వనవాసంలో ఒకనాడు

పచ్చని వనంలో ఎర్ర మట్టితో అలికి, రంగవల్లులు తీర్చిన ఆ పర్ణశాల ప్రకృతిమాత మడికట్టుకుని వెలిగించిన కార్తీకదీపంలా వెలిగిపోతుంది. వాకిట్లో వృక్షాలన్నీ నిన్నటి ముచ్చట్లు నెమర వేసుకుంటూ, ఆకులతో, కొమ్మలతో పలకరించుకుంటున్నాయి. కొమ్మలపై వాలిన పక్షులన్నీ సందడి చేస్తూ ఆ ముచ్చట్లకు అడ్డు తగులుతున్నాయి. చెట్లకు చుట్టూ గుబురుగా పరుచుకున్న పూల మొక్కలన్నీ మౌనంగా రేపటి తమ కానుపుకై కలలు కంటున్నాయి. ముంగిట్లో చేరిన హరిణాలు పచ్చిక తింటూ మధ్య మధ్యలో ఎవరికోసమో మెడలు పైకెత్తి పెద్ద పెద్ద లోచనాలతో ఆత్రంగా చూస్తున్నాయి

ఉదయం ఉత్సాహంలో ఉన్న సూర్యుడు కొమ్మల సందుల్లోనుండి ఒడుపుగా తన కాంతిని వదులుతూ ఎండ ముగ్గులు వేస్తున్నాడు. తుంటరి కొమ్మలు అటూ ఇటూ ఊగుతూ ఆయన్ని అల్లరిపెడుతున్నాయి. పాపం ఉడుక్కుంటున్న ప్రత్యక్ష నారాయణుడు మరింత వేడెక్కిపోతున్నాడు. ఏకాగ్రత చెదిరిందేమో ఇక కుదరదని వదిలేసి తన అశ్వాలని ముందుకు అదిలించాడు

ఒక తుంటరి జింకపిల్ల చెంగు చెంగున దూకుతూ గుమ్మం దాకా వచ్చేసింది. కాస్త తడబడుతూ, బిత్తర చూపులతో మెల్లగా లోపలికి తొంగి చూసింది. చూస్తూనే ఉండిపోయింది. ఏ రూపం చూడాలని లోకంలో ఉన్న కన్నులన్నీ పరితపిస్తాయో, ఏ మూర్తిని నింపుకుని మందిరాలుగా మారాలనీ మనస్సులన్నీ కోరుకుంటాయో, ఏ స్వామి వాత్సల్యం కోసం సర్వ ప్రాణికోటి ఆరాటపడుతుందో ఆ సుందర మనోహర రాముడు నార వస్త్రాలు ధరించి ధ్యానంలో ఉన్నాడు. సృష్టిలో ఉన్న ఏ ఆభరణాలూ ఈ నార వస్త్రాల్లా స్వామి అందాన్ని చూపలేవేమో?

గుమ్మంలో అలికిడి విని కన్నులు తెరిచి చూసాడు. పాపం జింక పిల్ల స్వామి తనని చూసేసారని తత్తరపాటుకి లోనయ్యింది. కానీ చూపుని స్వామి నుండి మరల్చ లేకపోయింది. స్వామి నడుచుకుంటూ వచ్చి జింక పిల్లని చేరదిసి “పొద్దున్నే పలకరించాలని వచ్చావా? ఇక పోయి నీ నేస్తాలతో ఆడుకో” అని వదిలి గుమ్మంలోకి వచ్చారు. స్వామి తనని తాకినందుకు సంబరపడుతూ ఈ విషయం తన నేస్తాలకి చెప్పాలన్న ఉత్సాహంలో జింక పిల్ల వాకిట్లోకి పరుగుతీసింది. స్వామి దర్శనం కోసం ఉదయం నుండీ పడిగాపులు కాస్తున్న పక్షులు, జంతువులు అన్నీ గుమ్మం దగ్గరకి చేరిపోయి స్వామిని మరింత దగ్గరగా చూడాలని ఉత్సాహ పడసాగాయి. స్వామి అందరినీ తన చల్లని చూపులతో, చిరు మందహాసంతో పలకరిస్తున్నారు.

పర్ణశాల లోపల పనిలో ఉన్న సీతమ్మతల్లి “హ్మ్ స్వామివారికి తెల్లారిందా? ఆ ముచ్చట ముగిసాక కాస్త వంటలో లవణం వేస్తారా? నా చేయి వీలు లేదు” అంటూ పురమాయించింది.

స్వామి చిరునవ్వుతో అందరిని పంపించి ఇంటిలోకి వచ్చారు. పాపం ఆయన వరదహస్తం కాస్త పెద్దదాయె, చేతివాటాన వంటలో కాస్త లవణం ఎక్కువే వేసారు. సీతమ్మ ఏమంటుందో అని కాస్త బెరుకు గొంతుతో “జానకీ! కాస్త ఉప్పు ఎక్కువయ్యిందేమో” అంటూ నసిగారు.

అమ్మవారు చేస్తున్న పని ఆపి నిట్టూరుస్తూ గెడ్డం కింద చెయ్యిపెట్టుకుని “హ్మ్ బాగుంది. నేను మీకే చెప్పానూ. ఏది ఎంత వెయ్యాలో తెలిసిన వారైతే లోకం ఇట్లా ఎందుకుంటుంది?” అని లేచి వంట దగ్గరకి వచ్చింది.

ఫలాలకోసం వనంలోకి వెళ్ళి అప్పుడే వచ్చిన లక్ష్మణస్వామి ముసి ముసిగా నవ్వుకుంటూ “లోకాలనేలే దేవదేవుడైనా ఇంటిలో ఉప్పుగడ్డకు లోకువ” అని మనసులోనే అనుకున్నారు.

సీతమ్మ వంట కాస్త రుచి చూద్దామని నోటిలో వేసుకుంది. కళ్ళలో నీళ్ళు తిరిగాయి. స్వామి అమ్మవారి కళ్ళలో నీళ్ళు చూసి భీతిల్లి “అయ్యో జానకీ ఏమయ్యింది? ఎందుకు రుచి చూసావు? మధుర ఫలములు తప్ప వేరు రుచి తెలియని నీ నోటికి లవణం బాధకలిగించిందా? ఏమరపాటున ఎంత పని చేసాను” అంటూ తల్లడిల్లారు.

అమ్మవారు స్వామి చేతులను కళ్ళకు అద్దుకుని “స్వామి మీ చేత జారిన లవణమయినా వృధాపోదని విస్మరించి తూలనాడాను. నన్ను క్షమించరూ. అమృతము తప్ప వేరు రుచి దీనికి సాటి రాగలదా? ” అని తన్మయత్వంతో పలికింది. స్వామి ఒక దీర్ఘ నిట్టూర్పు విడచి, చిరునవ్వుతో ఊరడిల్లారు. ఇదంతా చూసిన ఒక ఉలికిపిట్ట వనమంతా తిరిగి గోల చేసి అందరికీ ఈ వార్త చేరవేసింది. కాసిన్ని మెతుకులు మాకు దొరకకపోతాయా అని పక్షులన్నీ ముంగిట్లో చేరి చూడసాగాయి.

వంట ముగిసే సరికి సూర్యుడు నడినెత్తికి వచ్చాడు. స్వామిని భోజనానికి పిలిచి అమ్మవారు పూజ చేస్తున్నంత శ్రద్ధగా వడ్డన చేస్తుంది. “జానకి! ప్రతిరోజు ఇంతే ఓర్పుగా, శ్రద్ధగా వడ్డింపు చేస్తావు. నీ వడ్డనలో భక్తికి ముచ్చట వేస్తుంది సుమా” అన్నారు.

“నా బాధ మీకెప్పుడు తెలిసింది కనుక. ఇప్పుడేగా దక్కింది నాకీ భాగ్యం. అయోధ్యలో ఉండగా అత్తలు నాకీ అదృష్టం దక్కనిస్తేనా. ఒకరికి తెలియకుండా ఒకరు చొప్పున ముగ్గురత్తలూ మూడుపూటలా ఈ బాలాకుమారునికి కొసరి కొసరి ముద్దలు తినిపించటం చూడటానికే సరిపోయేది” అని బుగ్గలు నొక్కుకుంది సీతమ్మ.

“లోకమాత అని అందరూ పిలిచే నీకు అమ్మ ప్రేమ తెలియనిదా?” అని స్వామి నవ్వుకున్నారు.

“బాగుంది సంబరం. నేనిప్పుడు ఏమన్నా అని? మీ మాటలు వింటే నేనేదో అత్తలని ఆడిపోసుకున్నా అనుకుంటుంది లోకం” అని విసుక్కుంది సీతమ్మ.

“మీ సోదరి ఊర్మిళకి ఆ భాగ్యం కూడా లేకపోయింది” అని బయట మొక్కలకి నీరు పెడుతున్న రామానుజుని  చూసి రాముడు విచారపడ్డాడు.

“హ్మ్ మీ తమ్మునికి అన్న తప్ప అన్యులక్కరలేదాయె. ఏం చేస్తాం పాపం” అని నిట్టూర్చింది సీతమ్మ.

“సుకుమారవతియైన సతిని సుఖవాసాన ఉండనిచ్చి మేటిభర్త అనిపించుకున్నాడు. అడవులకు నడిపిన నింద నాకేగా. భావి తరాలు నాపై ఇంకెన్ని నిందలు మోపనున్నారో” అని నిట్టూరుస్తూ భోజనం ముగించారు స్వామి.

