ఆటోబయోగ్రఫీ లో ఆఖరుపేజి

ఆ రోజు ఎందుకో ఉదయాన్నే గుండె బరువుగా ఉంటే మగతనిద్రలో నుండి మెలుకువ వచ్చి లేచి కూర్చున్నా. అప్పటికింకా పూర్తిగా తెల్లారలేదు, కిటికి వైపు చూస్తే పెద్దగా వెలుగేమీ లేదు. బయటగాలి వస్తుందని రాత్రి తెరిచి ఉంచిన బాల్కనీ తలుపు అలానే వదిలేసినట్టున్నా. లేచి వెళ్ళి బాల్కనీలో నిల్చుంటే వీధిలో సైకిళ్ళు మీద తిరుగుతున్న పాలబ్బాయి, పేపరువాడు కనిపించారు. రామభజన పక్కన ఉండే టీకొట్టు రవణ టీ కాయటం మొదలెట్టేసాడు. చల్లగాలికి శరీరం తేలికబడింది. ఇంక పడుకున్నా నిద్ర వచ్చేట్టు లేదు. ఏదైనా పుస్తకం తిరగేద్దామని లోపలికి నడిచాను. లైటు వేస్తే, మా ఆవిడ రజని లేస్తుందేమో అని మంచం వైపు చూసాను. రజని మంచి నిద్రలో ఉంది, పక్కనే నేను కూడా.

ఉలిక్కిపడి మరలా చూసాను నేనే. అప్పుడెప్పుడో చదివిన సూక్ష్మశరీరంతో సంచరించటం నాకొచ్చేసిందా అనిపించింది. కంగారు, గుండెదడ మొదలయ్యింది. కాసేపటికి ఆ స్థితి అలవాటుపడి నిశ్చలంగా ఉండిపోయాను. నేను చనిపోయాననే విషయం నాకే అర్ధంకావటం లేదు. మిగిలిన వారికెలా అర్ధమవుతుందో ఏంటో బొత్తిగా తెలియటం లేదు. నేను ఆత్మనో దెయ్యాన్నో, నాకిప్పుడేవైనా మానవాతీత శక్తులు వస్తాయా? వచ్చాయని నాకెలా తెలుస్తుంది? అని ఆలోచిస్తూ గోడలగుండా తలుపులగుండా నడుస్తూ ఆలోచిస్తున్నా.

వ్రాయాలనుకున్నవి వ్రాయలేకపోయానని, చేయాలనుకున్నవి చేయలేకపోయానని ఒక చిన్న బాధ ఏదో మూల. అంతా మిధ్య ఏది శాశ్వతం, ఇన్నేళ్ళు బ్రతికినందుకు ఏం మిగిలింది, చెయ్యలేకపోయినవి చేస్తే మాత్రం చచ్చిన నా శరీరం బంగారమవుతుందా అని నాకు నేనే సమాధానం చెప్పుకుంటున్నా. మంచం మీద పడి ఉన్న నా శరీరాన్ని చూస్తే ఇది నేనేనా అనిపిస్తుంది, ఇరవైయేళ్ళ కుర్రాడిగా ఉన్నప్పటి నా రూపం మాత్రమే నేనుగా గుర్తుండటంవల్లనుకుంటా. నా అందమైన ఉంగరాల జుత్తు, కళ్ళల్లో మెరుపు, శరీరంలో చురుకు ఎప్పుడుపోయాయో కూడా తెలియకుండా పోయాయి. అప్పుడప్పుడు అద్దంలో చూసుకున్నప్పుడు మాత్రం ఒక నిట్టూర్పు విడిచేవాడ్ని.

ఇప్పుడు మా ఆవిడ నేను పోయానని తెలియగానే ఏమవుతుంది? అమె ఎలా స్పందిస్తుందో అని కాస్త ఆసక్తి, అంతకంటే ఎక్కువ ఆందోళన. ఎవరైనా వచ్చి ఘంటసాలవారి భగవద్గీత వేస్తే బావుండు కాస్త మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అనిపించింది.

