మీ అబ్బాయి చాలా మంచోడు

ఇదేదో ఎర్రబస్సెక్కిన వెర్రి ప్రొడ్యూసర్, సినిమా దురద తీర్చుకోవటానికి తీసిన దురదగుండాకు సినిమా టైటిల్ అనుకొనేరు. అబ్బే కాదండీ. నా గురించి మా మమ్మీ(ఈ పదానికి మితృలు నన్ను క్షమించాలి, చిన్నప్పటి నుండి అమ్మమ్మ ని అమ్మ అనటం మా అమ్మగారిని మమ్మీ అనటం అలవాటు. ఇది కాకుండా డాడీ కూడా చిన్నప్పుడే అలవాటు. అభిమానం పిలుపులో కంటే మనసులో ఉంటుందని నమ్ముతాను నేను. కొందరి మితృలని ఏరా రారా పోరా అన్నా సరే వారి మీద మనసులో చాల గౌరవం ఉంటుంది అంతేగా..) స్నేహితులు నా కిచ్చే కితాబు. ఇంక డాడీ స్నేహితులంతా మీ కేంటి రత్నాల్లాంటి పిల్లలు అంటారు. ఇలాంటి మాటలు విని అల్లరి చెయ్యాలనే మన ఆశ ఆవిరయిపోతుంది. కానీ మనసు మరీ మన కంట్రోల్లో లేక పోతే ఏం చేస్తాం ఏదో ఇలా చిన్న చిన్న పనులు చేస్తాం.

ఇంటర్ లో కిషోర్ అని ఒక క్లాస్ మేట్ ఉండేవాడు. వాడు కోవై సరళ లా కొంచెం అతి చేస్తాడు. వాడికి వినబడేలా శ్రీహరి క్లాస్ లో కిటికి అద్దం పగలగొట్టాడు అని చెప్పాం. మనోడు ప్రిన్సిపల్ దగ్గర మంచి కోసం వెంటనే వెల్లి ఈ విషయం చెప్పేసాడు. ప్రిన్సిపల్ క్లాస్ లో అందర్ని పిలిచి అందరి ముందు శ్రీహరిగాడిని తిట్టడం మొదలు పెట్టారు. వాడు నాకే పాపం తెలియదు మొర్రోమనిగోల. సరే ప్రిన్సిపల్ కిషోర్ గాడ్ని పిలిచి అసలు నువ్వు చూసావా అని అడిగారు. లేదండి మురళీ వాళ్ళు మాట్లాడుతుంటే విన్నా అన్నాడు. మేమా మేమెప్పుడు మాట్లాడుకున్నాం అన్నాడు మా అనిల్ గాడు. నేనయితే చేతులు కట్టేసుకొని, అమాయకంగా ముఖం పెట్టి అది మొదటి నుంచి అలానే ఉంది కదా సార్ అని అన్నాను. అంతే మరుక్షణం లో కిషోర్ గాడి చెంప ఎర్రగా కందిపోయింది. అయినా మావోడు అతి చేయటం మానలేదు. మనోడికి పద్మ అనే అమ్మాయి అంటే చాలా ఇష్టం. స్టడీ అవర్ లో పద్మ క్లాస్ పక్కనే ఉన్న ఖాళీస్థలం లో ఎవరూ ఉండరు అక్కడ చదువుకునేది. మనోడు కొంచెం దూరం లో ఆ అమ్మాయి కనపడేలా కూర్చొనేవాడు.రోజూ ఇదేతంతు. ఒకరోజు అక్కడ ఉన్న మావిడి ఆకు తో ఆ అమ్మాయి ఆడుకుంటూ పెన్నుతో గీతలు పెడుతుంది. ఆ అమ్మాయి వెళ్ళిపోగానే కిషోర్ కి కనిపించకుండా నేను వెళ్ళి ఆ ఆకు మీద “ఐ లవ్ యు” అని రాసి వచ్చేసా.

అనిల్ గాడు వెళ్ళి ఇంతవరకు ఆ అమ్మాయి ఆడుకున్న ఆకు తీసి దాచుకో రేపు పెళ్ళయ్యాక తనకి చూపిస్తే ఎంత ఆనందపడుతుంది అని చెప్పాడు. చెప్పాగా మనోడు అసలే అతి రెచ్చిపోయి వెళ్ళి ఆకు తెచ్చేసుకొన్నాడు. దానిమీద వున్నది చదివి మనోడి ఆనందానికి అవధులు లేవు. కాలేజి అయిపోగానే అందర్ని పిలిచి పండగ చేసి పార్టీ ఇచ్చేసాడు. “నన్నే చూస్తూ రాసింది.” అనే గుడ్డి నమ్మకం వాడిది. మరసటి రోజు పద్మ ఒంటరి గా కాలేజి నుంచి ఇంటికి వెళ్ళే దారి లో కలిసి, “నువ్వు మన జీవితం గురించి అస్సలు టెన్షన్లు  పెట్టుకోకు. మా నాన్నగారు త్వరలో వాలంటరీ రిటైర్ అయిపోతారు జాబ్ నాకు వచ్చేస్తుంది. మనం హాయిగా ఉండొచ్చు. మీ ఇంట్లో వాళ్ళతో కూడా నేనే మాట్లాడతా” అని చెప్పేసి సిగ్గుపడుతూ వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసాడు. పాపం పద్మకి జార్జిబుష్ తెలంగాణా యాస లో తెలుగుపాట పాడినట్టు ఏమీ అర్ధం కాలేదు. అర్ధమయ్యేటప్పటికి న్యూటన్ కి చెట్టు ఎక్కకుండానే ఆపిల్ దొరికినట్టు, పద్మకి మంచి అవకాశం “రాఖీ పౌర్ణమి” రూపం లో దొరికింది. రాఖీ పౌర్ణమి రోజున పద్మ రాఖీ తొ రక్తసంభందం లో సావిత్రి లా వచ్చేసింది. సునామీ విషయం ముందేతెలిసిన వాతావరణ కేంద్రం డైరెక్టర్ అనౌన్స్ కూడా చేయకుండా వాడే ముందు పారిపోయినట్టు, విషయం ముందే పసిగట్టిన కిషోర్ గాడు చెప్పాపెట్టకుండా పారిపోయాడు. మేము వదులుతామా వెళ్ళి ప్రిన్సిపల్ ని ఆడిగితే M.P.C నుంచి Bi.P.C కి మారిపోయాడు అని చెఫ్ఫారు. అంతే వాడి వెనక మేము, మా వెనక పద్మ సినిమాల్లో చూపించిన రేంజ్ లో చేజింగు. వాడి ఖర్మకి వాడు మేడపైకి పరిగెట్టాడు. పైకి వెళ్ళిన తరువాత పారిపోవటనికి లేదు. అప్పుడు వాడికి ఉన్నవి రెండు అవకాశాలు ఒకటి దిగివచ్చి రాఖీ కట్టించుకోవాలి లేదా దూకి చావాలి. మొదటి దే బెటర్ అని వచ్చి రాఖీ కట్టించుకున్నాడు. ఎలాగు రాఖీ కట్టేసింది కదా నేను మరలా MPC కి వెళ్ళిపోతా అని ప్రిన్సిపల్ అని అడిగాడు. ఈ సారి చెంపలు బొబ్బట్లయ్యాయి. ఆవిధంగా కిషోర్ గాడు మా చేతిలో ఎన్నోసార్లు బకరా అయ్యాడు. అన్నట్టు చెప్పటం మరిచాను మా మాట విని ఒకసారి పద్మ దగ్గరకి వెళ్ళి “పద్మావతి పద్మావతి నీ ఎర్రనిమూతి చూడగానే పోయింది నా మతి నామనస్సు అయ్యింది కోతి” “క్లాసులో నువ్వంటే అందరికీ మంట ఎందుకు వారి తో తంటా నేనుంటాగా నీ వెంట.”(ఈ కట్టింగు అక్షరాలా మందే) ఇలాంటి కవితలు చెప్పి అడ్డమైన తిట్లు తిన్నాడు.

