లోవెల్ ప్రాంతంలో బ్లాగు మితృలు ఉన్నారా?

నేను ప్రాజెక్ట్ పని మీద ఒక 6 నెలల పాటు ఉండటం కోసం నిన్ననే లోవెల్, మసా చూసెట్స్ వచ్చాను. ఈ ప్రాంతంలో బ్లాగు మితృలు ఉన్నారా?

2 comments మార్చి 8, 2009

ఏమయ్యింది నాకు?

ప్రపంచమంతా వేలంటైన్స్ డే పరిమళాల మత్తులో మునుగుతుంటే

నేను మాత్రం ఆటోలో నా బుర్రలోని ఆలోచనల్లా… 

అద్దాలషాపుల్లో గులాబీలు అందంగా అమర్చిఉన్నాయి

బ్లడ్‍బ్యాంకులో నెత్తురు సీసాల్లా… 

సెల్‍ఫోన్ తరంగాల్లో ప్రేమసందేశాలు

పంజాగుట్టలో ట్రాఫిక్‍లా…. 

గ్రీటింగ్‍కార్డుల్లో కవితలు అతికించి ఉన్నాయి….

జనాల పెదవులపై నవ్వుల్లా… 

నెక్లస్‍రోడ్డ్లులో జంటల కిలకిలలు

అక్వేరియంలో రంగుల చేపల్లా….. 

ఆలోచనలు సాగుతునే ఉన్నాయి

ఆటోమాత్రం ఆగింది మా ఇంటిముందు….

7 comments ఫిబ్రవరి 15, 2009

ఆంధ్ర తుంబురుడు అవతరించెను నేడు…

 జీవితంలో మనం ఎప్పుటికీ మరచిపోలేని రోజులు, క్షణాలు అందరికీ ఉంటాయి, ఉండాలి. నిన్నటి రోజు నా జీవితం లో ఒక మధురమయిన రోజు. నా చెవులకి పరిచయమున్న ఒక పాటని నా కళ్ళకి పరిచయం చేద్దాం అని వెళ్ళి, ఆ మకరంద స్రవంతిని నా హృదయం నిండా నింపుకున్నా. కానీ తన్మయత్వంలో నా హృదయాన్ని అక్కడే వదిలేసి వచ్చా. మరలా వెళ్ళి తెచ్చుకుందామంటే ఈ సారి ఆత్మనో, అస్థిత్వాన్నో వదిలేసి వస్తానేమోనన్న భయంతో ఆ ప్రయత్నం మానుకున్నా. మీలో ఎవరయినా గజల్ శ్రీనివాస్‌ని ఎరిగుంటే దయచేసి కాస్త నా హృదయాన్ని తెచ్చిపెట్టండి.

గాన గంధర్వుడు మ్యాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్

గాన గంధర్వుడు మ్యాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్

గజల్ శ్రీనివాస్ నిజానికి ఒక వేటగాడు. నిజం నమ్మరా? ఒక్కసారి అతన్ని కలిసి మాట్లాడండి మీకే తెలుస్తుంది. వెంటాడి, వెంటాడి భందిచేవాడ్ని వేటగాడు అనికాక పాటగాడని ఎలా అనుకోమంటారు? కాకపోతే వేటగాడు ఆయుధంతో వేటాడితే ఈయన తన గాత్రంతో, గజల్‌తో వెంటాడుతారు. అందుకేనేమో ఆయనే అన్నారు “నా గజల్‌కి కత్తికున్నంత పదునుంది కాదంటారా” అని. ఎలా అంటామండీ ఆయన గజల్‌కి రెండు వైపులే కాదు అన్నివైపులా పదునే. ఆ పదును తెలియాలంటే ఆయన స్వరంలో ఆయన సమక్షంలో కూర్చొని వినాల్సిందే. కాదు కాదు నాకు క్యాసెట్లు ఎక్కడ దొరుకుతాయో చెప్పండి, పదే పదే మీ వద్దకు రాలేనుగా అన్నా. పదే పదే వెళ్ళలేకపోయినా కాశీ వెళ్తే మాత్రం గంగలో ఒక మునక వేస్తాం. అదే ఇంటిముందు పారితే గుడ్డలుతుకుతాం కాదంటారా అన్నారు. ఏమంటాం నవ్వాపుకోవటానికి, ఆ మాటల్లో లోతైన భావాలను అర్ధంచేసుకుని తేరుకోవటానికే చాలా టైం పట్టింది. ఆయన మాటల్లో మనకి ఆయనలో ఉన్న తత్వవేత్త కనిపిస్తాడు. కానీ అది మన మనస్సులోకి చొప్పించే ప్రయత్నంచేయడు. తన గజల్‌లోని దాగి ఉన్న మర్మాన్ని మాటల్లో అందంగా అరటిపండు తొక్కతీసినట్టుగా వివరించి మన చేతిలో పెడతారు. ఆపైన ఆరగించని వాడు, అరిగించుకోని వాడు శుద్ద వెధవాయి అని నే వేరేగా చెప్పాలా?

ఆయన మాతో మాట్లాడుతున్నప్పుడు ఏది మాటో ఏది పాటో తెలియలేదు. ఎందుకంటే ఆయన మాటలు, పాటలు మమేకమయిపోయి ఆ గాత్రం లో ఏంవిన్నా మాకు శ్రావ్యంగానే ఉంది. పైగా బొత్తిగా సంగీత ఙ్ఞానం లేదాయే. నావరకు చెవులకి ఇంపయినది ఏదయినా సంగీతమే ఆయన మాటయినా, పాటయినా. పైగా పాట అంటే స్వరాలు, అనుస్వరాలు, సంగతులు కాదు. సాహిత్యాన్ని స్పష్టంగా శృతిలో శ్రావ్యంగా సామాన్యునికి అర్ధమయ్యేలా ఉండాలి అంటారాయన. ఆయన చెప్పేది ఒక్కటే తాన్‌సేన్‌లా రాగాలాపన చేయండి, లేదా వాగ్గేయకారుల్లా కీర్తనలు పాడండి. అంతేగానీ మహానుభావుల సంకీర్తనలను రాగాలతో కలిపి ముక్కలు చేసి, సాగదీసి హింసిచవద్దు. బొత్తిగా స్వర ఙ్ఞానం, సంగీత ఙ్ఞానంలేని నాకు కూడా ఆయన భావం అర్ధమయ్యింది, తిరిగి వ్రాయగలుగుతున్నా. అది ఆయన మాటల్లో వివరణలో ఉన్న శక్తి, సామాన్యుని హృదయానికి సహితం పట్టుకుంటుంది. అందుకేనేమో ఆయన అంటారు పిల్లల్ని ప్రతి తల్లిడండ్రులు బుర్రతో చదవమంటారు కానీ దయచేసి ఇకనుండి హృదయంతో చదవమని చెప్పండి అని. పిల్లలు అంటే ఆయనకి ఎంత ప్రేమో నిన్న ఆయన్ని చూసాక అర్ధమయ్యింది. మాతో మాట్లాడుతూనే, మధ్యలో వచ్చిన వాళ్ళ పాపని ముద్దు చేస్తున్నారు. తన వారసురాలింక ఆ పాపే, పేరు సంస్కృతి. నేటి ఆధునిక సమాజంలో పెద్దలు పిల్లలతో ఎంత సమయం గడుపుతున్నారో ఆలోచించుకోండి అని సూటిగా ప్రశ్నిస్తారాయన. రోజులో పిల్లలతో మాట్లాడేది కేవలం గంట సమయమే అయితే 16-20 ఏళ్ళల్లో ఎన్ని గంటలు గడపగలం? అటువంటప్పుడు ప్రేమాభిమానాలు ఎలా ఉంటాయి అంటారు. బయటకి వచ్చి మాకు వీడ్కోలు పలికి తిరిగి వెళ్తూ అక్కడ ఏడుస్తున్న ఎవరో చంటి పాపని బుజ్జగించి ఇంటిలోకి వెళ్ళరాయన. అదిచూసి అనిపించింది మాటల్లో ఏం చెబుతారో అది ఆచరించే వ్యక్తి అని.

మాటల్లోనే కాదు పాటల్లో ఏం చెబుతారో అదికూడా ఆచరిస్తారు. ఎప్పుడో జనాభా నియంత్రణ గురించి పాట పాడిన ఆయన అది తనజీవితంలో విధిగా ఆచరించి చూపించారు. అందుకే ఒక్క సంతానానికే పరిమితమయ్యారు. ఆయన అమ్మ గజల్‌తో, అమ్మ ని అమ్మగా ప్రతీ ఆంధృనికీ పరిచయం చేసేదాక నిదుర పోలేదు. నాన్న గజల్‌తో, తెలుగునాట ప్రతి తండ్రీ పూజింపబడేలా చేసారు. తెలుగు గడ్డని వదిలి వెళ్ళిన తెలుగు వాడ్ని “ఓనమాలు దిద్దిన బడి శిధిలమవుతూ, నిన్ను సెలవడిగింది” గజల్ తో పిలిచి, ఆ రాముని గుడి, నీవు నడిచిన వీధిరోడ్డు నీ క్షేమం అడిగాయని కలవరపరచి ప్రవాసాంధ్రులను ఇంటికి రప్పించారు. జీవనసమరంలో పట్టణాలకు వలసపోయిన నాలాంటి వారిని కూడా విడిచి పెట్టలేదు “ఒక్క సారి ఊరుపోయి రా” అన్న గజల్‌తో తెలియని అలజడి కలిగించారు. తెలుగువాడి సంస్కృతి, సంప్రదాయాల్లో,జీవన విధానంలో ఆయన గజల్ స్పందించని అంశాలు గానీ, స్పృశించని పార్శ్వాలు గానీ లేవేమో? ఎంత చిన్న విషయమైనా కూడా వదిలిపెట్టలేదు. ఎలా అంటే “ఇల్లు ఇల్లు లానే లేదు, తను ఊరినుండి ఇంకా రానేలేదు” అన్న గజల్లో భార్య ఊరికి వెళ్తే ఎలా ఉంటుందో కళ్ళకి కట్టేలా వినిపిస్తారు. తెలుగు సంకీర్తనల కోసమే వెంకన్న అన్నమయ్యని పుట్టిస్తే, తెలుగు సంగీత, సాహిత్యాలు సామాన్యుని ఆర్తిని,జీవన శైలిని పూర్తిగా తమలో ఇముడ్చుకోలేకపోతున్నాయని సాక్షాత్తు శారదాదేవే ఈ సరస్వతీపుతృన్ని మన తెలుగునాట పుట్టించిందేమో? పాట గొంతుతో కాదు ఆత్మతో పాడాలంటాడు ఆ గానగంధర్వుడు. సామాన్యుని జీవితాన్ని ఇంకా పూర్తిగా ఆవిష్కరించలేకపోయానని ఆయన చెబుతున్నప్పుడు శూన్యంలోకి చూస్తున్న ఆయన కళ్ళలో ఒక నిరంతర శోధన కనిపిస్తుంది మనకి. సామాన్యుని ఆర్తి,భక్తి మన తిరుపతి వెంకన్నని కదిలించిందో లేదో గాని శ్రీనివాస్‌ని కరిగించింది. అందుకే ఆయన ఆర్తితో, ఆత్మనివేదనతో శ్రీ శ్రీనివాసం క్యాసెట్ రూపొందించారు. “పొడగంటి మయ్యా మిము పురుషోత్తమా..” అనలేని సామాన్యుని కోసం “ఒక్కసారి రావాలని స్వామీ ఎన్నాళ్ళుగ పిలుస్తుంటి స్వామీ. వేడి వేడి అన్నంలో వెన్నపూస వేసిస్తా, ఆవకాయతో కలిపి గోరుముద్ద తినిపిస్తా” అని పాడి సామాన్యుడి ప్రార్ధన ఇలానే ఉంటుంది. కేవలం అన్నమయ్యదే ఆత్మనివేదనకాదు ఎందరో సామాన్యులదీ ఆత్మనివేదనే వారి భావాలు కూడా స్వామి వింటాడు అని చెబుతారు.

