పచ్చని వనంలో ఎర్ర మట్టితో అలికి, రంగవల్లులు తీర్చిన ఆ పర్ణశాల ప్రకృతిమాత మడికట్టుకుని వెలిగించిన కార్తీకదీపంలా వెలిగిపోతుంది. వాకిట్లో వృక్షాలన్నీ నిన్నటి ముచ్చట్లు నెమర వేసుకుంటూ, ఆకులతో, కొమ్మలతో పలకరించుకుంటున్నాయి. కొమ్మలపై వాలిన పక్షులన్నీ సందడి చేస్తూ ఆ ముచ్చట్లకు అడ్డు తగులుతున్నాయి. చెట్లకు చుట్టూ గుబురుగా పరుచుకున్న పూల మొక్కలన్నీ మౌనంగా రేపటి తమ కానుపుకై కలలు కంటున్నాయి. ముంగిట్లో చేరిన హరిణాలు పచ్చిక తింటూ మధ్య మధ్యలో ఎవరికోసమో మెడలు పైకెత్తి పెద్ద పెద్ద లోచనాలతో ఆత్రంగా చూస్తున్నాయి
ఉదయం ఉత్సాహంలో ఉన్న సూర్యుడు కొమ్మల సందుల్లోనుండి ఒడుపుగా తన కాంతిని వదులుతూ ఎండ ముగ్గులు వేస్తున్నాడు. తుంటరి కొమ్మలు అటూ ఇటూ ఊగుతూ ఆయన్ని అల్లరిపెడుతున్నాయి. పాపం ఉడుక్కుంటున్న ప్రత్యక్ష నారాయణుడు మరింత వేడెక్కిపోతున్నాడు. ఏకాగ్రత చెదిరిందేమో ఇక కుదరదని వదిలేసి తన అశ్వాలని ముందుకు అదిలించాడు
ఒక తుంటరి జింకపిల్ల చెంగు చెంగున దూకుతూ గుమ్మం దాకా వచ్చేసింది. కాస్త తడబడుతూ, బిత్తర చూపులతో మెల్లగా లోపలికి తొంగి చూసింది. చూస్తూనే ఉండిపోయింది. ఏ రూపం చూడాలని లోకంలో ఉన్న కన్నులన్నీ పరితపిస్తాయో, ఏ మూర్తిని నింపుకుని మందిరాలుగా మారాలనీ మనస్సులన్నీ కోరుకుంటాయో, ఏ స్వామి వాత్సల్యం కోసం సర్వ ప్రాణికోటి ఆరాటపడుతుందో ఆ సుందర మనోహర రాముడు నార వస్త్రాలు ధరించి ధ్యానంలో ఉన్నాడు. సృష్టిలో ఉన్న ఏ ఆభరణాలూ ఈ నార వస్త్రాల్లా స్వామి అందాన్ని చూపలేవేమో?
గుమ్మంలో అలికిడి విని కన్నులు తెరిచి చూసాడు. పాపం జింక పిల్ల స్వామి తనని చూసేసారని తత్తరపాటుకి లోనయ్యింది. కానీ చూపుని స్వామి నుండి మరల్చ లేకపోయింది. స్వామి నడుచుకుంటూ వచ్చి జింక పిల్లని చేరదిసి “పొద్దున్నే పలకరించాలని వచ్చావా? ఇక పోయి నీ నేస్తాలతో ఆడుకో” అని వదిలి గుమ్మంలోకి వచ్చారు. స్వామి తనని తాకినందుకు సంబరపడుతూ ఈ విషయం తన నేస్తాలకి చెప్పాలన్న ఉత్సాహంలో జింక పిల్ల వాకిట్లోకి పరుగుతీసింది. స్వామి దర్శనం కోసం ఉదయం నుండీ పడిగాపులు కాస్తున్న పక్షులు, జంతువులు అన్నీ గుమ్మం దగ్గరకి చేరిపోయి స్వామిని మరింత దగ్గరగా చూడాలని ఉత్సాహ పడసాగాయి. స్వామి అందరినీ తన చల్లని చూపులతో, చిరు మందహాసంతో పలకరిస్తున్నారు.
పర్ణశాల లోపల పనిలో ఉన్న సీతమ్మతల్లి “హ్మ్ స్వామివారికి తెల్లారిందా? ఆ ముచ్చట ముగిసాక కాస్త వంటలో లవణం వేస్తారా? నా చేయి వీలు లేదు” అంటూ పురమాయించింది.
స్వామి చిరునవ్వుతో అందరిని పంపించి ఇంటిలోకి వచ్చారు. పాపం ఆయన వరదహస్తం కాస్త పెద్దదాయె, చేతివాటాన వంటలో కాస్త లవణం ఎక్కువే వేసారు. సీతమ్మ ఏమంటుందో అని కాస్త బెరుకు గొంతుతో “జానకీ! కాస్త ఉప్పు ఎక్కువయ్యిందేమో” అంటూ నసిగారు.