మెల్లగా సంధ్యవాలి పున్నమి చంద్రుడు కలువలతో ముచ్చటలాడటానికి ఉత్సహంగా వచ్చాడు. పున్నమి చంద్రుని పూర్ణకళలు చుసి వనమంతా మురిసింది. అడవంతా ఆ తెల్లని వెలుగులో పాలసంద్రపు తరకలా ఉంది. పర్ణశాల బయట ఆదిశేషునిలా విస్తరించిన చెట్టు నీడన నిదురిస్తున్న స్వామిని చూసిన చంద్రుడు, తాను వెలవెలపోతానని భయపడి చటుక్కున మబ్బుల చాటుకి పోయాడు. నింగి నున్న తారకలన్నీ మిణుకుమిణుకుమని నవ్వుకున్నాయి. స్వామి పాదాలు ఒత్తుతున్న సీతమ్మ స్వామివారి కోదండం చూస్తూ ఏదో అలోచనలోపడింది.

“ఏమిటి జానకి, ఏదో అలోచనలో ఉన్నావు?” అని మూసిన కళ్ళు తెరవకుండానే అడిగారు స్వామి.

“అంతా గమనించేసారా?” అని నవ్వుకుంటూ “శివధనస్సు సహితం నిలువలేని మీ చేతిలో ఈ సాదారణ విల్లు ఎలా నిలువ గలిగిందా అని ఆలోచిస్తున్నా” అంది సీతమ్మ.

స్వామి లేచి తన చేతిపైకి ఒత్తిగిలి అమ్మవారిని చూస్తూ “నువ్వూ అదే అన్నావ్. నేను శివధనస్సును విరచలేదని ఎంత చెప్పినా వినరే. అది అనుకోకుండా జరిగింది సుమా” అని అలుక అభినయించారు స్వామి.

“శివధనస్సు ఎక్కుపెట్టే ముందు తామెదో తలుచుకున్నారు. ఎన్నిసార్లు అడిగినా అదేమిటో చెప్పరే” అని బుంగమూతి పెట్టింది సీతమ్మ.

“ఈనాడు చెప్పక్క తప్పేట్లు లేదు. లేకుంటే శివధనస్సు విరిచా అనే అపకీర్తి నాకు శాశ్వతమవుతుంది.” అని లేచి కూర్చుని నాటి సన్నివేశాన్ని అభినయించసాగారు స్వామి. అమ్మవారు ముసిముసిగా నవ్వుకుంటూ ఆసక్తిగా చూస్తుంది.

స్వామి ధనస్సుకి నమస్కరించినట్టుగా, రహస్యం చెప్పినట్టుగా అభినయిస్తూ “ఓ శివధనువా, నీవు సీతాసఖివని విని ఉన్నాను. చిన్ననాటి నుండి తను ఆటలాడగా చూసుంటావు. ఊసులాడగా విని ఉంటావు. తన మనసెరిగిన దానివి నీవని నా నమ్మకం. ఆడపిల్లలతో ఏనాడు ఆడి,మాటలాడి ఎరుగని నాకు ఆమె మనసు తెలుసుకొనటం సాధ్యం కాదు. మనసారా అంగీకరించని కన్యను చేపట్టటం మా రఘువంశము మెచ్చదు. అందుకే ఈ రాముడు నీ సహాయం కోరుతున్నాడు. నీ సఖి మనసున ఊహలకి రూపాన్ని నేను కాగలనని అనుకుంటే నా చేత ఒదిగిపోవుమా” అని పలికి సీతమ్మ వంక చూసి “ఇది మాత్రమే అన్నా జానకి. ఉలుకు తప్ప పలుకెరుగని నీ మనస్సు ఎట్లా తెలుసుకుందో నీ నెచ్చెలి ఉత్సాహం ఉరకలెత్తగా, అమాంతం తనువంతా విరుచుకు ముక్కలయ్యింది” అని అమాయకంగా చెప్పారు స్వామి.

స్వామి అభినయానికి నవ్వుకుంటూ, తన మనసు తెలుసుకోవాలనుకున్న ఆయన వాత్సల్యానికి కరిగిపోతూ స్వామి వారి పాదాల వద్ద ఒదిగిపోయింది సీతమ్మ. అనంత ఆనందాన్నిచ్చే ఈ దృశ్యాలను తనలో కలుపుకుంటూ కాలం మరో అందమైన రోజుకోసం సాగిపోయింది.

(నా పిచ్చి ఊహలకు క్షమార్పణలతో స్వామివారి పాదాలకు)

శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||

పునరపి

సాయంత్రం అయిదు గంటలవుతుంది. వేడి కాఫీ బాల్కనీ రెయిలింగ్ మీద పెట్టుకుని రోడ్డు వైపు చూస్తున్నా. పైన నల్లని మేఘం ఆకాశం మొత్తం కమ్మేస్తుంది. ఆదివారం కావటంతో రోడ్డు మీద జనాలు పెద్దగా లేరు. ఎదురుగా ఉండే అపార్ట్‌మెంట్ పిల్లలు రోడ్డు మీద ఆడుకుంటున్నారు. చిన్నగా జల్లు మొదలయ్యింది. పిల్లల అమ్మలనుకుంటా అందరినీ లోపలికి రమ్మని అరుస్తున్నారు. నేను కూడా లోపలికి వెళ్దామని వెనక్కి తిరిగా. కానీ ఒక దృశ్యం నన్ను ఆకర్షించి అక్కడే నిల్చుని చూస్తున్నాను.

పిల్లలంతా ఇంట్లోకి పారిపోతున్నా ఒక పాప మాత్రం ఆగిపోయింది. ఆకాశం వైపు చూస్తూ క్రింద పడుతున్న చినుకుల్ని తన చిట్టి చిట్టి చేతులతో కొడుతూ ఆడుతుంది. ఆ పాపని చూస్తూ ఒక బాబొచ్చాడు. పాప ఆనందంలో గెంతుతూ ఉంటే చూస్తూ నవ్వుకుంటున్నాడు. ఆ పాప గెంతటం ఆపి వాడి దగ్గరకి వెళ్ళి బుగ్గమీద ఒక ముద్దిచ్చింది. వాడి మొహంలో చెప్పలేని సంబరం. అక్కడున్న పిల్లలు, వాళ్ళ అమ్మలు అందరూ ఒకేసారి గట్టిగా నవ్వారు. ఇప్పుడు ఇద్దరూ చేతులు పట్టుకుని గెంతుతున్నారు. ఎంతో ఆనందం ఉత్సాహం ఉంది వారిలో. ఆ పాప వాళ్ళ అమ్మనుకుంటా వచ్చి పాపని, బాబు వాళ్ళమ్మ బాబుని తీసుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. నేను కూడా లోపలికి వచ్చేసా.

చల్లారిన కాఫీతో సహా కప్పుని సింక్‌లో పడేసా. వర్షంలో నిలబడటంతో బట్టలు తడిచాయి. మార్చుకుని వచ్చి తల తుడుచుకుంటూ సోఫాలో కూర్చున్నా. ఒంటరిగా ఆ నిశ్శబ్దంలో కూర్చోవటం చాలా బోర్‌గా ఉంది. టి.వి. చూసే అలవాటు లేకపోయినా ఒకసారి ఆన్ చేసా. చానెళ్ళన్నీ తిప్పినా ఏదీ నచ్చక ఆఫ్ చేసి పడేసా. కూర్చుని కిటికీలో నుండి వర్షం చూస్తుంటే ఇందాకటి పిల్లలు గుర్తొచ్చారు. వెంటనే ఎందుకో నాకు నా టైమ్‌మెషీన్ తియ్యాలనిపించింది. నా భార్య మధుకి మాత్రం అది టంకుపెట్టె. విలువైన సామాన్లు ఉండే ఇంటిలో ఏ విలువాలేని ఈ పెట్టెకి చోటులేదని మూలనెక్కడో అటక మీద పడేసింది.

పెట్టెని తీసే ప్రయత్నంలో అన్నీ చిందరవందర చేసాను. ఊరునుండి వచ్చాక ఇవన్నీ చూసిందంటే ఉరిమి ఉరిమి చూస్తుంది. కానీ ఆత్రం నన్ను ఆగనివ్వటంలేదు. మొత్తానికి పెట్టి పట్టుకుని హాలులోకి వచ్చి కింద కూర్చున్నాను. ఒక గుడ్డ పట్టుకుని శ్రద్ధగా బూజు మొత్తం దులిపాను. ఈసారి ఏ అనుభూతి దొరుకుతుందో అనే ఆత్రం నా కళ్ళలో, నాకే తెలుస్తుంది. మేజిక్ బాక్స్ వైపే ఆత్రంగా చూస్తున్న చిన్నపిల్లాడి బొమ్మ గోడ మీద. పెట్టె మూత సగం వరకూ తెరిచి కళ్ళు మూసుకుని చెయ్యి లోపలికి పెట్టాను. ఏదో కాగితంలా తగిలింది. ఏ స్పోర్ట్స్‌లోనో, వ్యాసరచనలోనో వచ్చిన సర్టిఫికేట్ అనుకుని ఆత్రంగా బయటకి తీసాను.

ఎక్సైట్‌మెంట్‌తో కళ్ళు తెరిచి చూసాను. అది చాలా పాత ఉత్తరం. ఎవరు రాసిందా అనుకుని వెనక్కి తిప్పి చూసా. గుండె ఒక్కసారి ఆగి రెండు మూడు బీట్స్ మిస్సయ్యాక తిరిగి కొట్టుకోవటం మొదలయ్యింది. ఇది.. లహరి రాసిన ఉత్తరం. లహరి రాసిన ఒకే ఒక ఉత్తరం. గుండె ఎందుకో వేగంగా కొట్టుకుంటుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఉత్తరం అందుకున్నప్పుడు అచ్చంగా ఇలానే కొట్టుకున్నట్టు గుర్తు. లహరి.. లహరి.. నా కలల కవితలపై చెరిగిపోని సంతకం, నా మస్తిష్కంలో ఏదో మూలపడి కనుమరుగైపోయిన జ్ఞాపకం. నిజమే కదా లహరి నాతో లేదనే సత్యాన్ని ఈ కాలం ఎంత లౌక్యంగా నాచేత ఒప్పించేసిందీ! కొన్ని కోట్లమంది నిత్యం పుట్టి చనిపోతున్న ఈ భూమి మీద ఎన్ని కోట్ల ప్రేమకధలు పుట్టాయో ఎన్నింటిని కాలం తన కాళనాలుకతో మింగేసిందో?

