భయంగా ఉంది నాన్న…

 
11 డిసెంబర్ 2008 :

“రాణి, నీ పెళ్ళి ముహూర్తం కూడా నిర్ణయం అయిపోయింది. బట్టలు,నగలు కొనటానికి రేపే అమ్మ,నేను విశాఖపట్నం వెళ్తున్నాం. నీకేం కావాలో చెప్పమ్మా?”

“నాన్న, నీ ఒక్కగానొక్క కూతురి పెళ్ళి ఘనంగా చేస్తావుగా మరి. నన్ను కాదని ఫోజు కొట్టిన సాఫ్ట్ వేర్ బావల చూపులు ఆకాశం నుండి నేలకి దిగిరావాలి. మా కొడుకులే పుత్తడి, మీరు ఇత్తడి అన్న అత్తల డాబు దిగేలాగా బందువుల్ని,ఊరందర్ని పిలవాలి. నువ్వు అడిగిన విధంగా ఖర్చులన్నింటినీ వ్రాసిపెట్టా. 20 లక్షలకి దగ్గరగా వచ్చింది.”

“అంతా నీకు నచ్చినట్టే చేద్దాం. మేము పొద్దున్నే బయలుదేరి రాత్రికి వచ్చేస్తాం. నువ్వు నిదానంగా లేచినా పర్వాలేదు. వచ్చేంతవరకు జాగర్త తల్లి.”

“సరే నాన్న.”

12 డిసెంబర్ 2008:

“రాణీ! తల్లి ఎక్కడున్నావు రా. ఇదిగో చూడు నువ్వు అడిగిన దానికంటే అందంగా ఉన్న చీరలు, నగలు. నా చిట్టితల్లి దగదగా మెరిసిపోతుంది ఇవి వేసుకుంటే. ఎక్కడున్నావమ్మా?”

“అమ్మాయి గది తలుపు వేసి ఉంది. పడుకుందేమోనండి? రేపు చూస్తుంది లెండి.”

“ఒక్కసారి ఇవన్నీ చూపించి నా చిట్టి తల్లి కళ్ళలో అనందం చూడకుండా పడుకున్నా నాకు నిద్రపట్టదు. వెళ్ళి కిటికీ లోంచి పిలువు వినిపిస్తుంది.”

“అలాగే. చెబితే వినరుగా….. ఏవండీ! త్వరగా రండీ. అయ్యో చిట్టి తల్లీ ఎంత పని చేసావమ్మా. నీకే కష్టం వచిందమ్మా. మమ్మల్ని ఒంటరిని చేసి వెళ్ళిపోయావా తల్లీ….”

“అమ్మా…..” 

రాణి తనగదిలో చీరతో ఉరివేసుకుని కనిపించింది ఆ తల్లిదండ్రులకి. వాళ్ళ రోదన అలా కొనసాగుతూనే ఉంది. బందువులు, మితృలు, పోలీసులు అందరూ వచ్చివెళ్ళారు. తలా ఒకమాట అన్నారు. ఆ తల్లిదండ్రుల అజాగ్రత్తకు, అతిజాగ్రత్తకు మందలించారు, తోచిన సలహాలిచ్చారు. కొందరు కూపీలాగారు. కానీ ఈ సంఘటనలో వారు పోగొట్టుకున్నది ఎవరు తిరిగి తెచ్చి ఇవ్వలేదు. రాణి కూడా ఒక ఉత్తరమైనా వ్రాసిపెట్టలేదు. తను ఉత్తరం వ్రాయలనుకుని ఉంటే ఏమని వ్రాసేది…….

 

ఆత్మహత్యకి ప్రత్యమ్నాయం లేదా?

ఆత్మహత్యకి ప్రత్యమ్నాయం లేదా?

