నేను కవిని కాదన్నవాడ్ని కత్తితో పొడుస్తా.

ముగ్ధ మోహనం
అమావాస్య చీకటిలో
కారడవిలో నడవలేనా?
…..నీ నవ్వుందిగా నా వెంట!
*********
అమృతం తో కలిపి అన్నింటినీ ఇచ్చేసి
నిన్ను మాత్రం దాచేసింది పాలకడలి
…..నా కోసం.
*********
ఆ కొలనులో కలువలకి
నవ్వటం రాదు
…..నీ కళ్ళలా.
*********
దేవుడికి ఇంకా అంతు పట్టలేదు
సప్తవర్ణాలు కాక ఏ వర్ణం తో చేసాడో
…..నిన్ను.
*********
నీలా ఉండాలని ఆ చందమామకి ఎంత ఆశో!
పాపం నువ్వే ఒక్కరోజు తనలా ఉండకూడదూ.
35 comments ఏప్రియల్ 29, 2009
మలిసంధ్య
ఆనందరావు గోదావరిలో హైదరాబాద్ బయలుదేరారు. చిన్న నాటి మితృడు శంకరరావు స్వచ్చంధ పదవీవిరమణ చేస్తూ తన అప్తులందరినీ ఆహ్వానించాడు. ప్రవాహగమనం లో పాయలుగా విడిపోయిన నదీ జలాలు, సముద్రంలో కలిసేచోట తనని తాను కనుగున్న అనుభూతి ఆనందరావుకి ఇప్పటికే మొదలయ్యింది. ఏరోజు విడిపోయే ప్రసక్తే లేదు, స్నేహమేరా జీవితం అని పాడుకొనే యవ్వనం చరిత్ర పుస్తకాల్లో సిరా చుక్కలుగా మారి రెండు దశాబ్దాలయ్యింది. జీవితంలో తలో దిక్కులో చేతనయిన వేగంలో పరిగెడుతూ, వగరుస్తూ ఎన్నో ఎత్తులూ, పల్లాలు చూసారు.పెళ్ళి, పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్ళిల్లు ఎన్నో మజిలీలు దాటిపోయాయి. కొన్నిసార్లు కొంతమంది మితృలు కలిసినప్పుడు క్లాసులో అందరిగురించి మాట్లాడుకోవటం, ఎవరు ఏంచేస్తున్నారో తెలుసుకోవటం చేయటం వలన అందరినీ కలుసుకోకపోయినా ఒకరి వివరాలు మరొకరికి తెలిసేవి. కానీ ఈనాటికి అందరూ ఒక్కచోట ఖచ్చితంగా కలుసుకోవాలని నిర్ణయించుకుని బయలుదేరారు. అమెరికాలో ఉన్న పావని, లండన్లో ఉన్న సోమశేఖర్ అందరూ వస్తున్నారు. వాళ్ళ హృదయాల్లో ఉప్పొంగుతున్న సున్నిత భావాల్ని ఘనీభవించి ఒక వేదికను చేయబోతున్నారు.
రాజమండ్రి బ్రిడ్జి మీదకు రాగానే లయబద్దంగా వినిపించే రైలు చప్పుడు వింటూ, తల్లి గోదారమ్మ పరవళ్ళు చూస్తూ గతం లోకి జారుకున్నాడు.
********************************************************************
శంకర్గాడంటేనే చిన్నఫ్ఫటి నుండి అందరికి ఒక ప్రత్యేకమైన ఇష్టం. వాడిని ఇష్టపడని అమ్మాయిలు, లెక్చరర్లు ఆ కాలేజీలో లేరు. అందుకు మిగిలిన అబ్బాయిలు కాస్తంత ఉడుక్కున్న వాడిని మాత్రం వదిలి ఉండేవారుకాదు. చదువుల్లో వాడు ఫస్టుకాదు, ఆటల్లో వాడు ఫస్టు కాదు కానీ అన్నింటిలో ప్రవేశం ఉంది, తనకంటూ ఒక ప్రత్యేకమైన తనదైన స్థానం ఉంది. ఇక వాడిది అంటూ తిరుగులేనిది కాలేజీ లో స్టేజ్. కాలేజీలో ఏ కార్యక్రమంచేసిన వాడు వ్రాసినవి, చేసినవి నాటకాలు, ఆటలు, పాటలు అన్ని ఉండాల్సిందే. అక్కడ మాత్రం వాడ్ని కొట్టేవాడు లేడు కాలేజీలో. అందుకే వాడికి ఆ ప్రత్యేక గుర్తింపు. శంకర్గాడి కాలేజీ రోజులు గురించి చెప్పేప్పుడు జ్యోతిర్మయి పేరు చెప్పకపోతే పూర్తికాదు. జ్యోతి నాన్న ఒక బడిపంతులు. తనకూతురికి చదువుసంధ్యలతో పాటు చక్కగా సంగీతం, నాట్యం నేర్పించాడు. జ్యోతి చాలా అందమయిన అమ్మాయి. కాలేజీ లో అడుగుపెట్టినది మొదలు ఆమెకి వచ్చిన ప్రేమలేఖలు ఫస్ట్ క్లాస్ క్రికెట్ రన్ రేట్ నుండీ 20-20 రన్ రేట్ లా పెరిగిపోయాయి. కానీ ఆమె ఒక నవ్వు నవ్వి మౌనంగా అన్నింటినీ చెత్త బుట్టలో పడేసింది.