బయట గాలికనుకుంటా ఉత్తరం చెయ్యి జారి ఎగిరి నా గుండెని హత్తుకుంది. నేను కావాలని అక్కున చేర్చుకోలేదు, గాలికే చెయ్యి జారింది. గాలి వేగం పెరుగుతుంటే మరింత గట్టిగా హత్తుకుంటూ, నా హృదయంలోకి వెళ్ళిపోయే ప్రయత్నం. తిరిగి చేతుల్లోకి తీసుకుని ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఒక దీర్ఘనిట్టూర్పు తర్వాత ఉత్తరం తెరిచాను. విచిత్రం అక్షరాల ఆనవాలు కళ్ళు పసిగట్టగానే నా శ్వాస తన శరీర సుగంధాన్ని ఫీలవుతుంది. అవును అదే సువాసన కొన్నేళ్ళ క్రితం రోజూ నన్ను పలకరించి, తను వస్తోందన్న రాయభారాన్ని మోసిన సువాసన. ప్రేయసి సహజ పరిమళాన్ని మించిన సుగంధాలు లేవని నాకు నిరూపించిన సువాసన.నా పెదాలు వణుకుతున్నాయి. తను నా దగ్గరకి వస్తుందంటే ఎప్పుడూ నాలో కలిగే భావస్పందన. కళ్ళు మూసుకుని గుండెల నిండా ఆ సువాసనని పీల్చుకున్నా, తనని తాకాలనే ఆవేశాన్ని సంతృప్తి పరిచటానికి నేను వెతుక్కున్న మార్గం ఇదే.

ఆ అచేతనావస్థలో ఉండగా తేరుకున్న మెదడు శరీరానికి ఒక షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చింది. వళ్ళంతా ఒక్కసారిగా జలదరించి స్పృహలోకి వచ్చాను. ఒక్క క్షణం అయోమయం ఏం జరిగింది? ఇప్పుడు ఇక్కడ తన ఉనికి ఎలా? ఏదో అర్ధమయ్యింది. గతకాలపు దృశ్యాల్లో మనం వదిలేసి వెళ్ళిపోయే అస్థిత్వాలు ఆ జ్ఞాపకాలను అంటిపెట్టుకునే అలానే ఉంటాయేమొ. అదే నిజమయితే ఆ నాడు తను వదిలిన తన ప్రెజెన్స్ ఇప్పుడు ఇక్కడే నాతో ఉంది. చుట్టూ పరికించి చూసాను. బయట హోరు గాలి, ఎడతెరిపిలేని వర్షం, చీకటిపడిపోయింది. లేవటానికి బద్దకంగా అనిపించినా ఉత్తరం అక్కడే పెట్టి లేచి వెళ్ళి లైట్ వేసాను. గది మొత్తం పరుచుకున్న వెలుగులో గాలికి కదులుతూ క్రింద ఉత్తరం.

ఉత్తరం తీసి సోఫాలో కూలబడ్డాను. ఎందుకో అక్షరాల మీద చేతులతో తాకుతూ ఉంటే తన స్పర్శ, నా పక్కనే తను కూర్చున్నప్పుడు అనుకోకుండా కదిలినప్పుడు అలా తాకి తిరిగి దూరమవుతున్న స్పర్శ. ఎప్పుడూ తను వ్రాసే ముత్యాల అక్షరాలు కావవి. రాయాల వద్దా అని క్షణానికో లక్షసార్లు (సూపర్ కంప్యూటర్లకి కూడా అందనంత వేగమేమో) ఆలోచిస్తూ, వ్రాస్తూ వద్దని ఆపేస్తూ, ఎన్నో విరామలతో సాగిన ఆత్మసంఘర్షణ. అందుకేనేమో చేతితో అక్షరాలను తాకుతూ ఉంటే చెయ్యి మెత్తగా జారిపోలేదు, ప్రతి లైనుకి ఎన్నోసార్లు చెయ్యి కదలలేదు. అక్కడ అక్కడ అక్షరాలు నీరు పడి చెరిగినట్టుగా తెలుస్తుంది. కన్నీళ్ళ గుర్తులు భద్రంగా దాచే మార్గం నాకిప్పుడే తెలిసింది. వ్రాసేప్పుడు తీవ్ర ప్రకంపానికి లోను చేసిన పదాల దగ్గరనుకుంటా అక్షరాల్లో వణుకు కనిపిస్తుంది.

అనుభూతులతో కడుపు నిండక అక్షరాలను ఏరుకోవటం మొదలుపెట్టాయి కళ్ళు. “కన్నయ్యా!” ఆ పిలుపు నేను చదివానా? లేక తనే పిలిచిందా? తన ప్రేమ మొత్తాన్ని తెలిపేందుకా అన్నట్టు శ్రావ్యమైన తన గొంతులో సహజంగా ఒదిగిపోయిన లాలిత్యంతో పిలిచే ఆ పిలుపు నా చెవులను తాకుతోంది. ఆ పిలుపుకున్న శక్తి తనకి తెలియదేమో కానీ. నాకు తెలుసు. యుగాలనాడు పోగొట్టుకున్న ఒక రాగం హృదయాన్ని పట్టి లాగినట్టుగా ఉంటుంది. ఆవలి తీరంలో ఎవరో నన్ను ఆశగా,ఆర్తిగా పిలిచినట్టుంటుంది. మనసులో ఓర్చుకోలేని బాధని పంటి బిగువున అణుచుకుంటున్నట్టుగా ఒక అలజడి మొదలయ్యింది. కళ్ళను కమ్మేస్తూ ఒక్క సన్నని నీటి పొర.

కన్నయ్యా,
జీవితంలో మరలా నిన్ను చూస్తానో లేదో తెలియదు. చివరగా నీతో చెప్పాలనుకున్న మాటలు చెబుతున్నారా. హడావుడిగా ఇప్పటికిప్పుడు వ్రాస్తున్నా. మరో పదిరోజులు దాటాక నేను వ్రాసినా మరొకరి భార్య వ్రాసిన ఉత్తరమయిపోతుంది. అప్పుడు నువ్వు కనీసం తెరవకుండానే చించేస్తావని నాకు తెలుసు. ఎలా తెలుసు అంటావా? వర్షంలో తడుచుకుంటూ వెళ్దామని ఎన్నోసార్లు నన్ను అడిగిన నువ్వు, నా పెళ్ళి కుదిరిన రోజు సాయంత్రం నీ పక్కనే వర్షంలో తడుస్తుంటే కనీసం నా మొహం కూడా చూడలేదు. చూడకూడదనే సంస్కారాన్ని నీ కళ్ళు ప్రదర్శించిన క్షణమే నీకెంత దూరమయ్యానో అర్ధమయిపోయింది. ఆ క్షణం రోడ్డు మీదున్నా అనే స్పృహేలేకుంటే అక్కడే కూలబడి చచ్చేదాక ఏడ్చేదాన్ని. నాన్నగారు నువ్వు ఎందుకు వద్దో నాకు చెప్పాలని, నిన్ను వంద రకాలుగా తక్కువ చేస్తుంటే, నీ వ్యక్తిత్వంతో నువ్వు లక్షరెట్లు ఎదిగి నువ్వు మాత్రమే కరెక్టని నిరూపించుకున్నావురా. కానీ ఏం చెయ్యనురా ఆడపిల్లను. చేతకాని సమాధానం కదా. అవును చేతకానీ నాకు ఇంకేమీ చెప్పే అర్హత లేదు. కానీ ఒక్కటి అడగాలనుకుంటున్నారా.

నువ్వెప్పుడూ వచ్చే జన్మ వద్దంటుంటావ్. నువ్వు కోరుకున్నట్టుగా వచ్చే జన్మలేకుంటే ఏమో కానీ, అలా కాకుండా మరలా పుడితే, మరలా నాకు ఈ అవకాశం ఇవ్వరా ప్లీజ్. ఈసారి ప్రాణాలైనా వదులుకుంటా, నిన్ను మాత్రం వదులుకోను. జీవితగమ్యాన్ని కోల్పోతున్న దురదృష్టవంతురాలినిరా వీలయితే నా మీద జాలిపడు, కోపగించకు….

…బై కన్నయ్య.

ఈ చివరి ముక్క బై కన్నయ్య వ్రాసేప్పుడు భూకంపంగానీ వచ్చిందా అని అనుమానం కలిగించేంతలా అక్షరాల్లో వణుకు. ఉత్తరం చదవటం పూర్తవ్వగానే కరెంటుపోయింది. కరెంటువాడికి నా మీద ఇంత జాలి ఉందని ఇప్పుడే నాకు తెలిసింది. తన జీవితంలో చివరిసారిగా చెబుతున్న బై అని తెలిసినప్పుడు తను ఎంత క్షోభ పడి ఉంటుందో, వ్రాసాక మూర్చ వచ్చేలా క్రింద పడి ఎంత ఏడ్చి ఉంటుందో నాకు తెలియజెప్పటానికేమో నా కళ్ళు ధారలు కడుతున్నాయి. నా కడుపులో నుండి మొదలయ్యిన దుఃఖం వెక్కిళ్ళుగా మారింది. ఆ చీకట్లో సోఫాలో అలానే పడి ఏడుస్తూ ఉన్నాను.