గమనిక: నా గత టపా “తెలుగు ఆత్మగౌరవ పునరంకిత దినం” ఫీడ్ లో ఉన్న సమస్య వలన కూడలిలో సరిగా రాలేదు.మితృలు ఇప్పుడు ఆ టపా చూసి మీ ఆలోచనలు కూడా తెలియజేస్తే మనం ఒక నిర్ణయం తీసుకోవచ్చు.

తెలుగు ఆత్మగౌరవ పునరంకిత దినం

మన తెలుగుబ్లాగర్లందరి తో నా ఆలోచన పంచుకోవాలని ఈ టపా పెడుతున్నాను. నా ఆలోచన వెనక రెండు విషయాలు ఉన్నాయి.
1.ఈ మధ్య కొందరు బ్లాగర్లు కనుమరుగవుతున్న తెలుగు భాష గురించి ఆవేదనగా టపాలు వ్రాసారు. అందరం కూడా చదివి నిజమే కదా అనుకున్నాం.
2.ఇక్కడ బ్లాగులలో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించి హిపోక్రసీ కి దూరం గా వ్రాయగలిగే ప్రతి ఒక్కరిని రచయితలుగా, విశ్లేషణాత్మక వ్యాఖ్యలు వ్రాసే మిత్రులను విమర్శకులు గా గుర్తిస్తున్నాం.
ఇప్పుడు నా ఆలోచన ఏమిటంటే మన ప్రపంచం లో మన ఆవేదన,ఆక్రోశం మనలోనే ఉండిపోతుంది తప్ప మన ఆంధ్రరాష్ట్రం లో మిగిలిన వారికి చేరటం లేదు.మనలో మనమే భాధపడటం అలానే మనలో మనమే ఓదార్చుకోవటం వలన ఏమిజరగదు.
కానీ మనం ఏమి చేయగలం?
మనం పూర్తిగా ప్రజల్ని మార్చ లేకపోవచ్చు. కానీ ఒక ముందడుగు వేసితెలుగు భాష మీద కాస్త గౌరవాన్ని పెంచగలమని నా భావన. పెద్ద పనులేమీ చేయనక్కరలేదు. పెను చీకటి ని పారద్రోలటానికి ఒక చిన్న దీపం చాలు. అలానే మనమున్న చీకటిని పోగొట్టటానికి ప్రతీ మనసులో ని చిన్న సంకల్పం చాలు.
మన బ్లాగు లోకం తరపున “తెలుగు ఆత్మగౌరవ పునరంకిత దినం” గా ఒకరోజుని గుర్తించి ఆ రోజున తెలుగు వారి గౌరవాన్ని పెంచే చిన్న పనులు చేయవచ్చు. అవి ఎలాంటివి అనేది బ్లాగులోకం లో పెద్దలు నిర్ణయిస్తే బ్లాగు లోకం లో రచయితలుగా, విమర్శకులు గా ఉన్న పిన్నలూ,పెద్దలూ భుజానికెత్తుకోవడమే. విస్తృతంగా వ్యాపించిన మీడియా(టి.వి.9,ఎఫ్.ఎం., వార్తాపత్రికలు)  సహాయం తీసుకొని ప్రజల లోకి తీసుకుపోవచ్చు. బత్తిబంద్ కి ఇచ్చినట్టే దీనికి కూడా పిలుపునివ్వవచ్చు.
నా చిన్ని మెదడు కి తట్టిన ఆలోచన.
ఆ రోజు ఒక బ్యాడ్జి ధరించవచ్చు “నేను తెలుగువాడిగా పుట్టినందుకు గర్విస్తున్నా” అని. ఇలాంటి చిన్న చిన్న పనులను ఒక ఉద్యమంలా తీసుకొని ఆ రోజున మనం చేసి పదిమంది చేత చేయించవచ్చు. ఇది తెలుగు బ్లాగుప్రపంచం తెలుగుభాషకి చేసే చిన్న సేవ.
ఇది ఆచరణయోగ్యం కాదు, ఆమోదం కాదు అంటే వదిలి పెట్టండి.
జై తెలుగు తల్లి.

నేను పాటలు రాసానోచ్…

స్నేహమా రాధిక గారి పాట చదివిన తరువాత నేను కూడా పాటల టపా పెట్టాలని అనుకున్నా. మా కాలేజి లో కొంత మంది స్నేహితులతో కలిసి నేను కొన్ని పాటలు వ్రాసి రికార్డింగ్ కూడా చేసాం. కానీ ఆడియో ఫైలు అట్టాచ్ చెయ్యలేకపోతున్నా. లిరిక్స్ మాత్రం ఇక్కడ ఇస్తున్నా. బ్లాగుమితృలెవరైనా పాటలు అట్టాచ్ చెయ్యటం ఎలాగో చెబితే ఆడియో ఫైల్స్ కూడా అందిస్తా. స్వర మైత్రి, సంగీత ఙ్ఞానం ఉన్నవాళ్ళు దయచేసి మమ్మల్ని క్షమించాలి. ఇవి గాలిపాటలు, అచ్చంగా మన జానపదాలలా. ఎందుకంటే ఇవి అందమయిన ఊహలలోంచి వచ్చినవే తప్ప, మాకు స్వర ఙ్ఞానం లేదు. అలానే శృతులు,యతులు తెలియవు

సందర్భం:

ఒకమ్మాయి ఒక అబ్బాయి కి కనిపించకుండా, అతని నే అనుసరిస్తూ చిన్న చిన్న బహుమతులు పంపిస్తూ ఉంటుంది. ప్రతిసరీ బహుమతిలో ఒక ఉత్తరం పెడుతుంది. ఆ ఉత్తరాలు చదివి ఇష్టపడి ఆమె ఎవరో తెలుసుకోవాలనే తపన పడే అబ్బాయి ఊహలు.

నీడల్లె నా వెంట ఉన్నా
నిను పోల్చుకోలేదు ప్రతి సారి
నువ్విప్పుడేచోట ఉన్నా
కనిపించవా నాకు ఓ సారి
  ||నీడల్లె||
||2|| నవ్వుతూ కవ్విస్తావు ఉత్తరం పంపిస్తావు
మెల్లగా మాయ చేసి ఇంతలో మిస్సవుతావు ||2||
ఆణువణువు నే వెతుకుతున్నా
నె చేరలేనా నీ దారి
   ||నీడల్లె||
||2|| హంసల్ని రప్పిస్తాను వెతికెందుకొప్పిస్తాను
నిన్ను చేరె దాక ఊరూరు పంపిస్తాను ||2||
నువ్వెంత తప్పించుకున్నా
నను దాటి పోలేవు ఈ సారి

సంధర్భం: ఎవరో తెలియని ఓ అబ్బాయి అల్లరి పనులు, ఇతరులకి చేసే సహాయాలు చూసి ప్రేమించిన అమ్మాయి ఊహలు.

కోయిలమ్మా కోయిలమ్మా
ఇంతలోనే ఎంత ప్రేమ
ఎవరో తెలియకుండా మనసే అడగకుండా
తననే వలచెనంట ఇది చెప్పలేని వింత
||కోయిలమ్మా||
తనతో చెప్పాలి మనసే విప్పాలి.
ఇకపై బిడియాన్ని ఆపాలి.
కలలే ఆగాలి నిజమై రావాలి.
జతగా అతగాడే కావాలి.
||కోయిలమ్మా||
మల్లెలనే తెచ్చి వెన్నెల లో పరిచి
తనకై నే ఎదురుచూస్తున్నా.
ఎక్కడ నే ఉన్నా ఏ పని చేస్తున్నా
తనధ్యాస లోనే బ్రతుకుతున్నా.
||కోయిలమ్మా||
సంధర్భం: ఇది షరామాములే ప్రేమలో ఓడిపోయిన ఓ అబ్బాయి కంటతడి..