ప్రియమైన నాన్నగారికి,

నాన్న నీతో చాలా మాట్లాడాలని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటా కానీ నీ పెద్దరికానికి, పెద్ద పెద్ద ఆలోచనలకి నావి ఆకతాయి అల్లరి చేష్టల్లా ఉంటాయని కొట్టి పారేస్తావ్. ఈ ఒక్కసారికి విను నాన్న. ఎందుకంటే ఇకముందు ఇలా చెప్పే అవకాశం ఉండదేమో? నాన్న నువ్వెంత గొప్పవాడివో తెలుసా. బయటవాళ్ళకి నువ్వెవరో తెలియదు గాని నాకు మాత్రం నువ్వు దేవుడివి. నువ్వు నాకు ఏమి ఇవ్వలేదని నాన్న. జీవరాశుల్లోనే ఉత్తమమైన మానవ జన్మనిచ్చావ్, అడిగింది కాదనక అల్లారు ముద్దుగా పెంచావ్, చదువు చెప్పించావ్. ఇప్పుడు నా పెళ్ళికోసం కూడా ఎంత కష్టపడుతున్నావ్.

అసలు ప్రతీ మనిషి ఇంతేనేమో, పెళ్ళి కానంతవరకు తనకోసం బ్రతికి, తనకోసం సంపాదించేవాడు పెళ్ళి కుదిరిన మరుక్షణం నుంచే పిల్లలే జీవితంగా బ్రతుకుతారు. నువ్వు పొద్దున్న లేస్తూనే కష్టపడేది, సంపాదించేది, ఆదా చెసేది ప్రతీది నా కోసమేగా. నీ జీవితం లో నీకోసం పావువంతు బ్రతికి మిగిలిన జీవితమంతా నా కోసమే బ్రతికావు కదా!

మరి నాకోసమే ఇంతలా బ్రతికే నువ్వు, నాకు ఏమి కావాలన్నా ఇచ్చే నువ్వు, నా భవిష్యత్తుని నా వందేళ్ళ జీవితాన్ని నిర్ణయించే పెళ్ళి దగ్గర మాత్రం నా ఇష్టాలతో, ఆశలతొ, ఆశయాలతో, నా భవిష్యత్తు నిర్ణయాలతో పనిలేకుండా పరువు, ప్రతిష్ట అంటావేంటి నాన్న. ఈ పరువు, కుటుంబ ప్రతిష్ట అంటే ఏంటి నాన్న? ఆడపిల్ల పద్దతిగా లేకపోతే కుటుంబ పరువు పోతుందని రోజూ అమ్మకి చెబుతావ్, సమాజం లో తలదించుకొనే పరిస్థితి రాకూడదని రోజూ అంటావ్. అమ్మ సంగతి తెలుసుగా 5వ తరగతి చదువుతో ఆడదానికి కుటుంబమే సర్వస్వం, భర్తే దైవం అని తప్ప వేరే ఏది ఆలోచించలేదు. వ్రతాలు, గాజులు, చీరలు, ఆవకాయ, అప్పడాలు ఇవి తప్ప తన దగ్గర ఇంకేదన్నా చర్చిస్తే తనకి అర్ధం కాదు. అందుకే నీ పరువు కోసం నన్ను గడప దాటనివ్వదు. సమాజం లో నీ గౌరవం కోసం నన్ను ఎవరితోనూ స్నేహం చెయ్యనివ్వదు. నీ బాగు చూసి ఓర్వలేకపోతున్నారు బందువులు అని బలంగా నమ్మి ఎవరితోనూ మాట్లాడనివ్వదు.

నా ఆలోచనలు ఆకాశంలో విహరిస్తే, మీ అర్ధంలేని భయాలు నా ప్రపంచాన్ని చిన్నదిగా చేసాయి. నా వయస్సులోనే ఉన్న అక్కలు,అన్నయ్యలు,బావలు,వదినలు ఎందరో మన భందువుల్లో ఉన్నారు. ఒక్కరోజు ఎవరినీ కలిసే అవకాశం లేదు. మనసు విప్పి మాట్లాడే అవకాశంలేదు. వాళ్ళ భవిష్యత్తు ప్రణాలికలు తెలుసుకోవాలన్న నా కోరిక ఇప్పటికీ తీరలేదు. వాళ్ళు కంప్యూటర్ లో ప్రపంచాన్ని చూస్తుంటే, నేనుమాత్రం ఇల్లే ప్రపంచంగా బ్రతికాను. విశాలమైన మన ఇంటి గదుల్లో ఎంత ఇరుకుగా పెరిగానో నీకు తెలుసా నాన్న.