అందుకే ఆయన్ని డాక్టరేట్లే కాదు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా వరించాయి. వీటి గురించి చెప్పటం నా వల్లకాదు. ఎందుకంటే ఆ చిట్టా ఆంజనేయుని తోకంత అవుతుంది. ఆయనకే ఇంటిలో పెట్టుకునే స్థలం లేక అటకెక్కించిన సత్కార, పురస్కార పత్రాలు, ఙ్ఞాపికలు ఎన్నో మాకు చూపించారు. భాదపడ్డారు, వీటికి మా ఇంటిలో అవమానం జరుగుతుందండీ అని. ప్రస్తుతం గాంధీ తత్వాన్ని ప్రపంచానికి పంచే పనిలో ఉన్నారు. ఇటీవలే 150 భాషల్లో పాడి ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నారు. తెలుగుని, తెలుగు సాంప్రదాయాన్ని ఆయన ఎంత గౌరవిస్తారో తెలుసుకోవాలంటే ఆయన ఇంటిని చూస్తే చాలు ఇట్టే తెలిసిపోతుంది. ముగ్గువేసి మధ్యలో రాగిపాత్రలో పువ్వులతో అతిధులని ఆహ్వానించే ముంగిలి. ఇంటినిండా తెలుగుదనాన్ని నింపుకున్న మట్టి బొమ్మలు, గోడలమీద ఏ చిత్రకారుడో తన కుంచెని తెలుగుదనంలో రంగరించి రంగుల్లో ఆవిష్కరించిన తైలవర్ణచిత్రాలు. ఆ ఇష్టాన్ని అందరికీ పంచాలని తెలుగుదండు అని ఒక సైన్యాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే ఆయన ఒక ఉద్యమంతో మన ముందుకి రాబోతున్నారు. ఎ-తెలుగు కి సహాయం అందించటానికి, బ్లాగుల ప్రచారానికి అయన తన సంసిద్ధత వ్యక్తం చేసారు. ఆయనకి భగవంతుడు చిరాయువునివ్వాలని, ఆయన సంకల్పించిన ప్రతి పనిలోని భగవంతుని దీవెన తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. నన్ను తమతో తీసుకు వెళ్ళిన సతీష్ యనమండ్ర గారికి, జీవితంలో కొత్తకోణం శ్రీనివాస్ గారికి నా కృతఙ్ఞతలు.

ఒక మధుర ఙ్ఞాపకం

ఒక మధుర ఙ్ఞాపకం

జీవితంలో కొన్ని ఙ్ఞాపకాలు పాత పుస్తకాల్లోని గులాబీ రేకుల్లా, నెమలీకలా దాగి ఉంటాయి. కానీ ఈ ఙ్ఞాపకాలు వాటిలా జీవం కోల్పోవు. ఎప్పుడు తరచి చూసిన ఆ పరిమళం మన హృదయాలను చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తునే ఉంటుంది. ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తూ సెలవు….

గమనిక: గజల్ శ్రీనివాస్‌ని ఆయన,గారు అని సంభోదించలేదు కారణం “ప్రతి తెలుగువాడి గుండె గడపలో ముగ్గులేసి తెలుగు మీద ప్రేమని నింపుతా. ఏం చేయలేమంటారా? ” అన్నారు. ఆ మాటతోనే మాకు ఆప్తుడయిపోయాడు, మా ఇంటిలో ఒకడు అయిపోయాడు. ఇంక ఆయన్ని దూరం చేసుకోవటం నాకిష్టం లేదు.

11 comments ఫిబ్రవరి 10, 2009

ఈ ఉగాదికి ఏంచేద్దాం?

ఈ ఉగాదికి ఏంచేద్దాం? ఎప్పటిలాగా ఉగాది పచ్చడి తిని, పంచాంగం విని పడుకుందామా? లేదా కొత్తసంవత్సరం ఏదయినా కొత్త పనితో మొదలు పెడదామా? నేను నా కొత్తసంవత్సరాన్ని ఖచ్చితంగా కొత్తగా మొదలుపెట్టాలనుకుంటున్నా. ఒక సమావేశంలో కత్తి మహేష్ గారు చెప్పారు “తెలుగును కాపాడుకోవాలని ప్రయత్నిస్తే మనకి ఎదురయ్యే ఎన్నో ప్రశ్నలకి సమాధానం చెప్పి అందర్ని ఒప్పించాలి. అప్పటికీ తెలుగుని బ్రతికించుకోగలమా అంటే ఎమో చెప్పలేం. తెలుగుతనాన్ని బ్రతికించే ప్రయత్నం చేద్దాం. అప్పుడు తెలుగు ఖచ్చితంగా బ్రతుకుతుంది”. అక్షరలక్షలు చేసేమాట. కానీ ఎలా? ప్లేకార్డ్లు పట్టుకుని రోడ్డు మీద తిరగాలి, ఫ్లెక్స్ పెట్టాలి విస్తృత ప్రచారం చెయ్యాలి. ఇవన్నీ అపోహలు, ఇవన్నీ చేయనక్కరలేదు.

స్వాతంత్ర్యం ఎలా అయినా సంపాదించుకోవాలి అని ఆవేశంలో ఊగిపోతున్న భరతజాతికి ఆయుధంలా మారి అందరిని ఒక్కతాటి పైన నడిపించింది ఒకచిన్నమాట కాదు ఒక మహామంత్రం “వందేమాతరం”. అలాగే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరిని ఒక్కటి చేసేది, చూడగానే తెలుగువాడిగా గుర్తింపునిచ్చేది ఏదయినా ఉందా? ఉంది మన కట్టూ,బొట్టూ. మన కట్టూ,బొట్టూ కార్పొరేట్ కంపేనీల్లో సాంప్రదాయ వస్త్రధారణ ఉత్సవాల్లో మాత్రమే కనిపిస్తుంది. ప్రపంచం మందిగా గుర్తించిన, గౌరవిస్తున్న మన వస్త్రధారణతోనే తెలుగుతనాన్ని చాటిచెబుదాం. ఆంధ్రులు ఆరంభశూరులని ఉన్న అపవాదుని చెరిపేసుకుందాం. మన కార్యక్రమాలకి ఇది కొనసాగింపేకానీ అదనపు భారంకాదని భావిస్తున్నా.

చేయాలనుకుంటున్న కార్యక్రమాలు :

1.ఉగాది రోజు అందరం తెలుగు సంప్రదాయ వస్త్రధారణని పాటిద్దాం. 10కె రన్, బత్తీబంద్‌లకి మద్దతునిచ్చిన ప్రసార మాధ్యమాలు, కార్పొరేట్ కంపెనీలు దీనికి కూడా మద్దతునిస్తాయని బలంగా నమ్ముతున్నా. ఇప్పట్నుండీ మీ కంపేనీల్లో సంభందిత వ్యక్తుల్ని సంప్రదించండి. ప్రతి ఉగాదికి చేసేదే కదా ఇందులో ఎముంది గొప్ప అనుకుంటున్నారా? ఇలానే ప్రతినెలలో ఒకరోజు పాటిద్దాం. శ్రీలంకలో ప్రతీ పౌర్ణమికి మా కంపెనీ సెలవిస్తుంది. కారణం ఆ రోజు వారికి సంప్రదాయదినం. గుడికి వెళ్ళటం ప్రార్ధనలు చెయ్యటం వంటివి చేస్తారంట. మనం అలానే ప్రతీనెలలో ఒకరోజు సంప్రదాయ దుస్తులని ధరిద్దాం. రాష్ట్రం మొత్తం ఒక్కరోజు మన సంప్రదాయ దుస్తుల్లో, లంగావోణీల్లో అమ్మాయిలు, పంచె కట్టులోనో లేదా కుర్తాల్లో అబ్బాయిలు అహా చూడాటానికి ఆ దృశ్యం ఎంత అందంగా ఉంటుందో

2.దీనికోసం మనం ప్రముఖ ప్రసారమాధ్యమాల మద్దతు లభిస్తుందేమో ప్రయత్నిద్దాం. ఖచ్చితంగా మద్దతు లభిస్తుందని భావిస్తున్నా.

3.”నేను తెలుగువాడిగా పుట్టినందుకు గర్విస్తున్నా.” అనే బ్యాడ్జి ధరిద్దాం. ఇవన్నీ తెలుగువారి జీవితంలో ఒకభాగం అయ్యేంతవరకు మనం ముందుకు తీసుకువెళ్ళాలి. తర్వాత తెలుగే మనల్ని నడిపిస్తుంది.

నేను పైన చెప్పిన పనులు చాలా చిన్నవి, సులువైనవి అని భావిస్తున్నా. నేను గతంలో గాని ఇప్పుడూ గాని ప్రతిపాదించినవి ఆచరణ సాధ్యమైనవి. మనకి మరింత బలాన్నిచ్చేవి. బ్లాగర్స్ డే చేసుకుంటే ఒక కొత్త ఉత్సాహం ఉంటుందని నా బ్లాగులో రాసినప్పుడు ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఈ రోజున ఈ-తెలుగు కార్యక్రమాలకి ఉత్సాహం మొదలయినది అక్కడే అని అందరికి తెలుసు. చివరిగా వీవెన్ గారు చెప్పినట్టు, “ఎవరికోసం ఎదురు చూడకు నువ్వు చేయాలనుకున్నది చేసెయ్”. అవును అందుకే నేను ఇది చెయ్యబోతున్నా. సోదరుడు సతీష్‌కుమార్ యనమండ్ర నాతో కలిసి నడిచేందుకు అంగీకరించారు. ఆయన తన కంపెనీ లోని ఉద్యోగస్తులకి ఆచరించమని కోరుతానన్నారు. ఇంక మీ సమాధానం మిగిలుంది. రండి కలిసి నడుద్దాం. తెలుగు విప్లవంలో పాలుపంచుకుందాం.

4 comments జనవరి 31, 2009

సంకురాతిరొచ్చింది మా పల్లెకి…

మిట్ట మధ్యాహ్నం, సూర్యుడు నడినెత్తిన ఉన్నాడు. పోస్ట్-మ్యాన్ రామయ్య తన పాత సైకిల్ పై చెమటలు కక్కుతూ వస్తున్నాడు. అసలే పండగ సమయం ఎవరయినా ఏవయినా మామూలు ఇస్తారేమో అని ఆలస్యం కాకుండా ఉత్తరాలన్నీ ఇచ్చేస్తున్నాడు. రామయ్య పదవీవిరమణ చేసినా సరే ఆ ఊరికి వేరే పోస్ట్-మ్యాన్ రాకపోవటంతో అతన్నే ప్రభుత్వం ఆ పనిలో కొనసాగిస్తోంది. రామయ్యకి కూడా ఆ ఉద్యోగం తప్పని సరి కాబట్టి చేస్తున్నాడు. రామయ్య కొడుకు అమెరికాలో ఉన్నాడు. ఆ విషయం రామయ్య చెబితే గాని మనబోటి వాళ్ళకి తెలియదు. మనకే కాదు రామయ్య ఇక్కడున్న సంగతి అసలు ఆ కొడుకుకే తెలియదు. ఎందుకంటే “ఇంజనీరింగ్ చదివించటానికే చాలా ఖర్చు ఆయ్యింది, ఇప్పుడు నిన్ను పై చదువులకోసం అమెరికా పంపించలేను, అసలే చెల్లి పెళ్ళి కూడా చేయాలి. ఇక్కడే ఏదో ఉద్యోగం చూసుకో” అన్నాడు రామయ్య. కానీ “నేను నిన్ను పంపిస్తా నాకూతుర్ని పెళ్ళి చేసుకుంటే” అన్నమాట తో రామయ్య కొడుకుని ఎగరేసుకుపోయాడు దగ్గర రా’బంధువొకడు ‘. పెరట్లో ప్రేమగా పెంచిన చెట్టు తుఫానుకి నేలకొరిగితే ఎలా ఉంటుందో గానీ, చెట్టంత ఎదిగిన కొడుకు ఇల్లు వదిలి వెళ్ళిపోతే. రామయ్య భార్య చాలా బాధపడింది, అలిగింది, ఏడ్చింది, శాపనార్ధాలు పెట్టింది కానీ అవేవి అమెరికా లో ఉన్న కొడుకుని చేరలేదు. అవును మరి అమెరికా చేరేంత ఖరీదయినవి కాదుగా మన ఏడుపులు. మనకే లేదు స్థోమత ఇంక మన తిట్లకి ఎలా వస్తుంది. అందరి సందేశాలు బట్వాడా చేసే పోస్ట్-మ్యాన్ బాధలు మాత్రం ఎవరూ అమెరికా లోనికొడుక్కి బట్వాడా చేయలేకపోయారు. రామయ్య మాత్రం “నేను తండ్రినయ్యా, వ్యాపారిని కాను పెట్టుబడి పెట్టి లాభం లేదనుకోటానికి. రెక్కలొచ్చిన పక్షులు తలో దిక్కు చూసుకుంటాయి, అంతే గాని ఇంకా ఈ దిక్కుమాలిన బ్రతుకుని కోరుకుంటాయా? రేపు పెళ్ళయ్యాక ఈ ఆడపిల్ల కూడా వెళ్ళిపోతుందే గాని ఈ చూరు పట్టుకుని వేలాడతుందా మన పిచ్చి గాని” అని నిర్వేదంగా నవ్వేస్తాడు. ఆ నవ్వుని భద్రపరిచే సాధనం లేదేమో మానవ మేధస్సులో. ఉంటే చాలా ఖరీదే చేస్తుంది. అతని గుండె నిబ్బరం అపోలో వాళ్ళు తెలుసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి తల్లితండ్రుల గుండె నొప్పులకి మందు తయారు చెయ్యొచ్చు.