కాస్త తెల్లారి, వెలుగు గదిలోకి వచ్చాక రజని లేచింది. లేచి నా వైపు ఒకసారి చూసి వంటగదిలోకి వెళ్ళిపోయింది. కాస్త ఉత్కంఠత నాలో రేగి చల్లారింది. పెళ్ళిచూపుల్లో తనని చూసేందుకు వెళ్ళినప్పుడు కూడా నా పరిస్థితి ఇదే. మంచమ్మాయని వాళ్ళన్నారు, మంచబ్బాయి అని మావాళ్ళూ అన్నారు. మంచి మంచి రాసుకుంటే మంచే రాలుతుందని అందరూ అన్నారు. అయినా నాన్న చెప్పినమాట విన్నప్పుడు మంచోడ్ని, అమ్మ చేసిన కూర బాలేదని తినకపోతే చెడ్డోడ్ని. మంచి చెడు రెండూ నేనే. అందుకే మంచి అమ్మాయి కావాలని అనుకోలేదు. అలా అని ఎలాంటి అమ్మాయి కావాలో కూడా తెలియలేదు.

మూగకోయిలనై రోధిస్తున్నవేళ
ముంతమామిడి చివురు తెచ్చే నెచ్చెలి ఆమె

గుండెల నిండా చీకటి పీల్చిన అమావాస్యరాత్రి
నాకోసం క్షణమైనా వెలిగి రాలిపోయే తార ఆమె

హారివిల్లు విరిసి మెరిపోతున్న వేళ
మదిలో చీకటిచారను చూడగల కాటుక కన్నులు ఆమె

అలసినవేళ సాయంగా, తలచినవేళల హాయిగా
బాధల్లో ఛాయలా, బ్రతుకంతా ఓ మాయలా
వలచి వలపింపబడి సృజించి సృజించబడు
నా బ్రతుకు కావ్యం ఆమె

అమ్మాయిని తెచ్చి ఎదురుగా కూర్చండబెట్టారు. నిర్మలంగా వర్షంలో తడిచిన నందివర్ధనం పువ్వల్లే ఉంది. నచ్చిందనేందుకు నమ్మకం కుదరలేదు, కాదనేందుకు కారణం దొరకలేదు. పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేను టీగ్లాసు పుచ్చుకున్ని వాకిట్లోకొచ్చి నిలబడ్డాను. రెండురూపాయలకి ఒకటి అని బోర్డు పెట్టి రంగు రంగుల కోడిపిల్లలు అమ్ముతున్నాడెవడో. కొన్ని కోడిపిల్లలు గంపదాటి పోతుంటే వాటిని లాగి లోపల పడేస్తున్నాడు.

వంటగదిలోకి వెళ్ళిన రజని టీగ్లాసు తో వచ్చింది. ” ఏవండీ లేస్తారా? టీ చల్లారిపోతుంది” రెండు మూడుసార్లు పిలిచింది. “సరే ఇక్కడ పెడుతున్నా లేచి త్రాగండి” అని అక్కడే టేబుల్ మీద వేడి వేడి టీ పెట్టి వెళ్ళిపోయింది. తట్టిలేపితేనేగా వచ్చిపడిన చల్లదనం తెలిసేది.

పెద్దవాళ్ళు పెళ్ళి నిశ్చయం చేసి ముహుర్తాలు పెట్టి కబురుపెట్టారు. పెళ్ళికి వారం రోజులు ముందుగా సెలవు పెట్టి వచ్చాను. “పిల్లను ఒకసారి కలిసి రాకూడదూ” అన్నారు నాన్న. ఆటపట్టించటానికో, నిజమో తెలియదు ఇంట్లో అందరూ అదేమాట. ఎదురింటి చంటి బండి మీద రజని ఇంటి దగ్గర దించి వెళ్ళాడు. ఇంట్లో పెళ్ళిసందడి కనిపిస్తుంది. చుట్టాలు అప్పటికే వచ్చారు. తన ఈడు ఆడపిల్లలు ఇలా నేను రావటం గూర్చి తనని ఆటపట్టిస్తున్నారు. పెరట్లో జామచెట్టు నీడన నాకు కూర్చీ వేసి, తినటానికి జంతికలు, పెళ్ళికని చేసిన లడ్డూలు పెట్టి వెళ్ళారు.