ఒకరోజున హఠాత్తుగా పెళ్ళిచూపులన్నారు, పెళ్ళన్నారు. వచ్చినవాడికి నేనంటే ఇష్టమా? మీరు ఇస్తానన్న కట్నం ఇష్టమా? నా ఆశలని,ఆలోచనలని అర్ధంచేసుకుంటాడా? లేక వండివార్చితే చాలనుకుంటాడో? ఏమీ తెలియదు. ఇవన్నీ పోని మిమ్మల్ని అడుగుదామంటే ఆడది చదివి చెడిందంటారు. అంతేగా? ఇంకెవర్ని అడగాలి? ఎవరితో పంచుకోవాలి. నాకు ఎవర్ని అందిచారు? ఎవర్ని మిగిల్చారు మీరు? నాకు నేను తప్ప ఎవరూ మిగలలేదు.

అసలు లోకులు,బందువులు ఎవరు నాన్న మన జీవితాల్ని శాసించటానికి? ఇప్పుడు రమ్మను వాళ్ళని కళ్ళు చల్లబడతాయి. ఇప్పుడూ నేను లేని లోటుని తీర్చగలరా వాళ్ళు. పశ్చాత్తాప పడి నేను కోల్పోయిన ప్రాణాన్ని తిరిగి ఇవ్వగలరా. నీ మనసులో గూడు కట్టుకు ఉన్న పరువుని, ప్రతిష్టని అడిగి సమాధానం చెప్పు.. ఇకచాలు నాన్నఇంత పెద్ద ప్రపంచంలో నాకు,నా ఆలోచనలకి స్వేచ్చని,స్థానన్ని ఇవ్వలేని సంకుచిత సమాజాన్ని ద్వేషిస్తూ వెళ్ళిపోతున్నా. నీ రూపం లో నా మెడని వంచి విజయాన్ని అందుకుందామన్నా విధిని పరిహసిస్తూ వెళ్ళిపోతున్నా. నా ఇష్టమయిన ఉయ్యాలని చివరిసారిగా ఊగాలని ఉరివేసుకుని ఊగి వెళుతున్నా.

అంతే నాన్న..  నేను చెప్పాలనుకున్నది అంతే…   ఇంకా చాలా చెప్పగలనేమో..  కానీ ఇప్పటికే జరగాల్సిన ఆలస్యం జరిగిపోయింది..  ఇంకా ఏవో చెప్పి ప్రయోజనం లేదు…

ఇన్ని మాటలు చెప్పాను కానీ నాన్న, భయంగా ఉంది నాన్న. చావాలంటే భయంగా ఉంది నాన్న. ఉరితాడు నా మెడకి బిగుసుకుంటూ ఉంటే ఊపిరాడక నొప్పిగా ఉంటుదేమో? నాన్న భయంగా ఉంది. చనిపోయాక ఎమవుతా నాన్న, అక్కడ ఆలోకంలో ఆకలయితే అన్నం పెట్టే వాళ్ళు ఉంటారా? ఒంటరిగా అందర్ని వదిలి వెళ్ళాలంటే చాలా భయంగా ఉందినాన్న. నన్ను మరిచిపోకండి నాన్న… ప్లీజ్

మీ నిర్భాగ్యురాలయిన కూతురు,

రాణి.  