జ్యోతి మొట్ట మొదటిసారి శంకర్ తోనే మాట్లాడింది ఆ కాలేజీలో. ఒక కార్యక్రమంలో పాట పాడాలని. తనగాత్రం విని శంకర్ చాలా అభిమానించాడు. ఆ రోజు నుండి శంకర్,జ్యోతి చాలా గొప్ప మితృలయ్యారు. శంకర్ కి కేవలం మితృడిగా మిగిలి పోవాలని లేదు. ఆ అపురూప లావణ్యాన్ని, గాత్రాన్ని, నాట్యాన్ని వదులుకున్నవాడు పిచ్చివాడే అందులో సందేహం లేదు. కాలేజిలో అందరూ కూడా వీరిద్దరిదీ ముచ్చటయిన జంట అని కితాబునిచ్చారు. జ్యోతి పుట్టినరోజుకి శంకర్ తన ప్రేమ విషయం చెప్పాడు. జ్యోతి మిగిలినవారిని తిరస్కరించినట్టు తిరస్కరించలేదు. అలా అని అంగీకరించలేదు. మా ఇంటిలో వాళ్ళు అంగీకరిస్తే చేసుకోవటానికి అభ్యంతరం లేదని చెప్పింది. శంకర్ దూకుడు జలపాతానికి ఏమాత్రం తీసిపోదు. వెంటనే వెళ్ళి జ్యోతి ఇంటిలో మాట్లాడాడు. వాళ్ళూ కూడా గతంలో శంకర్ గురించి విని ఉండటం వలన, శంకర్ కుటుంబ పరిస్థితులు కూడా తెలియటం వలన ఆనందంగా అంగీకరించారు.
శంకర్ ఆనందానికి హద్దుల్లేవు, అదే ఊఫూలో వెళ్ళి పరీక్షలన్నీ చాలా బాగా వ్రాశాడు. అనుకున్నట్టే మంచి ఫలితాలు వచ్చాయి. హైదరాబాద్ లో ఒక ఉన్నతమైన కంపెనీ లో ఉద్యోగం వచ్చింది. పెళ్ళి ముహుర్తాలకోసం కుటుంబంతో కలిసి జ్యోతి ఇంటికి వెళ్ళాడు శంకర్. జ్యోతి తండ్రి హైదరాబాద్ ఉద్యోగాన్ని ఇష్టపడలేదు. తన కూతురు దగ్గరలోనే అల్లుడితో చల్లగా కాపురం చేస్తే చూడాలన్న అతని కోరిక శంకర్ కి చెఫ్ఫాడు. శంకర్ తను భవిష్యత్తులో ఎక్కాల్సిన శిఖరాలకి ఈ ఉద్యోగం చక్కని అవకాశమని తాను బావిలో కప్పలాగా ఉండలేనని చెప్పాడు. అంతటితో శంకర్ జీవితంలో జ్యొతి అధ్యాయం ముగిసిపోయింది. జ్యోతి మొదట చెప్పినట్టుగా తండ్రి మాటనే అనుసరించింది. పంతంలో దూకుడులో శంకర్ ప్రళయ రుదృడే. ఇది జరిగిన వారంలో జ్యోతికంటే అందమయిన, చదువుకున్న పెద్దింటి సంభందం చూసి చేసుకున్నాడు. జీవితంలో ఓటమంటే ఏంటో తనకి తెలీదని నిరూపించాడు