అమ్మవారు చేస్తున్న పని ఆపి నిట్టూరుస్తూ గెడ్డం కింద చెయ్యిపెట్టుకుని “హ్మ్ బాగుంది. నేను మీకే చెప్పానూ. ఏది ఎంత వెయ్యాలో తెలిసిన వారైతే లోకం ఇట్లా ఎందుకుంటుంది?” అని లేచి వంట దగ్గరకి వచ్చింది.
ఫలాలకోసం వనంలోకి వెళ్ళి అప్పుడే వచ్చిన లక్ష్మణస్వామి ముసి ముసిగా నవ్వుకుంటూ “లోకాలనేలే దేవదేవుడైనా ఇంటిలో ఉప్పుగడ్డకు లోకువ” అని మనసులోనే అనుకున్నారు.
సీతమ్మ వంట కాస్త రుచి చూద్దామని నోటిలో వేసుకుంది. కళ్ళలో నీళ్ళు తిరిగాయి. స్వామి అమ్మవారి కళ్ళలో నీళ్ళు చూసి భీతిల్లి “అయ్యో జానకీ ఏమయ్యింది? ఎందుకు రుచి చూసావు? మధుర ఫలములు తప్ప వేరు రుచి తెలియని నీ నోటికి లవణం బాధకలిగించిందా? ఏమరపాటున ఎంత పని చేసాను” అంటూ తల్లడిల్లారు.
అమ్మవారు స్వామి చేతులను కళ్ళకు అద్దుకుని “స్వామి మీ చేత జారిన లవణమయినా వృధాపోదని విస్మరించి తూలనాడాను. నన్ను క్షమించరూ. అమృతము తప్ప వేరు రుచి దీనికి సాటి రాగలదా? ” అని తన్మయత్వంతో పలికింది. స్వామి ఒక దీర్ఘ నిట్టూర్పు విడచి, చిరునవ్వుతో ఊరడిల్లారు. ఇదంతా చూసిన ఒక ఉలికిపిట్ట వనమంతా తిరిగి గోల చేసి అందరికీ ఈ వార్త చేరవేసింది. కాసిన్ని మెతుకులు మాకు దొరకకపోతాయా అని పక్షులన్నీ ముంగిట్లో చేరి చూడసాగాయి.
వంట ముగిసే సరికి సూర్యుడు నడినెత్తికి వచ్చాడు. స్వామిని భోజనానికి పిలిచి అమ్మవారు పూజ చేస్తున్నంత శ్రద్ధగా వడ్డన చేస్తుంది. “జానకి! ప్రతిరోజు ఇంతే ఓర్పుగా, శ్రద్ధగా వడ్డింపు చేస్తావు. నీ వడ్డనలో భక్తికి ముచ్చట వేస్తుంది సుమా” అన్నారు.
“నా బాధ మీకెప్పుడు తెలిసింది కనుక. ఇప్పుడేగా దక్కింది నాకీ భాగ్యం. అయోధ్యలో ఉండగా అత్తలు నాకీ అదృష్టం దక్కనిస్తేనా. ఒకరికి తెలియకుండా ఒకరు చొప్పున ముగ్గురత్తలూ మూడుపూటలా ఈ బాలాకుమారునికి కొసరి కొసరి ముద్దలు తినిపించటం చూడటానికే సరిపోయేది” అని బుగ్గలు నొక్కుకుంది సీతమ్మ.
“లోకమాత అని అందరూ పిలిచే నీకు అమ్మ ప్రేమ తెలియనిదా?” అని స్వామి నవ్వుకున్నారు.
“బాగుంది సంబరం. నేనిప్పుడు ఏమన్నా అని? మీ మాటలు వింటే నేనేదో అత్తలని ఆడిపోసుకున్నా అనుకుంటుంది లోకం” అని విసుక్కుంది సీతమ్మ.
“మీ సోదరి ఊర్మిళకి ఆ భాగ్యం కూడా లేకపోయింది” అని బయట మొక్కలకి నీరు పెడుతున్న రామానుజుని చూసి రాముడు విచారపడ్డాడు.
“హ్మ్ మీ తమ్మునికి అన్న తప్ప అన్యులక్కరలేదాయె. ఏం చేస్తాం పాపం” అని నిట్టూర్చింది సీతమ్మ.
“సుకుమారవతియైన సతిని సుఖవాసాన ఉండనిచ్చి మేటిభర్త అనిపించుకున్నాడు. అడవులకు నడిపిన నింద నాకేగా. భావి తరాలు నాపై ఇంకెన్ని నిందలు మోపనున్నారో” అని నిట్టూరుస్తూ భోజనం ముగించారు స్వామి.