(ఇది ఈమధ్య మా బందువుల్లోనే జరిగిన ఒక సంఘటన. కారణం ఎవరికీ తెలియదు. బందువుల్లో ఎవరితోనూ కలివిడిగా ఉండే అవకాశంలేదు. ఒక చిన్న పల్లెటూరిలోనే తన నిండు నూరేళ్ళు నిండిపోయాయి. తన చివరి క్షణాల్లో పడ్డ సంఘర్షణ ఆవిష్కరించాలని ఎంతగానో ప్రయత్నించా. కానీ తన ఆలోచనలు, నడవడిక, వ్యక్తిత్వం , గతం, భవిష్యత్తుకై తన ఆలోచనలు ఏమీ తెలియని నేను వ్రాసినవి కేవలం నా ఊహలేగాని వాస్తవాలు కావు. వాస్తవాలు తన మనస్సు అనే రహస్యపు పెట్టెలో శాశ్వతంగా దాచేసి తనతో తీసుకుపోయింది. నావాళ్ళకే నాతో కష్టాలు పంచుకునే చనువు ఇవ్వలేకపోయాను. అందుకేనేమొ ఈ సంఘటన నన్ను పదే పదే వెంటాడుతుంది. నాకిప్పుడు కొన్ని నిజాలు తెలియాలి. తను చనిపోవాల్సిన అవసరం ఏంవచ్చింది? తన  చావుకి నిజమయిన కారకులు ఎవరు? చనిపోయినప్పుడు తన ఆత్మసంఘర్షణ  ఏంటి? చావు తర్వాత ఏమవుతుందో ఇప్పటికీ మానవమేధస్సుకి తెలియదు. తను అసలు ఆవిషయం ఆలోచించిందా? ఉరివేసుకోవటానికి భయపడలేదా? బ్రతకటానికి ఏవయినా అవకాశాలు ఉన్నాయేమొ ఆలోచించలేదా? రేపటినుండి తాను ఏమవుతుంది, తనగది ఏమవుతుంది, తన బట్టలు, పుస్తకాలు, తనకిష్టమయిన వస్తువులు అన్నీ ఏమవుతాయి? ఇంకా కొన్ని వేల ప్రశ్నలు నా మనస్సుని తొలిచేస్తున్నాయి. ఇన్ని ప్రశ్నలు తనకి కలగలేదా? మరి ఏం సమాధానం చెప్పుకుంది. తనని తాను చావుకి మానసికంగా ఎలాసిద్దంచేసుకుంది. నా ప్రశ్నలకి ఎవరు సమాధానం చెప్పగలరు………………….)


జావా జావా కన్నీరు

పొద్దున్నే అయ్యప్ప పూజ చేసుకొని కిటికి తలుపు తెరిచా పక్షులింకా అప్పుడే బ్రష్ చేసుకోవటం మొదలు పెట్టాయి. నేను స్నానం కూడా చేసాను అని వాటికి తెలియాలని బట్టలు శబ్దంవచ్చేలా పదిసార్లు దులిపి తీగమీద వేసి వచ్చా. లేకపోతే సాఫ్ట్ వేర్ వాళ్ళంటే ప్రతి ఒక్కడికి లోకువే. “మా లంచ్ అయితే గాని పక్కమీదనుంచి లేవని సాఫ్ట్ వేర్ వాళ్ళు” అని పక్షులు ఒక సామెత కూడా పెట్టేసుకున్నాయి. ఈ రోజుకి వాటి తిక్కకుదిరింది.

పిచ్చుక 1: కిచకిచ కిచ్ కిచ్ కీచ్ కీచ్  (తెలుగులో: ఏంటే మనోడు ఈ రోజు పొద్దున్నే లేచాడు. ఏంటి సంగతి?)

పిచ్చుక 2: కిచో కిచ కిచోకిచ కిచకిచే కిచ కిచకిచే కిచ కిచ్చు కిచ్చు కిచ్చు కిచ్చు   (తెలుగులో: నిద్రపట్టక. మాబావ స్వాలో అమెరికా లోని లీమన్ బ్రదర్స్ లో గూడు కట్టుకొని ఉన్నాడు తెలుసుగా వాడు నిన్నే మెయిల్ పెట్టాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యమని. అమెరికాలోని ఆర్ధికమాంధ్యనికి ఇక్కడ సాఫ్ట్ వేర్ కంపెనీలు ఎలాగు మూసుకోవాలి. ఇళ్ళులేని భారతీయ పక్షులన్నింటికీ హైటెక్ సిటీ లో గూళ్ళు కట్టి అమ్ముకో అని. అదీ వీడి ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అని నిద్రపట్టక లేచుంటాడు.)

వెంటనే నేను కిటికి మూసేసి, కర్టేన్ వేసి లోపలికి వచ్చేసా.