కాస్త ఆలస్యంగా రజని వచ్చి అక్కడే ఉన్న సిమెంటు గట్టు మీద కూర్చుంది. ముస్తాబయి రావటంవల్ల ఆలస్యమయ్యిందని అర్ధమయ్యింది. రెండురోజులుగా షాపింగ్‌కి, టైలర్ మెజర్మెంట్స్‌కి ఎండల్లో తిరుగుతున్నా కాస్త రంగు తగ్గాను అని చెప్పింది. నేను నవ్వి ఉరుకున్నా. నాకు ఆ తేడా తెలియలేదు. అయినా పెళ్ళి సమయానికి సమస్య లేదులెండి. మా పిన్ని కూతురు వస్తుంది పెళ్ళికి. తనకి ఊర్లో బ్యూటీపార్లర్ ఉంది. తనే నాకు పెళ్ళికూతురు ముస్తాబు చేస్తుంది అని గలగలా చెప్పింది. నేను ముభావంగా చూడటం గమనించి ఫోటోల్లో అందంగా పడాలిగా అని నా వైపు సమాధానం కోసం చూసింది. అవును అని చెప్పి ఊరుకున్నా.

మీరేమీ మాట్లాడటం లేదు అని అడిగింది. నేను నవ్వాను. ఆమె పక్కనే ఉన్న మొక్కలు చూస్తూ ఆ గులాబి బావుంది అన్నాను. అమె ఆ పువ్వును తెంపి తలలో పెట్టుకుని సిగ్గుపడింది. వర్షం వచ్చేలా ఉంది అని మేఘాలను తనకి చూపించి, చలిని స్వీకరిస్తూ చేతులు కట్టుకున్నాను. అవును నిజమే అని ఆమె పరుగున వెళ్ళి తీగ మీద ఆరేసిన బట్టలు ఇంటిలో పెట్టేసి వచ్చింది. నేను మౌనంగా ఉన్నాను. మీరు బొత్తిగా నెమ్మది. నేను వచ్చాక కుదరదు సుమా అని గట్టిగా నవ్వి తను పెళ్ళికి కొనుకున్న జూకాల గురించి చెప్పింది. అవి చూసి అసూయపడుతున్న తన స్నేహితుల గురించి, ఇంకా ఏవో చాలా చెప్పింది. వర్షం మొదలవక ముందే ఇంటికి వెళ్ళాలి అని చెప్పి నేను వచ్చేసాను.

“నాన్న ఇంకా లేవలేదు. ఈ రోజు మార్నింగ్ వాక్‌కి వెళ్ళినట్టు లేదు” రజని ఫోన్లో మాట్లాడుతూ ఉంది. మా అబ్బాయి ఉదయ్‌తో అనుకుంటా. చదువు పూర్తవుతూనే ఉద్యోగం వచ్చింది. దూరమైనా కెరీర్ బావుంటుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. రోజూ ఉదయం, సాయంత్రం ఫోన్ చేసి వాళ్ళమ్మతో మాట్లాడతాడు. ఎప్పుడన్నా మాట్లాడాలనిపిస్తే వాళ్ళమ్మ దగ్గర ఫోన్ తీసుకుని ఎలా ఉన్నావు అని అడుగుతాను. అంతకంటే ఏం మాట్లాడాలో ఎంత కూడబలుక్కున్నా నాకు మాటలు రావు. ఇదిగో అమ్మకిస్తున్నా అని తిరిగి ఫోన్ ఇచ్చేస్తాను. ఇప్పటికీ తెలియదు వాళ్ళిద్దరూ అంతసేపు ఏం మాట్లాడుకుంటారో. రజని ఫోను మాట్లాడూతూ పువ్వులు ఏరుకునేందుకు పెరట్లోకి వెళ్ళింది.