ఎంత సేఫు ఏడ్చానో నాకే గుర్తులేదు. కరెంటు వచ్చి మొహం పైన ఒక్కసారిగా కాంతి పడటంతో కళ్ళు బైర్లు కమ్మినట్టయ్యి లేచాను. సెల్‌ఫోన్ చూస్తే మధు మిస్డ్‌కాల్స్ నాలుగున్నాయి. ఉత్తరం మూసి పెట్టెలో పెట్టేసాను. ఆ గదిలో అంతవరకూ ఉన్నా ఆ సువాసన లేదు, నా మనసుకి అంత వరకు తెలుస్తున్న లహరి ప్రెజెన్స్ అక్కడ లేదు. లహరి మరోసారి మరోసారి నన్నొదిలి వెళ్ళిపోయింది. మధు భర్త సంస్కారం ఆపేయాలనుకుంటున్న మనసు మాటలు నా చెవులను తాకాయి “ఇలా ఎన్నిసార్లు లహరి నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవటం?”

ఉగ్రవాదం జిందాబాద్

ఉగ్రవాదం జిందాబాద్

ఉగ్రవాదం జిందాబాద్

హిమోగ్లోబిన్ అడుగంటిన రక్తం
రోడ్ల మీద ఎర్రగా మెరిసింది
కండలేని దేహం
ముక్కలుగా నింగికెగసింది
కాల్షియం కరువయిన
ఎముకలు గుండగా మారాయి
కారిడార్లో మాంసపు ముద్దలతో
సైలెన్స్ అని అరుస్తున్న ఆసుపత్రులు
వెర్రిగా చిందులేస్తూ
వికటాట్టహాసం చేస్తూ మృత్యువు

కుట్లుపడ్డ పెదాల మీద
రక్తం చిమ్ముతూ గులాబీలా
విచ్చుకుందో చిరునవ్వు

మంటలుపెట్టే మతాలు
కుమ్ములాడే కులాలు
నిలువునా దోచుకునే రాజకీయాలు
నడ్డివిరిచే ధరలు

రౌడీలు,గూండాలు
కబ్జాలు,ఖూనీలు
కూతురి వెంటపడే పోకిరోళ్ళు
ఇళ్ళు లూటీ చేసే దొంగ నాయాళ్ళు
ఇక్కడే ఇన్నుండగా
ఎక్కడినుండో బాంబులు మోసుకొచ్చారా అంటూ

కుట్లుపడ్డ పెదాల మీద
రక్తం చిమ్ముతూ గులాబీలా
విచ్చుకుందో చిరునవ్వు

ఒంటెద్దు సంసారాల నుండి,ఉద్యోగాల నుండి
క్యూలు నిండిన రేషన్ల నుండి,సినిమా టిక్కెట్ల నుండి
కట్నాల నుండి, బీటు కానిస్టేబుల్ లంచాల నుండి
ఇన్సూరెన్సు నుండి,కేబుల్ కనెక్షన్ల నుండి
షుగర్ మందుల నుండి, వాకింగుల నుండి
కుర్లాన్ పరుపులో కలల నుండి,ఆశల నుండి,అలసట నుండి
ఉగ్రవాద బాంబులు ఇచ్చిన
మోక్షానికి సంబరపడుతూ
కర్కశత్వపు అమాయకత్వానికి
జాలితో కృతజ్ఞతలు చెబుతూ

కుట్లుపడ్డ పెదాల మీద
రక్తం చిమ్ముతూ గులాబీలా
విచ్చుకుందో చిరునవ్వు

పితృదేవోభవ

పితృదేవోభవ

పితృదేవోభవ

హిమాలయం కరగటం చూసా
కరిగి వాకిట్లో సెలయేరుగా పారటం చూసా
మౌనం వీడి కేరింతలు కొట్టడం చూసా
నాతో కలిపి నట్టింట్లో కుప్పిగంతులు వెయ్యటం చూసా

నిలువెత్తుగా నిలబడ్డ గాంభీర్యం చూసా
తొణకని వ్యక్తిత్వం చూసా
చుక్కలనంటే ఆశయాన్ని చూసా
ఆదుకుంటా అనే అభయం చూసా

శిఖరం వరకూ మలచిన దారిని చూసా
దారి పక్కన ముళ్ళ పై రక్తపు మరకలు చూసా
కొండెక్కిన వెన్నెల చూసా
ఇవన్నీ నాకే అన్న సంఙ్ఞని చూసా

నాన్నా నువ్వే నా తొలిగురువు
నువ్వే నా మలిగురువు
నీ మౌనం,జీవనం ఒక పాఠం
నువ్వు నడిచే ఙ్ఞానం

ఎందరు వేలు పట్టి దిద్దించినా
ఎన్ని వేల పుస్తకాలు చదివినా
బ్రతకటం నేర్పేది మాత్రం
నీ వేలు పట్టి నడిచిన దారే.

ఈ దేహం నీది
ఈ రక్తం నీది
ఈ జీవితం నీది
నేను కేవలం నీ నీడని.

అడ్రసులేని ఉత్తరం

హాయ్ రా,
నేను కూడా నీలానే పిలిచా. ముందెప్పుడూ ఇలా పిలవలేదు కదా. నిజానికి ఎలా పిలవాలో తేల్చుకోలేక. నాకు ఇదో పెద్ద కన్‌ఫ్యూజన్. ఎవరినయినా పిలిచేప్పుడు,పలకరించేప్పుడు మన మనసులో ఏం ఫీల్ అవుతున్నామో అది exact గా పిలవగలిగితే మన మనసులో కాస్త తృప్తిగా ఉంటుంది. అవును ఇదే నేను అనుకుంటున్నది సరిగ్గా అనిపిస్తుంది. If your salutation reflects what you exactly feel about the other person, you could feel like some transmission of an unknown feel b/w two hearts. Of course the relation between those two may be any damn thing. Did you ever feel it? అందుకే నేను ఒక్కోసారి ఒక్కోలా పిలుస్తా. ఎప్పుడు ఏది నచ్చుతుందో మనకే తెలియదుగా. Anyways off the context.

ఏంటీ బ్లాగులో ఎప్పుడూ “ఐ హేట్ యూ”, “పార్టింగ్ నోట్” అని వ్రాస్తున్నా అని కోపమా? బ్లాగులో వ్రాసేవన్నీ నా ఫీలింగ్స్, నా experiences. అందులో కొన్నిసార్లు నీ గురించి వ్రాయొచ్చు కొన్నిసార్లు వేరే వాళ్ళ గురించి కావొచ్చు. కానీ అవేవి వ్యక్తిగతంగా మీ మీద కోపంతో కాదు. My mind is a dark room. అక్కడ నాతో నేనే గొడవపడుతూ ఉంటా. నాతో నేనే వాదించుకుంటూ ఉంటా. అక్కడ ఎవరి మీద కోపంతోనో ద్వేషంతోనో అరవను. నాలో జరిగే struggle severity బట్టి content ఉంటుంది. కోపం అంతా నా ఫీలింగ్స్ మీద లేకపోతే నా fate మీద ఇలా అన్నీ నాతో నేనే.

Forget about the departing. Few things in this world are out of our control and we can’t change those things. Thinking of them is solving a puzzle which has no answer. One thing I always tell you. Probably this is 10 millionth time. మనిద్దరం మాట్లాడుకోవటం మానేసిన తర్వాత నిజానికి ఈ ప్రపంచంలో నా existence నీకు, నువ్వాన్నవని నాకు తెలియకుండా ఎన్నో ఏళ్ళు గడిపుండొచ్చు. ఆ టైంలో అసలు నేను నీకు గుర్తు వచ్చి ఉండకపోవచ్చు. నిజానికి గుర్తుచేసుకునే అవకాశం కూడా లేదులే. కానీ నాకు ఏకాంతంలోనూ,ఒంటరితనంలోనూ ఇంకా correct గా చెప్పాలంటే whenever I try to walk back into roots of my life I always observe you smiling beside me like a water mark. It may be my child hood or student life whatever I used to feel like you were there always observing me. You name it as madness or any damn thing but I swear it is true. You know while typing these lines also I felt the same feelings and my eyes filled with tears. These emotions suck. I should quote a few lines from my story photon here.

“అందుకే అందరూ బయటకి వెళితే నేను రూంలో కూర్చుని నెట్ మీదపడ్డా. ఏవో ఆలోచిస్తూ అలా చూస్తూ ఉంటే ఒక ఫోటో కనిపించింది. మొదట కొంచెం కంగారుగా అనిపించింది. ఎదో అలజడి ఇంక ఇలానే ఉంటే ఎవో ఙ్ఞాపకాలు వెంటాడుతాయని భయంవేసింది. ఎవో పాటలు పెట్టి ల్యాప్పీ ని వదిలి పక్క రూమ్‌లోకి వచ్చా. ఎవరూ లేరు అంతా బయటకి వెళ్ళారు. రాత్రి వరకు ఎవరూ రారు. బాల్కనీలోకి వెళ్ళి నిల్చున్నా. చిన్నపిల్లలు ఆడుతూ కనిపించారు. అవే ఙ్ఞాపకాలు స్కూలు, ఆటలు, స్నేహితులు. ఏ ఙ్ఞాపకాలు మనం పదిలంగా దాచుకుంటామో, ఏ ఙ్ఞాపకాలు మన తర్వాతి జీవితంలో తీపి గుర్తులంటామో అవే నా పాలిట శాపంగా మారాయి. ఎవరికయిన చిన్నప్పటి రోజులు గుర్తొస్తే తలుచుకుని నవ్వుకుంటారు. అందరికి చెప్పుకుంటారు. కానీ నేను మాత్రమే ఎందుకిలా? కారణం ఒకటే ఆ గతంలోకి మరలా వెళ్ళిపోతే బాగుందనిపిస్తుంది. గతం తిరిగి వర్తమానంగా మారిపోతే బాగుంటుందనిపిస్తుంది. బాగుందనిపిస్తే సమస్య కాదు అలా జరగనందుకు ఏడుపొస్తుంది, పిచ్చిలేస్తుంది.”

