బ్లాగర్ల ఆత్మీయ సమావేశం

కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్లో తెలుగు వ్రాయటం లేక చదవటం ఇప్పుడు అత్యంత సాదారణమైన విషయం. టెక్నాలజీ గురించి పెద్దగా అవగాహన లేని వాళ్ళు కూడా వాడగలిగేంత సరళమైన ప్రక్రియ. కానీ 10 ఏళ్ళ క్రితం టెక్నాలజీలో పని చేసే వాళ్ళకు కూడా తెలుగుని ఇంత విరివిగా కంప్యూటర్‌లో వాడుకోవచ్చనే అవగాహన లేదు. అసలు ఇంత విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని ఎవరూ ఊహించలేదు.

కానీ ఈ మార్పులు ఒక్క రాత్రిలో వచ్చేయలేదు. తెలుగు టైపింగ్ అంటే డిటిపి చేసే వాళ్ళకి ఇవ్వాలి, సాఫ్ట్‌వేర్లు కొనుక్కోవాలి అనే రోజుల నుండి సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో సునాయాసంగా తెలుగు టైప్ చేసే రోజులకు వచ్చేసాం. దీని వెనుక ఎందరో ఔత్సాహికుల కృషి ఉంది.

IMG_0113

గూగుల్‌లో వెతికితే తెలుగు సమాచారం ఏమీ దొరకని రోజుల్లో అందరినీ తెలుగు వాడేలా ప్రోత్సాహించి, అవగాహన సదస్సులు నిర్వహించి దీన్ని ఒక ఉద్యమంగా నడిపిన e-తెలుగు గూర్చి ఈ రోజున తెలుగు టైప్ చేస్తున్న వారిలో ఎందరికి తెలుసు?

IMG_1571

కంప్యూటర్‌లో తెలుగు ఉంది చూడండి అని ప్రచారం చేసి, చేయిపట్టి అక్షరాలు దిద్దించినట్టుగా యూనికోడ్‌లో తెలుగు టైపింగ్ నేర్పించి, అవసరమైన సాఫ్ట్‌వేర్లను సిడిల్లో ఎక్కించి ఉచితంగా పంచిపెట్టి అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి ఎంతో కృషి చేసిన సంస్థ e-తెలుగు. సంస్థ సభ్యులు తమ సొంత డబ్బులు పెట్టుకుని ఏ లాభాపేక్షలేకుండా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించారు. వీళ్ళందరీనీ నడిపించిన చైతన్యం ఒకటే భాష మీదున్న అభిమానం.

ప్రతి ఏడాది హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఒక స్టాల్‌ని నిర్వహించి తెలుగులో బ్లాగుల వ్యాప్తికి ప్రోత్సహించటమే కాకుండా మెయిల్ ఐడి ఉన్న ప్రతి ఒక్కరికి అక్కడికక్కడే ఒక బ్లాగు క్రియేట్ చేసి, దాని నిర్వహణ మీద అవగహాన కల్పించేవారు. కేవలం బ్లాగులే కాదు, తెలుగు వికీపీడియా వ్యాసాల అభివృద్దిలో కూడా పాలుపంచుకోమని ప్రచారం చేసేవారు. ప్రొపరైటరీ ఫాంట్స్ వాడే తెలుగు వార్తాపత్రికలకు, వెబ్‌సైట్స్‌కి యూనీకోడ్ వల్ల లాభాలు వివరించి, యూనికోడ్‌కి మారేలా ప్రోత్సహించారు. ఈ స్టాల్ నిర్వహణ కోసం సభ్యులు ఆఫీస్‌కి సెలవు పెట్టి మరీ వచ్చేవారు. ఈ కార్యక్రమాల్లో నేను కూడా నా వంతు పని చేసానని చెప్పడానికి గర్వపడతున్నా.

ఈ విషయాలన్నీ తెలుగు బ్లాగుల్లో పాతపోస్టుల్లో ఎక్కడో మరుగునపడిపోయాయి. ఒక సౌకర్యవంతమైన నేటి వెనుక ఎందరిదో ఎన్నో రోజుల కృషి ఉంటుంది. అప్పుడప్పు ఇలా గుర్తు చేసుకోకపోతే, వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకోకపోతే లావైపోతాం.

ఎన్నోరోజుల తర్వాత ఆనాటి బ్లాగర్లు, e-తెలుగు సభ్యులు ఈ ఆదివారం (05-01-2020) కృష్ణకాంత్ పార్కులో సమావేశమయ్యారు. మళ్ళీ e-తెలుగు ని చైతన్యవంతం చేసేందుకు నిర్ణయించుకున్నారు. మరో ఉద్యమానికి ఇది నాంది కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.

blogmeet