కాసేపు అష్టాచెమ్మా,గుడుగుడు గుంచం ఆడుకున్నాం. కోతికొమ్మచ్చి, కబడ్డీ, కర్రాబిళ్ళ ఆడుకుందామంటే స్థలాభావం. అందుకే “ఎక్కడి సెల్లులు అక్కడే గప్చుప్ సాంబార్ బుడ్డీ” ఆడుకున్నాం.(ఆట నియమావాళి: 1.అందరూ నిజాయితీగా ఆడాలి. 2.రూం లో ఉండే వారు, అమీర్ పేట హాస్టల్లో ఉండేవాళ్ళు బయట వారిని ఆడించకూడదు. 3.కొద్దిరోజులముందే సెల్లు పోగుట్టుకున్న నాలాంటి వారిని ఆడించేప్పుడు తగిన జాగర్తలు తీసుకోవాలి. 4.మీ సెల్లు గాని దొంగ సెల్లు అయితే సెల్లు యజమాని ఉన్నప్పుడు ఆడరాదు. ఆట విధానం: 1 .మొదటగా పంటలు వేసుకోవాలి. (పొలం లో వేసేవి కావు.) 2.దొంగ ఎవరో తెలిసాక వాడి సెల్లు తీసి పండిన వారు దాచేయాలి. 3.దొంగ పసిగట్టకుండా ఎప్పటికప్పుడు స్థలాలు మార్చాలి. 4.చివరగా ఎవరు దాచినప్పుడు దొంగ సెల్లు పట్టేసుకుంటాడో వాడు తర్వాతి ఆటకి దొంగ. ముఖ్య గమనిక: ఇక్కడ చెప్పబడిన ఆటలో జాగర్తవహించకుండా ఆడి సెల్లు పోగొట్టుకుంటే దానికి పూర్తి భాద్యత జానారెడ్డి గారిది. నైతికభాద్యత వహిస్తూ అమ్మ ఆదేశానుసారం ఆయన రాజీనామా చెయ్యాలి. జై ఉండవిల్లి)

గతంలో ఎప్పుడూ అంత పొద్దున్నే లేచిన అనుభవంలేదు. ఆ టైం లో ఏం చేస్తారో తెలియదు. పోని బయటకి వెళ్ళి అందరూ ఏం చేస్తున్నారో చూద్దమంటే చలి. ఇక గత్యంతరం లేక టి.వి. పెట్టా.

టి.వి.99: సాఫ్ట్ వేర్ ఉద్యోగులకి పిల్లనివ్వటానికి మీరు సిద్దమా? (మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.) మీ సమాధానం అవును అయితే ఎఱ్ఱగడ్డ పిచ్చి ఆసుపత్రి కి ఫోన్ చెయ్యండి. కాదు అయితే మీ పక్కింట్లో అద్దెకుండే సాఫ్ట్ వేర్ కుర్రాళ్ళు మీ అమ్మాయి మీద కన్నేసారు జాగర్త.

టి.వి.55: ఆర్ధికమాంధ్యంతో చివరికంటా పోరాడి ఉద్యోగాలు కోల్పోయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కుటుంబాలకి మీ సానుభూతి తెలియజేయాలనుకుంటే హైటెక్ సిటీ ముందు కొవ్వొత్తులని వెలిగించండి.

టి.వి. 100: @$!^*!*!)(*%%!$$

టి.వి. 1000000000000001: !@!^$%!!)*!*(!

టి.వి. ఆపేసి ఆఫీస్ కి బయలుదేరాను.

నేను: ఆటో లైఫ్ స్తైల్ కి వస్తావా?

ఆటోవాడు: 100 అవుతుంది.

నేను నా ట్యాగ్ తీసి మెడలో వేసుకున్నా.

ఆటోవాడు: సాఫ్ట్ వేరా?(సంతోషం సినిమా లో బ్రహ్మానందం డబ్బాపాలా అని అడిగినట్టు)

నేను: అవును. (దీనంగా మొహం పెట్టి)

ఆటోవాడు: ఊరుకోండి సార్. కష్టాలు సాఫ్ట్ వేర్ వాళ్ళకి కాకపోతే మనుషులకి వస్తాయా? ఇలాంటి సమయంలోనే ఒకరికొకరు చేదోడు గా ఉండాలి. 30 ఇవ్వండి చాలు.