ప్రేమనే ప్రేమిస్తే ఓటమే ప్రతిసారి
ప్రేమగా మనసిస్తే భాధలే మిగిలేవి
మనసుకోరే గమ్యం చేరనీడే దైవం
చెలిమి కోరే హృదయం అందుకోదే విజయం
||ప్రేమనే||
చీకట్లు కమ్ముకున్నా నిదుర నను చేరరాదు
కనులెంత మూసి ఉన్నా నీ రూపు మాసిపోదు
వెంటపడి వేదిస్తూనే జంట నే రానంటుంది
కంటతడి పెడుతూ ఉంటే కొంటేగా నవ్వుతుంది.
||ప్రేమనే||

ఏంటి ఈ బోడి పాటలు మేము చదవాలా అనుకొన్నవారికి శతకోటి క్షమాపణలు. సర్లే చావు పో అనుకున్న వారికి నెనర్లు.

నేటికి నెరవేరిన మూషికవరం

ఆ ప్రకారంగా నైమిషారణ్యంలో సేదతీరుతున్న ఋషిపుంగవలకి అటువైపుగా వచ్చుచున్న శుకమహర్షి దర్శనం కలిగింది. అందరూ ఆ మహా భాగవతునికి సపర్యలు చేసి,స్తుతించిన పిమ్మట ఆ మహానుభావుని ద్వార కధాకాలక్షేపాన్ని ఆశించినవారై “స్వామీ! ఇది వరకు మానవమాత్రులెవరికి తెలియనిది, ఎవరికి ఎవరిచేత చెప్పబడనిది, ఇంకనూ దైవరహస్యముగానే ఉన్న వృత్తాంతమేమైనా ఉంటే ఈ సమయం లో మాకు చెప్పవలసినది” అని వినమ్రంగా ప్రార్దించారు. వారి సపర్యలకి సంతుష్ఠుడైన శుకమహర్షి చిరునవ్వు తో “తప్పకుండా చెబుతా. కానీ ఈ విపరీత కోరిక ఎందుకు కలిగింది నాయన?” అని అడిగారు.

ఇంతలో చిరు జల్లులు మొదలయ్యాయి. చంద్రబాబు హయాంలో ఆకస్మిక తనిఖీ లు, వైయస్ పాలనలో అకాల వర్షాలు తప్పవని అనుకుంటుంటే ఋష్యశృంగులవారు విచ్చేసారు. ఆ చిరుజల్లులు ఆయన రావటం చేత అని గ్రహించిన ఋషులు దేవునిపాలనను (అంధ్రప్రదేశ్ లో) అనుమానించినందుకు కించిత్తు చింతించి మిగిలిన కార్యక్రమాన్ని కొనసాగించేందుకు కుటీరాలలోకి పరుగు తీసారు.శుకమహర్షి తనకై ఉద్దేశించబడిన ఆసనం లో ఆసీనులయ్యాక ఋషులు సమాధానం చెప్పనారంభించారు.

“స్వామీ! మేము చదవని పురాణాలు, వినని వృత్తాంతాలు లేవు. ఆ కారణం చేత కొత్త కధలు వినాలన్న ఆరాటం లో మానవులలాగా సినిమాలకి అలవాటుపడ్డాం. ఈ మధ్య కాలం లో వస్తున్న తెలుగు సినిమాల్లో పాత్రలు తప్ప కధలు అంతరించిపోయాయి. సినిమాకి వెళితే చేతి చమురు వదులుతుందే తప్ప ఇసుమంతైనా కొత్త దనం లేదు. కధానాయకుల విన్యాసాలకు అంతులేదు. దేవదేవుడైనా సింహాసనం వద్దకి వెళ్ళి ఆసీనుడవుతాడు. కానీ తెలుగు హీరోల వద్దకే సింహాసనాలు పరుగెత్తుకొస్తాయి. సాక్షాత్తు భగవంతుడు రధసారధి గా వీరాధివీరుడు ఆర్జునుడు యుద్దానికి వెల్లినా కౌరవసైన్యం లో భంటు కూడా వెన్ను చూపలేదు. కానీ తెలుగు హీరో ని చూస్తే అరివీర భయంకరులు, మహా ముష్కరులు అయిన దుండగులు అస్త్రసన్యాసం చేసి పారిపోతారు. టైటిల్ పడక ముందే మలుపులు, పోష్టర్లు చూడగానే కధలు తెలిసిపోతున్నాయి కాబట్టి చిన్నదైనా ఒక కొత్త వృత్తాంతం కోసం మనసు పరిపరి విధాల తపిస్తుంది” అని తన సుదీర్ఘమైన ప్రసంగాన్ని ముగించాడు దిగులు ముఖంతో, గడ్డం సగం ఊడిన కుర్ర ఋషి.

ఋష్యశృంగులవారు విషయం అవగతమైన వారై  “మహర్షి! ఈ కుర్ర రిషి తన భాధని సుదీర్ఘంగా శేఖర్ కమ్ముల గోదావరి సినిమాలా సాగతీస్తూ వెల్లగక్కాడు.  తమరు మాత్రం ఎన్నాళ్ళు ఆ శ్రీ హరి కధలు చెబుతారు, బి.గోపాల్ బాలకృష్ణ తో వరసగా సినిమాలు తీసినట్టు. పాపం వీళ్ళ కోసం ఒక సరి కొత్త కధ చెప్పండి.” అని వివరించారు. శుకమహర్షి చిరునవ్వుతో చెప్పనారంభించారు.

పూర్వం ఒకానొక మహారణ్యంలో జంతువులన్నీ ఒక గొప్ప ఉత్సవాన్ని జరుపుంటున్నాయి. ఆ ఉత్సవంలో లేని వింతలు,విశేషాలు లేవు. ఆ ఉత్సవానికి దేవతల వద్ద ఉండే జంతువులని, మృగాలని పిలిచారు. వీరిని సంతోషబెట్టి తమపనులు దేవతలకి వీరిద్వారా విన్నవించవచ్చని ఆలోచన. విందులు, వినోదాలు ఘనంగా జరుగుతున్నాయి. సురాపానం (అదే లెండి కల్లు తాగాయి) చేసిన జంతువులన్నీ పిచ్చి ఆననదంతో గెంతులు వేస్తున్నాయి.అతిధులుగా వచ్చిన జంతాగ్రేసరులనందరినీ ఘనంగా సత్కరిస్తున్నారు. సింహాలని, పులులని, ఏనుగులని అలా అందరిని ఘనంగా సత్కరించారు. తన సకల పరివారం తో సహా వేంచేసిన మూషికరాజుని మాత్రం ఎవరూ గుర్తించలేదు.

దానితో తన పరివారం ముందు జరిగిన అవమానాన్ని భరించలేని మూషికరాజు ఆగ్రహంతో ఊగిపోతూ “లోకంలో ప్రధమ పూజ్యుడు, విఘ్నరాజు వాహానాన్ని నేను. ఆ మహాదేవుని కి సమస్త లోకాలని చూపేది నేనే. మరి నేను లెజెండ్ ని కాదా? ఇప్పుడే తేలిపోవాలి ఎవరు లెజెండు, ఎవరు సెలబ్రిటీ?”

ఇంతలో ఎవరో వజ్రోత్సవాలు అయిపోయాక మోహన్ బాబు గారిని అడిగి చెబుతామన్నారు.

“మీరు పుస్తకాలు అచ్చేసే వరకు ఆగే ఓపిక లేదు. ఇప్పుడే తేల్చండి.”

అప్పుడు అక్కడుండే జంతువులన్నీ అవహేళన చేసాయి. ఎవరూ లెక్క చేయలేదు. “నీకు అంత గౌరవం కావాలంటే నీ ప్రభువినే అడుగు పో. ఇన్నాళ్ళు  మోసినందుకు ఆయన నీకు ఏమాత్రం గౌరవమిస్తారో చూస్తాం” అని హేళన చేసాయి. ఆ ఆగ్రహంతో మూషికరాజు తన పరివరానికి అక్కడ ఉత్సవాన్ని నాశనం చేయమని ఆదేశించి సరాసరి వినాయకుని వద్దకు వెల్లింది.