ఈ రోజు సుబ్బయ్య మాష్టరికి ఉత్తరం వచ్చింది. సుబ్బయ్య నిజానికి ఏ స్కూల్ లోనూ పనిచేయలేదు. ట్యూషన్లూ చెప్పలేదు. ఆయన ఒక వంటమాష్టర్ ఊర్లో కధలకి, కార్యాలకి వంట చేస్తాడు. ఆయన బృందం వంటల్లో ఆ జిల్లాలోనే పేరు గడించింది. ఆయన చేతివంట చలవ వలన కార్యం జరిగిన ప్రతి ఇంట్లోనూ శుభమే. అలా ఆయన సుబ్బయ్యమాష్టారుగా స్థిరపడిపోయారు. రామయ్య సైకిల్ చప్పుడు వినగానే ఇంటి బయటకి పరుగున వచ్చినవి, కిటికీలు తీసి ఆశగా గమనించేవి చాలా చూపులు ఆయన్ని తాకాయి. ఆయన గుండె నిబ్బరం మనకి తెలియనిదా అందుకే ఆయన ఆ చూపులకి బేలగా అయిపోలేదు. ముందుకి సాగిపోయాడు. సుబ్బయ్య గారింటికి వచ్చి కూర్చున్నాడు. అంతే ఊరంతా సుబ్బయ్య ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అలాంటి కవరు ఉత్తరాలు ఆ ఊరిలో మోతుబరి వీరయ్యకి, రామాలయం పంతులు శాస్త్రికి వారం రోజులు ముందే వచ్చాయి. సుబ్బయ్య మాష్టరి అర్ధాంగి సీతమ్మ రామయ్య ఉత్తరం తో ఇంటి ముందు అడుగుపెట్టేసరికే తొందరగా వంట గదిలోకి పోయి ఒక చేతిలో మజ్జిగ, మరో చేతిలో కజ్జికాయలు, జంతికలు పెట్టిన క్యారేజు తెచ్చి రామయ్యకి ఇచ్చింది. ఉత్తరం అందుకొని సుబ్బయ్య గారికోసం చూస్తే ఆయన కనబడలేదు. ఇరుగు పొరుగు వాళ్ళని అడుగుతుంది “వదినా! ఆయన గానీ అన్నయ్యగారి దగ్గరకి వచ్చారా?” “చెల్లాయ్! బావగారిని గాని చూసావా” అందరూ లేదన్న మాటే ఆమె మాత్రం ఆతృతతో వీధిలో అన్ని గుమ్మాలు తిరిగేస్తుంది.

రామయ్య పండగ మామూలు దొరక్కపోయినా తన భార్యకి పండగకి కజ్జికాయలు పెట్టొచ్చన్న ఆనందాన్ని మిగుల్చుకుని ఇంటికి బయలుదేరాడు. మరలా అవే చూపులు, సాయం సంధ్యలో చీకటిని తరిమే శక్తిలేక దాసోహం అన్న అరుణ సూర్యుని వంటి కళ్ళతో, తనని తాకి పరికిస్తున్నాయి. తాను మాత్రం చూపు మరల్చకుండా సూటిగా చూస్తూ తన ఇంటిదారిపట్టాడు. రామాలయం లో ఉన్న సుబ్బయ్య మాష్టారికి మొత్తానికి విషయం తెలిసి ఇంటికి బయలుదేరాడు. ఇందాక రామయ్యని తాకిన అవే చూపులు సుబ్బయ్యని కూడా వదిలిపెట్టలేదు. కానీ ఆ చూపుల్లో ఇప్పుడు ఆశలేదు. కాస్త అసూయ, కాస్త అభినందన. సుబ్బయ్య మొహంలో ఎప్పుడూ చూడని ఒక వింతకాంతి. పెదవుల్లో దాగని చిరునవ్వు. అంతకంటే అసూయపడటానికి ఇంకేం కావాలి? సుబ్బయ్య ఇంటికి వస్తూనే “ఏమేవ్! కవరు ఎక్కడపెట్టావ్?” అంటూ గుమ్మంలో అడుగు పెట్టారు. ఆయనకి ఉత్తరం అందించి సీతమ్మ తన పొరిగింటి లక్ష్మితో “చూసావా వదినా ఆ ముఖం ఎలా వెలిగిపోతుందో. మా పెళ్ళినాడు కూడా ఇంత ఆనందం నేను చూడలేదు.” అని ఆటపట్టించింది. సుబ్బయ్య సిగ్గుపడుతూ కవరు తో సహా తన గదిలోకి వెళ్ళిపోయాడు.

గదిలో మంచం మీద తీరుబడిగా కూర్చుని తన పాత కళ్ళద్దాలతో కాసేపు కుస్తీ పట్టి, కవరు చించి పదిసార్లు చూసుకుని, హాయిగా పడుకున్నాడు. మంచినీళ్ళ గ్లాసుతో లోనికి వచ్చిన సీతమ్మ సుబ్బయ్య పడుకోవటం చూసి, వంట గదిలోకి వచ్చేసింది. ఇంక తన ఏర్పాట్లు తాను చేసుకుంటుంది. కజ్జికాయలు, సున్నుండలు, అరిసెలు అన్నీ స్టీల్ క్యాన్లలో పెట్టింది. జంతికలు పెట్టడానికి సామాన్లు ఏవీ ఖాళీ లేవు. పక్కింటి వాళ్ళని అడిగి ఒక క్యాన్ తెచ్చి కట్టింది. రాత్రి వరకు ఇవే పనులతో సీతమ్మకి సరిపోయింది. సుబ్బయ్య సాయంత్రం ఊరిలోకి వెళ్ళి స్నేహితుల్ని కలిసి స్పేర్ తాళాలు పనోడు కిట్టిగాడికి ఇచ్చి వచ్చారు. ఆ రాత్రి ఆ దంపతులిద్దరూ ఏవో ఆలోచనలతో గడిపారు. ఇద్దరికి నిద్దుర లేదు. సీతమ్మ పొద్దునే లేచి తయారయ్యింది. కాఫీ పెట్టి సుబ్బయ్యని లేపింది. నిద్ర లేకపోవటంతో నీరసంగా ఉన్న సుబ్బయ్య కష్టంగా లేచి కాఫీ అందుకున్నాడు. సీతమ్మ లోపలికి వెళ్ళిపోయింది. గ్లాసు కిందపడేసిన చప్పుడుతో ఇవతలికి వచ్చిన సీతమ్మ సుబ్బయ్య కింద పడి ఉండటం చూసి గావుకేక పెట్టింది. వీధిలో అందరూ వచ్చారు. ఎవరో పోయి కంపౌండర్ శ్రీనుని తీసుకువచ్చారు. శ్రీను నాడిని చూసి, బి.పి. చూసి “అసలే ఈయన గుండె అంత గట్టిదేం కాదు ఈ సమయంలో ఎక్కడికీ కదిలించటం మంచిది కాదు” అని చెప్పి మందులిచ్చి వెళ్ళాడు. సుబ్బయ్య నీరసంగా చూసి సీతమ్మతో “పోనీ నీవయినా” అని కవరు తీసి ఇచ్చాడు. అందులో హైదరాబాద్ కి టికెట్లు ఉన్నాయి. సీతమ్మ పరుగున కరణంగారి అబ్బాయి కోటి దగ్గరకి వెళ్ళి “బాబు నీ దగ్గర మా సత్తిపండు నంబరు ఉందికదా. వాళ్ళ నాన్నకి బాగుండలేదని వాళ్ళనే ఇక్కడకి రమ్మని చెప్పు” అని అడిగింది. సుబ్బయ్య కొడుకు సత్తిపండు హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్. సత్తిపండు, కోటి చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు. సత్తిపండుకి ఫోన్ చేసి మాట్లాడమని సీతమ్మకిచ్చాడు కోటి. సీతమ్మ జరిగినదంతా చెప్పింది అటువైపు నుండి చాలాసేపటి వరకు సమాధానం లేదు. ఫోన్ కట్టయ్యింది. ఒక 10 నిమిషాలలో మరల పోన్ వచ్చింది.

“సరే అమ్మ నాన్నకి ఇప్పుడు బాగానే ఉందిగా. మరీ అంత ఇంటి దగ్గర ఎవరయినా ఉండాలంటే పొరుగూరిలో ఉన్న అత్తయ్యకి కబురుపెట్టు. నువ్వు మాత్రం ఈ రోజు బయలుదేరి వచ్చేయ్. పిల్లలు, కోడలు నిన్ను చూడాలంటున్నారు. అసలే 1000 అయ్యింది టికెట్లకి. పండగ లో టికెట్ల ధర చాల ఎక్కువ. సరే నాకు ఆఫీస్ కి టైం అయ్యింది ఉంటా.” సీతమ్మ ఉన్నచోటే కూలిపోయింది. అందరూ జాలిగా చుస్తున్నారు. “ఉత్తరం రాగానే పాపం ఎంత సంబరపడ్డారో ” అనిమాటలాడుకుంటున్నారు.

ఆ ఊరిలో ఇలాంటి కధలు కొత్తేం కాదు. ఊరిలో చాలా గడపల కధ ఇంతే. అందరి పిల్లలు పట్నాలలో ఉన్నారు. పండగలొస్తే ఎవరూ ఇక్కడకి రారు. టికెట్లు వస్తాయి. పట్నాలలో ఇళ్ళు ఇరుకుగా ఉంటాయి. వంట కుదరదని వాళ్ళకి నచ్చిన వంటకాలు ఉత్తరంలో రాస్తే వండి తీసుకుని వెళతారు. రోజంతా మా అబ్బాయి ఫలానా కంపెనీ, ఇంతజీతం, మా మనవలు ఇంగ్లీష్ మీడియం తెలుగు అసలు రాదు అని గొప్పలు చెప్పుకోవటం. టి.వి. లో ప్రకటనలు వచ్చినప్పుడు మా అబ్బాయి కారు అదే, ఇది మా అబ్బాయి ఇంటిలో ఉంది అని చెప్పుకుంటారు. రామాలయం లోకూర్చుని ఈ సంవత్సరం మా అబ్బాయి స్థలం కొన్నాడు, ఫ్లాట్ కొన్నాడు అని రాత్రి అయ్యేవరకు మాట్లాడుకుని రాత్రికి ఇల్లు చేరుతారు. రోజులు అలా గడిచిపోతాయి. పిల్లలు వస్తారనే ఎదురు చూపులు ఎప్పుడో మానేసారు. అప్పుడప్పుడు ఉత్తరాలు మాత్రం వస్తాయి. పండగలో మాత్రం టికెట్లు పంపేది తల్లి ఇంటిపనులకి, తండ్రి బయట పనులకి సాయం ఉంటారని. మనవలకి సెలవులు కాబట్టి అల్లరి చేయకుండా ఆడించేందుకు అంతే. పనివాళ్ళు పండగల్లో రారు వచ్చినా పని ఎక్కువయితే డబ్బులెక్కువడుగుతారు పైగా గొడవ చేస్తారు. 

సీతమ్మ ఇంకేం చేయగలదు లేచింది. ఇంటికి వెళ్తుంటే రామయ్యని, సుబ్బయ్యని తడిమిన చూపులు జాలితో అమెని స్పృశించాయి. వెళ్ళి ముందురోజు వచ్చిన కవరు అందుకుంది, సత్తిపండు చిన్నప్పటి ఫోటోలు, చిన్ననాటి బట్టలు, తన చేతులతో అల్లిన స్వెటర్ అన్నీ ఒక బ్యాగులో పెట్టింది. సుబ్బయ్య కనీసం భార్యయిన వెళ్తున్నందుకు ఆనందంగానే ఉన్నాడు. కానీ మనవడ్ని చూడలేకపోతున్నా అనే భాద. వెధవ రోగం ఇప్పుడే రావాలా అని తిట్టుకుంటున్నాడు. వీధిలోకి వచ్చిన సీతమ్మ ఆ బ్యాగు విసిరి అగ్గిపుల్ల గీసి పడేసింది. లోపలికి ఆవేశంగా వెళ్ళి గది గది గాలించి ఏ ఒక్క ఙ్ఞాపకం మిగలకుండా అన్నీ ఏరుకొచ్చి ఆమంటలో పడేసింది. చివరగా రైల్ టికెట్లున్న కవరు కూడా. వీధి లో అందరూ సీతమ్మకి పిచ్చి పట్టిందనుకున్నారు. సుబ్బయ్య నోరు వెళ్ళబెట్టాడు. కాసేపట్లోనే ప్రతీ ఇంటినుండీ ఒక్కొక్కరుగా వచ్చి మంటల్లో ఇన్నేళ్ళ తమ నిరాశని బాధని కాల్చి బూడిద చేసారు. ఆ రోజే ఆ పల్లెకి భోగి వచ్చింది. మరుసటి రోజు సీతమ్మ తను వండిన వంటకాలు ఇంటింటికి తిరిగి పంచింది. ఆ రోజు నిజమయిన సంక్రాంతి పండగ చేసుకున్నారు ఆ ఊరిలో. రామాలయంలో పెద్ద ఎత్తున పూజలు చేసారు. రామయ్య మరలా ఎప్పుడూ అలాంటి కవర్లు ఎవరికీ ఇవ్వలేదు. వచ్చినవి వచ్చినట్టే తన ఇంటిలో పొయ్యలో పడేసాడు.

