శంకరా’భరణం’
సెప్టెంబరు 13, 2010 at 3:13 ఏ ఎమ్ 7 వ్యాఖ్యలు
డిసెంబర్ 31, అర్ధరాత్రి. ప్రపంచమంతా సంబరాల్లో మునిగి తేలుతుంటే నేను మాత్రం ఆఫీస్ లో కూర్చుని ప్రోజెక్ట్ రిలీజ్ కోసం కష్టపడుతున్నా. ఇంతలో అన్నయ్య ఫోన్ చేసాడు. ఏముందన్నయ్యా మా రాకెట్ ఎలా ఎగురుతుందా అని కౌంట్ డౌన్ చేస్తున్నా అన్నాను. మీ సాఫ్ట్ వేరోళ్ళు ఎప్పుడూ ఇంతే అది ఎగురుతూ ఉంటే మీరు కింద ఉండి చప్పట్లు కొడతారు. అలా కాదుగానీ నిన్నే ఎవరెస్ట్ ఎక్కించేస్తా అన్నాడు. అన్నయ్య మీద నమ్మకం ఉన్నా ప్రోజెక్ట్ మీద ఉన్న భయంతో ఈ రోజుకి వదిలెయ్ అన్నాను. కాసేపాగి నాకు అన్నయ్య నుండీ మరలా ఫోన్ వచ్చింది. కానీ మాట్లాడేది అన్నయ్య కాదు. చాలా పరిచయమున్న గొంతు. తెలుగు లోగిళ్ళలో ఏ ఇంటిలో వినిపించిన టక్కున గుర్తుపట్టే గొంతు. ఆర్ధ్రతను, ఆవేశాన్ని, వ్యంగ్యాన్ని, కర్కశత్వాన్ని ఇంకా ఎన్నింటినో అవలీలగా పలికించే గొంతు. కవిత్వాన్ని చదివేప్పుడు తన్మయత్వాన్ని, ఆద్యాత్మికతను ప్రబోదించేప్పుడు నిర్వికారంగా, అప్పుడప్పుడూ చిలిపిగా మనల్ని పలకరించే గొంతు. ఆ గొంతునుండీ వచ్చిన మాటలు “రెండు సంవత్సరాల సంధి కాలాన్ని కలిసి గడుపుదాం వీలయితే రండి” అంతే అంతవరకు నన్ను నేను ఎలా ఆపుకున్నానో తెలియదు. మరుక్షణంలో బయలుదేరేసా. పండితులకి,యోగులకి మాత్రమే అలా అన్యులను అమాంతం గొంతుతో శాసించి పాదాక్రాంతం చేసుకునే శక్తి ఉంటుంది. మరి ఆయన ఓ పండితుడు యోగి రెండూనూ. అయనే భరణి. తెలుగు లోగిళ్ళలో మనందరి తోటరాముడు.
మొత్తానికి వీలయినంత వేగంతో ఆయన ఇంటికి చేరుకున్నాను. ఇంటిలో అడుగుపెట్టేముందే మనసులో ఉత్కంటతోనో లేదా ఆయనని కలుస్తున్నానన్న ఆనందంలోనో తెలియదు కానీ కాస్త అలజడి. కానీ ఎదురుగా ఇంటిలోకి ఆహ్వానిస్తున్న చిత్రపటం చూడగానే అలజడి పోయి మనసంతా ఆహ్లాదంగా మారిపోయింది. బాణాసురుని వంటి అసురుని భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ఇంటికి కాపలా కాసాడని విన్నాను. కానీ భరణిగారింట ఆయన అభిమానానికి మెచ్చి, తరలి వచ్చి అతిధులను ఆహ్వానించే పని తీసుకున్నది నిలువెత్తు చిత్రపటంలో చిరునవ్వుతో ఒదిగిన మహానటి సావిత్రి. శివుని వెంట నంది ఉండాలిగా మరి అని నవ్వుకుంటూ వెళ్తున్నంతలో మరో చిత్రపటంలో నవ్వుల నెలరాజు రేలంగి. ఆయన ఏడ్చినా జనం మాత్రం నవ్వుతారట. తెలుగుజాతికి దేవుడిచ్చిన గొప్పవరాలు వీరిద్దరు. ఆ మహానటులను స్మరిస్తూ లోపలకి అడుగుపెట్టాం.