జరిగినది మొత్తం చెప్పి “తమరు లోకంలో ఉన్న భక్తులందరి కీ వరాలు ఇస్తారు. ఇన్నాళ్ళుగా నాకు మాత్రం ఒక్క వరం కూడా ఇవ్వలేదు. ఈ రోజు వరం ఇచ్చి తీరవలసినదే” అని పట్టుబట్టింది. కాదనలేని స్వామి కోరుకోమన్నాడు.

“ఇకనించి తమరు పూర్తిగా నా మీదే ఆధారపడి ఉండాలి. ప్రపంచం మొత్తం నా మీదే ఆధారపడి నడవాలి. నన్నందరూ అందలమెక్కించాలి. నేను లేకపోతే ప్రపంచం లో పనులన్నీ ఆగిపోవాలి.” అని ఆవేశంతో చుంచు గోల చేసింది.

స్వామి ఇరుకున పడ్డాడు. కాదంటే రేపటినుంచి నిర్వాహనుడయిపోతాడు. హోండా లు, ఆడీలు వాడేంత ధనవంతుడు కాడు. భిక్షాటన చేసే తండ్రి, ఇల్లేమో శ్మశానం. ఇప్పుడు వాహనంకూడా లేకపోతే సాటి దేవతల ముందు పరువుపోతుంది.

“సరే మూషికా, అట్లే కానివ్వు. వరం ఇస్తున్నా తీసుకో. నీవు కోరినట్టు కలియుగంలో ప్రపంచం మొత్తం నీ ఆకారపు మూర్తులని చేపట్టి నీ మీదే ఆధారపడి నడుస్తుంది. ఇకపోతే నాకు ఎలాగూ నీవే ఆధారం. కాబట్టి ఇకపైన  నీ మూర్తులని చేపట్టిన మానవులు నా వంటి రూపాన్ని పొందుతారు. అనగా బానపొట్ట తో నా వలెనే కనిపిస్తారు. కావున నేనే నీ పై ఆధారపడినట్టు నీకు సంతృప్తి కలుగుతుంది.” అని వరమిచ్చాడు. ఈవిధంగా కధని పూర్తి చేసి శుకమహర్షి, ఋష్యశృంగులు సెలవుతీసుకొని వెళ్ళిపోయారు.

అదండీ సంగతి ఆ వరం వల్ల ప్రపంచం ఈ రోజున మౌస్ మీద ఆధారపడి నడుస్తుంది. మౌస్ చేతపట్టిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకి పొట్ట సంక్రమించింది. ఈ విషయం తెలీక నానా హైరానా పడి మా వాళ్ళు జిమ్ము లనీ, యోగా అనీ చాలా చేస్తారు. అయినా ప్రయోజనం లేదు. పై పెచ్చు ఈ టెన్షన్ వల్ల జుత్తు ఊడిపోవడమనే కొత్త సమస్య. అందుకే ప్రియతమ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు జరగాల్సిందే జరుగుతుంది. మీరు అనవసర హైరానా పడకండి. జై మూషికా జై జై మూషికా అని సరిపెట్టుకోండి..

హ హా హాసిని

కొన్నేళ్ళ క్రితం శంకరాభరణం సినిమా వచ్చిన కొత్తలో వయస్సు మళ్ళిన తాతగార్లంతా “స రీఈఈఈఈఈఈ గాఆఆఆఆఆఆఆఆ మాఆఆఆఆఆ” అంటూ బ్యాటరీ అయిపోయిన రేడియోలా రోడ్లమీద ‘ఖూనీ’రాగాలు తీస్తూ హీరోల్లా ఫోజులు కొట్టారంటా. (నాకు తెలియదులెండి నేనప్పటికి పుట్టి చావలే.ఎవరో చెప్పగా విన్నా.) ఆ తరువాత సోగ్గాడు శోభన్ బాబులు, దసరా బుల్లోల్లు, సకల వాహన చోదకులు (ఆటో డ్రైవర్,లారీ డ్రైవర్ తదితరులు), గూండాలు,రౌడీలు అంతెందుకు నిన్న కాక మొన్న జె.డి.చక్రవర్తి ని చూసి గెడ్డం గాల్లు, నిన్నటికి నిన్న ఆర్య సినిమా చూసి ఒకవైపు ప్రేమికులు అందరూ సినిమాలు చూసి తమని తాము సినిమాలో హీరో గా గుర్తించేసుకొని, ఫోజు కొట్టిన వారే. ఇప్పుడింక మరొకరు తయారయ్యారు. వాళ్ళే హ హ హాసిని లు. బొమ్మరిల్లు,JOB WE MET సినిమాల పుణ్యమా అని లొడ లొడ వాగే వాగుడుకాయలు, పిచ్చి పనులు చేసే టింగరి బుచ్చిలు, మనుషుల పరిమాణం పెరిగినా మెదడులో పరిఙ్ఞానం లేని చవట దద్దమ్మలు ఫోజులు కొట్టేకాలం దాపురించింది. ఇంక అరుదుగా దొరికే ఈ జాతి అమ్మాయిలని తమ ఆడస్నేహితుల జాబితా లో చేర్చుకుంటే ఉన్న పళంగా తాము కూడా సిద్దు అనిపించుకోవచ్చని ఆరాట పడే చవట సన్నాసులంతా అమీర్ పేటలో ఐసుబండ్ల దగ్గర, టాంక్ బండ్ పైన పీసు మిఠాయి కొట్ల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. మన హాసినీలు మాత్రం every dog has it’s day. టైం వచినప్పుడే ఫోజు కొట్టాలన్న సూత్రం సిన్సియర్ గా ఆచరిస్తూ తమ చీముడి ముక్కులు ఎగబీలుస్తూ, షోడా బుడ్డీ కళ్ళ జోళ్ళు సవరిస్తూ ఫ్యాషన్ షో చూపిస్తున్నారు. మన సన్నాసులు ఆ మెల్ల కళ్ళలో అందాన్ని పొగుడుతూ, ఆ జడ్డి నవ్వు కై పడి చస్తున్నారు. (అరెరే అరెరే మనసే జారే…, ఎటో వెళ్ళిపోయింది మనసు…)
హు.. ఈ మధ్య నాకో హాసినితో పరిచయం పొందే మహద్భాగ్యం (?) దక్కింది. (కాకపోతే నేను సిద్దు ని కాను. కాదు కూడదు అనుకుంటే భాస్కర్ గా గుర్తించ ప్రార్ధన.) ఈవిడగారెమన్నా తక్కువతిన్నారా? సినిమాలో హాసిని కంటే నాలుగు నాలుగులు పదహారాకులు ఎక్కువ చదివింది. అర్ధరాత్రి టాంక్ బండ్ పైన షికారని వెళ్ళటం, తరువాత భయపడి స్నేహితులని పిలవటం, రైల్లోనో, బస్సులోనో పరిచయమయిన అడ్డమయిన వాళ్ళకి పూర్తి బయొడేటా, మొబైల్ నెంబరు తో కలిపి ఇవ్వటం, తర్వాత తంతు షరామాములే వచ్చే కాల్స్ మాట్లాడలేక నెంబరు మార్చటం, రాత్రి 9 గంటలకి అనగా భోజనానికి 10 నిమిషాల ముందు దుకాణం మొత్తం కట్టేసి వెళ్ళిపోతున్న టీకొట్టువాన్ని పారిపోకుండా పట్టుకొని ఆపి టీ నో కాఫీ నో త్రాగటం ఇంకా.. ఒక్క క్షణం దాహంగా వుంది మంచి నీళ్ళు త్రాగి వస్తా. హమ్మయ్య..ఇంకా ఆటో అంకుల్లు, ఆఫీసులో సెక్యూరిటీ గార్డు ఫ్రెండులు, అప్పుడప్పుడూ చూడటానికి వచ్చి వెళ్ళే  తుమ్మ మొద్దులాంటి పెళ్ళికొడుకులు ఇవన్నీ కలిపితే మా సదరు అప్పలమ్మ గారి వైభోగం లో సగం కూడా కాదు. అందుకనే మొదలుగునవి అని చివర్లో మీరే పెట్టేసుకొని నన్ను క్షమించేసుకోవలసినది గా ప్రార్ధన.
ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడని ఆ మనిషి మా వూరే అని తెలిసి మాట్లాడా. మొదట్లో ఆఫీసుకి వెళ్లే తొందరలో టిఫిన్ తినే వాడిలా అరకొరగా మాట్లాడేది. అమ్మాయి నెమ్మదస్తురాలేమో అనుకున్నా. ఒకరోజు అత్యవసరం ఉండి ఫోన్ చేసా. కాసేపటికి మొహమాటం అనే బూజు వదిలిపోయి తన జూలు విదిల్చింది. రాత్రి 10.30 కి మొదలయ్యి తెల్లవారి 3 గంటల వరకూ కొనసాగిన ఏకపక్ష చర్చల్లో (చర్చలు అని ఎందుకన్నా అంటే ఊ.. కొట్టడం, కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పటం నా క్రియాశీలక ప్రాతినిధ్యం గా గుర్తించాలి మీరు. ) నాగురించి అన్ని విషయాలు తెలుసుకొని, తన గురించి కొన్ని విషయాలు మాత్రం చెప్పి వాళ్ళ హాస్టల్ లో మరుసటి రోజు కూర వండటానికి తెచ్చిన కోడి కూసేసిందని పడుకోవాలని తొందరపడి ఫోన్ పెట్టేసింది. తరువాత కొన్ని రోజుల పాటు యధాలాపంగా అంతే సమయం జరిగిన ప్రసంగాల్లో (నా క్రియాశీలక ప్రాతినిధ్యం పూర్తిగా అణిచివేయబడిందని ఈ పాటికి గుర్తించే ఉంటారు.) తన గురించి ఒక మాదిరి అవగాహన ఏర్పడింది. అలా రోజులు ఇడ్లి(మా హాస్టల్ ఎల్లారావు వండే సగం ఉడికిన తెల్ల పిండి ముద్దలు) లో సాంబారులా త్వరగా అయిపోయాయి.