నిజానికి ఈ paragraph వ్రాసేప్పుడు అంతలా నేను analyze చెయ్యలేదు. ఇప్పుడు ఇక్కడ అవే lines paste చేసినప్పుడు instant గా అనిపించింది నీకు చెబుతున్నా. ప్రస్తుతంలో బ్రతకటం అంటే నువ్వు లేవనే వాస్తవాన్ని అంగీకరిస్తూ ఈ జీవితమంతా బ్రతకాలి అదే గతంలోకి తిరిగి వెళ్ళిపోతే కనీసం illusion లో అయినా హాయిగా రోజూ నిన్ను చూస్తూ, మాట్లాడుతూ గడిపెయ్యొచ్చు. నిజానికి అప్పుడు అలానే బ్రతికేవాడ్ని కదా. Let me end this mad session. I met more beautiful girls, closer friends and sincerely girls better than you in many aspects. But I never felt like what I had felt for you. Still I am struggling to find a reason, why it happened with you only.

ఇంత ఆవేదన మనసులో ఉంది కాబట్టి నా డార్క్ రూమ్ కొన్నిసార్లు వార్ రూమ్‌లా మారి నిన్ను ద్వేషించమని శాసిస్తుంది. అప్పుడు కసిగా ద్వేషిస్తా. కొన్నిసార్లు నిన్నలో దాచుకున్న అందమైన ఙ్ఞాపకాల సుగంధాలు తాకి అంతులోని భావుకత్వం నన్నావహిస్తుంది. ఇవన్నీ నా మనసులో పొంగే భావ తరంగాలే తప్ప వ్యక్తిగతంగా నీ మీద కోపం పెంచుకోవటం వల్ల కాదు. ఏప్పటిలానే “ఏదయినా ఏం లాభంరా మనమిక జన్మలో కలవలేం కదరా అంటావా?”

వెన్నెల్లో నువ్వాడుకుంటూ ఉంటే రాలేనేమో
కానీ రావాలనే ఉంటుంది.
ఇసుకలో నీ చేతులు గుడిని కడుతుంటే నా చేతులు తోడుకాలేవేమో
కానీ ఆ అవకాశంపోయినందుకు భాదగా ఉంటుంది.
మంచుకురుస్తున్నప్పుడో, వానలో తడుస్తున్నప్పుడో నీ పక్కనే నేను లేకపోవచ్చు
కానీ ఎవరయినా చూసి చెబితే అదే ఊహించుకుంటూ ఉంటా.
నీకు అవసరమయి పిలిచిన ప్రతిసారీ నేను రాలేకపోవచ్చు
కానీ ప్రతీక్షణం నీ గురించి ఆలోచిస్తూ ఉంటా.
పొరపాటునా ఏరోజైనా నీ కంటినుండి నీళ్ళు వస్తే మాత్రం
నువ్వు వద్దన్నా వస్తా నీతోనే ఉంటా…

అందరూ నీతో ఉన్నప్పుడు నా ప్రేమ నీకవసరంలేని ఆటబొమ్మలా కనిపించొచ్చు, కానీ ఈ ప్రపంచం మొత్తం నిన్ను ఒంటరిగా వదిలి వెళ్తున్నప్పుడు, దిగులు చీకట్లు కమ్ముకున్నప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు నీ కన్నీటి చుక్క నేల రాలనివ్వనంత దూరంలో నా ప్రేమ నీ తోడుగా ఉంటుంది.

Just
Murali

ఏం డిసైడ్ జేసినవయ్యా తోటరాముడు

ఏం డిసైడ్ జేసినవయ్యా తోటరాముడు

ఏం డిసైడ్ జేసినవయ్యా తోటరాముడు

ఏం డిసైడ్ జేసినవయ్యా తోటరాముడు
సక్కగా తిక్క శంకరయ్య పక్కజేరినవ్ లే.

ముగ్గురమ్మల పుణ్యమంటవ్
మూడు కళ్ళోడి పూజలంటవ్
కయిత్వాల్ రాస్తవ్
తత్వాల్ పాడతవ్

ఎండికొండోడు ఏమిచ్చిండొ ఏమో
కవులకు కనకాభిషేకాలన్నవ్
నీ కతల్, కయితల్ సల్లగుండ
నీ ఇస్టోరీ నే డిసైడ్‌జేసినా సూడు

రైలుబండోలింట పుట్టినవ్
ఏడు బోగిలతో చుకుచుకాడినవ్
తరగతిలా నాటకాలాడినవ్
మధ్యతరగతిలా బ్రతుకుల్ సదివినవ్

కధల్లేవ్ తెరదించాలంటే
సిరాలో కాయితాల్ ముంచినవ్
జంతువులచేత అండాలు పెట్టించినవ్
జనాలచేత దండాలు పెట్టించినవ్

ఏదికలెక్కుడు ఇసుగుపుట్టింద ఎమో
ఎండితెర ఎంటపడ్డవ్
ఆడోళ్ళకి కుట్టేటోడికి కధల్ కట్టినవ్
రాములోరి శివునికి వంతపాడినవ్

తోటరాముడూ అని కృష్ణుడు పిలిస్తే
పాన్ తీసి పెన్ మూసినవ్
ఆమె అన్నవ్ అతడన్నవ్
తిట్టించుకున్నవ్ భుజాల్ తట్టించుకున్నవ్

పాతికేళ్ళు నిండిపోయినయ్
కొత్త కళలు పుట్టుకొచ్చినయ్
నాడు గోగ్రహాణాల్ నేడు గ్రహణాల్
ఎండితెర మీద జర ఇంకుజల్లినవ్

ఆడ యాడో కొండ ఇరిగితే
ఈడ నీ గుండె పగిలినాది
కండ్లల్లా నీళ్ళు కురిసినయ్
కాయితాల్లా  తత్వాల్ ఎలిసినయ్

అన్నిట్లా ఉండేటోడ్ని
అందరికీ సూపినవ్
నువ్వు ఆయన గుడులెంటపడితే
ఆయన నీ గుండెల్లో పండిండు

బాంచెన్ నీ కాల్మొక్కతా శంకరయ్య
యాడున్న మా భరణిని సక్కగా డిసైడ్ జెయ్.

బ్లాగు ప్రయాణంలో మూడేళ్ళు

బ్లాగు ప్రయాణంలో మూడేళ్ళు

బ్లాగు ప్రయాణంలో మూడేళ్ళు

చిరుఆశ అనే ఒక టపాతో చిరంజీవి రాజకీయప్రవేశం గురించి కాస్త పదాల అల్లికతో ఏదేదో వ్రాసి ఒకటపాగా వేసి బ్లాగు అనగానేమి అనే ప్రశ్న వెంట మొదలయిన నా ప్రయాణంలో మూడేళ్ళు నిండాయి. అసలు నేను వ్రాస్తే ఎవరన్నా చదువుతారా? స్పందిస్తారా? అభినందిస్తారా అనే అనుమానాలతో. ఆరాటలతో మొదలయిన నా బ్లాగు ప్రయాణంలో గుర్తుచేసుకోదగ్గ స్మృతులు ఎన్నో.ఈ మూడేళ్ళ నా ప్రయాణాన్ని కాస్త అవలోకనం చేసుకోవలనిపించింది. ఏముంది పెద్ద గొప్ప? అని ఎవరన్నా అంటే నా సమాధానం ఏ వ్యక్తీ గొప్పపనులు చెయ్యడు. కొందరు వ్యక్తులు చేసిన పనుల్ని సమాజం మాత్రం గొప్పగా భావిస్తుంది. నా దృష్టిలో గొప్పతనం సాధించేది కాదు కేవలం ఆపాదించబడేది. అందుకే ఈ టపా గొప్పతనాన్ని మాత్రమే సహించే గొప్పవాళ్ళ కోసం కాదు. ఇది నాలాంటి ఒక మాములు మేంగో మేన్ తన ఆలోచనలతో వ్రాసుకున్న బ్లాగు మరియు బ్లాగు ప్రయాణం పై ఒక విహంగ వీక్షణం.

మూడేళ్ళ క్రితం ల్యాప్‌టాప్ కొన్న కొత్తలో అంతర్జాలంలో చాటింగ్,మెయిలింగ్ తప్ప వేరే ఏమీ తెలియవు నాకు. తెలుగులో అందరూ పెట్టే మెసేజ్లు, స్టేటస్లు ఎలా వస్తున్నాయో తెలుసుకుందామనే ప్రయత్నంలో గూగులమ్మని ఆశ్రయించా. పేదరాసి పెద్దమ్మని కదిపితే కధలకి లోటా? అనగనగా ఒక వీవెన్ అనే రాజు తన రాజ్యంలో జనాలంతా పరభాషా వ్యామోహంలో కొట్టుకు పోతుంటే ఇలా అయితే మన గత కీర్తికి ఏం కాను అని భయపడినవాడై “దేశ భాషలందు తెలుగు లెస్స. కోడు భాషలందు యునీకోడ్ లెస్స” అని పలికి, వారికోసం “శ్రీ రాజీవ్ లేఖిని” (క్షమించాలి అలవాటులో పొరపాటు) లేఖిని అనే పధకాన్ని ప్రవేశపెట్టాడని తెలిసింది. మచ్చుకు కొన్ని బ్లాగుల్ని చూపించి వదిలింది.