పెళ్ళై హైదరాబాద్ వెళ్ళిన శంకర్ జీవితంలో మితృలంతా ఫోన్ నంబర్లుగా మిగిలారు. శుభకార్యాలకి గ్రీటింగులు, గిఫ్టులు, టెలీగ్రాములు సరిపోయేవి. మనిషే యంత్రాన్ని తయారు చేసాడు అని శంకర్ జీవితం చూసి చెప్పటం చాలా కష్టం. ముచ్చట పడి పెళ్ళికి కొనుకున్న గడియారం చుట్టూ శంకర్ పరిగెడుతూనే ఉన్నాడు. సంసారం పిల్లలు, చదువులు, పెళ్ళిల్లు అన్ని కూడా ఒక ఖరీదయిన నాటకంలా జీవితంలో గడిచిపోయాయి. పిల్లలు మంచి ఉద్యోగస్తులయ్యారు. మంచి ఇల్లు కట్టుకున్నాడు, కారు కొనుకున్నాడు. అసలు జీవితంలో అనుకున్నట్టే అన్నీ సాధించాడు. చిన్ననాటి మితృలు శంకర్ నే ఒక ఉదాహరణగా తమ పిల్లలకి చూపించే స్థాయిలో ఉన్నాడు. కాలేజీ రోజుల్లో తెలిసో తెలియకో ఏదో వాగి జీవితంలోని చివరి మజిలీ లో దాన్ని సాధించలేకపోతే ఉండే భాద సామాన్యమైనది కాదు. ఒక జీవితం మొత్తం వ్యర్ధమైపోయింది, ఇంకేమీ మిగల లేదు అనే భావన చాలా భయంకరమయింది. అలాంటి పరిస్థితి తనకి లేదని శంకర్ గర్వపడేవాడు.
కాలచక్రం తో బొంగరాలాడే పైవాడు ఇంకా ఆడుతూనే ఉన్నాడు. అదీ గిర్రున తిరుగుతూనే ఉంది. శంకర్ ఒక పెళ్ళికి రాజమండ్రి వెళ్ళాల్సి వచ్చింది. పెళ్ళిళ్ళకి బొత్తిగా వెళ్ళని శంకర్ వ్యాపార సంభందాలున్న మితృడి కొడుకు పెళ్ళి కావటంతో వెళ్ళక తప్పలేదు. పెళ్ళి లో కూర్చుని వచ్చేపోయే వార్ని గమనిస్తూ ఉన్నాడు. ఇంతలో ఎవరో వస్తున్నారని అందరూ వెళ్ళి పలకరించటంతో అటుగా చూసాడు. పరాకుగా చూసి ఎవరో తెలిసిన వాళ్ళనిపించి పరీక్షగా చూసాడు. జ్యోతి…. 20 ఏళ్ళ తర్వాత తను బాగా ఎరిగిన జ్యోతిని చూసి శంకర్ మనస్సు ఎగిసిపడింది. పట్టు చీరతో పెద్ద బొట్టు మెడ దగ్గర, చేతుల దగ్గర కనిపిస్తున్న పచ్చని చాయ నిండు ముత్తైదువు. సాక్షాత్తు గోదారమ్మ కొబ్బరి తోటల పచ్చదనాన్ని చీరగా కట్టి వచ్చినంత ఆహ్లాదంగా ఉంది. వెళ్ళి పలకరించాలా వద్దా? తను ఉన్న గొప్ప స్థానం తనకి చెప్పాలన్న ఆశ ఉన్నా ఏదో తెలియని అలజడి. అలా సందిగ్దంలో ఉండగా తనే చూసి పలకరించింది. తన వివరాలు చెప్పి వీలయితే ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళమని చెప్పి పెళ్ళి వేదిక వైపు వెళ్ళిపోయింది. తనని కాదన్న జ్యోతి ఎలాంటి స్థితిలో ఉందో చూడలన్న పంతానికి ప్రయాణం ఒక రోజు వాయిదా వేసుకున్నాడు శంకర్రావు.