కాలచక్రం గిర్రున తిరిగి ఉగాది కి ఇంటికి బయలు దేరాను. మా హాసిని కూడా ఊర్లో పనుందని బయలు దేరింది. ఆప్రకారంగా నేను తనకూడా ప్రయాణం చేసే దుస్సాహసం చెయ్యాల్సి వచ్చింది. సాహసవంతుడు మొండి గా ముందు కి వెళ్తాడు. కానీ నేను ఒక మోస్తరు గడుసువాడ్నే. అందుకే నా స్నేహితుడ్ని తోడుగా తీసుకువచ్చా. అప్పటికే టిక్కెట్ నా దగ్గర ఉంచుకొని చివరి నిమిషంలో రన్నింగ్ లో రైలు ఎక్కినందుకు, నేను రాకముందే మొదలు పెట్టిన తిట్లదండకం కొనసాగించింది. చుట్టూ కూర్చున్న జనాలు తన వాక్ప్రవాహాన్ని గమనించి, అప్పుడే మొదలయిన కొత్త సినిమాని చూస్తున్నంత ఆసక్తి గా చూడటం మొదలు పెట్టారు. కాసేపటికి అర్ధంకాని ఆంగ్ల చిత్రం చూస్తున్నట్టు మొహాలు మారాయి. రైలు గుంటూరు చేరే సరికి జనాల గుండె దైర్యం సడలింది. విజయవాడ వచ్చేసరికి దూరదర్శన్ లో బలవంతంగా బదిరులకి వార్తలు చూపిస్తున్నట్టుగా జనాల్లో కొంచెం కలకలం. వాళ్ళ ధైర్యం పరీక్షించటానికా అన్నట్టూ బ్రిడ్జ్ మీద ట్రైన్ ఆపేసాడు. విజయవాడ లో దిగాల్సిన జనాలు తమ సామాన్లతో అప్పటికే తలుపు దగ్గర కాచుకొని ఉన్నారు. ఆ అవకాశాన్ని దూరం చేస్తూ  ట్రైన్ మరోసారి ఆపేసాడు. అంతే ఒకరిద్దరు కృష్ణ లో దూకటానికి సిద్దపడ్డారు కానీ ఆ కనకదుర్గమ్మ దయవల్ల అప్పటికే ఆకలి అంటున్న మా హాసిని కాస్త విరామం ప్రకటించింది. ట్రైన్ స్టేషన్ కి చేరుకోగానే గబాలున దూకేసిన ఒక కుర్రాడికి గాయమైనా సరే ప్రాణాలు మిగిలినందుకు ఆనందపడ్డాడు. అందరూ ట్రైన్ వైపు ఒకసారి  దుర్గమ్మ గుడి వైపు ఒకసారి చూసి దండాలు పెట్టుకొని బ్రతుకు జీవుడా అని బయట పడ్డారు. మా పక్కనే కూర్చున్నాయన మాత్రం దిగినవారి అదృష్టం మెచ్చుకొని తన దౌర్భాగ్యానికి తిట్టుకొని నిద్ర కి ఉపక్రమించాడు. విజయవాడ వరకు మా హాసిని వేరే స్నేహితునితో మాట్లాడింది. నేను మహాసముద్రం నవల చదువుతూ గడిపేసా. అప్పుడిక నా తో మాటలు మొదలు పెట్టింది. మా ప్రక్కాయన పాపం మధ్యతరగతి లా వుంది. పీనుగులాంటి భర్త, ఒక మోస్తరు ఏనుగు లాంటి భార్య, ముద్దుగా బొద్దుగా కళ్ళద్దాలు పెట్టుకున్న ఒక మాదిరి కూతురు. పాపం ఆ కుటుంబం మొత్తం ఎవో బరువు భాద్యతలు మోస్తున్నట్టుగా భారంగా ఉన్నారు. ఆ పాప ట్రైన్లో కూడా క్లాస్ నోట్సులు చదువుకుంటుంది. అలాంటి వారికి ఒకేసారి హాసిని లాంటి వారు తగిలితే ఎలా వుంటుంది. కుటుంబ భవిష్యత్తు పై బెంగ పడిన అంకులు శివాలెత్తి తనకొచ్చిన ఆంగ్లభాష లో అర్ధగంట ఉపన్యసించి మా హాసినిని మందలించి పడుకొనేదాక ఊరుకోలేదు. వాడి దెబ్బకి పడుకున్న మా మేడం గారు ఉదయం వరకు లేస్తే ఒట్టు.