దొరికిన బ్లాగుల్ని పట్టుకుని వాటి వెంట పరిగెట్టి, అందులో కామెంటిన వారి బ్లాగుల్లోకి జంపింగులు చేస్తూ ఏకబిగిన పదమూడు పగల్లు, పదమూడు రాత్రులు గడిపాను. అఫీసులో అప్పటికే అఫ్లికేషన్ కంటే వికీ ఎక్కువ వాడతానని అపవాదు ఉంది. దానికి బ్లాగులు తోడయ్యాయి. దీనితో మన అప్రైజల్ కాస్త గోవిందా కొట్టింది. కానీ కొత్త దొంగోడు వేకువ ఎరుగడని (బాగా చెప్పానా? :)) నేను మాత్రం నా పంథా మార్చుకోలేదు. చదవగా చదవగా నిత్యరోగికి హాస్పిటల్ పెట్టేయాలని దురదపుట్టినట్టు నాకు కూడా ఒక బ్లాగు తెరవంగ మనంబున మిక్కిలి దురదపుట్టెన్.

ఏం వ్రాయాలో తెలియదు. ఏం వ్రాస్తే అందరూ చదువుతారో తెలియదు. అందర్నీ ఆకట్టు కోవటానికి ఆంధ్రలో అందరూ వాడే ఫార్ములా దొరికింది. మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రావాల్సిందంతే అన్నటైపులో వ్రాసాను. వ్రాసి పోస్టు వేసి “వస్తాడు నారాజు ఈ రోజు” అని పాడుకుంటూ కామెంట్లకోసం ఎదురుచూసా. “రేయిగడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే” అని పాడి పాడి అలిసి సొలసి పడిపోయాకా అబ్రకదబ్రగారు డింగ్ మని ప్రత్య్క్షమయ్యారు. గూగుల్లో చూసి ఇటొచ్చా నాయన ఏంటీ వెర్రి రాతలు? సరే ఏదో ఒకటి ఏడు కానీ అమెరికా వెళ్ళాలనుకునేవాడివి శంషాబాద్ వెళ్ళాలి కానీ ఇలా అమీర్‌పేట్ చౌరస్తాలో దారి తప్పోయినోడిలా అయోమయంగా ఎదురుచూస్తే ఎట్టా అన్నారు. అంతా విని మూసినది పుష్కరాల్లో దారితప్పోయినోడిలా మొహం పెట్టి ఇంతకీ ఎటు వెళ్ళాలి అని అడిగా. “పార్ధాయ ప్రతిభోదితాం భగవత నారాయణీనస్వయం” అని చిరునవ్వు నవ్వి “పార్ధా, కనిపించే ఈ మూడు చౌరస్తాలు అమీర్‌పేట, కూకట్‌పల్లి, మూసపేట చౌరస్తాలయితే కనిపించని ఆ నాల్గవ చౌరస్తానే కూడలి.. కూడలి.. కూడలి” అని చెప్పి డింగుమన్నారు.ఆయనకి మొదటిగా ధన్యవాదాలు చెప్పుకోవాలి నేను.

కూడలిలో క్రూరమృగం నా మొదటి టపా. అప్పటికే బ్లాగులోకంలో సీనియర్లు సుజాతగారు, చావాగారు, కత్తి మహేష్‌గారు, బొల్లోజు బాబాగారు అభినందిస్తూ కమెంట్లుపెట్టారు. అటుపైన నా బ్లాగు కాస్త అందరి దృష్టిలో పడింది. చదివినవాళ్ళు సూచనలు, అభినందనలు ఇచ్చారు. “హ హా హాసిని, నేటికి నెరవేరిన మూషికవరం, బందరు మామయ్య – బంగారు బాతు, హాసిని కి పెళ్ళి చూపులోచ్…, జాజు – ఒక కాకి కధ, జావా జావా కన్నీరు” లాంటి సూపర్‌హిట్టు టపాలు వ్రాసాక బ్లాగులోకంలో నా బ్లాగు కూడా అందరికీ తెలిసింది..ఇందులో అత్యధిక టపాలకు కధావస్తువుగా నిలిచిన నా స్నేహితురాలు హాసినికి నా కృతఙ్ఞతలు. “భయంగా ఉంది నాన్న…, e-తెలుగు విజయవాడ పర్యటన పై నివేదిక” వంటి టపాలకు అందరి ప్రశంసలు అందుకున్నా.

చదివినవారందరూ గుర్తుంచుకోకపోయినా చాట్లోనో, కాల్ చేసో కొన్ని వాక్యాలు ఉటంకించి బాగున్నాయి అని చెప్పినప్పుడూ ఆనందపడ్డా. సవరణలు, టైపాట్లు చెప్పినప్పుడు సర్దుకున్నా. నా వరకు నాకు సంతృప్తినిచ్చి మరలా మరలా చదువుకునే టపాలు, వాక్యాలు ఎన్నో ఉన్నాయి. ఖాళీగా ఉన్నప్పుడు ఇప్పటికీ చాలాసార్లు నా టపాలు నేనే చదువుకుంటా. కాకిపిల్ల కాకి ముద్దు అని నవ్వి పోదురుగాక. కానీ భాదలో ఉన్నప్పుడు నా టపాలే నాకు కొన్నిసార్లు స్వాంతననిచ్చాయి, నిరాశలో ఉన్నప్పుడు ఉత్సాహాన్నిచ్చాయి. కొన్ని వాక్యాలు చదివినప్పుడు ఇంత గొప్ప భావం నాకేలా తట్టిందబ్బా అనుకున్న సందర్భాలూ ఉన్నాయి. బోస్టన్‌లో ఉండగా ఎవరో తెలియని వ్యక్తులు ఫోన్ చేసి నా టపాలు బాగున్నాయి అని చెప్పిన అనుభవాలూ ఉన్నాయి. భయంగా ఉంది నాన్న చదివినప్పుడు అమ్మమ్మ,ఇంకొంతమంది భందువులు కళ్ళనీళ్ళు పెట్టుకుని ఫోన్ చేసిన చేదు స్మృతులూ ఉన్నాయి. క్రమం తప్పకుండా మమ్మీ ఇప్పుడు నా బ్లాగు చదువుతుంది. బోస్టన్‌లో ఉండగా మా క్లైంట్ మేనేజర్ శంకర్ నా వ్రాతల కారణంగా ఇప్పటికీ నన్ను గుర్తుంచుకున్నారు. నా బజ్జులో క్రమం తప్పకుండా కామెంట్లు పెట్టి ప్రోత్సహిస్తున్నారు. భరణిగారు, దర్శకులు వంశీగారు వంటి కొందరు ప్రముఖులను కలిసే అవకాశం కూడా బ్లాగు వలనే కలిగింది నాకు. ఇంకా చెప్పాలంటే చాలా ఙ్ఞాపకాలు ఉన్నాయి. ఒకప్పుడు నా డైరీ అని పొదవిపట్టుకునేవారట. ఇది నా బ్లాగు మురళీగానం, అడవి లోని వెదురు పలికే స్వరాలు.

ఈ బ్లాగుతో అసలేం సాధించానని? తెలుగు సాహిత్యమనే సముద్రంలో చిన్న నీటిబొట్టుని కూడా కాలేను. కానీ ఎంత గొప్ప సాహితీవేత్తయినా “నీలా ఉండాలని ఆ చందమామకి ఎంత ఆశో! పాపం నువ్వే ఒక్కరోజు తనలా ఉండకూడదూ” అన్న నా చిరుకవితను విని “అర్భకా! ఈ భావం బాగుందిరా” అని అనకపోతారా? పైగా పప్పు,నిప్పు,ఉప్పు,తుప్పు అని ప్రాసలో పదాలు కూర్చటమే కవిత్వం, అనే అఙ్ఞానంలోనే ఉండిపోకుండా నాది అనే స్వరం కోసం అన్వేషణ సాగిస్తున్నా. అసలెప్పటికీ నా ఐడెంటిటీ సాధించలేకపోయినా ఈ అన్వేషణ చాలు నాకు తృప్తినివ్వటానికి. నన్ను ప్రపంచం తెలుసుకోవటానికి, నేను ప్రపంచాన్ని తెలుసుకోవాటానికి, అసలు నన్ను నేనే తెలుసుకోవటానికి బ్లాగులోకం ఉపయోగపడింది. నా ఆలోచనలు ఒక నిర్దిష్టతను సంతరించుకోవటంలోనూ, వివిధ వ్యక్తుల వ్యక్తిత్వాలు, వృత్తులు, ప్రవృత్తులు, భావజాలాలు, భేషజాలు, విపరీత భావాలు, మనస్తత్వాలు తెలుసుకొని ఒక అవగాహన ఏర్పరుచుకోవటంలో బ్లాగులోకంలో నా ప్రయాణం ఎంతో ఉపయోగపడింది. నా చేతల్లోనూ, వ్రాతల్లోనూ ఒక పరిణతికి ఉపయోగపడింది.

ఈ మూడేళ్ళలో బ్లాగులోకంలో ఎంతో మార్పు వచ్చింది.చిన్న కుటుంబం చింతలేని కుటుంబంలా ఉండేది ఒకప్పుడు. బ్లాగర్లంతా చాలా ఆత్మీయంగా ఒకే కుటుంబంలా ఉండేవారు. నేను వచ్చిన కొత్తలో నా చేయి పట్టుకు నడిపించారు. ఒకరిని ఒకరు ప్రోత్సహిస్తూ సహాయ సహకారలందిస్తూ స్నేహంగా ఉండేవారు. బ్లాగులోకం విస్తరించిన కొద్దీ ఎన్నో బిగ్ బాంగ్‌లు సంభవించాయి. విడి విడిగా పాలపుంతలు ఏర్పడ్డాయి వేటి స్వయం ప్రతిపత్తి వాటిది, వేటి మనుగడ వాటిది. ఏ వ్యవస్థలోనయినా మార్పు నియంత్రించలేనిది, అనివార్యమైనది.