6 comments జనవరి 26, 2009

e-తెలుగు విజయవాడ పర్యటన పై నివేదిక

నివేదిక ముందుగానే వ్రాయాల్సి ఉన్నా ప్రయాణ బడలిక, పని ఒత్తిడి వలన కాస్త ఆలస్యమయ్యింది. అయినా ఎదురుచూపులో ఉన్న హాయి మీకు తెలియనిదా? అసలు ఈ రెండు రోజుల్లో మేము విజయవాడనుండి మోసుకొచ్చిన అనుభూతులని మీతో పంచుకొని మరింతగా ఆస్వాదించాలని ప్రతీక్షణం అనుకుంటున్నా ఇప్పటికి కుదిరింది. అనుకున్న ప్రకారమే చదువరిగారు, చావా కిరణ్‌గారు కూకట్‌పల్లి నుండి ఇన్నోవా లో బయలుదేరారు. మార్గంలో శ్రీనివాసరాజు దాట్ల, నేను, సతీష్‌కుమార్ యనమండ్ర గారు, అరుణ పప్పు గారు వారిని కలిసాం. అందరం మంచి చాయ్ ఒకటి కొట్టి ప్రయాణం మొదలు పెట్టాం. మొదటి విడతలో ఆంధ్ర రాజకీయాలు, తెలుగు సినిమాల గురించి చర్చతో ప్రయాణం సాగించాం. అల్పాహారం తీసుకున్నాక చర్చని కాస్త మార్చి e-తెలుగు తదుపరి కార్యక్రమాలు ఏంటి? ఇప్పుడు మన మితృలలో కనిపిస్తున్న ఉత్సాహాన్ని నిర్మాణాత్మకంగా ఎలా వినియోగించుకోవాలి? గత కొద్దిరోజులలో తాబేలు నడకను వీడీ కుందేలులా దూకుతున్న మనప్రగతి నిర్లక్ష్యం లేదా నైరాశ్యంతో కుంటుపడకుండా ఈ స్పూర్తిని ఇదేస్థాయిలో కొనసాగించటానికి తీసుకోవాల్సిన నిర్ణయాల పై చర్చ జరిగింది. ఏకపక్షంగా కాక భిన్న వాదనల మధ్య కొనసాగిన చర్చ చివరికి ఏమార్గం లో నైనా అందరం కలిసే నడుద్దాం అన్న నిర్ణయం తో ముగిసింది. ఆ చర్చ వివరాలు త్వరలోనే మీ ముందుకు వస్తాయి. చర్చ ముగిసేంతలోనే విజయవాడ దగ్గరగా వచ్చేసాం. శ్రీకాంత్ గారికి ఫోన్ చేసి ఎక్కడకురావాలో వివరాలు తీసుకుని అక్కడకు చేరుకున్నాం. ఒక 5 నిమిషాల్లో శ్రీకాంత్‌గారు వచ్చేసారు. ఆయన రూపం బ్లాగులోని ఫోటోకి కాస్త భిన్నంగా ఉంది. ఫోటో చూసి యువకులేమో అనుకున్నాం కానీ మధ్యవయస్కులు (శ్రీకాంత్‌గారు మీకు కోపం రాదుకదా? :) ). శ్రీకాంత్‌గారు తమ ఇంటికి అందర్నీ సాదరంగా ఆహ్వానించారు. అద్భుతమయిన పాతడాబా ఇల్లు, పెద్దగా ఎత్తుగా ఉన్న ద్వారాలు, చెక్కమంచం, బీరువా నిండా పుస్తకాలు, ఇంటివెనక విరగ కాసిన ఉసిరిచెట్టు భలే అనిపించింది. నేను,చావాగారు ఎంతో ప్రయత్నం మీద నాలుగో ఐదో ఉసిరికాయలు తెంపాం. శ్రీకాంత్‌గారి ఇద్దరి పిల్లలూ ఎంతో ఒద్దికతో మమ్మల్ని వచ్చి పలకరించారు. శ్రీకాంత్‌గారి సతీమణి అన్నపూర్ణ గారు మాకు చల్లని మంచినీళ్ళతో ఆహ్వానం పలికారు. కాసేపు శ్రీకాంత్‌గారితో ముచ్చటించి, అందరం కాస్త సేదతీరాక భోజనాలు అవికానిచ్చి విజయవాడ ఆకాశవాణి కి చేరుకున్నాం.  

శ్రీకాంత్‌గారి పుస్తకాల కొలువు

శ్రీకాంత్‌గారి పుస్తకాల కొలువు

పద్మకళగారు వచ్చి అందర్ని ఆకాశవాణి లోకి తీసుకొని వెళ్ళారు. పేరు చూసి నడివయస్కులేమో అనుకున్నాం కానీ మళ్ళీ దెబ్బతిన్నాం. ఎన్నో ఏళ్ళ చరిత్రకలిగిన ఆకాశవాణిలో అడుగుపెడుతుంటే అందరిమనస్సుల్లో ఒక గొప్ప అనుభూతి కెరటంలా వెల్లువెత్తింది. “ఇప్పుడు సమయం 2 గంటలా 30 నిమిషాలు కావస్తుంది”, “మీరు వింటున్న ఈ పాట సాలూరు రాజేశ్వర్రావు స్వరసారధ్యంలో “,”ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ” ఇలా కొన్ని చిన్నప్పటి ఙ్ఞాపకాలు కళ్ళ ముందు కదిలాయి. ఎందరో గొప్ప సాహితీ వేత్తలు, కవులు, గాయకులు, రంగస్థలనటులు, కళాకరులని మనకి అందించిన ఆకాశవాణిలో మేము మాట్లాడటం రవ్వంత గర్వాన్ని కలిగించింది. ఈ ఘనత e-తెలుగు చరిత్ర లో ఒక మైలురాయి. ముందుగా ప్రణాళిక లేక పోవటం చేత పద్మకళగారితో అప్పటికప్పుడు చర్చించి కార్యక్రమం మొదలు పెట్టాం. చదువరిగారు e-తెలుగు లక్ష్యాలు,సాదించిన విజయాల్ని గణాంకాలతో సహా వివరించారు. e-తెలుగు భవిష్యత్తు ప్రణాలికలు చెప్పారు. చావా కిరణ్‌గారు తెలుగు వికిపీడియా గురించి, బ్లాగుల గురించి చక్కగా వివరించారు. బ్లాగుల వలన గృహిణులకి,విధ్యార్దులకి, విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి కావల్సిన ఎన్నో సలహాలు సూచనలిచ్చే బ్లాగులు తెలుగులో మనకు ఉన్నాయని,ముఖ్యంగా కనుమరుగయిపోతున్న ఆరోగ్యకరమయిన హాస్యాన్ని అందిచే బ్లాగులు ఎన్నో ఉన్నాయని చావాగారు వివరించారు. నేనుకూడా ఉడతసహాయంచేసాను. ఆవిధంగా అనుకున్నదానికంటే కూడా మంచిగా ఆ కార్యక్రమం ముగిసినది.  

శ్రీనివాసరాజు, సతీష్ యనమండ్ర

శ్రీనివాసరాజు, సతీష్ యనమండ్ర

అరుణ పప్పు, చావా కిరణ్

అరుణ పప్పు, చావా కిరణ్

శ్రీనివాస కర గారు , శివరామప్రసాద్‌ గారు

శ్రీనివాస కర గారు , శివరామప్రసాద్‌ గారు

పుస్తకప్రదర్శన ప్రాంగణం

పుస్తకప్రదర్శన ప్రాంగణం

ఆకాశవాణి లో చర్చ ముగిసినవెంటనే “వాక్ ఫర్ బుక్స్” ర్యాలీకి చేరుకొని, అప్పటికే మొదలయిన ర్యాలీ లో మధ్యలో దూరి e-తెలుగు బ్యానర్ ని ప్రదర్శిస్తూ నడక సాగించాం. అరుణగారు,చావాగారు ఒక జట్టుగా సతీష్‌గారు, శ్రీనివాస్ ఒక జట్టుగా బ్యానర్ పట్టుకొని కాస్త చొరవ తీసుకుని ర్యాలీ లో ముందుకు దూసుకుపోయి అందరి దృష్టిని ఆకర్షించారు. ర్యాలీ పుస్తక ప్రదర్శనకి చేరుకున్నాక అరుణగారు మనకోసం ఒక చిన్న స్టాలులా బల్లలతో ఏర్పాటు చేసారు. బ్యానర్ కట్టినప్పటినుండి మన కార్యక్రమం మొదలు పెట్టేంతవరకు వచ్చిన జనమంతా అడిగిమరీ కరపత్రాలు తీసుకొని, తమ సందేహాలను సహితం తీర్చుకొని వెళ్ళారు. కార్యక్రమం సమయం కంటే కాస్త ముందుగానే స్టాలు ని ముగించి “ప్రతిభ వేదిక” వద్దకి చేరుకున్నాం. మన కార్యక్రమానికి తగ్గ పేరుగల వేదిక చూసారా? శ్రీకాంత్‌గారు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు. కుర్చీలు వేయించటం, ప్రొజెక్టర్ ఏర్పాటులాంటివి చకచకా జరిగిపోయాయి. పద్మకళగారు మీడియా మితృలని పిలవటం, మన గురించి చెప్పటం, పరిచయం చేయటం వంటి పనులతో తీరికలేకుండా గడిపారు. కళగారి సహాయంతో 93.5 FM వారు, జీ న్యూస్ వారు మంచి కవరేజినిచ్చారు. ఉరుముల్లేని పిడుగులా జీవితంలో కొత్తకోణం శ్రీనివాస్‌గారు వచ్చారు. వస్తూనే ఆయన ఏర్పాట్లలో నిమగ్నమయిపోయారు. జీ న్యూస్ వారికి e-తెలుగు గురించి వివరించారు. చావా గారు, సతీష్ గారు 93.5 FM కి వివరాలు అందించారు.  

e-తెలుగుస్టాలు

e-తెలుగుస్టాలు

ఆదిత్యప్రసాద్ గారి పరిచయం

ఆదిత్యప్రసాద్ గారి పరిచయం

e-తెలుగు గురించి వివరిస్తున్న చదువరిగారు

e-తెలుగు గురించి వివరిస్తున్న చదువరిగారు

img_0185

బ్లాగుల గురించి వివరిస్తున్న చావాకిరణ్

బ్లాగుల గురించి వివరిస్తున్న చావాకిరణ్

జీన్యూస్ కి వివరాలు అందిస్తున్న శ్రీనివాస్ (జీవితంలో కొత్తకోణం)

జీన్యూస్ కి వివరాలు అందిస్తున్న శ్రీనివాస్ (జీవితంలో కొత్తకోణం)

ఆకాశవాణి సంచాలకులు ఆదిత్య ప్రసాద్ గారి వ్యాఖ్యానం తో కార్యక్రమం మొదలయ్యింది. చదువరిగారు ఆహుతలకి అర్దమయ్యేలా అంతర్జాలంలో తెలుగుని ఉపయోగించవచ్చని ఇది సులువైనది ఖర్చులేనిదని వివరించారు. అంతర్జాలంలో తెలుగు ఉపయోగాన్ని పెంచటమే e-తెలుగు లక్ష్యమని చెప్పారు. శ్రీధర్‌గారు రాకున్నా ఆయన వ్యాఖ్యానంతో ఉన్న వీడీయోల సహాయంతో కార్యక్రమం కొనసాగింది. చదువరి గారి సారధ్యం లో నేను కంప్యూటర్లో తెలుగు ఎనెబుల్ చేసుకోవటం, లేఖినిలో తెలుగు వ్రాయటం గురించి వివరించాను. చావాగారు బ్లాగు గురించి, బ్లాగులు ఎలా తయారు చేసుకోవాలి, తెలుగు వికిపీడీయా గురించి ఆసక్తికరంగా వివరించారు. శ్రీధర్‌గారు ఎంతో శ్రమతో తయరుచేసిన వీడీయోలు ప్రేక్షకులు ఆసక్తిగా చూసారు. కొందరు నోట్స్ వ్రాసుకోవటం కూడా కనిపించింది. కార్యక్రమం ముగిసిన వెంటనే అందరూ మా వద్దకి వచ్చి కరపత్రాలు తీసుకొని, అనేక సందేహాలని నివృత్తి చేసుకొని, వారి ఈ-మెయిల్ వ్రాసిచ్చి వెళ్ళారు. కొందరు చావాగార్ని అసలు వదిలిపెట్టనే లేదు. కార్యక్రమం ముగిసిన ఎంతోసేపటి వరకు మాతో మాట్లాడుతునే గడిపారు. ఇది నిజంగా మేమంతా ఆనందించిన విషయం. హైదరాబాద్ లో కంటే ఇక్కడ లభించిన స్పందన మాకు తృప్తిని మిగిల్చింది. అంతదూరం ప్రయాణం చేసి వెళ్ళినందుకు చాలా తృప్తికలిగింది. అక్కడితో అయిపోలేదు అంతవరకు హడావుడిగా సాగిన కార్యక్రమం, బ్లాగు మితృల ముచ్చట్లతో తేలిక పడింది. పుస్తకప్రదర్శన తిలకించటనికి వచ్చిన ఒక వ్యక్తికి e-తెలుగు బ్యానర్ కనపడింది మా వద్దకి వచ్చి పలకరించి తనని తాను పరిచయం చేసుకున్నారు. అప్పుడు తెలిసింది ఆయన మనందరికి చిరపరిచితుడైన గీతాచార్య అని. అందరం పోటో తీసుకుందాం అనుకునేంతలో హలో నేను కూడా బ్లాగర్నే నా బ్లాగు పేరు యువకుడు అంటు ఒక నవయువకుడు వచ్చాడు. అసలు ఊహించ కుండానే అంత మంది బ్లాగర్లు ఒకేసారి కలుసుకోవటం గమ్మత్తుగా అనిపించింది. కార్యక్రమం సాఫీగా జరగటానికి సహాయ పడిన శ్రీనివాస కర గారికి, శివరామ ప్రసాద్‌గారికి ఎంతో ఋణపడి ఉన్నాం. పుస్తక ప్రదర్శనలో అడుగుపెట్టినప్పటినుండి అన్ని పనులు తమ భుజానవేసుకుని నడిపించారు. వారికి మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మొత్తం కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించిన ఒక పెద్దాయన తన పేరు సుబ్బారావు అని తాను కొత్తపాళీ గరి మామ గారినని పరిచయం చేసుకున్నారు. అందరం ఆయన్ని ఆప్యాయంగా పలకరించాం. ఈ వయస్సులో ఇంత చలిలో మనకోసం వచ్చినందుకు ఆయనకి ఏవిధంగా మనం ధన్యవాదాలు చెప్పగలం? కళగారి మితృడు సాయి మన కార్యక్రమ వివరాలు తెలుసుకుని ఆసక్తి తో మనకి ఎంతో సహాయం చేసాడు. కరపత్రాలను పంచి ఓపికగా అందరివద్దకి వెళ్ళి ఈ-మెయిల్ తీసుకుని నింపి కార్యక్రమం ముగిసేవరకూ ఉండి వెళ్ళారు. ఆయనకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు  