చిరునామా చూపి మితృడిని అడిగాడు ఎలా వెళ్ళాలని. తానే స్వయంగా తీసుకు వెళతానని చెప్పి లాంచీ ఎక్కించి తీసుకెళ్ళాడు. లాంచీ దిగి కాస్త నడవగానే బృందావనం అని ఒక పెద్ద బోర్దు కనిపించింది. అందులోకి నడుస్తుంటే అందమయిన తోటల మధ్యలో ఇంకా అందమయిన కుటీరాలు. అన్ని రకాల పూలు, చెట్లతో నిజంగా బృందావనమేనేమో అనిపించేలా ఉంది. కమ్మని స్వరం వినిపించటంతో ఇద్దరూ అటుగా కదిలారు. అప్పటికే శంకర్ కి తాను ఉన్నది తను రోజూ బ్రతుకుతున్న భూమి మీదన లేక కలగంటున్నానా అనే అనుమానం వెంటాడుతుంది. పక్షుల అరుపులు, చల్లని గాలి, కళ్ళెదుటే గోదారమ్మ పరవళ్ళు జీవితం ఈ క్షణంలో స్థంబించిపోతే బాగుంటుంది అనే భావన. స్వరం వినిపించిన వైపు వెళితే జ్యోతి కొంతమంది పిల్లల్ని కూర్చో బెట్టుకుని ఆలాపిస్తుంది. శంకర్ తనని పిలిచే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే బృందావనంలో వేణుగానం వినే అవకాశం వస్తే వదులుకోవటం సాధ్యమా? తన ఆలాపన పరిసరాలలో మాధుర్యాన్ని నింపుతుంది. అలా సమయం తెలియకుండా చాలాసేపు నిలబడి పోయాడు శంకర్. జ్యోతితో మాట్లాడకుండానే వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఓటమిని అంగీకరించే శక్తి శంకర్ కి ఎప్పుడూ లేదు.మితృడి ద్వారా వివరాలు తెలుసుకున్నాడు.
జ్యోతి భర్త డిగ్రీ వరకు చదివి పెద్దలనుండీ వస్తున్న వ్యవసాయాన్నే ఎంచుకున్నాడు. సాంప్రదాయలని ఇష్టపడే ముచ్చటైన కుటుంబం వారిది. జ్యోతిలో ఉన్న కళ వ్యర్ధంకాకూడదని ఒక ఆశ్రమాన్ని కట్టించి వేసవి సెలవుల్లో పిల్లలకి నామ మాత్రం ఖర్చులతో సంగీతాన్ని, నాట్యాన్ని నేర్పించే ఏర్పాటు చేసాడు జ్యోతి భర్త. చిన్న పిల్లలకి నీతి కధలు, పురాణాలు చెఫ్ఫే ఏర్పాట్లు చేసాడు. వేసవిలో పిల్లలకి వినోదాన్ని, విఙ్ఞానాన్ని అందించే వారు. పిల్లలకి విపరీతంగా నచ్చి వేసవి సెలవులకోసం ఎదురుచూసేలా నడుస్తుంది ఆ ఆశ్రమం. మొత్తం తెలుసుకున్న శంకర్కి ఒక అలజడి మొదలయ్యింది. జీవితంలో ఏదో కోల్పోయాననే భావన ఎక్కువయ్యింది. నా తోటి వాళ్ళవద్ద ఓడిపోబోతున్నా అనే ఆలోచన వెంటాడింది. చాలా రోజులు తిండి, నిద్ర సహించలేదు. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తునే గడిపాడు. పనిమీదకి మనసు బొత్తిగా పోలేదు. ఇంటిలో కూడా అందరూ ఆందోళన పడ్డారు. అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. స్వచ్చంధ పదవీవిరమణ చేస్తున్నట్టుగా ఆఫీస్ లో అందరికీ చెప్పేసాడు.
*********************************************************************************
ఆనందరావ గోదావరి దిగి ఫోన్ చేసాడు. కారులో వచ్చి శంకర్ పెద్ద కొడుకు ఇంటికి తీసుకు వెళ్ళాడు. అక్కడనుండి శంకర్ ఊరు చివరకొత్తగా కట్టిన ఇంటికి తీసుకు వెళ్ళాడు. చుట్టూ తోట మధ్యలో ఇల్లు చాలా ఆహ్లాదంగా ఉంది. ఇల్లుకూడ చాలా వరకు పాత కాలం నాటి ఇల్లులా చాలావరకూ చెక్కతో కట్టిన మిద్దె ఇల్లు, కాంక్రీటు భూతం లా కాక ఆహా అనిపించేలా ఉంది. కానీ ఖరీదయిన భవంతుల్లో గడిపే స్థాయి ఉన్న శంకర్ ఇలాంటి ఇల్లు కట్టుకోవటం నమ్మలేకపోయాడు ఆనంద్. లోపల అడుగు పెడితే ఏ చక్రవర్తో మనసు పడి తన రాణీవాసంకోసం కట్టించిన కట్టడంలా అద్భుతంగా నగిషీలు చెక్కి ఉన్నాయి. ఒక గదిలో సంగీత పరికరాలు, గొప్ప గొప్ప సంగీత విద్వాంసుల పాటల సిడీలు, మరో గదిలో ఆధునిక, ప్రాచీన సాహిత్యంలో వెలువడిన పుస్తకాలు పెద్ద పెద్ద చెక్కబీరువాల్లో ఉన్నాయి. ఇంటి వెనుక గా ఒక చిన్న కృత్రిమ సరస్సు అందులో నిజమైన కలువలు. శంకర్ నిజంగా చాలా గొప్పవాడే వాడి శేష జీవితం కూడా మన తరాలకి ఉదాహరణ కాబోతుందని అనుకున్నాడు ఆనంద్.