పెళ్ళైన అయిదవరోజేమో అదే పెరట్లో మీరెందుకు అందరిలా ఉండరు అని అడిగింది రజని. ఆ ప్రశ్న లోతుగా తగిలింది. చిన్ననాటి నుండి అందరిలో పడిపోకుండా ఒక్కో అక్షరం చెక్కుతూ ఒక సంతకం దిద్దుకున్నా. అందరిలా ఉండకపోవటం నా గొప్పనుకున్నానే తప్ప అది తప్పని నాకు తెలియలేదు. నాలా ఉంటే ఏం సమస్యలు వస్తాయో తను చెప్పింది. చాలా నష్టాలు జరిగే అవకాశం ఉన్నట్టుంది. కానీ ఒక్కడినే ఉన్నప్పుడు నాలా ఉండటంలో కష్టాలేవి తెలియలేదేంటి అని ఆలోచించాను.

పెళ్ళి అంటే ఒక పెద్ద బాధ్యత అని చెప్పింది. నిజమే ఇది నేను ఎక్కడో చదివాను. పెళ్ళంటే మీరొక్కరే కాదు మీరు, నేను ఇద్దరం అని కూడా చెప్పింది. కానీ నేను పెళ్ళంటే ఒక్కరే అని చదివాను. తనకి అదే విషయం చెప్పాను. మరయితే ఇద్దరం ఒకేమాట మీద నడవాలి పదండి నాతో అంది. ఆ రోజు నాకు నిద్రపట్టలేదు. పెరట్లో మొదలయిన వాదనలు మెల్లగా పడకింటికి, అటుపైన నట్టింటికి నడిచొచ్చాయి. అందరూ కూర్చొని ఆరాతీసారు, పంచాయితీ చేసారు. తర్వాత గొడవలే కాదు, మాటలు కూడా తగ్గిపోయాయి.

ఇంటిలోకి వస్తూ టైము చూసిన రజనికి ఏదో అనుమానం వచ్చినట్టుంది. మంచం దగ్గరకొచ్చి తట్టి లేపబోయింది. శరీరంలో చల్లదనం, కరుకుదనం తెలిసిరాగానే గట్టిగా అరిచి స్థాణువులా నిలిచిపోయింది. నాకు ఎప్పుడు ప్రతిస్పందించటం అలవాటు లేదు, అందుకే తిరిగి పలకలేదు. రజని అరుపుకి పనమ్మాయి కంగారుగా గదిలోకి వచ్చి చూసి వీధిలోకి పరిగెట్టింది.

కాసేపట్లో ఇంట్లోనూ, వీధిలోనూ హడావుడి మొదలయ్యింది. ఎవరెవరో ఎవరెవరికో ఫోనుల్లో నా చావు వార్త గుసగుసగా చెబుతున్నారు. రజని ఫోనులో నంబరు చూసి ఎవరో ఉదయ్‌కి కూడా చెప్పారు. తెలిసినవాళ్ళు, స్నేహితులు వచ్చి వెళుతున్నారు. వచ్చినవాళ్ళు ఇంటి ముందు వేసిన శామియానా కింద కూర్చున్నారు. టీకొట్టు రవణ వచ్చి అందరికీ టీలు పోస్తూ, పోసిన గ్లాసులు లెక్కబెట్టుకుంటున్నాడు. “అబ్బాయి ఎప్పటికి వస్తాడో” అని గడియారాన్ని చూస్తూ కొందరు, “రానివ్వండి తొందరేముంది” అని రిటైర్ అయిన కొందరూ మాట్లాడుకుంటున్నారు.