లోపలకి అడుగు పెట్టగానే వైకుంఠంలో పరమశివుడు కొలువు తీరినట్టుగా ఒక సాహిత్యగోష్ఠి. గరళకంఠునిలా ఆయన సభ మధ్యలో కూర్చుంటే చెరో పక్క వేణుగారు, వీణాపాణిగారు కూర్చున్నారు. వాళ్ళని పరిచయం చేస్తూ నా శంఖుచక్రాలు అని చెప్పారు. వేణుగారు వెంటనే శివునిచేతి శంఖుచక్రాలం అని చమత్కరించారు. ఇక ఆయన చుట్టూ ప్రమదగణాల్లా మేము కూర్చున్నాం. కాసేపు ముచ్చట్లు సాగాయి. ముచ్చట్లను ముగిస్తూ భరణిగారు తను వ్రాసిన పరికిణీ కవితను వేణుగారి కంజీర సహాయంతో రాగయుక్తంగా మొదలుపెట్టారు.
“దండెంమీద
ఇంద్రధనస్సుని
పిండి ఆరేసినట్టుంటుంది”
ఆ పదాలవెంట పరిగెడుతూ భావాల్ని గమనించటం మరిచిపోయాం, అయ్యో అనుకుంటూ భావాల్ని ఏరుకోవటానికి వెనక్కి వస్తే పదాల్లో గమ్మత్తుని అందుకోలేకపోతున్నాం. అటూఇటూ పరిగెడుతూ అలసిపోయి చివరికి వేరే దారిలేక వన్స్మోర్ అన్నాము. ఇప్పుడు పరికిణీ పుస్తకం పెట్టుకుని చదువుకుంటూ మరలా గుర్తు చేసుకుంటే చాలా గమ్మత్తుగా అనిపించింది.
“కుర్రకారు గుండెల్ని
‘పిండి’ వడియాలు పెట్టేసిన
జాణ – ఓణీ!!
ఓణీ… పరికిణీ…
తెలుగు కన్నెపిల్లకు అర్ధాంతన్యాసాలంకారాలు
అప్పుడే మీసాలు మొలుస్తున్న కుర్రాడికి…
ఓణీయే ఓంకారం!!
పరికిణీయే పరమార్ధం!!”
ఆ పదాల్లో ఒక చిలిపితనం, చిన్న చిన్న పదాల్లో ఒదిగిపోయే భావుకత ఎవ్వరికో తప్ప సాధ్యం కాదు సుమా! కవితల్లో కేవలం ఆ చిలిపితనానికే దాసోహమయిపోయారా అని మీరు గయ్యమనిలేస్తారేమో? అయితే కన్యాకుమారి మీకు వినిపించాల్సిందే.
“ఎక్కడ పెళ్ళి భజంత్రీలు మోగినా
గుండెలో ముగ్గేసినట్టుంటుంది
ఎసట్లో పోసే బియ్యం తలంబ్రాలు అవుతాయి
ఓణీ మాటి మాటికి జారుతుంది
ఎవరన్నా చూస్తారేమో అన్న భయం
చూస్తే బావుణ్ణు అన్న కోరికా!”
సాదారణంగా ఇలాంటి కవితలో కవి కన్నెపిల్లలో పరకాయప్రవేశం చేస్తాడు ఇక్కడ గమ్మత్తుగా భరణిగారు వింటున్న మాకు కూడా పరకాయప్రవేశ మంత్రం ఉపదేశించారు.
“అమ్మాయికేం
చదువుల్లో సరస్వతి
పనిపాటల్లో పార్వతీదేవి
లక్ష్మీకళే బొత్తిగా లేదు!
సర్లెండి వెళ్ళి ఉత్తరం రాస్తాం!
సూర్యుడు ముప్పైసార్లు అస్తమిస్తాడు
చంద్రుడికి రెండుసార్లు పక్షవాతం వొస్తుంది!
ఉత్తరం మాత్రం రాదు!
ఎన్నిసార్లు తలొంచుకున్నా
ఉత్తరాలు రావు!”
భావుకతకి దాసోహమంటూనే భావం ఒంటబట్టి కరిగిన మంచుముద్దల్లా అయిపోయమంతా. ముగింపు వినలేదుగా ఇంకా మీరు కళ్ళ చివర ఆగిపోయిన నీళ్ళు మెత్తగా జారిపోయే ముగింపు.
“ఎక్కడ మంగళ వాయిద్యం
వినిపించినా
గుండెల్లో నిప్పులు పోసినట్టుంటుంది!”
తన ఊహా ప్రపంచంలో పుష్పకవిమానం మీద విహరింపచేసినట్టే చేసి చివరికి వాస్తవజీవిత సత్యాల్లో అమాంతం పడేసారు. మధ్యతరగతి మిధ్యా ప్రపంచాన్ని చాపచుట్టి 30-ఫస్ట్నైట్ అంటారు.
“రేపన్నా ‘క్రికెట్’ బాట్ కొంటారా డాడీ – పుత్రుడు
క్రికెట్ లేజీగేమ్.. కబడ్డీ ఆడూ వెధవా..
కండలైనా వొస్తాయ్!!