బ్లాగుమితృలు ఒక్కచోట చేరిన వేళ

బ్లాగుమితృలు ఒక్కచోట చేరిన వేళ

ప్రముఖ రచయిత కేశవరెడ్డిగారిని కలిసి నేను,అరుణగారు e-తెలుగు కార్యక్రమాలు వివరించాము. ఆయన మన కృషికి అభినందనలు తెలిపారు. అలాగే చదువరిగారు పలువురు ప్రముఖులను కలిసి e-తెలుగు కార్యక్రమాలు వివరించారు. పుస్తకప్రదర్శనలో కార్యక్రమం ముగించుకొని శ్రీకాంత్‌గారి ఇంటికి చేరుకుని బడలిక తీర్చుకున్నాం. ఆరోజు సంగతులన్నీ ఒక్కసారి స్మరించుకున్నాం. శ్రీకాంత్‌దంపతుల వద్ద సెలవు తీసుకుని బయలుదేరాం. శ్రీకాంత్‌గారు మాకూడా బయటకు వచ్చి మేము అల్పాహారం తినే వరకు మాతోనే ఉన్నారు. ఆయనకి కళగారికి మనం ఋణపడిపోయాం. ఆ స్మృతలన్నీ మూటగట్టుకొని హైదరాబాద్ దారిపట్టాం.మొన్న ఎలా జరుగుతుందో అన్న ఊహ, నిన్న నమ్మలేని నిజంగా మాముందు ఆవిష్కరింపబడి నేటికి ఒక మధుర ఙ్ఞాపకంలా అనుభవాల పెట్టెలోకి చేరుకుంది. నివేదికకి చిత్రాలని అందించిన శ్రీనివాసరాజు దాట్లకి ధన్యవాదాలు. నేను మరిచిపోయిన వ్యక్తుల వివరాలు, సంఘటనలు ఏమయినా ఉంటే మితృలు వ్యాఖ్యలరూపంలో అందించండి.

13 comments జనవరి 7, 2009

భయంగా ఉంది నాన్న…

 
11 డిసెంబర్ 2008 :

“రాణి, నీ పెళ్ళి ముహూర్తం కూడా నిర్ణయం అయిపోయింది. బట్టలు,నగలు కొనటానికి రేపే అమ్మ,నేను విశాఖపట్నం వెళ్తున్నాం. నీకేం కావాలో చెప్పమ్మా?”

“నాన్న, నీ ఒక్కగానొక్క కూతురి పెళ్ళి ఘనంగా చేస్తావుగా మరి. నన్ను కాదని ఫోజు కొట్టిన సాఫ్ట్ వేర్ బావల చూపులు ఆకాశం నుండి నేలకి దిగిరావాలి. మా కొడుకులే పుత్తడి, మీరు ఇత్తడి అన్న అత్తల డాబు దిగేలాగా బందువుల్ని,ఊరందర్ని పిలవాలి. నువ్వు అడిగిన విధంగా ఖర్చులన్నింటినీ వ్రాసిపెట్టా. 20 లక్షలకి దగ్గరగా వచ్చింది.”

“అంతా నీకు నచ్చినట్టే చేద్దాం. మేము పొద్దున్నే బయలుదేరి రాత్రికి వచ్చేస్తాం. నువ్వు నిదానంగా లేచినా పర్వాలేదు. వచ్చేంతవరకు జాగర్త తల్లి.”

“సరే నాన్న.”

12 డిసెంబర్ 2008:

“రాణీ! తల్లి ఎక్కడున్నావు రా. ఇదిగో చూడు నువ్వు అడిగిన దానికంటే అందంగా ఉన్న చీరలు, నగలు. నా చిట్టితల్లి దగదగా మెరిసిపోతుంది ఇవి వేసుకుంటే. ఎక్కడున్నావమ్మా?”

“అమ్మాయి గది తలుపు వేసి ఉంది. పడుకుందేమోనండి? రేపు చూస్తుంది లెండి.”

“ఒక్కసారి ఇవన్నీ చూపించి నా చిట్టి తల్లి కళ్ళలో అనందం చూడకుండా పడుకున్నా నాకు నిద్రపట్టదు. వెళ్ళి కిటికీ లోంచి పిలువు వినిపిస్తుంది.”

“అలాగే. చెబితే వినరుగా….. ఏవండీ! త్వరగా రండీ. అయ్యో చిట్టి తల్లీ ఎంత పని చేసావమ్మా. నీకే కష్టం వచిందమ్మా. మమ్మల్ని ఒంటరిని చేసి వెళ్ళిపోయావా తల్లీ….”

“అమ్మా…..” 

రాణి తనగదిలో చీరతో ఉరివేసుకుని కనిపించింది ఆ తల్లిదండ్రులకి. వాళ్ళ రోదన అలా కొనసాగుతూనే ఉంది. బందువులు, మితృలు, పోలీసులు అందరూ వచ్చివెళ్ళారు. తలా ఒకమాట అన్నారు. ఆ తల్లిదండ్రుల అజాగ్రత్తకు, అతిజాగ్రత్తకు మందలించారు, తోచిన సలహాలిచ్చారు. కొందరు కూపీలాగారు. కానీ ఈ సంఘటనలో వారు పోగొట్టుకున్నది ఎవరు తిరిగి తెచ్చి ఇవ్వలేదు. రాణి కూడా ఒక ఉత్తరమైనా వ్రాసిపెట్టలేదు. తను ఉత్తరం వ్రాయలనుకుని ఉంటే ఏమని వ్రాసేది…….

 

ఆత్మహత్యకి ప్రత్యమ్నాయం లేదా?

ఆత్మహత్యకి ప్రత్యమ్నాయం లేదా?

ప్రియమైన నాన్నగారికి,

నాన్న నీతో చాలా మాట్లాడాలని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటా కానీ నీ పెద్దరికానికి, పెద్ద పెద్ద ఆలోచనలకి నావి ఆకతాయి అల్లరి చేష్టల్లా ఉంటాయని కొట్టి పారేస్తావ్. ఈ ఒక్కసారికి విను నాన్న. ఎందుకంటే ఇకముందు ఇలా చెప్పే అవకాశం ఉండదేమో? నాన్న నువ్వెంత గొప్పవాడివో తెలుసా. బయటవాళ్ళకి నువ్వెవరో తెలియదు గాని నాకు మాత్రం నువ్వు దేవుడివి. నువ్వు నాకు ఏమి ఇవ్వలేదని నాన్న. జీవరాశుల్లోనే ఉత్తమమైన మానవ జన్మనిచ్చావ్, అడిగింది కాదనక అల్లారు ముద్దుగా పెంచావ్, చదువు చెప్పించావ్. ఇప్పుడు నా పెళ్ళికోసం కూడా ఎంత కష్టపడుతున్నావ్.

అసలు ప్రతీ మనిషి ఇంతేనేమో, పెళ్ళి కానంతవరకు తనకోసం బ్రతికి, తనకోసం సంపాదించేవాడు పెళ్ళి కుదిరిన మరుక్షణం నుంచే పిల్లలే జీవితంగా బ్రతుకుతారు. నువ్వు పొద్దున్న లేస్తూనే కష్టపడేది, సంపాదించేది, ఆదా చెసేది ప్రతీది నా కోసమేగా. నీ జీవితం లో నీకోసం పావువంతు బ్రతికి మిగిలిన జీవితమంతా నా కోసమే బ్రతికావు కదా!

మరి నాకోసమే ఇంతలా బ్రతికే నువ్వు, నాకు ఏమి కావాలన్నా ఇచ్చే నువ్వు, నా భవిష్యత్తుని నా వందేళ్ళ జీవితాన్ని నిర్ణయించే పెళ్ళి దగ్గర మాత్రం నా ఇష్టాలతో, ఆశలతొ, ఆశయాలతో, నా భవిష్యత్తు నిర్ణయాలతో పనిలేకుండా పరువు, ప్రతిష్ట అంటావేంటి నాన్న. ఈ పరువు, కుటుంబ ప్రతిష్ట అంటే ఏంటి నాన్న? ఆడపిల్ల పద్దతిగా లేకపోతే కుటుంబ పరువు పోతుందని రోజూ అమ్మకి చెబుతావ్, సమాజం లో తలదించుకొనే పరిస్థితి రాకూడదని రోజూ అంటావ్. అమ్మ సంగతి తెలుసుగా 5వ తరగతి చదువుతో ఆడదానికి కుటుంబమే సర్వస్వం, భర్తే దైవం అని తప్ప వేరే ఏది ఆలోచించలేదు. వ్రతాలు, గాజులు, చీరలు, ఆవకాయ, అప్పడాలు ఇవి తప్ప తన దగ్గర ఇంకేదన్నా చర్చిస్తే తనకి అర్ధం కాదు. అందుకే నీ పరువు కోసం నన్ను గడప దాటనివ్వదు. సమాజం లో నీ గౌరవం కోసం నన్ను ఎవరితోనూ స్నేహం చెయ్యనివ్వదు. నీ బాగు చూసి ఓర్వలేకపోతున్నారు బందువులు అని బలంగా నమ్మి ఎవరితోనూ మాట్లాడనివ్వదు.

నా ఆలోచనలు ఆకాశంలో విహరిస్తే, మీ అర్ధంలేని భయాలు నా ప్రపంచాన్ని చిన్నదిగా చేసాయి. నా వయస్సులోనే ఉన్న అక్కలు,అన్నయ్యలు,బావలు,వదినలు ఎందరో మన భందువుల్లో ఉన్నారు. ఒక్కరోజు ఎవరినీ కలిసే అవకాశం లేదు. మనసు విప్పి మాట్లాడే అవకాశంలేదు. వాళ్ళ భవిష్యత్తు ప్రణాలికలు తెలుసుకోవాలన్న నా కోరిక ఇప్పటికీ తీరలేదు. వాళ్ళు కంప్యూటర్ లో ప్రపంచాన్ని చూస్తుంటే, నేనుమాత్రం ఇల్లే ప్రపంచంగా బ్రతికాను. విశాలమైన మన ఇంటి గదుల్లో ఎంత ఇరుకుగా పెరిగానో నీకు తెలుసా నాన్న.

ఒకరోజున హఠాత్తుగా పెళ్ళిచూపులన్నారు, పెళ్ళన్నారు. వచ్చినవాడికి నేనంటే ఇష్టమా? మీరు ఇస్తానన్న కట్నం ఇష్టమా? నా ఆశలని,ఆలోచనలని అర్ధంచేసుకుంటాడా? లేక వండివార్చితే చాలనుకుంటాడో? ఏమీ తెలియదు. ఇవన్నీ పోని మిమ్మల్ని అడుగుదామంటే ఆడది చదివి చెడిందంటారు. అంతేగా? ఇంకెవర్ని అడగాలి? ఎవరితో పంచుకోవాలి. నాకు ఎవర్ని అందిచారు? ఎవర్ని మిగిల్చారు మీరు? నాకు నేను తప్ప ఎవరూ మిగలలేదు.

