-తెలుగు కార్యక్రమాలకి తమ వంతు సహకారం ఎప్పుడూ అందించే కొందరు బ్లాగర్లు వీరందరి నుండి “స్వంత లాభం కొంత మానుకు” అనేదానికి అర్ధం నేర్చుకున్నాను. విఫలమై ప్రజలు గుర్తించని కొన్ని కార్యక్రమాలకు కూడా ముందు వెనుక వీరు చేసిన కృషి సభ్యుడిగా నాకు తెలుసు. ఏం ఉద్దరిస్తారు తెలుగుని నిలబెట్టి? అని ఎవరన్నా అంటే సొంత తల్లిని తిట్టినట్టే భావించే వీరి సంస్కారం నాకు ఆదర్శాలను ఎంత త్రికరణ శుద్దిగా నమ్మాలో తెలియజెప్పింది.

రేపు ఈ బ్లాగులు,బజ్జులు అన్నీ పోవచ్చు. కానీ వీరంతా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నా జీవనప్రయాణంలో భాగంగా ఉంటారు. నా బ్లాగు ప్రయాణంలో నాకు ఎంతో ఇచ్చిన మీ అందరికీ కృతఙ్ఞతలతో…

మీ
మురళీ

నాకు నచ్చిన గుర్తుచేసుకోదగిన టపాలు కొన్నిక్రింద ఇస్తున్నా.

హాస్య టపాలు:
1.కౄర మృగం
2.హ హా హాసిని
3.నేటికి నెరవేరిన మూషికవరం
4.బందరు మామయ్య – బంగారు బాతు
5.హాసిని కి పెళ్ళి చూపులోచ్…
6.జావా జావా కన్నీరు
కవితలు:
1.పిచ్చి రాతలు
2.లాలీ జో.. లాలీ జో..
3.నేను కవిని కాదన్నవాడ్ని కత్తితో పొడుస్తా.
4.నేను రచయిత కాదన్నవారిని రాయిచ్చుకు కొడతా..
5.ఆమె నన్ను వదిలి వెళ్ళిపోయింది.
నివేదికలు:
1.e-తెలుగు విజయవాడ పర్యటన పై నివేదిక
2.ఆంధ్ర తుంబురుడు అవతరించెను నేడు…
3.శంకరా’భరణం’
ఇతరములు:
1.ఇదే నా మొదటి ప్రేమలేఖ…
2.జాజు – ఒక కాకి కధ
3.>భయంగా ఉంది నాన్న…
4.పెళ్ళి-ఒక దృక్కోణం
గుర్తింపుకి నోచుకోని నాకు నచ్చిన టపాలు:
1.కాకి దిద్దిన కాఫురం (!?!)
2.పార్టింగ్ నోట్
3.ఐ హేట్ యు రా
4.సరికొత్తచీర ఊహించినాను..