పండక్కి జడగంటలు కొంటానన్నారు – నాన్నారూ – అమ్మడు
గంటలకన్నా బ్యాండు సౌండెక్కువ!
రబ్బరు బ్యాండ్లు కొనుక్కోతల్లీ!
… … …
… … …
… … …
ఆ… రాత్రి… నులక మంచం మీద!
రెండు మూరల మల్లెపూలెందుకండీ!!
ఏ పాలకూరో – కొత్తిమీరో వచ్చేది గద!..?
యాడాదికి ఓ పూటైనా మొగుణ్ణి
అనిపించుకుందావనీ!
ఈ కవితలు చదివేప్పుడు వచ్చే భావానికంటే ఆర్ధ్రత నిండిన ఆయన గొంతులో విన్నఫ్ఫుడు కలిగే భావావేశం చాలా ఎక్కువ. మరి అది ఆ గొంతుకి దేవుడిచ్చిన వరమో లేదా జీవితాన్ని చదివిన అనుభవ సారమో? వాస్తవాన్ని జీర్ణించుకున్న జీవితానికి నిర్వికారం సాదారణమే కదా! నిర్వికారం తలకెక్కాలంటే భోదించే గురువు కావాలి. భోదించే తత్వం నాలాంటి ఆమ్ జనతా (మేంగో మేన్) కి అర్ధమయ్యే సరళ భాషలో ఉండాలి. నిర్వికార రూపుడైన శివుని గురించి చెప్పేందుకు అలా ఏమైనా ఉందా? ఈ విషయంలో విష్ణువు తెలివైనవాడు. తన తత్వసారాన్నంతా భగవద్గీతగా తానే చెప్పేసుకుని మన ఘంటసాల మాష్టారి చేత పాడించేసుకున్నాడు. మాష్టారి గొంతు మహిమో లేక సహజంగానే విష్ణుమూర్తి కున్న చరిష్మా, ఫ్యాన్ ఫాలోయింగో కానీ ఊరూర గీత మారుమోగిపోతుంది. చిన్నబుచ్చుకున్న శివుడు ఏ కళనో ఉన్న భరణిగారిని గిచ్చి ఊరుకున్నాడు. ఉప్పొంగిన భావావేశం నుండి పదాలు జారుకుంటూ వచ్చి జలపాతంలా మా మీద వచ్చి పడ్డాయి. అవే శివతత్వాలు. శివకేశవుల భిన్నత్వాన్నో ఏకత్వాన్నో ద్వైతాన్నో అద్వైతాన్నో ఆటలా చెప్పేసారు.
ఆటగదరా శివా!
ఆటగద కేశవా!
ఆటగదరా !
నీకు అమ్మతోడు!!
ఆటగద గణపతిని
తిరిగి బతికించేవు
కళ్ళుమూయుట
మొదటి ఆట నీకు.
ఆటగద జననాలు
ఆటగద మరణాలు
మద్యలో ప్రణయాలు
ఆటనీకు.
ఇలా చెప్పుకుంటూపోతే శివతత్వాల్లో మొత్తం పుస్తకంలో ఉన్నవన్నీ వ్రాయాలిక్కడ. పండితపామర భేధంలేకుండా అందరికీ అర్ధమయ్యి మనలో శివున్ని దర్శించేలా చేసే అద్భుతమైన తత్వాలు అక్కడితో శివుని పైన అధ్యయనం ఆగిపోలేదు.
నా లోన శివుడు గలడు… నీ లోన శివుడు గలడు…
నా లోన శివుడు గలడు… నీ లోన శివుడు గలడు…
నా లోన గల శివుడు నీ లోన గల శివుడు, లోకమ్ము లేల గలడు,
నా లోన గల శివుడు నీ లోన గల శివుడు, లోకమ్ము లేలగలడు,
కోరితే శోకమ్ము బాప గలడు.
… … …
… … …
… … …
నా లోన శివుడు గలడు… నీ లోన శివుడు గలడు…
నా లోన శివుడు గలడు… నీ లోన శివుడు గలడు…
నా లోన గల శివుడు నీ లోన గల శివుడు, నాటకాలాడగలడు.
నా లోన గల శివుడు నీ లోన గల శివుడు, నాటకాలాడగలడు.
తెర దించి మూట కట్టెయ గలడు.
మేము మాత్రం ఇంకా తెరదించలేదు. తర్వాత వెంటనే ఎంతా మోసగాడివయ్యా శివా అంటు శివునితో చమత్కారమాడారు. బోయవానిభక్తిని పాటగట్టి వినిపించారు. ఆయన తన సాహిత్యంతో శివున్ని ఆడించారు, చమత్కరించారు, దెప్పిపొడిచారు, మొత్తానికి మెప్పించారు. ఇంతగొప్ప భక్తునికి ఆయన ఏ వరం ఇవ్వగలడు. అమ్మకిచ్చుండకపోతే అర్ధభాగాన్నిచ్చేవాడేమో? అయినా అర్ధభాగమివ్వకపోతేనేం? పరమేశ్వరుడు భరణిగారి ఆత్మలో కొలువై ఉన్నాడు. ఆయన ఇప్పుడు సంపూర్ణీశ్వరుడే!