అక్కడ నుండి కార్యక్రమ వేదిక వద్దకి అందరూ సమయానికి చేరుకున్నారు. ఊరిలో పెద్దలంతా వచ్చారు. ఏవో సాంస్కృతిక కార్యక్రమాలు సాగుతునే ఉన్నాయి. ఎన్నో ఏళ్ళ తర్వాత కల్సిన మితృల కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి, ఉద్వేగం, ఉద్రేకం అభిమానం, ఆనందం అన్నీ ఆక్కడే కనిపిస్తున్నాయి. అందరి జీవితాల్లోని కష్టాలు, సుఖాలు మాటల రూపంలో ఆ ప్రదేశంలో పొంగి పొర్లుతున్నాయి. వేదికనెక్కి అందరూ శంకర్ విజయాల గురించి, కాలేజి నుండి నేటి వరకు అతని విజయ వంతమైన జీవితం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. కార్యక్రమం అధ్బుతంగా జరిగింది, అంతా ఒక కలలా జరిగి ముగింపుకి వచ్చింది. శంకర్ ఇద్దరు కొడుకులూ ఒక మంచి కారు కొని తెచ్చి శంకర్ కి బహుమతిగా ఇచ్చారు. అందులో శంకర్, శంకర్ భార్య ఎక్కి కొత్త ఇంటికి బయలుదేరి వెళ్ళాలని కొడుకులు పట్టుబట్టారు. శంకర్ పెదవులమీద ఒక గర్వంతో కూడిన నవ్వు. జీవితంలో తనకి ఎప్పటికీ ఓటమే లేదని మనసులో అనుకుంటూ కారు ఎక్కుతూ కుప్పకూలి పడిపోయాడు. ఆసుపత్రికి తీసుకు వెళ్ళేసరికే చనిపోయాడు. ఒక్కచోట చేరిన మితృలంతా హృదయ విదారకంగా ఏడ్చారు ఏడ్చారు ఏడుస్తునే ఉన్నారు. అన్నీ ముగిసాయి. గోదారమ్మ శంకర్ అస్థికలని తన ఒడిలో చేర్చుకుంది. ఒక్కొక్కరూ తలో మాట అనుకుంటూ భాదగా నిట్టూర్చి తిరుగు ప్రయాణమయ్యారు. “శంకర్ తెలివైనవాడు, సమర్ధుడు. ఒక మంచి అభిరుచి గలవాడీ జీవితం వ్యర్ధమయిపోయిందేమో? వాడు తలచుకుంటే అతని జీవితం వెన్నెల్లో గోడరిలా ఉండేది కానీ నిరంతరం పరిగెట్టి నిజం తెలుసుకునే సరికే సమయం ముగిసిపోయింది” అన్నారెవరో. “వాడికేం రా? రాజాలా బ్రతికాడు లేని వాడు చెప్పే పనికిమాలిన ఓర్వలేని మాటలివి. ఇదో అల్ప సంతోషం”అన్నాడొకడు. ఎవరి జీవితాల పక్షి గూడులలోకి వాళ్ళు తిరిగి దూరిపోయారు.