కట్ చేస్తే మొత్తానికి ఆఫీస్ కి వచ్చిపడ్డా. డబ్బుల్లేక ఆటోవాడికి సొడెక్సో ఇచ్చా. ఆఫీస్ లో అడుగు పెట్టగానే పవన్ గాడు టెన్షన్ గా అటూ ఇటూ తిరుగుతున్నాడు.

నేను: “ఏమయ్యింది రా?”

పవన్: నాకు లీవ్ కావాలి రా. ఆర్.ఆర్.బి., బ్యాంక్ పుస్తకాలు కొనడానికి కోఠికి వెళ్ళాలి. సరోజ తెలుసు గా?

నేను: ఎవరు నువ్వు హౌసింగ్ లోన్ తీసుకున్న 20 లక్షలతో షాపింగ్ చేసిన అమ్మాయే గా ఎలా మరిచిపోతా?

పవన్: అవునవును. గవర్నమెంట్ ఉద్యోగం చూసుకోకపోతే, నన్ను పెళ్ళి చేసుకోను అంది. పోని మరో అమ్మాయిని చుసుకుందామంటే అప్పులివ్వటానికి బ్యాంకులన్నీ ఎత్తేస్తున్నారుగా.

అని హడావుడి గా మా పి.ఎం. ని కలిసాడు. మా పి.ఎం. “ఏంటయ్యా నీ గోల? రోలొచ్చి మద్దెలకి మొరపెట్టుకోవటం అంటే ఇదే. ఇటు ఉద్యోగం సవ్యంగా లేక అటు స్టాక్ మార్కెట్ లో పెట్టిన డబ్బులుపోయి నేను ఏడుస్తుంటే? వెళ్ళి ఏదో ఒకలా తగలడు” అని పవన్ గాడిని పంపేసాడు. నేను వెళ్ళి నా క్యూబ్ లో కూర్చున్నా. హాసిని ప్రమోషన్ వచ్చిందని చెప్పి స్వీట్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఉద్యోగాలు తీసేసే కాలంలో ప్రమోషన్ ఏంటబ్బా నాకర్ధం కాలేదు. వాళ్ళ టీం లో ఉండే రాజేష్ ని అడుగుదామని కాల్ చేసా.

నేను: హలో

రాజేష్: అవును నేనే తాజ్ హోటల్లో చనిపొయింది. నా పేరు ఇమ్రాన్. మాది పాకిస్థాన్.

నేను వెంటనే బయపడి ఫొన్ పెట్టేసా. కాసేపట్లో కొందరు వైట్ డ్రెస్ లో వచ్చి రాజేష్ తో పాటు మరికొందర్ని గొలుసులు కట్టి తీసుకుపోయారు. జీవితంలో ఇచ్చిన ఒకేఒక్క సెమినార్ తో 10 మందిని మతిస్థిమితం లేకుండా చేసి హెడ్ కౌంట్ తగ్గించినందుకు హాసిని కి ప్రమోషన్ ఇచ్చారు. ఇంకా మరిన్ని సెమినార్లు చెప్పించాలని మేనేజ్మెంట్ అనుకుంది. ఏదో మెయిల్ చూసుకుంటున్నా.

ఫోన్ వచ్చింది. “సర్! నేను హెచ్.ఎస్.బి.సి. నుంచి మాట్లాడుతున్నా క్రెడిట్ కార్డ్”

నేను: నాకొద్దు.

“ఏడ్చావ్. అదే మేమూ చెప్పేది మీ కార్డ్ క్యాన్సిల్ చేసా పో” ఫొన్ పెట్టేసింది.