ఇంక మేము తెల్లవారే విజయనగరంలో దిగాము. టిఫిన్ చేద్దామని ఒక హోటల్కి వెళ్ళాము. మా దౌర్భాగ్యానికి అక్కడ ఒక ముసలాయన ఈవిడ్ని పలకరించి ఊరు,పేరు అడిగాడు. అంతే మాటలు మొదలు. సమయం సబ్బులా కరిగిపోతున్నా చలనం లేదు. మాతో వచ్చిన స్నేహితునికి ఈ వైపరీత్యం చూసిన తరువాత కళ్ళు తిరిగిపడబోయి కాస్త తమాయించుకొన్నాడు. నేనసలే ఢక్కమొక్కీలు తిన్నవాడ్ని కాబట్టి నాకేం కాలేదు. ఇంతలో పాస్ పోర్ట్  ఆఫీస్ కి వెళ్ళాము. ఆ రోజు ఆఫీస్ కి సెలవు. అప్పటికే కాళ్ళు పీకి అక్కడే కూలబడ్డాం. కూర్చోగానే ఓపికొచ్చి మరలా ఎదో ఒకటి మాటలు మొదలు పెట్టింది. మా వాడు దణ్ణం పెట్టి ఒక చెట్టు కిందకెల్లి పడుకొన్నాడు. పాపం ఒక సాఫ్ట్ వేర్  ఇంజినీర్ అలా చెట్టు కింద పడుకుంటే చాలా జాలేసింది నాకు. మా అమ్మాయిగారు కాస్తా తిరిగి వస్తా అని వెల్లింది. కాసేపటికి  ఒక చోట గుంపుగా తయారయ్యింది. ఈవిడగారు ఎదో చేసిందని భయపడ్డా. కానీ అక్కడున్న పోలిసు అంకుల్లతోనూ, అన్నయ్యల తోనూ కబుర్లు మొదలు పెట్టింది. సదరు గుంపు లో ఒక అన్నయ్యకి తన మొబైల్ ఇచ్చి చార్జింగ్ పెట్టమంది. మా వాడి కి ఈ విషయం తెలిస్తే కింద పడే వాడే కాని పడుకొని వుండటం వల్ల తెలియలేదు. నేను అబ్బే ఇలాంటి విషయాలకి జడిసే రకం కాదు. మా వాడు లేచాడు ఈవిడగారు కూడా సమావేశం ముగించి వచ్చింది. ఇంతలో ఒక పోలిసంకులు వచ్చి “నాన్నా ఈ రోజు సెలవు కదా రేపు వస్తే నీ పాస్ పోర్ట్ పని నేను చేయిస్తా. సరే రా ఎస్.పి. గారి తో పనుంది నేను ఉంటా” అని చెప్పి వెళ్ళిపోయాడు. మా వాడికి లీలగా ఏం జరిగిందో అర్ధమవుతూ ఉండగానే ధబ్ మనే శబ్ధంతో కిందపడ్డాడు. మరలా గుండె దిటవు చేసుకొని లేచాడు. ఇంతలో ఒక పోలిసు అన్నయ్య “నీకు ఫోన్ వచ్చింది రా..” మరలా ధబ్. ఇక నావల్ల కాదని బస్ స్టేషన్ కి లాక్కొచ్చా ఇద్దర్నీ. ఇచ్చట రిజర్వేషన్ చేయబడును అనే బోర్డు బస్ స్టేషన్ లో చూసి మేడం గారు  గోదావరికి రిజర్వేషన్ అడిగారు. లౌడ్ స్పీకర్ లో ధబ్. పాపం ఆ టికెట్ కౌంటర్ వాడు కింద పడ్డాడు. వాడి వెదవ జీవితం లో ఊహించి ఉండడు బస్ స్టేషన్ లో ట్రైన్ టికెట్ అడుగుతారని. నేను మాత్రం మా వూరి మధ్యలో ఉన్న తాండ్రపాపారాయుడి విగ్రహంలా ధైర్యంగా ఉన్నా. బొబ్బిలి బస్ వచ్చింది ఎక్కాం. ఖాళీ లేక మధ్యలో నిలబడ్డాం.  మేడంగారు ఇంజను పైన కూర్చున్నారు. ఈ లోగా మరో ధబ్. మా వాడే ముచ్చటగా మూడోసారి పడ్డాడు. ఎమయ్యిందబ్బా అని చూస్తే ఈవిడగారు డ్రైవరుతో మాటలు మొదలు పెట్టింది. ఈ గ్యాప్ లో డ్రైవర్ గారు చిన్న ప్రమాదాన్ని తృటిలో తప్పించారు. బస్సులో ఉన్న అంత మంది ప్రాణాలని దృష్టిలో పెట్టుకొని మేడం ని నాలుగు తిట్టి, చీవాట్లు పెట్టి నోరుమూసుకొని వుండమని గట్టిగా చెప్పి ఒక సీటు ఖాళీ అయితే అందులో పడేసాం. హమ్మయ్యా అని నేను,నా ఫ్రెండు ఊపిరి పీల్చుకున్నాం. ఇంతలో ఎవరివో మాటలు వినబడి అటు చూసా ఇంకేముంది ఈవిడే నిలబడి ఉన్న ఒకమ్మాయి కి చోటిచ్చి మాటలు మొదలు పెట్టింది. ధబ్ నా ఫ్రెండ్. ధబ్ ధబేల్ ధబ్ ఇంకెవరు నేనే.

ఎంతనుకున్నా సరే ఇలాంటి గమ్మతైన స్నేహితులు, స్మృతులు లేకపోతే నిత్యం సంఘర్షణతో సాగే జీవితం మరీ ఉప్పూ,కారం లేని వంట (మంట, పెంట కూడా) అయిపోదూ. అందుకే అందుకోండి హ హా హాసినీ లు జోహార్లు.

హ్యపీడేస్

నేను B.Sc. చదివే రోజుల్లో హ్యాపిడేస్ సినిమా లానే ఒక గ్యాంగ్ లా వుండేవాల్లం. దావుద్ D లాగా మేము కూడా మొదటి అక్షరాలతో MTS అని గ్యాంగ్ పేరు పెట్టుకున్నాం. ఏం చేసినా,ఎంత అల్లరి చేసినా? ఎవరికి దొరికేవాల్లం కాదు. మేము ప్రతిసారి పేపర్ లీక్ చేస్తున్నామని (PUBLIC exams కాదండొయ్) మా ప్రిన్సిపల్ దగ్గర నుండి, ప్యూన్ రమణ వరకు అందరికి మా మీద అనుమానం. మా క్లాస్మేట్స్ కైతే ఎలా అయినా మమ్మల్ని పట్టించాలని, మమ్మల్ని పొగిడే సార్స్ చేత తిట్టించాలని వాళ్ళ జీవితాశయం. అబ్బో అప్పట్లో మా ఇంటి చుట్టూ నిఘాలు, గూఢచారులు చాలా చేసారు. మేము చదువుతూ ఉండగా, ముఖ్యమంత్రి ఆఖస్మిక తనికీ కి వచినట్టు వచ్చి మా పుస్తకాలు పరిశీలించటం, అందులో పెన్నుతో మేము నక్షత్రం గుర్తులు పెట్టిన ప్రశ్నలు రాసుకొని వెల్లటం ఎన్ని చేసినా ఊహూ.. ప్రయోజనం లేదు. సూత్రధారిని నేనే అయినా పాత్రధారుల ఆచరణ అమోఘం. ముఖ్యంగా మా శ్రీనుగాడు. వాడి నట చాతుర్యానికి ఆస్కారులు, పురస్కారాలు ఎన్ని అయినా తక్కువే.

ఒకసారి ఎలా అయినా మా గుట్టు బయటపెట్టాలని ఒక మిత్రుడు, శ్రీనుగాడి ఇంటికి సాముహిక విద్యాభ్యాసం కోసం వచ్చి కూర్చున్నాడు. అప్పటికే పేపరు తెచ్చుకొని ఇక చదవటం మొదలు పెడదాం అనుకొన్న శ్రీనుగాడికి, శని షేక్ హ్యాండు ఇచ్చినట్టు, గొంతులో పచ్చి పనసకాయ పడ్డట్టూ అయ్యింది. నువ్వు చదువుతూ ఉండు నేనిప్పుడే వస్తా అంటే లేదు నేనూ వస్తా అంటాడు. పోని కాసేపు ఆగి రా రా, నాకు ఇప్ప్పుడు చదివే ఉద్దేశ్యం లేదంటె, ఏం పర్వాలేదు ఇక్కడే ఉంటా కాసేపు ఆగి చదువుదాం అంటాడు. ఆఖరికి బాత్రూం అని చెప్పి కిందకి వచ్చి నాకు ఫోన్ చేసి రమ్మన్నాడు. నేను వస్తే మొత్తం సీను అర్దమవుతుంది నువ్వే ఎదో చెయ్యి అన్నాను.