ఆడవాళ్ళు కొందరు రజని దగ్గరకొచ్చి “అమ్మా అగరొత్తులెలిగించి, తల దగ్గర దీపం పెట్టాలి” అని చెప్పారు. “కుడి వైపా? ఎడమవైపా?” అని అడిగారు ఎవరో. రజని పెద్దవాళ్ళ వైపు చూసింది. “ఎవరేం చెప్పినా వినకు, మన ఇళ్ళల్లో ఇంతే. మీది మాది ఒకటే ఇంటిపేరు. మా ఆయనపోయినప్పుడు..” అని ఒక ముసలామె ఏదో చెబుతుంది. రజని ఆమె వైపు మౌనంగా చూస్తూ కూర్చుంది. “బంగారంలాంటి మనిషి ప్రకాషం, ఇలా చెప్పా పెట్టకుండా పోయాడు” అన్నారెవరో. “ఎక్కడికి మాత్రం చెప్పి వెళ్ళాడాయన” రజని మనసులోని మాటలు నాకు మాత్రమే వినిపించాయి.

అందిన విమానం పుచ్చుకుని ఆగమేఘాల మీద ఇంటికి చేరాడు ఉదయ్. ఘనీభవించిన మౌనం కరిగి ఉప్పెనగా మారి ఉదయ్ మీదపడింది. అందరూ వాడిని పట్టుకుని బావురుమంటున్నారు. తుఫానులో చేజారిన ఆసరా వెదుకుతూ వచ్చినట్టు, జనాల్ని తప్పించుకుంటూ లోపలికి వచ్చాడు ఉదయ్. బయట మొదలయిన ఆందోళనకే ఉదయ్ వచ్చేసాడని గ్రహించిన రజని, పనమ్మాయికి గ్లాసు నీళ్ళు తెమ్మని చెప్పింది. ప్రయాణంలో తోటి ప్రయాణికుల మధ్య బయటపడలేక బిగదీసుకుపోయిన కొడుకుకి రాగానే నీళ్ళివ్వాలని ఆమె ఆరాటం. చిన్నప్పుడు వాడు గుక్కపెట్టి ఏడుస్తూ ఊపిరాడకపోతే అదే చేసేది.

ఉదయ్ నీళ్ళ గ్లాసు అందుకోలేదు. పూలదండల మధ్య నా శరీరాన్ని వెతుక్కునేందుకు కూలబడ్డాడు. వంగి నా ముఖం వైపే చూస్తున్నాడు, ఎన్నో ఏళ్ళుగా చూస్తున్నా మనసులో ముద్రపడని దాన్ని పరిశీలనగా చూస్తున్నట్టు. ఎప్పుడు చూసాడు గనక. కాలేజి ఫీజుకో, పుస్తకాలకో డబ్బులడిగినప్పుడు కూడా అటు తిరిగి మాట్లాడేవాడు లేదా వాళ్ళమ్మకు చెప్పేవాడు. ఊరిలో అందరూ వాళ్ళ పిల్లాడు పాసయ్యాడని ఆనందపడినప్పుడో, పరీక్షతప్పాడని బాధపడ్డప్పుడో నేనూ ఉదయ్ గురించి ఏదైనా చెప్పాలని తోచేది కాదు. ఎవరైనా అడిగితే మాత్రం చెప్పేవాడిని. పెళ్ళికి అత్తవారు పెట్టిన ఉంగరంలానే, వాడు కూడా నాకు సొంతమో కాదో ఎప్పుడూ అర్ధంకాలేదు.

రజని గురించో, నా గురించో, ఉదయ్ గురించో ఏదీ ఆగలేదు. “జరగాల్సిన పనులు” అని అందరూ చెప్పే పనులేవో జరుగుతూనే ఉన్నాయి. “అమ్మను లేవదీయాల్సిన వాడివి నువ్వేంట్రా ఇలా” అని ఉదయ్‌ని రెక్కపట్టుకుని లేవదీసారు. రజనికి,ఉదయ్‌కి, నాకు తెలియనివి అర్ధంకానివి సొంతంకానివి ఏవేవో పనులు, ఆచారాలు జనాలు భుజాలకెత్తుకుని జరిపించేస్తుంటే ఎలాగో శ్మశానానికి వచ్చేసాం. చిన్నప్పుడు అక్కడే క్రికెట్ ఆడేవాళ్ళం. దూరంగా శవాలు కాలుస్తుంటే భయంగా చూసేవాళ్ళం.