అసలు లోకులు,బందువులు ఎవరు నాన్న మన జీవితాల్ని శాసించటానికి? ఇప్పుడు రమ్మను వాళ్ళని కళ్ళు చల్లబడతాయి. ఇప్పుడూ నేను లేని లోటుని తీర్చగలరా వాళ్ళు. పశ్చాత్తాప పడి నేను కోల్పోయిన ప్రాణాన్ని తిరిగి ఇవ్వగలరా. నీ మనసులో గూడు కట్టుకు ఉన్న పరువుని, ప్రతిష్టని అడిగి సమాధానం చెప్పు.. ఇకచాలు నాన్నఇంత పెద్ద ప్రపంచంలో నాకు,నా ఆలోచనలకి స్వేచ్చని,స్థానన్ని ఇవ్వలేని సంకుచిత సమాజాన్ని ద్వేషిస్తూ వెళ్ళిపోతున్నా. నీ రూపం లో నా మెడని వంచి విజయాన్ని అందుకుందామన్నా విధిని పరిహసిస్తూ వెళ్ళిపోతున్నా. నా ఇష్టమయిన ఉయ్యాలని చివరిసారిగా ఊగాలని ఉరివేసుకుని ఊగి వెళుతున్నా.

అంతే నాన్న..  నేను చెప్పాలనుకున్నది అంతే…   ఇంకా చాలా చెప్పగలనేమో..  కానీ ఇప్పటికే జరగాల్సిన ఆలస్యం జరిగిపోయింది..  ఇంకా ఏవో చెప్పి ప్రయోజనం లేదు…

ఇన్ని మాటలు చెప్పాను కానీ నాన్న, భయంగా ఉంది నాన్న. చావాలంటే భయంగా ఉంది నాన్న. ఉరితాడు నా మెడకి బిగుసుకుంటూ ఉంటే ఊపిరాడక నొప్పిగా ఉంటుదేమో? నాన్న భయంగా ఉంది. చనిపోయాక ఎమవుతా నాన్న, అక్కడ ఆలోకంలో ఆకలయితే అన్నం పెట్టే వాళ్ళు ఉంటారా? ఒంటరిగా అందర్ని వదిలి వెళ్ళాలంటే చాలా భయంగా ఉందినాన్న. నన్ను మరిచిపోకండి నాన్న… ప్లీజ్

మీ నిర్భాగ్యురాలయిన కూతురు,

రాణి.  

(ఇది ఈమధ్య మా బందువుల్లోనే జరిగిన ఒక సంఘటన. కారణం ఎవరికీ తెలియదు. బందువుల్లో ఎవరితోనూ కలివిడిగా ఉండే అవకాశంలేదు. ఒక చిన్న పల్లెటూరిలోనే తన నిండు నూరేళ్ళు నిండిపోయాయి. తన చివరి క్షణాల్లో పడ్డ సంఘర్షణ ఆవిష్కరించాలని ఎంతగానో ప్రయత్నించా. కానీ తన ఆలోచనలు, నడవడిక, వ్యక్తిత్వం , గతం, భవిష్యత్తుకై తన ఆలోచనలు ఏమీ తెలియని నేను వ్రాసినవి కేవలం నా ఊహలేగాని వాస్తవాలు కావు. వాస్తవాలు తన మనస్సు అనే రహస్యపు పెట్టెలో శాశ్వతంగా దాచేసి తనతో తీసుకుపోయింది. నావాళ్ళకే నాతో కష్టాలు పంచుకునే చనువు ఇవ్వలేకపోయాను. అందుకేనేమొ ఈ సంఘటన నన్ను పదే పదే వెంటాడుతుంది. నాకిప్పుడు కొన్ని నిజాలు తెలియాలి. తను చనిపోవాల్సిన అవసరం ఏంవచ్చింది? తన  చావుకి నిజమయిన కారకులు ఎవరు? చనిపోయినప్పుడు తన ఆత్మసంఘర్షణ  ఏంటి? చావు తర్వాత ఏమవుతుందో ఇప్పటికీ మానవమేధస్సుకి తెలియదు. తను అసలు ఆవిషయం ఆలోచించిందా? ఉరివేసుకోవటానికి భయపడలేదా? బ్రతకటానికి ఏవయినా అవకాశాలు ఉన్నాయేమొ ఆలోచించలేదా? రేపటినుండి తాను ఏమవుతుంది, తనగది ఏమవుతుంది, తన బట్టలు, పుస్తకాలు, తనకిష్టమయిన వస్తువులు అన్నీ ఏమవుతాయి? ఇంకా కొన్ని వేల ప్రశ్నలు నా మనస్సుని తొలిచేస్తున్నాయి. ఇన్ని ప్రశ్నలు తనకి కలగలేదా? మరి ఏం సమాధానం చెప్పుకుంది. తనని తాను చావుకి మానసికంగా ఎలాసిద్దంచేసుకుంది. నా ప్రశ్నలకి ఎవరు సమాధానం చెప్పగలరు………………….)


17 comments డిసెంబరు 28, 2008

జావా జావా కన్నీరు

పొద్దున్నే అయ్యప్ప పూజ చేసుకొని కిటికి తలుపు తెరిచా పక్షులింకా అప్పుడే బ్రష్ చేసుకోవటం మొదలు పెట్టాయి. నేను స్నానం కూడా చేసాను అని వాటికి తెలియాలని బట్టలు శబ్దంవచ్చేలా పదిసార్లు దులిపి తీగమీద వేసి వచ్చా. లేకపోతే సాఫ్ట్ వేర్ వాళ్ళంటే ప్రతి ఒక్కడికి లోకువే. “మా లంచ్ అయితే గాని పక్కమీదనుంచి లేవని సాఫ్ట్ వేర్ వాళ్ళు” అని పక్షులు ఒక సామెత కూడా పెట్టేసుకున్నాయి. ఈ రోజుకి వాటి తిక్కకుదిరింది.

పిచ్చుక 1: కిచకిచ కిచ్ కిచ్ కీచ్ కీచ్  (తెలుగులో: ఏంటే మనోడు ఈ రోజు పొద్దున్నే లేచాడు. ఏంటి సంగతి?)

పిచ్చుక 2: కిచో కిచ కిచోకిచ కిచకిచే కిచ కిచకిచే కిచ కిచ్చు కిచ్చు కిచ్చు కిచ్చు   (తెలుగులో: నిద్రపట్టక. మాబావ స్వాలో అమెరికా లోని లీమన్ బ్రదర్స్ లో గూడు కట్టుకొని ఉన్నాడు తెలుసుగా వాడు నిన్నే మెయిల్ పెట్టాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యమని. అమెరికాలోని ఆర్ధికమాంధ్యనికి ఇక్కడ సాఫ్ట్ వేర్ కంపెనీలు ఎలాగు మూసుకోవాలి. ఇళ్ళులేని భారతీయ పక్షులన్నింటికీ హైటెక్ సిటీ లో గూళ్ళు కట్టి అమ్ముకో అని. అదీ వీడి ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అని నిద్రపట్టక లేచుంటాడు.)

వెంటనే నేను కిటికి మూసేసి, కర్టేన్ వేసి లోపలికి వచ్చేసా.

కాసేపు అష్టాచెమ్మా,గుడుగుడు గుంచం ఆడుకున్నాం. కోతికొమ్మచ్చి, కబడ్డీ, కర్రాబిళ్ళ ఆడుకుందామంటే స్థలాభావం. అందుకే “ఎక్కడి సెల్లులు అక్కడే గప్చుప్ సాంబార్ బుడ్డీ” ఆడుకున్నాం.(ఆట నియమావాళి: 1.అందరూ నిజాయితీగా ఆడాలి. 2.రూం లో ఉండే వారు, అమీర్ పేట హాస్టల్లో ఉండేవాళ్ళు బయట వారిని ఆడించకూడదు. 3.కొద్దిరోజులముందే సెల్లు పోగుట్టుకున్న నాలాంటి వారిని ఆడించేప్పుడు తగిన జాగర్తలు తీసుకోవాలి. 4.మీ సెల్లు గాని దొంగ సెల్లు అయితే సెల్లు యజమాని ఉన్నప్పుడు ఆడరాదు. ఆట విధానం: 1 .మొదటగా పంటలు వేసుకోవాలి. (పొలం లో వేసేవి కావు.) 2.దొంగ ఎవరో తెలిసాక వాడి సెల్లు తీసి పండిన వారు దాచేయాలి. 3.దొంగ పసిగట్టకుండా ఎప్పటికప్పుడు స్థలాలు మార్చాలి. 4.చివరగా ఎవరు దాచినప్పుడు దొంగ సెల్లు పట్టేసుకుంటాడో వాడు తర్వాతి ఆటకి దొంగ. ముఖ్య గమనిక: ఇక్కడ చెప్పబడిన ఆటలో జాగర్తవహించకుండా ఆడి సెల్లు పోగొట్టుకుంటే దానికి పూర్తి భాద్యత జానారెడ్డి గారిది. నైతికభాద్యత వహిస్తూ అమ్మ ఆదేశానుసారం ఆయన రాజీనామా చెయ్యాలి. జై ఉండవిల్లి)

గతంలో ఎప్పుడూ అంత పొద్దున్నే లేచిన అనుభవంలేదు. ఆ టైం లో ఏం చేస్తారో తెలియదు. పోని బయటకి వెళ్ళి అందరూ ఏం చేస్తున్నారో చూద్దమంటే చలి. ఇక గత్యంతరం లేక టి.వి. పెట్టా.

టి.వి.99: సాఫ్ట్ వేర్ ఉద్యోగులకి పిల్లనివ్వటానికి మీరు సిద్దమా? (మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.) మీ సమాధానం అవును అయితే ఎఱ్ఱగడ్డ పిచ్చి ఆసుపత్రి కి ఫోన్ చెయ్యండి. కాదు అయితే మీ పక్కింట్లో అద్దెకుండే సాఫ్ట్ వేర్ కుర్రాళ్ళు మీ అమ్మాయి మీద కన్నేసారు జాగర్త.

టి.వి.55: ఆర్ధికమాంధ్యంతో చివరికంటా పోరాడి ఉద్యోగాలు కోల్పోయిన సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కుటుంబాలకి మీ సానుభూతి తెలియజేయాలనుకుంటే హైటెక్ సిటీ ముందు కొవ్వొత్తులని వెలిగించండి.

టి.వి. 100: @$!^*!*!)(*%%!$$

టి.వి. 1000000000000001: !@!^$%!!)*!*(!

టి.వి. ఆపేసి ఆఫీస్ కి బయలుదేరాను.

నేను: ఆటో లైఫ్ స్తైల్ కి వస్తావా?

ఆటోవాడు: 100 అవుతుంది.

నేను నా ట్యాగ్ తీసి మెడలో వేసుకున్నా.

ఆటోవాడు: సాఫ్ట్ వేరా?(సంతోషం సినిమా లో బ్రహ్మానందం డబ్బాపాలా అని అడిగినట్టు)

నేను: అవును. (దీనంగా మొహం పెట్టి)

ఆటోవాడు: ఊరుకోండి సార్. కష్టాలు సాఫ్ట్ వేర్ వాళ్ళకి కాకపోతే మనుషులకి వస్తాయా? ఇలాంటి సమయంలోనే ఒకరికొకరు చేదోడు గా ఉండాలి. 30 ఇవ్వండి చాలు.

కట్ చేస్తే మొత్తానికి ఆఫీస్ కి వచ్చిపడ్డా. డబ్బుల్లేక ఆటోవాడికి సొడెక్సో ఇచ్చా. ఆఫీస్ లో అడుగు పెట్టగానే పవన్ గాడు టెన్షన్ గా అటూ ఇటూ తిరుగుతున్నాడు.

నేను: “ఏమయ్యింది రా?”

పవన్: నాకు లీవ్ కావాలి రా. ఆర్.ఆర్.బి., బ్యాంక్ పుస్తకాలు కొనడానికి కోఠికి వెళ్ళాలి. సరోజ తెలుసు గా?

నేను: ఎవరు నువ్వు హౌసింగ్ లోన్ తీసుకున్న 20 లక్షలతో షాపింగ్ చేసిన అమ్మాయే గా ఎలా మరిచిపోతా?

పవన్: అవునవును. గవర్నమెంట్ ఉద్యోగం చూసుకోకపోతే, నన్ను పెళ్ళి చేసుకోను అంది. పోని మరో అమ్మాయిని చుసుకుందామంటే అప్పులివ్వటానికి బ్యాంకులన్నీ ఎత్తేస్తున్నారుగా.