రాత్రి వరకు ఓపికగా ఉన్న శ్రీనుగాడికి, కోపం వచ్చి ఏం చెయ్యాలో తెలియక ఏడ్చి పడుకున్నాడు. వచ్చిన మిత్రుడు చక్కగా అర్ధరాత్రి వరకు చదువుకొని పడుకున్నాడు. అంతే అంత వరకూ పడుకున్నట్టు కలరిచ్చిన మా శ్రీనుగాడు చక్కగా లేచి పేపరు లో ఉన్న ప్రశ్నలు చదివి పడుకున్నాడు. ఎప్పటిలానే మాకే మంచి మార్కులు వచ్చాయి. మా మిత్రుడి ఆపరేషను ఆవిధంగా ముగిసింది, ఇరాక్ పై అమెరికా యుద్దం లా.

అసలు వీళ్ళందరికి ఒక విషయం అర్ధం కాదండి. పేపరు లీక్ చేసి చదవటం కంటే బుద్దిగా నోట్సులు చదువుకోవటం వీజీ అని. కాదంటే మీకు కొన్ని విషయాలు చెప్పాల్సిందే. పేపరు లీక్ చెయ్యడానికి పేపరు తయారు చేసే సార్ దగ్గర్నుండి, వాటిని ప్రింట్ చేసే ప్యూన్ వరకూ నిఘా పెట్టాల్సిందే. ఆ రోజుల్లో వాళ్ళ పూర్తి టైం టేబుల్ మనకి తెలియాలి. పరిస్థితుల బట్టి, చిత్తు కాగితాలు తుడిచే ఈశ్వరమ్మని కుడా ఇందిరా గాంధీ అంత గొప్పదానివని పొగడాలి. క్రిస్మస్ పండగకి కూడా దసరా మాములివ్వాలి. అర్ధరాత్రి టార్చిలైట్లు పట్టుకొని కాలేజి గోడలు దూకాలి. మచ్చుకి ఒక ఎపిసోడ్ చెబుతా.

BSc లో ఉన్నప్పుడు ఒకసారి Half yearly exams వచ్చాయి.. అందరూ కష్టపడి చదువుతున్నారు. మేము మాత్రం అలవాటు పడ్డ ప్రాణం కదా, చదవకుండా కాలేజి కి ఎదురుగా ఉండే పాత బిల్డింగ్ ఎక్కి కాలేజి మీద అరడజను కల్లేసి వుంచాం. మా మీద అనుమానం ఉన్న ప్యూన్ రమణ పేపరు ప్రింటు తీసి భద్రంగా దాచేసాడు. అన్ని గదులకి తాళాలు వేసారు. మరుసటి రోజు ఆదివారం కాలేజి కి సెలవు. ఎవరూ రారు. పనిమనిషి ఈశ్వరమ్మ కూడా ఆదుకోవటానికి, రాదు ఆదివారం కదా. కళ్ళ ముందు తెల్ల కాగితం కనబడుతుంది. ఇంక ఆశలన్నీ ఆవిరయిపోయాయి. అయినా చావో రెవో తేల్చుకోవాలి. కానీ ఎలా? కాలేజి లో అన్ని గదులకి తాళం వేసి ప్యూన్ వెళ్ళిపోయాడు.మా శ్రీనుగాడి లోని నటవిశ్వరూపం చూపాల్సిన అవసరం వచ్చేసింది. నా లోని దర్శకత్వ ప్రతిభ తోడయ్యి, మంచి ఘట్టం మొదలయ్యింది. శ్రీను గాడు ఆఫీస్ ముందు దిగులుగా ముఖం పెట్టుకొని కూర్చొన్నాడు. ఆ సీన్ మా వాచ్ మేన్ కంటపడాలన్నది మా ప్రయత్నం. వాడి పేరు అభిషేక్ బచ్చన్. ఎందుకంటే వాడి నాన్న కూడా ఒకప్పుడు వాచ్ మేన్, పొడుగ్గా ఉంటాడని అమితాబ్ అని పిలిచే వారు. అతని కొడుకు కావటం చేత, మంచి పొడుగు ఉండటం చేత ఆ పేరు వచ్చింది. వాడు మాత్రం వాడి పనిలో ఉన్నాడు గాని శ్రీనుగాడ్ని చూడలేదు. అప్పుడే అర్ధం అయ్యింది అమ్మాయి దృష్టి లో పడటమే కాదు, అవసరాల్లో వాచ్ మేన్ దృష్టి లో పడటం కూడా కష్టమని. అయినా శ్రీను పట్టువదలని గంగూలీ లా తన ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ ఒకమ్మాయి వచింది. ఖాళీ గా ఉన్న నేను, మా తారకగాడు ఆ అమ్మాయి తో కబుర్లు మొదలుపెట్టాం. కాసేపటి వరకు శ్రీనుగాడు మమ్మల్ని చూడలేదు. చూసిన తరువాత వాడి ముఖం చూడాలి, ఇవతల అమ్మయి తో మేము వాడ్ని పిలవకుండా మాట్లాడుతున్నామన్న భాద, పేపరు భాద. ఏడుపు ముఖం పెట్టాడు. అప్పటికే రెండు రోజులు గా ఇల్లు,తిండి నిద్ర మాని కాలేజి చుట్టూ తిరగటం వల్ల అందరి వాలకాలు రాళ్ళు కొట్టేవాళ్ళ లాగా ఉంది. చీకటి పడే వరకూ శ్రీను అదే ఫోజ్. మొత్తానికి మా మొర ఆలకించిన దేవుడు అప్పటికి వాచ్ మేన్ దృష్టిలో పడేట్టు చేసాడు.

ఇంక మా శ్రీనుగాడు నంది అవార్డ్ వచ్చిన ప్రకాష్ రాజ్ లా విజృంబించాడు. అభిషేక్ వచ్చి ఇంతవరకు ఎందుకున్నారని అడిగాడు.కళ్ళల్లో నీళ్ళు దించి, గుమ్మడిలా పూడుకు పోయిన గొంతుతో నా 10 సర్టిఫికేట్ పోయిందని చెఫ్ఫాడు. అభిషేక్ కనీసం కనికారం లేకుండా సోమవారం రమ్మని చెప్పేసాడు. మా వాడు తక్కువ తిన్నాడా? మనసంతా నువ్వే లో ఉదయ్ కిరణ్ లా రేపు నాకు ఇంటర్వ్యూ ఉంది సర్టిఫికేటు లేకపోతే ఉద్యోగం రాదని చెఫ్ఫాడు. మొత్తానికి కరుణించిన అభిషేక్ క్లర్క్ని తీసుకు వచ్చాడు. ఆఫీస్ రూం తాళం తీసి ఎక్కడన్నా పడిపోయిందేమో వెతుక్కోమని వదిలేసాడు. తలుపులు తీసిన వెంటనే ఆఫ్ఘన్ శరణార్దుల్లా లోపల దూరి మొత్తానికి డస్ట్ బిన్ లో ఉన్న చిత్తుకాగితాలన్నీ జేబులో పెట్టుకొని బయటకి వచ్చి ఆనందంగా దొరకలేదని చెప్పాం. క్లర్క్ పాపం బాగ ఫీలయ్యాడు. ఒక ఉత్తరం రాసి పెట్టాడు మా కోసం. “అయ్యా! నా పదవ తరగతి సర్టిఫికేటు పోయింది. అదిలేకుంటే నాకు ఉద్యోగం రాదు. కావున ఒక డూప్లికేట్ ఇప్పించ ప్రార్ధన.” కానీ మా పని జరిగి పోయిందని వేరే చెప్పాల?