మనలో చాలామంది జీవితాలు మొదలు కావటం ఒకేలా చిన్నగా ఉంటుంది. నది జన్మస్థలంలో నీటి ప్రవాహంలా. కానీ ప్రవాహం ముందుకు సాగుతున్న కొద్దీ ప్రతీ మలుపులో కొన్ని పాయలు విడిపోతుంటాయి. కానీ చివరికి చేరాల్సిన గమ్యం మహా సముద్రమే. మనకి కూడా జీవితంలో కొన్ని మలుపుల్లో మన జీవితాన్ని నిర్వచించే ఎంపికలు అనివార్యమవుతాయి. ఆలస్యం చెయ్యొద్దు, కొన్నిసార్లు జీవితంలో రెండో అవకాశం దొరకదు. ఇంతకి శంకర్ గెలిచాడా? ఓడాడా? మీ జీవితంలో మీ ఎంపికలే శంకర్ గెలిచాడో ఓడాడో మీ వరకు నిర్ణయిస్తాయి. ఎంతమంది చదివితే అన్ని ముగింపులు ఈ శంకర్ కధకి.
6 comments మార్చి 19, 2009
మనసున మనసై బ్రతుకున బ్రతుకై..
మనసున మనసై బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము
నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నింపుటకు…
మహానుభావుడు ఎంత అద్భుతంగా వ్రాసాడండి. తోడు ఉంటే సరిపోదు నిన్ను నిన్నుగా అంగీకరించే తోడు. నిజం మనవాళ్ళు మనపక్కనే లేని జీవితం అన్నీ ఉన్నా ఏమీ తినలేని, నిద్రలేని ధనవంతుడి రోగంతో సమానం. ఒకతరం క్రితం ఎంత కష్టం వచ్చినా ఊరువదిలి వెళ్ళేవారు కాదు. ఎవరయినా ఉద్యోగరిత్యా వెళ్ళినా అందరూ భాదపడేవారు ఎంత కష్టం వచ్చింది ఊరువదిలిపోవాల్సి వస్తుందీ అని. పొట్టకూటికి ఎన్నిపాట్లు అని అందరూ జాలి పడేవారు. కానీ ఇప్పుడో మన నాయకులకు భాగ్యనగరం మీద ఉన్న ప్రేమ మనల్ని చచ్చినట్టు ఇక్కడికి రప్పిస్తుంది. తల్లిదండ్రులను, ప్రాణస్నేహితులను వదిలి రావటం. ఎంత కష్టం అండి. దూరాలు పెరిగి ప్రేమలు పెరిగే రోజులు పోయాయి, ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోయి వారి మధ్య ఒక తెలియని అగాధం ఎర్పడుతుంది. చాలాసార్లు నా చినప్పటి స్నేహితులు అనుకోకుండా కలిసినప్పుడు ఏమి మాట్లాడటానికి ఉండదు. ఎవో ఉద్యోగాల గురించి అడిగి ఊరుకుంటా. ప్రవర్తనలో కూడా చనువుపోవటం చూసాను.
నేను హైదరాబాద్ వచ్చినప్పుడు, నా చాలామంది స్నేహితులు నా కూడా వచ్చారు. అందరం ఒకే దగ్గర ఉండటం కొంత బాగుండేది. ఇంటిలో వాళ్ళని దూరమయ్యా అనే భాద ఉన్నా స్నేహితుల మధ్యే ఉండటం వలన మా ఊరిలోనే ఉన్నానేమో అనేట్టు ఉండేది. అయినా మనం ఇష్టపడే మన సొంత ఊరు, మనల్ని మనంగా గుర్తించే మన ఊరివాళ్ళని వదిలి మన ఉనికి మనకే తెలియని, మన ఉనికికి ఏమాత్రం ప్రాముఖ్యత లేని చోటకి రావటం ఏంటండి మన పిచ్చిగానీ.
ఇప్పుడు నా పరిస్థితి మరీ దారుణం. పెనంలో నుండి పొయ్యలో పడ్డట్టు అయ్యింది. ఆఫీసు పని మీద చద్దికూడూ తినే ఈ అమెరికాకి పొట్టకూటికి వచ్చా(ఈ వ్యాఖ్య ఎవరినయినా భాదిస్తే క్షమించండి). కనీసం నా పక్కనే ఉండే నా స్నేహితులు కూడా లేకపోయేసరికి నా మీద నాకే జాలి కలుగుతుంది. ఎంత పనికిమాలిన పసలేని జీవంలేని జీవితం గడుపుతున్నాను అని. మన ఇంటిలో ఇరుగు పొరుగు స్నేహితులతో తినే పచ్చడిమెతుకుల్లో ఉండే ఆనందం ఇక్కడ డాలర్లు పెట్టి కొనుక్కుతినే చద్దికూడు లో ఉంటుందా? పోనీ నా జీవితం లో వయస్సు 50 వచ్చేవరకు ఇలాగే కష్టపడి కడుపుకట్టుకుని, అందరికి దూరంగా నేను ఇష్టపడే నా ఊరికి దూరంగా ఉంటా, ఉండి 50 ఏళ్ళకి నేను దాచుకున్నదానితో ఏమి చెయ్యాలి? హాస్పిటల్కి కట్టాలి. ఎందుకంటే అప్పటికి ఖచ్చితంగా అన్ని రోగాలు వచ్చేస్తాయిగా.