అని హడావుడి గా మా పి.ఎం. ని కలిసాడు. మా పి.ఎం. “ఏంటయ్యా నీ గోల? రోలొచ్చి మద్దెలకి మొరపెట్టుకోవటం అంటే ఇదే. ఇటు ఉద్యోగం సవ్యంగా లేక అటు స్టాక్ మార్కెట్ లో పెట్టిన డబ్బులుపోయి నేను ఏడుస్తుంటే? వెళ్ళి ఏదో ఒకలా తగలడు” అని పవన్ గాడిని పంపేసాడు. నేను వెళ్ళి నా క్యూబ్ లో కూర్చున్నా. హాసిని ప్రమోషన్ వచ్చిందని చెప్పి స్వీట్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఉద్యోగాలు తీసేసే కాలంలో ప్రమోషన్ ఏంటబ్బా నాకర్ధం కాలేదు. వాళ్ళ టీం లో ఉండే రాజేష్ ని అడుగుదామని కాల్ చేసా.

నేను: హలో

రాజేష్: అవును నేనే తాజ్ హోటల్లో చనిపొయింది. నా పేరు ఇమ్రాన్. మాది పాకిస్థాన్.

నేను వెంటనే బయపడి ఫొన్ పెట్టేసా. కాసేపట్లో కొందరు వైట్ డ్రెస్ లో వచ్చి రాజేష్ తో పాటు మరికొందర్ని గొలుసులు కట్టి తీసుకుపోయారు. జీవితంలో ఇచ్చిన ఒకేఒక్క సెమినార్ తో 10 మందిని మతిస్థిమితం లేకుండా చేసి హెడ్ కౌంట్ తగ్గించినందుకు హాసిని కి ప్రమోషన్ ఇచ్చారు. ఇంకా మరిన్ని సెమినార్లు చెప్పించాలని మేనేజ్మెంట్ అనుకుంది. ఏదో మెయిల్ చూసుకుంటున్నా.

ఫోన్ వచ్చింది. “సర్! నేను హెచ్.ఎస్.బి.సి. నుంచి మాట్లాడుతున్నా క్రెడిట్ కార్డ్”

నేను: నాకొద్దు.

“ఏడ్చావ్. అదే మేమూ చెప్పేది మీ కార్డ్ క్యాన్సిల్ చేసా పో” ఫొన్ పెట్టేసింది.

నా ఖర్మకి ఏడ్చి కాఫీ త్రాగుదామని వెళ్తుంటే (ఆఫీస్ లో కాదు బాబు. ఆఫీసుల్లో ఎప్పుడో ఎత్తేసారు) మా పి.ఎం. వచ్చి హాసిని ఏదో సెమినార్ అంటా నువ్వుకూడా వెళ్ళు అన్నాడు. విషయం అర్దమయ్యింది “సార్ పొద్దున్నే కాలుకి ముళ్ళు గుచ్చుకుంది అప్పటి నుండి కడుపులో నొప్పిగా ఉంది ఈ రోజు కి ఇంటికి వెళ్ళిపోతా” అని చెప్పి ఆయన ఏం చెబుతున్నాడో కూడా వినకుండా వచ్చేసా.

బయట ఒక కుర్రాడు ఏవో కరపత్రాలు పంచుతున్నాడు. మెడలో ట్యాగ్ వేసుకొని ఉన్నవాళ్ళకి మాత్రమే ఇస్తున్నాడు. నన్ను చూసి “గురూ తీసుకో పనికొస్తుంది” అని ఇచ్చాడు.

అందులో వివరాలు.. ప్రత్యమ్నాయ ఆదాయం కోసం కోచింగ్ సెంటర్. కోర్సులు

1. మిమ్మల్ని ఎవరూ గుర్తించకుండా పల్లీలు, భఠాణీలు అమ్ముకోవటం ఎలా?

2. మిర్చి బజ్జీ తయారీ విధానాలు.

3. దర్జాగా వచ్చి సెల్లు,ల్యాప్పీ పట్టుకొని పారిపోవటం ఎలా?

4…….

5…….

అదిచదువుతూ ఆటోని పిలిస్తే ఆటో వాళ్ళు అదోలా నా వైపు చూసి వెళ్ళిపోతున్నారు. ఒక ముసలి ఆటోడ్రైవర్ వచ్చాడు. “రా బాబు. భాదపడకు. ఆ భాద నాకు తెలుసు నాకూ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసిన కొడుకు,అల్లుడూ ఉన్నారు” అని కన్నీళ్ళతో ఆటోలో తీసుకు వచ్చి డబ్బులు ఇస్తున్నా తీసుకోకుండా వెళ్ళిపోయాడు. నాకేమి అర్ధం కాలేదు. నేను రావటం చూసిన నా శతృవులైన పిచ్చుకలు తినటం మానేసి వచ్చి అన్ని గుమిగూడి ఒకదాని రెక్కలు ఒకటి పట్టుకొని నా వైపు చూసి ఆనందంగా నవ్వుతూ అరకులోయలో గిరిజన యువతులు చేసే థింసా నృత్యం చేయటం మొదలు పెట్టాయి. “కిచ్చా రే కిచా కిచా కిచ కిచ హో కిచ్చా రే కిచా కిచా కిచ కిచ హో” ఏరోజూ బియ్యం ఏరినప్పుడు కూడా ఒక్క గింజ వేసిన పాపాన పోలేదు నన్ను చూసి ఇంతలా పండగ చేసుకుంటున్నాయేంటి ఏం అర్ధం కాలేదు. బెల్ల్ కొడితే తలుపు తీసిన మా సన్నీ గాడు నన్ను చూసి భోరున ఏడ్వటం మొదలుపెట్టాడు.

నేను: “ఏమయ్యింది రా?”

సన్నీ: “నా ఉద్యోగం ఎలాగూ పోయింది. నీ ఉద్యోగం ఉందన్న ధైర్యం తో ఉన్నడబ్బులన్నీ పెట్టి బియ్యం కూరగాయలు తెచ్చేసా. గ్యాస్ ఆర్డర్ చేసా. లాండ్రీ కి బట్టలు కూడా ఇచ్చా. వా……ఆ డబ్బులే ఉంటే బస్సెక్కి అమలాపురం పోయి పాలవ్యాపారం చేసుకునేవాడిని.. వా….”

నేను: సరే ఇప్పుడేమయ్యింది?

సన్నీ: నీ చేతి లో ఆ పింక్ స్లిప్ ఏంటీ?

నేను: ఓర్ని చంపేసారు పో. అదా అందరు అలా అనుకోవటానికి కారణం.అది కరపత్రమ రా..బాబు.

39 comments డిసెంబరు 10, 2008

జెమిని మ్యూజిక్ లో తెలుగు బ్లాగులు

ఈ రోజు మద్యాహ్నం 1:30 కి జెమిని మ్యూజిక్ లో బ్లాగులగురించి ఒక కార్యక్రమం లో వివరించారు. తెలుగు బ్లాగుల గురించి ప్రస్తావించారు. నాకు ఎక్కువసేపు చూసే అవకాశం దొరకలేదు. ఎవరయినా చూసి ఉంటే గనక కార్యక్రమ వివరాల్ని తెలపండి. కానీ యాంకర్ కి తెలుగు బ్లాగుల గురించిన సమాచారం ఎక్కువగా లేక పోవటం వలన అనుకుంటా మాటలు వెతుక్కుని చాలా ఇబ్బంది పడుతున్నట్టు కనిపించారు. ప్రసారమాధ్యమాల మద్దతు మనకి ఇప్పుడు ఎక్కువగా దొరుకుతుంది. ఇలాంటి సమయం లో బ్లాగుల గురించి తగిన సమాచారం వారికి అందేలా చూడటం మన కనీస భాద్యత.

ఒక టపాలో తెలుగు బ్లాగర్ల వివరాలు, బ్లాగు వయస్సు, ప్రత్యేకతలు పొందుపరిస్తే సులువుగా ఉంటుందని నా అభిప్రాయం. బ్లాగర్ గా నా వయస్సు కేవలం ఆరునెలలు మాత్రమే. అందువలన అందరి బ్లాగుల వివరాలు, వాటి పైన నా అవగాహన పరిమితం. అందువలన ఈ భాద్యతని నేను తీసుకోలేకపోతున్నా. లేదా మితృలు వ్యాఖ్యల రూపంలో మీకు తెలిసిన బ్లాగులని క్లుప్తంగా అందిస్తే ఒక టపాగా పొందుపరుస్తా.

7 comments నవంబరు 13, 2008

జాజు – ఒక కాకి కధ

భద్రాచలం కొండల మధ్యలో ఓ కాకులు దూరే కారడవి. జాజు అనే ఒక కాకి పిల్ల మరి కొన్ని కాకులతో కలిసి ఆ అడవిలో ఉంటుంది. కొన్నేళ్ళ క్రితం ఈ కాకులన్నీ గోదావరి నది ఒడ్డున మైదాన ప్రాంతంలో ఉండేవి. ఒకసారి వచ్చిన పెనుతుఫానులో అన్ని చెల్లాచెదురయ్యి ఇక్కడకి వచ్చి తలదాచుకొన్నాయి. సమూహంలో చాలా కాకులు తమ ఆప్తులని కోల్పోయాయి. జాజు కూడా తన వాళ్ళందరినీ కోల్పోయి ఇక్కడ తలదాచుకుంది. సమూహం లోని కాకులన్నీ రొజూ పగలంతా తిండి వేటలో కష్టపడి చీకటి పడే వేళకి సమావేశమై తాగి,తిని సందడి చేస్తాయి

జాజు ఎప్పుడూ సమూహానికి దూరంగా ఒంటరిగా గడిపేది. ఎప్పుడూ తనవాళ్ళగురించి ఆలోచిస్తూ ఉండేది. జాజు కి చిన్నప్పటి నుండీ పాటలు అంటే చాలా ఇష్టం. జాజు తల్లి మంచిగా పాటలు పాడేది. సమూహంలో అందరూ తనపాట విని మెచ్చుకొనేవారు. ఎప్పుడన్నా ఏదన్నా ఉత్సవం జరిగితే జాజు తల్లి పాట ఉండాల్సిందే. జాజు ఎప్పుడూ తన తల్లి జోలపాడీతే గాని పడుకునేది కాదు. తన తల్లిని ఎప్పుడూ అడిగేది “నేను కూడా పెద్దయ్యాక నీ అంత బాగా పాడగలనా?” అని.కాని జాజు గొంతు శ్రావ్యంగా ఉండదు, కాస్త బండగా ఉంటుంది. కాని జాజు బాధపడకూడదని “నాకంటే బాగా పాడగలవు” అని చెప్పేది జాజు తల్లి. జాజు బాల్యం గుర్తుచేసుకుని ఎప్పుడూ భాదపడుతూ ఉండేది. సమూహంలో అందరూ ఉన్నప్పుడు జాజు పాడితే ఎవరూ వినేవారు కాదు. మంచిపాటలు పాడే తల్లి కి నువ్వెలా పుట్టేవ్ అంతేలే పండితపుత్ర పరమ శుంఠః అని ఏడిపించేవారు. ఒక ఉత్సవంలో పాటల పోటీలో పాడబొతే అందరూ గోల చేసి ఆపేసారు. అప్పటి నుండీ జాజు ఉత్సవాలకి వెళ్ళటం మానేసింది. జాజు కి సమూహంలో ఇద్దరు స్నేహితులు ఉన్నారు.వాళ్ళే చింకి,డుంబు. వాళ్ళు జాజు తో ” సంగీతమనేది పుట్టకతో రావాలి మనకి ఆ విద్య రాలేదు వదిలెయ్ ” అని చెబుతాయి. సమూహంలో తిరగటం, ఉత్సవాల్లో పాల్గొనటం ఇష్టం ఉన్నాసరే జాజు ని ఒంటరిగా వదిలి వెళ్ళటం ఇష్టంలేక చింకి, డుంబు కూడా వెళ్ళటం మానేసారు.

ఒక రోజు ఆ అడవికి ఒక కోకిల దారితప్పి వచ్చింది. దాని పేరు టింకు. టింకు ఒక చెట్టు మీద కూర్చుని మావిచిగురు తిని పాట పాడింది. దాని పాట విని అడవిలో కాకులన్నీ వచ్చి దాన్ని భందిచాయి.రాత్రి సమావేశం లో అన్నీ తప్ప తాగి ఉన్నాయి. సమూహం పెద్ద సాహి గంభీరంగా గద్దెమీద ఉన్నాడు. ఉత్సవాల్లో ఎప్పుడూ పాటలు పాడే కేతు ఆవేశంగా “టింకు జాతి వల్ల కాకి పాటలని అందరూ అసహ్యించుకుంటున్నారు. ఆ జాతి మీద తరతరాలుగా మనం చేస్తున్న యుద్దం ఇంకా ఆగలేదు. కేవలం మన గుట్టు తెలుసుకోవటానికి వచ్చిన గూఢచారి టింకు. దాన్ని చంపెయ్యాలి ” అని అరిచిగోల చేసింది.సమూహంలో కాకులన్నీ “అవును అవును” అన్నాయి. చేసేదిలేక సాహి కూడా అంగీకరించాడు. కానీ జాజుకి టింకుని చంపాలన్న సమూహం నిర్ణయం నచ్చలేదు. కానీ పెద్దల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే సమూహం నుంచి వెలివేస్తారు లేదా కొన్నిసార్లు మరణశిక్ష కూడా పడవచ్చు. అందుకే అందరిముందు ఏమి అనకుండా ఊరుకుంది. చింకి,డుంబులని పిలిచి ఎలాగైనా టింకు ని కాపాడాలని చెప్పింది. చింకి,డుంబు పెద్దలని కాదంటే ఏమవుతుందో అని మొదట భయపడ్డారు. కానీ ప్రాణస్నేహితుడి మాటను కాదనలేక ఒప్పుకున్నారు.