ఒకసారి ప్రింటింగ్ బయట ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకి ఇచ్చారు. నిఘా వాళ్ళ ఇంటి మీద వేసాం. ప్రింటింగ్ ప్రెస్ ఓనర్ కూతురు ఒకబ్బాయి ని ప్రేమించిన విషయం మా పరిశోధనలో తేలింది. వాడికి ఒక బీరుబాటిల్ బేరం పెట్టి పని చెప్పాం. వాడు ఎంత ప్రయత్నించిన ఏం దొరకలేదు. చిన్న చిత్తు కాగితం ముక్క మాత్రం దొరికింది. అది తెచ్చి ఇచ్చాడు. ఊరికే ఇచ్చాడా? ఒక గొప్ప ఉపాయం చెప్పి మరీ ఇచ్చాడు. అది ఎంత గొప్ప ఐడియా అంటే “న్యూటన్ కి ఆపిల్ పడినప్పుడు వచ్చిన ఐడియా లాంటిది.” తిరగబడి ప్రింట్ అయిన ఆ కాగితాన్ని అద్దం లో చూస్తే మూడు ప్రశ్నలు కనిపించాయి. అదే వరస లో ప్రశ్నలు ఏ టెస్ట్ పేపర్ లో ఉన్నాయో వెతకమన్నాడు. అంతే మొత్తం సమస్య తీరిపోయింది.

ఇలాంటి ఎన్నో అద్భుత ఎపిసోడ్ లతో మొత్తానికి దొరకకుండా నిర్విఘ్నంగా డైలీ సీరియల్ లా మా కాలేజి పూర్తి అయ్యే వరకు కొనసాగించాం. అప్పుడే అసలు ట్విస్టు కొన్ని అనుకోని పరిస్థితులలో మా శ్రీనుగాడు మా కాలేజి లోనే లెక్చరర్ గా జాయిన్ అయ్యాడు. వాడి పేపర్ లీక్ అయ్యినప్పుడు తెలిసింది వాడికి భాద. మరుసటి పరీక్షకి తేలుకుట్టిన దొంగ లా వాడి పేపర్ ని వాడే ప్రింట్ తీసుకొని వాడి దగ్గరే ఉంచుకొని పరీక్ష టైం కి మాత్రమే తేవడం మొదలుపెట్టాడు. పాపం శ్రీను గాడు.

నేను 1000 దాటేసానోచ్…

హమ్మయ్య మొత్తానికి 1000 మైలురాయి దాటేసా. 8 టపాలు, 26 రోజులు 37 వ్యాఖ్యలతో మొత్తానికి ఏదో ఒకలా మొదటి మెట్టు ఎక్కేసా.
అయినా అంత వీజీగా అయ్యిందనుకుంటున్నారా? అసలు ఎన్ని భాధలు పడ్డానని. అప్పుడెప్పుడో ఈనాడు లో తెలుగు బ్లాగుల గురించి చదివినప్పుడు అనుకున్నా, ఎలా అయినా నేనూ ఒక బ్లాగు మొదలు పెట్టి తీరవలసినదే అని. ఎక్కడిదీ కుదిరి చస్తేనా. ఏదో ఆ మధ్య నేను పనిమాని Internet లో ఊసుపోని విషయాలన్నీ చదువుతున్నా అని నాకో వంక పెట్టి మా కంపెనీ వాళ్ళు నా స్కోర్ కార్డ్  గోవిందా అనిపించిన తరువాత గానీ ఖాళీ సమయం దొరకలేదు. ఒకసారి పార్కు లో పట్టుబడ్డ ప్రేమజంట భయం పోయి కళ్ళముందే తిరిగినట్టు, నేను కూడా ఈ మధ్య భయంపోయి కొంత సమయం దీనికి కేటాయించేసా. ఇంక వ్రాయటం మొదలుపెట్టిన తరువాత, నా చుట్టూ ఉన్నవాళ్ళ లో తెలుగు బ్లాగులు చదివే వాళ్ళు కాగడా పెట్టి వెతికినా దొరికి చావలే.
ఇంక లాభం లేదని దీన్నో ఉద్యమంగా భావించి మా వాళ్ళకి మెయిల్లు పెట్టి, క్లాసు పీకి నానా భాదలు పడ్డా. అసలు డి.ఎస్.సి. కోసం ప్రయత్నిస్తున్న వారి దగ్గర్నుండి, సాఫ్ట్ వేర్ వాళ్ళ దాక తెలుగు లోనా? అని దీర్ఘం తీసేవాళ్ళే. నాకు ఇంగ్లీష్ రాకే తెలుగు లో వ్రాస్తున్నా అని నిర్దారణ కి వచ్చేసారు. ఇంక నేను నా 10, ఇంటర్ లో వచ్చిన ఇంగ్లీష్ మార్కులు చూపించినా నమ్మరే అసలు. కొంత మందయితే ఇంకాస్త ముందుకి వెళ్ళి “సారీ బాస్ ! నాకు తెలుగు మాట్లాడటమే  తప్ప చదవటం రాదు ” అనేసారు.అయ్యో రామ. ఆంధ్రదేశం లో పుట్టి, పెరిగి, చదువు కూడా ఇక్కడే చదివిన మనవాళ్ళకి తెలుగు చదవటం రాకపోవడమేమిటండీ. చోద్యం కాకపోతే. స్కూల్లో మాకు తెలుగు లేదు అనేసారు. అవునులెండి సెలవు ఇవ్వకపోతే, మందుషాపులు మూయించక పోతే, గాంధీ జయంతి ని మరిచి పోయే రోజులు. ఇంక మార్కులకు పనికి రాని తెలుగు ఎందుకు నేర్చుకుంటారు? వీళ్ళ తో వేగటం నావల్ల కాదని, వీలుంటే తెలుగు చదవటం ఎలా అని ఒక బ్లాగు వ్రాస్తానని చెప్పి వచ్చేసా. ఇంక తెలుగు చదవటం వచ్చినవాళ్ళ దగ్గరకి వెళ్ళి నేనే బ్లాగు ఓపెన్ చేసి చదవమని చెబితే, మరీ ఇంత పెద్దపెద్దవి రాస్తే ఎలా అనేసారు. ఇంకొంతమంది పల్లీ-బటాణీ ని పిల్లిబటాణీ అని, ఇంకా వాళ్ళ పరిధి లో కొన్ని భూతులు చదివాక, ఇక తప్పదని వాళ్ళందరిని కూర్చోబెట్టి నేనే చదివి వినిపించాల్సి వచ్చింది. విని ఊరుకున్నారా? అబ్బే
“ఇవి నీ సొంతమా?”(అబ్బే లేదు. నా మొహం నాకంత సీన్ ఎక్కడిది, ఎదో అరవం సినిమా లోనివి.)
“ప్రేమలేఖ అంత బాగా వ్రాసావ్ కొంపదీసి ప్రేమలో పడ్డావా.” (లేదమ్మ మీ దయ వల్ల రోడ్డు మీద పడ్డాను.)
ఇంకా శతకోటి ప్రశ్నలు, జోకులు.

మొదటి 1000 కే ఇన్ని పాట్లు పడ్డాను. ముందు ముందు ఎలా నెగ్గుకు రాగలనో అంతా భగవంతుడి దయ.
నాకు సహకరిస్తున్న, విశ్లేషణలిస్తున్న బ్లాగర్లకి, మిత్రులకి ధన్యవాదాలు. సదా మీ సహకారం కోరుకుంటూ,

మీ
మురళీ.

జయ జయ జయహే

మినార్లు గోపురాలంత ఉన్నతంగా ఉండవు మా ఆలోచనలు.
మహల్లు ఆలయాలంత విశాలంగా ఉండవు మా హృదయాలు.
పువ్వులంత స్వఛ్ఛమైనవి కావు మా నవ్వులు.

బండరాళ్ళలోని అందాలని వెలికి తీస్తాంగానీ,
ప్రక్కవాడి కన్నీరు తుడవలేం.
దేశాలమధ్య దూరాలను చెరిపేస్తాం గానీ,
మనసుల మధ్య గోడల్ని కూల్చలేం.

అవును మాది యూగాలునిండిన చరిత్ర,
ధరిత్రి మెచ్చిన సంస్కృతి.