నా స్నేహితులని, కుటుంబాన్ని ఎంతగా మిస్సవుతున్నానో నిన్న ఒక గంట ఏకాంతంలో కూర్చున్నప్పుడు తెలిసింది. అవును మనస్సుకి మొహమాటం ఎక్కువ అందరూ ఉన్నప్పుడు సందడిగా ఉన్నప్పుడు మాట్లాడదు. ఏకాంతంలో మాత్రమే మాట్లాడుతుంది.
అవును ఏకాంతం నీతో చాలా ఊసులాడుతుంది.
ఏకాంతం నీలో ఉన్న నిన్ను నీకు చూపిస్తుంది.
ఏకాంతం నీ వాళ్ళని నీకు పరిచయం చేస్తుంది.
ఏకాంతం నీ గత స్మృతులను మోసుకొస్తుంది.
ఏకాంతం నిన్ను ఏడిపిస్తుంది, ఓదారుస్తుంది.
పైన చెప్పినవన్నీ నిజాలు. నేను అనుభూతికి లోనవుతున్న భావాలు. లేకపొతే అక్కడ మనదేశంలో నా వాళ్ళందరూ ఘాడ నిద్రలో ఉంటే నేనెందుకు వారిగురించి ఆలోచిస్తున్నా. ఏకాంతంలో కూర్చుని నా ఫస్ట్ క్రష్ నుండి ప్రతీ ఒక్కరిని తలచుకుని ఎందుకు భదపడుతున్నా. నన్ను వదిలివెళ్ళిపోయిన వాళ్ళని సహితం ఒక్కసారి చూడాలని ఎందుకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒంటరితనం. మనకి మనమే తవ్వుకున్న గొయ్యలాంటి ఒంటరితనం. నేను అమెరికా వస్తే మా మురళీ అమెరికా వెళ్ళాడు అని నా స్నేహితులు కుటుంబ సభ్యులు గర్వంగా చెప్పుకుంటుంటే. నేను వాళ్ళకి “ఐ మిస్ యు” అని చాలా కృతకంగా. కృత్రిమంగా చెప్పాలా? చెబితే నన్నో చవటాయి లేదా కెరీర్ ఆబ్జెక్టివ్ లేని వెదవాయి అనుకుంటారు. అవకాశాలు చేతిలో ఉంచుకుని చంటిపిల్లాడిలా ఏంటిది అనుకుంటారు. అనుకోనివ్వండి ఇంతకు మించి నటించటం నావల్ల కాదు. ఇప్పటికే నేను మిమ్మల్నందరిని వదిలి ఉండలేకపోతున్నా అని చెప్పలేక ఇగోతో ఇంతకాలం నడిపించుకుంటూ వచ్చా. ఇక నావల్ల కాదు. గట్టిగా అరవాలని ఉంది నాకు డబ్బు అధికారం దర్పం కంటే మీరు కావాలి. మీ అభిమానం కావాలి.
నే ఇసుకతో ఇల్లు కడితేనే మురిసిపోయి నన్ను ఊరేగించిన భుజాల తోడుకావాలి.
అ ఆ లు రాస్తేనే సంబరపడి హత్తుకున్న చేతులు కావాలి.
గల్లీ క్రికెట్లో సిక్సర్ కొడితే అబ్బురపడి ప్రోత్సహించిన చప్పట్లుకావాలి.
ఏంచేసినా సై అని నావెంటే ఉండే అడుగులు కావాలి.
చింపిరి జుట్టుతో నే స్టైల్ కొట్టినా నా అమాయకపు ప్రేమని గుర్తించిన ఆ చిరునవ్వు కావలి.
ఇవన్నీ మనజీవితంలో రోజూ మరలా మరలా జరగటానికి తగినంత సమయం కావాలి.
ఏదో ఒకటి చేస్తాను ఇవన్నీ తెచ్చి మీకోసం ఎదురుచూస్తూ ఉంటాను…….