రాత్రి అందరూ తాగి మత్తుగా పడుకున్నారు. తెల్లవారితే టింకుని చంపేస్తారు. చీకటిలో ఎవరూ చూడకుండా జాజు మఱ్ఱిచెట్టు తొర్రలో ఉన్న టింకు కట్లు విప్పి బయటకి తీసుకువచ్చింది. చింకి, డుంబు బయట కాపలాగా ఉన్నాయి. అందరూ రాత్రి ఎవరూ చూడకుండా తప్పించుకుని చాలా దూరం ఎగిరి వచ్చేసాయి. టింకు వాళ్ళకి తన ధన్యవాదాలు తెలిపింది. “ఇక సెలవు మిత్రమా, నీ వాళ్ళ దగ్గరకి నీవు హాయిగా వెళ్ళవచ్చు ” అని టింకుని వదిలి వెనక్కు రావాలని అనుకున్నారు స్నేహితులు. “నా వాళ్ళు ఎక్కడున్నారో ఇప్పుడు ఇక జన్మ లో నేను వాళ్ళని కలవలేనేమొ. ఇక్కడ దగ్గరలో ఏదో మామిడి తోపు చూపించండి అక్కడే ఉండిపోతా.” అంది టింకు. అప్పటికే తెల్లవారింది. తమ సమూహంలో అప్పటికే విషయం తెలిసిపోయుంటుంది ఇక వెనకకు వెళ్ళటం ఆపదకొనితెచ్చుకోవటమే అని మితృలు గ్రహించారు. ఇక అందరూ కలిసే ఉందామని నిర్ణయించుకున్నారు. మానవసంచారానికి దగ్గరలో ఉన్న ఒక చిట్టడవిలో నివాసం ఏర్పరుచుకొన్నారు.

అందరూ దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి తిండి సంపాదించుకొనేవారు. వచ్చే దారిలో ఒక విద్వాంసుడు తన శిష్యులకి సంగీతం నేర్పేవాడు. జాజు అక్కడే చెట్టుమీద కూర్చుని రోజూ ఆ పాటలు విని మనుషులు చాలా అదృష్టవంతులు అనుకునేది. అలాంటప్పుడు ఎప్పుడన్నా టింకు పాడితే గురువు ఆహా కోకిలది ఎంతకమ్మని గొంతు అనేవాడు. చాలా సార్లు అలావిన్న జాజు ఒక రాత్రి “మిత్రమా! నీకు ఇంత కమ్మని గొంతు ఎలా వచ్చింది” అని అడిగింది. “మావిచిగురు తినటంవలనే మా జాతికి ఇంత కమ్మని గొంతు వచ్చింది నేస్తం” అని టింకు చెప్పి పడుకుంది. ఆ రోజు రాత్రంతా జాజు కి నిద్రపట్టలేదు. తన తల్లి గుర్తు వచ్చింది.

మధ్య రాత్రి లో ఏదో శబ్దం వినిపించి టింకు లేచి చూసింది. జాజు మామిడి చెట్టు మీద కూర్చుని చిగురు తిని తిని పాడుతూ ఉంది. దానితో గొంతు కి మామిడి చిగురు అడ్డుపడి మూర్చపోయింది. చింకి, డుంబు వెంటనే లేచి వెళ్ళి పట్టుకున్నారు. టింకు ఒక చిన్న ఆకు తో నీరు తెచ్చింది. నీరు త్రాగిన జాజు కాసేపటికి మొత్తం మామిడి చిగురు కక్కేసింది. రాత్రంతా స్నేహితులంతా దానికి సేవలు చేస్తూ ఉన్నారు. తెల్లవారితే జాజుకి తెలివి వచ్చి అందరినీ చూసి తల దించుకొని ఏడుస్తుంది. “నాకు జన్మలో పాటలు రావు. నాకు చాలా సిగ్గుగా ఉంది” అని జాజు భాదపడింది. “నీకు కూడా మంచిగా పాటలు వస్తాయి బాదపడకు” అంటుంది టింకు.

“నా గొంతు బాగుండదు కదా మరి నేను ఎలా మంచిగా పాడగలను” అని అడిగింది జాజు. “పాడటానికి శ్రావ్యమైన గొంతు తప్పనిసరి కాదు గొంతులో మంచి శృతి,లయ ఉంటే చాలు” అంది టింకు. కానీ జాజు ఆ మాటలు నమ్మదు. ఒక రోజు వీళ్ళు ఉండె అడవికి కొంతమంది మనుషులు పిక్నిక్ వచ్చారు. వాళ్ళు పగలంతా నీట్లో ఆడుకొని రాత్రికి మంట పెట్టి దాని చుట్టూ పాడుతూ డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళ గొంతు ఊరిలోని విద్వాంసుడి గొంతులా గొప్పగా లేదు. బండ గా ఉంది. అయినా వాళ్ళు పాడుతూ ఉంటే చాలా ఉత్సాహంగా ఉంది. టింకు వాళ్ళని చూపించి “చూసావా సంగీతానికి గొంతు కాదు శృతి లయ ముఖ్యం” అని చెప్పింది. మరుసటి రోజు నుంచి ఒక వారం రోజులు పాటు దగ్గరలో ఉన్న గ్రామాలన్నీ తిరిగి ప్రజలు వినేవి, పాడుకునేవి పాటలన్నీ విన్నారు. అందులో జాస్సిగిఫ్ట్ తో మొదలెట్టి హిమేష్ వరకు ఉన్నాయి. “అ అంటే అమలాపురం” నుండి “ఆకలేస్తే అన్నంపెడతా” వరకు ఉన్నాయి. అప్పుడు టింకు చెప్పింది నిజమే అని జాజు నమ్మింది. ఆ రోజు నుండి టింకునే జాజు కి సంగీత గురువు. జాజు కష్టపడి రాత్రి పగలు పాడుతూనే ఉంటుంది. చింకి, డుంబు జాజు తిండి అవసరాలు చూస్తూ ఉంటారు. వాళ్ళకి కూడా సంగీతం మీద ఇష్టం పెరిగి జాజు పాడూతూ ఉంటే పక్కన ఎండిన ఆకులను తొక్కుతూ, ముక్కులతో కొమ్మలను కొడుతూ శబ్దం చేస్తూ ఉంటారు. ఒక రోజు చింకి కొన్ని చిన్న చిన్న గిన్నెలు చెంచాలు ఎత్తుకొచ్చి వాటిని కొట్టటం మొదలు పెట్టింది. డుంబు ఊరిలోకి పోయి ఒక బూరలమ్మే వాడి బుట్టలో ఉన్న ఏక్తారా ఎత్తుకొచ్చేసి ముక్కుతోను, గోళ్ళతోను వాయించటం మొదలు పెట్టింది. జాజు తెలివిగా తన బండ గొంతుని, టింకు మంచి గొంతుని సరైన పద్దతిలో కలిపి చక్కని బాణీలు కట్టి పాడింది. వాళ్ళు అలా పాడుతూ ఉంటే ఆ చిట్టడవిలో జంతువులన్నీ మెచ్చుకున్నాయి. ఇంకేముంది తాము “4 నోట్స్” అనే ఒక రాక్ బ్యాండ్ గా ప్రకటించుకున్నాయి.

తమ సమూహం లో తన పాటల ప్రతిభ చూపించాలని తన తల్లి పేరు నిలబెట్టాలని జాజు స్నేహితులతో తిరిగి పాత అడవికి బయలుదేరింది. వీరిని చూడగానే కేతు తన బృందంతో దాడి చేసి భందించింది. సాహి ముందు హాజరు పరిచింది. వాళ్ళు చేసిన దాడి లో జాజుకి తీవ్రంగా దెబ్బలు తగిలాయి. సాహి మీరు సమూహం నిర్ణయాన్ని ఎదిరించారు మీకు మరణశిక్ష తప్పదు. కానీ పారిపోయిన మీరు ఎందుకు తిరిగి వచ్చారు చెప్పండి అని అడిగింది. జరిగిన విషయం మొత్తం జాజు చెప్పింది. అంతా విన్న సాహి ఆలోచనలో పడింది. కేతు గర్వంతో పాటలో నన్ను ఓడిస్తే నీకు శిక్ష లేకుండా వదిలేస్తాం అని అంది. అందరూ ఒప్పుకున్నారు. చావు ఎలాగు తప్పదు కాబట్టి చివరి అవకాశంగా జాజు కూడా ఒప్పుకుంది. కానీ పోటిలో ఓడితే తనని మాత్రమే చంపాలని మిగిలిన వాళ్ళని క్షమించాలని ఇదే తన చివరికోరికని చెప్పింది. కేతు వీళ్ళ దగ్గర ఉన్న వస్తువులన్నీ ఎక్కడివి? దొంగతనం గా ఎత్తుకు వచ్చినవిలా ఉన్నాయి వీటిని వాడటానికి వీళ్ళేదంది. కేతూ బృందం మాత్రం పాట మొదలు పెట్టి అద్బుతంగా పాడారు. కాకులన్నీ ఆనందంతో చిత్తుగా తాగి ఊగి రెచ్చిపోయి గెంతాయి. ఇప్పుడిక జాజు బృందం పాడాలి. వాద్యాలు లేవు. జాజు దిగులుగా వేదిక మధ్యలో నిలబడింది. డుంబు కి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. తనతోకలో ఒక ఈక పీకి బాణంలా వంచి దానికి చిన్న చిన్న తీగలు కట్టింది. “ట్రంగ్” మని గట్టిగా శబ్దం చేసింది. చింకి కొన్ని కొబ్బరి చిప్పలు తెచ్చి తిరగేసి వాటి మీద ముక్కు తో కాంగో కొట్టటం మొదలుపెట్టింది. టింకు “హే హే లలల లా హే హే లలల లా” అని చిన్న ఆలాపన చేసింది. అప్పుడు జాజు కి ఉత్సాహం వచ్చింది. మితృలందరూ చావుకి సిద్దపడే ఉన్నారు. జీవితంలో చివరిసారి పాడుతున్నాము అనే స్పృహలో ఉన్నారు. తమకిష్టమైన సంగీతం కోసం చావుకి సిద్దపడ్డారు. సంగీతంలో మునిగి చనిపోవాలన్న కాంక్షతో తన్మయత్వం లో ఉన్నారు. వారి ఆత్మలీనమైన ఆ పాట అద్బుతంగా ఉంది. జాజుకి తగిలిన దెబ్బలనుండి రక్తం కారుతూనే ఉంది. కేతు కూడా పాటలో లీనమైపోయాడు.

“నా తల్లి లాలిపాటలో,

నామితృలు పంచిన ప్రేమలో,

కమ్మదనమే నా పాట.

ఈ వరాలన్నీ నాతో ఉంటాయి ప్రతిపూట.

ఈ పూట తో నా ఊపిరి పోయినా,

ఓ పాటగా నే బ్రతికే ఉంటా.

ఆ కొండలో ఆ కోనలో, ఈ చెట్టులో ఈ పుట్టలో,

ప్రతి సవ్వడిలో ఓ పాటగా నే బ్రతికే ఉంటా.”

ఆత్మ ని మిలితంచేసి పాటలోనే కలిసిపోయి పాడూతూ జాజు వేదికపైన ఒక్కసారి కుప్పకూలి పడిపోయింది.   

మరి జాజు తిరిగిలేచిందా? సమూహం వారి గొప్పతనాన్ని ఒప్పుకుందా? వాళ్ళ పాటకి అడవితల్లి జేజేలు పలికిందా? లేక సమాజం ఎప్పటిలానే తన కాఠిన్యం చాటుకుందా? ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పి నాది అనే ఒక ముగింపు ఇవ్వటం నాకిష్టంలేదు. “విఙ్ఞులయిన పాఠకులారా మీకు నచ్చిన ముగింపుతో మీరే కధని చదవటం పూర్తిచేయండి.”

19 comments సెప్టెంబరు 25, 2008

Next Posts Previous Posts


మెటా

ఖజానాలు

ఇటీవలి జాబులు

మైలురాళ్ళు

ఉత్తమ టపాలు

ఇటీవలి అభిప్రాయములు

K.Rao on ఆమె,నేను,కొన్ని ఊహలు..
M. Nagarjuna on ఆమె,నేను,కొన్ని ఊహలు..
Toon India on ఆమె నన్ను వదిలి వెళ్ళిపోయ…
pavan on ఆమె నన్ను వదిలి వెళ్ళిపోయ…
purnima on నేను రచయిత కాదన్నవారిని రాయిచ్…

లింకులు

Copy Right

Page copy protected against web site content infringement by Copyscape