నా ఖర్మకి ఏడ్చి కాఫీ త్రాగుదామని వెళ్తుంటే (ఆఫీస్ లో కాదు బాబు. ఆఫీసుల్లో ఎప్పుడో ఎత్తేసారు) మా పి.ఎం. వచ్చి హాసిని ఏదో సెమినార్ అంటా నువ్వుకూడా వెళ్ళు అన్నాడు. విషయం అర్దమయ్యింది “సార్ పొద్దున్నే కాలుకి ముళ్ళు గుచ్చుకుంది అప్పటి నుండి కడుపులో నొప్పిగా ఉంది ఈ రోజు కి ఇంటికి వెళ్ళిపోతా” అని చెప్పి ఆయన ఏం చెబుతున్నాడో కూడా వినకుండా వచ్చేసా.

బయట ఒక కుర్రాడు ఏవో కరపత్రాలు పంచుతున్నాడు. మెడలో ట్యాగ్ వేసుకొని ఉన్నవాళ్ళకి మాత్రమే ఇస్తున్నాడు. నన్ను చూసి “గురూ తీసుకో పనికొస్తుంది” అని ఇచ్చాడు.

అందులో వివరాలు.. ప్రత్యమ్నాయ ఆదాయం కోసం కోచింగ్ సెంటర్. కోర్సులు

1. మిమ్మల్ని ఎవరూ గుర్తించకుండా పల్లీలు, భఠాణీలు అమ్ముకోవటం ఎలా?

2. మిర్చి బజ్జీ తయారీ విధానాలు.

3. దర్జాగా వచ్చి సెల్లు,ల్యాప్పీ పట్టుకొని పారిపోవటం ఎలా?

4…….

5…….

అదిచదువుతూ ఆటోని పిలిస్తే ఆటో వాళ్ళు అదోలా నా వైపు చూసి వెళ్ళిపోతున్నారు. ఒక ముసలి ఆటోడ్రైవర్ వచ్చాడు. “రా బాబు. భాదపడకు. ఆ భాద నాకు తెలుసు నాకూ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసిన కొడుకు,అల్లుడూ ఉన్నారు” అని కన్నీళ్ళతో ఆటోలో తీసుకు వచ్చి డబ్బులు ఇస్తున్నా తీసుకోకుండా వెళ్ళిపోయాడు. నాకేమి అర్ధం కాలేదు. నేను రావటం చూసిన నా శతృవులైన పిచ్చుకలు తినటం మానేసి వచ్చి అన్ని గుమిగూడి ఒకదాని రెక్కలు ఒకటి పట్టుకొని నా వైపు చూసి ఆనందంగా నవ్వుతూ అరకులోయలో గిరిజన యువతులు చేసే థింసా నృత్యం చేయటం మొదలు పెట్టాయి. “కిచ్చా రే కిచా కిచా కిచ కిచ హో కిచ్చా రే కిచా కిచా కిచ కిచ హో” ఏరోజూ బియ్యం ఏరినప్పుడు కూడా ఒక్క గింజ వేసిన పాపాన పోలేదు నన్ను చూసి ఇంతలా పండగ చేసుకుంటున్నాయేంటి ఏం అర్ధం కాలేదు. బెల్ల్ కొడితే తలుపు తీసిన మా సన్నీ గాడు నన్ను చూసి భోరున ఏడ్వటం మొదలుపెట్టాడు.

నేను: “ఏమయ్యింది రా?”

సన్నీ: “నా ఉద్యోగం ఎలాగూ పోయింది. నీ ఉద్యోగం ఉందన్న ధైర్యం తో ఉన్నడబ్బులన్నీ పెట్టి బియ్యం కూరగాయలు తెచ్చేసా. గ్యాస్ ఆర్డర్ చేసా. లాండ్రీ కి బట్టలు కూడా ఇచ్చా. వా……ఆ డబ్బులే ఉంటే బస్సెక్కి అమలాపురం పోయి పాలవ్యాపారం చేసుకునేవాడిని.. వా….”

నేను: సరే ఇప్పుడేమయ్యింది?

సన్నీ: నీ చేతి లో ఆ పింక్ స్లిప్ ఏంటీ?

నేను: ఓర్ని చంపేసారు పో. అదా అందరు అలా అనుకోవటానికి కారణం.అది కరపత్రమ రా..బాబు.