మెల్లగా సంధ్యవాలి పున్నమి చంద్రుడు కలువలతో ముచ్చటలాడటానికి ఉత్సహంగా వచ్చాడు. పున్నమి చంద్రుని పూర్ణకళలు చుసి వనమంతా మురిసింది. అడవంతా ఆ తెల్లని వెలుగులో పాలసంద్రపు తరకలా ఉంది. పర్ణశాల బయట ఆదిశేషునిలా విస్తరించిన చెట్టు నీడన నిదురిస్తున్న స్వామిని చూసిన చంద్రుడు, తాను వెలవెలపోతానని భయపడి చటుక్కున మబ్బుల చాటుకి పోయాడు. నింగి నున్న తారకలన్నీ మిణుకుమిణుకుమని నవ్వుకున్నాయి. స్వామి పాదాలు ఒత్తుతున్న సీతమ్మ స్వామివారి కోదండం చూస్తూ ఏదో అలోచనలోపడింది.
“ఏమిటి జానకి, ఏదో అలోచనలో ఉన్నావు?” అని మూసిన కళ్ళు తెరవకుండానే అడిగారు స్వామి.
“అంతా గమనించేసారా?” అని నవ్వుకుంటూ “శివధనస్సు సహితం నిలువలేని మీ చేతిలో ఈ సాదారణ విల్లు ఎలా నిలువ గలిగిందా అని ఆలోచిస్తున్నా” అంది సీతమ్మ.
స్వామి లేచి తన చేతిపైకి ఒత్తిగిలి అమ్మవారిని చూస్తూ “నువ్వూ అదే అన్నావ్. నేను శివధనస్సును విరచలేదని ఎంత చెప్పినా వినరే. అది అనుకోకుండా జరిగింది సుమా” అని అలుక అభినయించారు స్వామి.
“శివధనస్సు ఎక్కుపెట్టే ముందు తామెదో తలుచుకున్నారు. ఎన్నిసార్లు అడిగినా అదేమిటో చెప్పరే” అని బుంగమూతి పెట్టింది సీతమ్మ.
“ఈనాడు చెప్పక్క తప్పేట్లు లేదు. లేకుంటే శివధనస్సు విరిచా అనే అపకీర్తి నాకు శాశ్వతమవుతుంది.” అని లేచి కూర్చుని నాటి సన్నివేశాన్ని అభినయించసాగారు స్వామి. అమ్మవారు ముసిముసిగా నవ్వుకుంటూ ఆసక్తిగా చూస్తుంది.
స్వామి ధనస్సుకి నమస్కరించినట్టుగా, రహస్యం చెప్పినట్టుగా అభినయిస్తూ “ఓ శివధనువా, నీవు సీతాసఖివని విని ఉన్నాను. చిన్ననాటి నుండి తను ఆటలాడగా చూసుంటావు. ఊసులాడగా విని ఉంటావు. తన మనసెరిగిన దానివి నీవని నా నమ్మకం. ఆడపిల్లలతో ఏనాడు ఆడి,మాటలాడి ఎరుగని నాకు ఆమె మనసు తెలుసుకొనటం సాధ్యం కాదు. మనసారా అంగీకరించని కన్యను చేపట్టటం మా రఘువంశము మెచ్చదు. అందుకే ఈ రాముడు నీ సహాయం కోరుతున్నాడు. నీ సఖి మనసున ఊహలకి రూపాన్ని నేను కాగలనని అనుకుంటే నా చేత ఒదిగిపోవుమా” అని పలికి సీతమ్మ వంక చూసి “ఇది మాత్రమే అన్నా జానకి. ఉలుకు తప్ప పలుకెరుగని నీ మనస్సు ఎట్లా తెలుసుకుందో నీ నెచ్చెలి ఉత్సాహం ఉరకలెత్తగా, అమాంతం తనువంతా విరుచుకు ముక్కలయ్యింది” అని అమాయకంగా చెప్పారు స్వామి.
స్వామి అభినయానికి నవ్వుకుంటూ, తన మనసు తెలుసుకోవాలనుకున్న ఆయన వాత్సల్యానికి కరిగిపోతూ స్వామి వారి పాదాల వద్ద ఒదిగిపోయింది సీతమ్మ. అనంత ఆనందాన్నిచ్చే ఈ దృశ్యాలను తనలో కలుపుకుంటూ కాలం మరో అందమైన రోజుకోసం సాగిపోయింది.
(నా పిచ్చి ఊహలకు క్షమార్పణలతో స్వామివారి పాదాలకు)
శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||