నిన్నటిది నేటికి పాతబడుతున్న ప్రపంచంలో బ్లాగు పోయి, బజ్జు వచ్చే డాం డాం డాం అని మారుతున్న రోజుల్లో బ్లాగులు ఉంటాయో ఊడతాయో తెలియదు కానీ బ్లాగులోకంలో కొందరు సన్నిహితులు మాత్రం ఎప్పటికీ నా మనసులో అలానే ఉంటారు. కొందర్ని చూసినప్పుడు వీళ్ళు మురళీగాడి బ్లాగు ఫ్రెండ్స్‌రా అని నా స్నేహితులు అంటారు. అలా ఒక ప్రత్యేకమైన స్నేహవర్గం నాకు దొరికింది. మొదట్లో కామెడీ పోస్టుల ద్వారా దోస్తీ కట్టిన శ్రీవిద్య, మీనాక్షి, ఆశ్విన్ తో మొదలు, కవితలతో దోబూచులాడే క్రాంతి వరకూ అందరూ ఆప్తులే. తమ్ముడూ అని ఆప్యాయంగా పిలిచే సతీష్ అన్నయ్య, శ్రీనివాస్ కుమారన్నయ్య, నా ఫీజులేని డాక్టర్ కౌటిల్య, ఇప్పుడు అవినేని అన్నయ్య, టపాలు చదివి అభినందించటమే కాక కొన్ని మంచి మంచి చర్చలు చేసే విశాలగారు అందరూ అభిమానం చూపించినవారే.

e-తెలుగు సభ్యుడిగా సంస్థ నిర్వహించిన కార్యక్రమాల్లో నా ఉడుత సహాయం అందించాను. సమయంలేక ఇప్పుడు సంస్థ కార్యక్రమాల్లో హాజరుకాకపోయినా నన్ను ఏనాడు నిందించని కార్యవర్గానికి ఏ రూపంలో కృతఙ్ఞత చూపించాలో? సంస్థలో చురుకుగా పాల్గొనటం వలన చదువరిగారు, వీవెన్‌గారు, కశ్యప్‌గారు ఇలా నిర్ధిష్ట అభిప్రాయాలున్న వ్యక్తుల సాహచర్యం దొరికింది. వ్యక్తిగా వీరి వద్దనుండి నేర్చుకున్నది ఎంతో ఉంది. లాభాపేక్షలేని సంస్థకి తమ సమయాన్ని కేటాయిస్తూ, పదవులు, హోదాలు కూడా ఉత్సాహవంతులకు కట్టబెట్టి తాము మాత్రం కాడి భుజానికిఎత్తుకొంటారు. సి.బి.రావుగారు, శ్రీనివాసరాజు దాట్ల, చక్రవర్తిగారు, రవిచంద్ర ఇలా గత ప్రస్తుత కార్యవర్గ సభ్యులు, e-తెలుగు కార్యక్రమాలకి తమ వంతు సహకారం ఎప్పుడూ అందించే కొందరు బ్లాగర్లు వీరందరి నుండి “స్వంత లాభం కొంత మానుకు” అనేదానికి అర్ధం నేర్చుకున్నాను. విఫలమై ప్రజలు గుర్తించని కొన్ని కార్యక్రమాలకు కూడా ముందు వెనుక వీరు చేసిన కృషి సభ్యుడిగా నాకు తెలుసు. ఏం ఉద్దరిస్తారు తెలుగుని నిలబెట్టి? అని ఎవరన్నా అంటే సొంత తల్లిని తిట్టినట్టే భావించే వీరి సంస్కారం నాకు ఆదర్శాలను ఎంత త్రికరణ శుద్దిగా నమ్మాలో తెలియజెప్పింది.

రేపు ఈ బ్లాగులు,బజ్జులు అన్నీ పోవచ్చు. కానీ వీరంతా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నా జీవనప్రయాణంలో భాగంగా ఉంటారు. నా బ్లాగు ప్రయాణంలో నాకు ఎంతో ఇచ్చిన మీ అందరికీ కృతఙ్ఞతలతో…

మీ
మురళీ

నాకు నచ్చిన గుర్తుచేసుకోదగిన టపాలు కొన్నిక్రింద ఇస్తున్నా.

హాస్య టపాలు:
1.కౄర మృగం
2.హ హా హాసిని
3.నేటికి నెరవేరిన మూషికవరం
4.బందరు మామయ్య – బంగారు బాతు
5.హాసిని కి పెళ్ళి చూపులోచ్…
6.జావా జావా కన్నీరు
కవితలు:
1.పిచ్చి రాతలు
2.లాలీ జో.. లాలీ జో..
3.నేను కవిని కాదన్నవాడ్ని కత్తితో పొడుస్తా.
4.నేను రచయిత కాదన్నవారిని రాయిచ్చుకు కొడతా..
5.ఆమె నన్ను వదిలి వెళ్ళిపోయింది.
నివేదికలు:
1.e-తెలుగు విజయవాడ పర్యటన పై నివేదిక
2.ఆంధ్ర తుంబురుడు అవతరించెను నేడు…
3.శంకరా’భరణం’
ఇతరములు:
1.ఇదే నా మొదటి ప్రేమలేఖ…
2.జాజు – ఒక కాకి కధ
3.>భయంగా ఉంది నాన్న…
4.పెళ్ళి-ఒక దృక్కోణం
గుర్తింపుకి నోచుకోని నాకు నచ్చిన టపాలు:
1.కాకి దిద్దిన కాఫురం (!?!)
2.పార్టింగ్ నోట్
3.ఐ హేట్ యు రా
4.సరికొత్తచీర ఊహించినాను..

ఏడ నుండి వస్తామో ఏడకెళ్ళిపోతామో


తోడురాని పయనం

తోడురాని పయనం

ఏడ నుండి వస్తామో
ఏడకెళ్ళిపోతామో
నీడ కూడా మిగలకుండా
తోడేదీ లేకుండా

ఏడుస్తూ వస్తాం
ఏడిపిస్తూ పోతాం
ఏడ నుండి వస్తామో
ఏడకెళ్ళిపోతామో

కూడంటాం గూడంటాం
గుడ్డంటాం దుడ్డాంటాం
ఈడంటాం జోడంటాం
తాడంటాం బిడ్డంటాం

ఏడ నుండి వస్తామో
ఏడకెళ్ళిపోతామో

నాదంటాం నీదంటాం
జాతంటాం మతమంటాం
పదవంటాం మదువంటాం
స్థాయంటాం స్థోమతంటాం

ఏడ నుండి వస్తామో
ఏడకెళ్ళిపోతామో

ఎదురుబొంగు పాడె మీద
కట్టెల మంటలోకి
ఆరడుగుల గొయ్యిలోకి
ఖాలీ చెయ్యితోటి

ఏడ నుండి వస్తామో
ఏడకెళ్ళిపోతామో

నీది లేదు నాది లేదు
గుప్పెడు బూడిద
మందిలేదు మతం లేదు
ఒంటరి బాట

ఏడ నుండి వస్తామో
ఏడకెళ్ళిపోతామో

ఉసురు పోయాక ఒట్టి ఊసే నువ్వు
మడుసుల మతిలో మిగిలే కతే నువ్వు

ఏడ నుండి వస్తామో
ఏడకెళ్ళిపోతామో
నీడ కూడా మిగలకుండా
తోడేదీ లేకుండా

అందరికీ మొదటి అమ్మ

అమ్మమ్మ

అనురాగలోకంలో అందరికంటే పెద్ద ఆమె.

అమ్మకి పసివాళ్ళ లాలన నేర్పేది ఆమె.

అడ్డాలలో వేసి అందరికీ మొదట లాలపోసేది ఆమె.

నిజానికి అందరికీ మొదటి అమ్మ ఆమె.

ఆమె మన అమ్మనే కన్న అమ్మమ్మ.

ఎలా మరిచిపోయాం మనం. మనకి జన్మనిచ్చిన అమ్మని కీర్తించి మన గుండెల్లో కొలువుంచాం. మరి అమ్మమ్మని ఎలా మరిచిపోయాం మనం. మన అభివృద్ధిలో, కీర్తిలో ఏనాడూ తనవాటా ఏంటో చూసుకోని నిస్వార్ధం, మన ఎదుగుదలని వెనుక ఉండి చూస్తూ ఆనందపడే ప్రేమతత్వం ఆమెకు మాత్రమే సొంతం.
తన కూతురి ప్రసవవేదన చూసి కడుపులో ప్రేగు కదిలి ఒక కంట కన్నీరు, తనవారంటూ ఎవరూలేని ఏదో మిధ్యాలోకం నుండి ఏడుస్తూ ఇక్కడకి వచ్చి పడ్డ తన కూతురి బిడ్డకు అన్నీ తానై అక్కున చేర్చుకుని మరో కంట ఆనందాశృవులు. ఆ పసిబిడ్డని, ఆ పసిబిడ్డని కన్న తన బిడ్డని చంటిపాపల్లానే చూసుకుంటూ తన కనుపాపల్లో పెట్టి కాపాడుకుంటుంది. కూతురిని బిడ్డతో సహా అత్తవారింటికి పంపేదాకా చేసే గొడ్డుచాకిరి మనకి కనిపించినా, తనకి మాత్రం కేవలం కూతురి మీద ఆపేక్షగానే కనిపిస్తుంది. ఆణువంత పుట్టిన మనవడ్ని అల్లరిగడుగ్గాయిలా కేరింతలు కొట్టేదాకా సాకి ఆ పైన కూతురితో పాటు అప్పగింతలు చేయాల్సిందే. ఆడపిల్లని కన్న పాపానికి జీవితంలో అడుగడుగునా అప్పగింతలు తప్పవేమో?