గతంలో కొందరు కమర్షియల్ కళాకారులకు మీరెందుకు మీ బ్లాగుల్లో అంత అందలమెక్కిస్తారు అని అడిగారు. ఇప్పుడు కూడా అడగాలనుకునేవారూ ఉంటారు. గ్రహణం,సిరా సినిమాలు చూసాక ఈయన బృతికోసమే తప్ప మతిలో కమర్షియల్ కాదని తెలిసిపోతుంది. అయినా అప్పుడే సినీ నటుడు భరణిని కలవటానికి వెళ్ళనన్న భావన మనస్సులో నుండి పూర్తిగా తొలగిపోయింది. ఒక కవిని చూసాను, అతిధిని గౌరవించే గృహస్థుని చూసాను. కవి పండి పండితుడైన వైనాన్ని చూసాను. చివరగా పండితుడు పరమేశ్వరుడైన అద్భుతాన్ని చూసాను.
Entry filed under: ఙ్ఞాపకాలు, తెలుగు. Tags: తనికెళ్ళ భరణి, తెలుగు, భరణి, సాఫ్ట్ వేర్ ఇంజనీర్, bharani, tanikella bharani, telugu, thanikella.
అభిప్రాయములు Add your own
ప్రత్యుత్తరమిమ్ము
Trackback this post | Subscribe to the comments via RSS Feed







1. madhuri krishna | 10:08 సాయంత్రము వద్ద సెప్టెంబరు 12, 2010
enjoyed reading this post.
2. budugoy | 9:59 ఏ ఎమ్ వద్ద సెప్టెంబరు 13, 2010
love listening to his naalona sivudu galadu. did he write any new sivatatvaalu?
-bu
3. Pranav Ainavolu | 6:04 సాయంత్రము వద్ద జనవరి 9, 2011
Really enjoyed reading the post!
The narration is too good indeed. Thanks for sharing your experiences
4. raja | 10:36 ఏ ఎమ్ వద్ద జనవరి 28, 2011
Hi murali,
Gud one. Keep it up
Regards
5. బ్లాగు ప్రయాణంలో మూడేళ్ళు « మురళీగానం | 9:56 ఏ ఎమ్ వద్ద జూన్ 2, 2011
[...] 2.ఆంధ్ర తుంబురుడు అవతరించెను నేడు… 3.శంకరా’భరణం’ ఇతరములు: 1.ఇదే నా మొదటి ప్రేమలేఖ… [...]
6. ఏం డిసైడ్ జేసినవయ్యా తోటరాముడు « మురళీగానం | 6:10 ఏ ఎమ్ వద్ద జూన్ 7, 2011
[...] మంచి మనిషినయితే చూడలేదు. అందుకే నా శంకరా’భరణం’లో ఆయన్ని పరమేశ్వరుడిగా మారిన [...]
7. rathnamsjcc | 4:38 సాయంత్రము వద్ద నవంబరు 9, 2011
మనం ఎవరో తెలియక తికమక పడుతూ మన చుట్టూ వున్న వాటితో మనల్ని అన్వయించుకొని ఏకత్వం చెందుతూ అవే మనం అనుకుంటూ కాలం అనే ప్రవాహంలో కొట్టుకుపోతున్న మానవ జాతిని మేలుకొలిపి మానవుడు తన నిజ స్వరూపం తెలుసుకోవటం కోసం గురువు ఎంతో కరుణ గలిగి తనను తెలిసిన కొందరిని పంపుతాడు. వారికి, వారు వచ్చిన పని తెలిసి, పంపినదెవరో తెలిసి మానవుని అభ్యున్నతి కోసం శ్రమిస్తారు. శ్రమను మరచి జాతిని ముందుకు నడిపిస్తారు. వారిని అనుసరించిన వారికి జ్ఞానమును అందించి కర్మయోగ రహస్యములను తెలిపి తిరిగి వారు సేవా మార్గములో ఎలా తరించి తమను తెలుసుకొని దైవాన్ని చేరవచ్చో ఆచరించి తెలియ పరుస్తారు. వారే సద్గురువులు. దైవానికి, సాధకునికి మద్య ఒక వారధి వలే పనిచేస్తారు.ఇటువంటి స్థితి నుండి మనలను ఉద్ధరించి సత్యము వైపు నడిపించుటకు దైవమే గురువు