ఏడదాకోయ్ నీ నడక ఓ ఎర్రికొడుకా
ఏపాటి గొప్పదోయ్ ఇంతోటి పుటక
నీ ఏడి నెత్తురు నీ సోకు అత్తరు
ఎముక తెలియని సేయి ఎనకలెరుగని ఎన్ను
సూడు కాలి కాష్టమయ్యే ఏడుక

నన్ను తగలేసి వెనక్కి వెళ్ళిపోతున్న జనాల్ని చూస్తూ కాటికాపరి పసివాడైన తన కొడుక్కి తత్వాలు నేర్పిస్తున్నాడు.

యాత్ర వీధి దాటగానే ఇళ్ళు కడిగేయాలంటూ ఆడాళ్ళందరూ రజనిని పక్కకి లాగి బక్కెట్లతో ఇళ్ళంతా నీళ్ళు పోసేస్తున్నారు. రజని కళ్ళు మేఘాల్లేని వర్షంలా కురవటం మొదలెట్టాయి. కన్నీరుగా మొదలై, ఎక్కిళ్ళుగా మారి ఆమె ముసురుపట్టిన వేళ సముద్రపుఘోషలా ఏడుస్తుంది. ఏళ్ళుగా ఒకే చూరుక్రింద అపరచిత వ్యక్తితో సాగిస్తున్న కాపురమనే జీవితం ముగిసి, ఇన్నేళ్ళుగా కనబడకుండానే తన స్వేచ్ఛను మింగేసిన గాలిసంకెళ్ళు తెగిపోయి, ఏనాడో పోగొట్టుకున్న తను తనకి దొరికిన కంగారులో దారితప్పి కూడలిలో నిల్చున్న పసివాడిలా దిక్కుతోచక ఏడుస్తుంది. ఆ దుఖం ఆమెను తేలికపరుస్తుంది. అంతకంటే ఎక్కువగా ఆందోళనలోకి నెట్టేస్తోంది. ఇప్పుడు రజనమ్మ సంగతేంటి ఉదయ్‌బాబుతో వెళ్ళిపోతుందా ఎవరో అడిగారు. “లేదు ఇక్కడే ఉంటాను” అంత దుఃఖంలోనూ తనలో తను చెప్పుకుంది. అవును ఇన్నేళ్ళూ తన బ్రతుకు తను బ్రతకలేకపోయిందిగా. సముద్రం మధ్యలో కురిసి కరిగిపోయిన మేఘం గాలివాటానికి చివరిచుక్కలతో తీరం వైపుసాగింది.

కాటికాపరి కొడుకు వాడి కొత్త నోటుబుక్కులో నుండి రెండు తెల్లని అందమైన కాగితాలు చింపి ఏంటో వ్రాసాడు. బరబరా గీతలు గీసి కాసేపు ఆడుకుని అక్కడే నా చితిమంటల్లో వేసాడు. కాగితం కాలి దాని పైన అ పిల్లాడు గీసిన అక్షరాలు కాసేపు మెరిసాయి. గట్టిగా వీచిన సాయంత్రం గాలికి కాలిన ఆ కాగితం బూడిదై ఎగిరింది.

ఉన్నాయో లేదో తెలియని లోకాలను చూపి, జరిగాయో లేదో తెలియని జ్ఞాపకాలతో తడిపి, నన్ను నడిపిన ఆమెను కలవకుండానే అర్ధాంతరంగా ముగిసిన ఆత్మకథలా నేను ఆనంతంలో లీనమయ్యాను.