రోజూ స్నానం చేయిస్తున్నప్పుడు అమ్మమ్మ ఆపేక్ష, కళ్ళల్లో ఆనందం ఒక అందమైన దృశ్యం. పండంటి పసివాడ్ని మెరిసిపోయేలా చేయటమే కాదు నూనె పెట్టేప్పుడు కాళ్ళు చేతులు సాగతీస్తూ ఒక ఆజానుబాహుడ్ని చెయ్యాలని పరితపిస్తుంది. స్నానం చేయించి తుడుస్తున్నప్పుడు జలుబుకి తుమ్మితే చిరంజీవ చిరంజీవ అంటూ చిరాయువునిస్తుంది. తలకి పెట్టే సాంబ్రాణీ, నుదుటిమీద పెట్టే కాటుక బొట్టూ ఇలా అడుగడుగునా అమ్మమ్మ ప్రేమని పొందటం ఒక వరం. చీకటి పడుతూనే పాడు కళ్ళు దిష్టి పెట్టాయేమొ అని ఎన్ని రకాలుగా దిష్టి తీస్తుంది.

మనవలు ఎంతమంది ఉన్నా కొడుకు బిడ్డలకంటే కూతురి బిడ్డలంటేనే ఎందుకో ఆపేక్ష. పండగ అనగానే కూతురు,అల్లుడు తన మనవలతో వస్తారని ఎంత సంబరపడుతుందో. మనవలకి ఇష్టమైనవన్నీ వండిపెట్టి వాళ్ళు వచ్చేలోగా ఎవరినీ తిననివ్వకుండా “హన్నా” అనటం చూడని తెలుగు లోగిలి ఉండదేమో కదా! చదువులో ఎదుగుతూ ఉంటే ఊరంతా చెప్పే గొప్పలు, ఉద్యోగం వచ్చింది అని తెలియగానే ఆంజనేయస్వామికి చేసే అప్పాలదండ ఇలా అమ్మమ్మకి మనవలపైన ఉన్న ప్రేమకి అంతేలేదు. ఇంత చేసినా అడబిడ్డ పిల్లలుగా మనం పెట్టేవి ఏ రోజూ తీసుకోదు. మరి మననుండి తను ఆశించేది ఏంటి? “అమ్మమ్మా” అనే ఒక పిలుపు, ఆప్యాయంగా మనం చిన్నప్పుడు ఇచ్చే బుల్లి బుల్లి ముద్దులు. అమ్మమ్మ ఇల్లంటే అందుకే మనవలందరికీ ఎంతో ఇష్టం. పండగ వచ్చిన, వేసవి సెలవులు వచ్చిన “నాన్న అమ్మమ్మ వాళ్ళింటికి ఎప్పుడు వెళ్తాం?” అనే అడుగుతాం.

లోకం తెలియని నీవు మాకు ఈ లోకం చుపావు.

నువ్వెంత అమాయకురాలివైన మాకు మాత్రం లౌక్యం నేర్పావు.

ముక్కోటి దేవతలకు మొక్కి మాకుచిరాయువునిచ్చావు.

అసలు నాకు ఈ జన్మనిచ్చిన మా అమ్మని నువ్వే ఇచ్చావు.

దేవతలకి దేవుడైనవాడు దేవదేవుడయితే అమ్మకే అమ్మవైన నువ్వు అమ్మమ్మవైనావు.

మా అభివృద్ది వెనుక కష్టం నువ్వు. ఆ దేవుడికి సహితంలేని అదృష్టం నువ్వు.

(గమనిక: గూగుల్లో దొరికిన చిత్రాన్ని ఇక్కడ వాడుకున్నా ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు అనే నమ్మకంతో.)

నేను నిర్లక్ష్యం చేసిన నా నేస్తం

మధురమైన ఏకాంతవేళ...

మధురమైన ఏకాంతవేళ...

ఎప్పుడూ నేనొక నేస్తాన్ని నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నా. నా పక్కనే తనుంటుందని తెలిసీ, చూసి చూడనట్టుగా తప్పించుకుపోతుంటాను. చూసి పలకరిస్తే తనకోసం కాస్త సమయం ఇమ్మంటుందని నా భయం. సమయం ఇస్తే మాత్రం ఏంపోతుంది? రోజుకి నేను సోది మాటల్లో వృధా చేసే కాస్త సమయం ఇవ్వొచ్చు. కానీ ఇస్తే తను నాలా డొంకతిరుగుడుగా మాట్లాడదు. నిక్కచ్చిగా నిగ్గదీసి నిజాన్ని మాట్లడుతుంది, నన్ను మాట్లాడమంటుంది. తీరా అన్నీ మాట్లాడాక తను విని వెళ్ళిపోతుంది. నేను మాత్రం రోజంతా ఆ మాటల్లో, ఆలోచనల్లో నన్ను నేను కోల్ఫోతాను. అందుకే ఈ తప్పించుకు తిరిగే ప్రవృత్తి.

కానీ తనెప్పుడూ చెబుతూ ఉంటుంది. నేనేరా నీ నిజమైన నేస్తాన్ని అని. నేనెప్పుడూ నిన్ను వదిలి ఉండలేదు, ఉండను అని.నాకు కూడా తెలుసు అదే నిజమని. కానీ ఆ నిజాన్ని అంగీకరిస్తే అమ్మో ఆ భయంకర భావాల్ని నేను భరించలేనేమో? అలా అని పూర్తిగా తనని వదిలి ఎప్పుడూ నేను కూడా ఉండలేదు. నా అవసరాల్లో, భాదల్లో తననే ఆశ్రయిస్తా. ఆనందాల్లో మాత్రం తనని మరిచిపోతా. అయినా ఇంతకాలం ఎప్పుడూ చిన్నబుచ్చుకోలేదు. నేను పట్టించుకోకపోయినా నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తనతో అవసరంపడి తనకోసం చూడగానే అర్ధం చేసుకుని వచ్చి వాలిపోతుంది. బయటకి ఎప్పుడూ చెప్పకపోయినా తనంటే నాకు చాలా ఇష్టం.

చల్లని సాయంత్రం సముద్రపు కెరటాలతో పోటీపడి నా పాదాలు పరిగెడుతున్నప్పుడు తను కావాలి. మనాలి మంచుకొండల్లో, ఆపిల్‌తోటలో బెంచిమీద కూర్చుని కాఫీ తాగుతున్నప్పుడు తను కావాలి. వారం మొత్తం ఎక్కువగా పనిచేసి అలిసిపోయినట్టుంటే వారంతంలో బద్దకంగా ఆలస్యంగా లేచి ఇళయరాజా పాటలు పెట్టుకుని వింటున్నప్పుడు తను కావాలి. ఏదయినా కవితో, బ్లాగులో టపానో వ్రాయాలనుకున్నప్పుడు తనుకావాలి. అన్నట్టు తన పేరు చెప్పలేదు కదా? తనపేరు ఏకాంతం. పేరు వినగానే ఎక్కడో విన్నట్టు కాదు కాదు మీకు కూడా నేస్తమే అనిపించిందా? అవును మరి ఏ కాంతాలేనివారికి, శాంతి లేనివారికి ఏకాంతమే నేస్తం. అసహనంలో ఉన్నప్పుడు, అశాంతిలో ఉన్నప్పుడు, ఆగ్రహంలో ఉన్నప్పుడు, అవమానం ఎదురయినప్పుడు మనల్ని ఓదార్చే నేస్తం ఏకాంతం.

ఏకాంతం ఓ గురువు

మనలో ఉన్న శక్తి మనకి తెలియజేస్తుంది.

ఏకాంతం ఒక నేస్తం

మనం చేసిన తప్పుల్ని ఒప్పుల్ని ఒకే దృష్టితో చూసి మనకు చెబుతుంది.

ఏకాంతం ఒక మౌని

మనకు సంయమనం నేర్పుతుంది.

ఏకాంతం మన శ్రేయోభిలాషి మనవాళ్ళెవరో తెలియజెబుతుంది. తల్లిలా ఒడిలో ఏడ్చే అవకాశమిస్తుంది. తండ్రిలా తలనిమిరి ధైర్యాన్నిస్తుంది. గురువుగా భుజంతట్టి ఓ మార్గం చూపుతుంది. ప్రియురాలిలా అపూర్వమైన మధురమైన క్షణాల్లో మౌనంగా నీతో కలిపి అనుసరిస్తుంది. అన్నింటికంటే నీ మనసనే నేస్తంతో నువ్వు ప్రతిసారీ మాట్లాడేది ఏకాంతంలోనే.ఏకాంతంలేనప్పుడు ఎన్ని ఉన్నా ఆత్మతృప్తి ఉండదు కదా!అదేంటో ఎప్పుడు రమ్మన్నా పరిగెట్టుకు వచ్చే ఏకాంతం ఇప్పుడు నీమీదే టపా వ్రాస్తున్నా నిజంగా ఇప్పుడూ నువ్వు కావాలి అన్నా నవ్వుతూ నిలబడిందే గాని రాదే?? మరి తనేం చెప్పిందో తెలుసా?

“నేనే కాదు బాబూ, నీకు నువ్వు తప్ప వేరెవ్వరూ నీతో లేకపోవటమే ఏకాంతం.”