9 comments మార్చి 16, 2009
లోవెల్ ప్రాంతంలో బ్లాగు మితృలు ఉన్నారా?
నేను ప్రాజెక్ట్ పని మీద ఒక 6 నెలల పాటు ఉండటం కోసం నిన్ననే లోవెల్, మసా చూసెట్స్ వచ్చాను. ఈ ప్రాంతంలో బ్లాగు మితృలు ఉన్నారా?
2 comments మార్చి 8, 2009
ఏమయ్యింది నాకు?
ప్రపంచమంతా వేలంటైన్స్ డే పరిమళాల మత్తులో మునుగుతుంటే
నేను మాత్రం ఆటోలో నా బుర్రలోని ఆలోచనల్లా…
అద్దాలషాపుల్లో గులాబీలు అందంగా అమర్చిఉన్నాయి
బ్లడ్బ్యాంకులో నెత్తురు సీసాల్లా…
సెల్ఫోన్ తరంగాల్లో ప్రేమసందేశాలు
పంజాగుట్టలో ట్రాఫిక్లా….
గ్రీటింగ్కార్డుల్లో కవితలు అతికించి ఉన్నాయి….
జనాల పెదవులపై నవ్వుల్లా…
నెక్లస్రోడ్డ్లులో జంటల కిలకిలలు
అక్వేరియంలో రంగుల చేపల్లా…..
ఆలోచనలు సాగుతునే ఉన్నాయి
ఆటోమాత్రం ఆగింది మా ఇంటిముందు….
7 comments ఫిబ్రవరి 15, 2009
ఆంధ్ర తుంబురుడు అవతరించెను నేడు…
జీవితంలో మనం ఎప్పుటికీ మరచిపోలేని రోజులు, క్షణాలు అందరికీ ఉంటాయి, ఉండాలి. నిన్నటి రోజు నా జీవితం లో ఒక మధురమయిన రోజు. నా చెవులకి పరిచయమున్న ఒక పాటని నా కళ్ళకి పరిచయం చేద్దాం అని వెళ్ళి, ఆ మకరంద స్రవంతిని నా హృదయం నిండా నింపుకున్నా. కానీ తన్మయత్వంలో నా హృదయాన్ని అక్కడే వదిలేసి వచ్చా. మరలా వెళ్ళి తెచ్చుకుందామంటే ఈ సారి ఆత్మనో, అస్థిత్వాన్నో వదిలేసి వస్తానేమోనన్న భయంతో ఆ ప్రయత్నం మానుకున్నా. మీలో ఎవరయినా గజల్ శ్రీనివాస్ని ఎరిగుంటే దయచేసి కాస్త నా హృదయాన్ని తెచ్చిపెట్టండి.

గాన గంధర్వుడు మ్యాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్
గజల్ శ్రీనివాస్ నిజానికి ఒక వేటగాడు. నిజం నమ్మరా? ఒక్కసారి అతన్ని కలిసి మాట్లాడండి మీకే తెలుస్తుంది. వెంటాడి, వెంటాడి భందిచేవాడ్ని వేటగాడు అనికాక పాటగాడని ఎలా అనుకోమంటారు? కాకపోతే వేటగాడు ఆయుధంతో వేటాడితే ఈయన తన గాత్రంతో, గజల్తో వెంటాడుతారు. అందుకేనేమో ఆయనే అన్నారు “నా గజల్కి కత్తికున్నంత పదునుంది కాదంటారా” అని. ఎలా అంటామండీ ఆయన గజల్కి రెండు వైపులే కాదు అన్నివైపులా పదునే. ఆ పదును తెలియాలంటే ఆయన స్వరంలో ఆయన సమక్షంలో కూర్చొని వినాల్సిందే. కాదు కాదు నాకు క్యాసెట్లు ఎక్కడ దొరుకుతాయో చెప్పండి, పదే పదే మీ వద్దకు రాలేనుగా అన్నా. పదే పదే వెళ్ళలేకపోయినా కాశీ వెళ్తే మాత్రం గంగలో ఒక మునక వేస్తాం. అదే ఇంటిముందు పారితే గుడ్డలుతుకుతాం కాదంటారా అన్నారు. ఏమంటాం నవ్వాపుకోవటానికి, ఆ మాటల్లో లోతైన భావాలను అర్ధంచేసుకుని తేరుకోవటానికే చాలా టైం పట్టింది. ఆయన మాటల్లో మనకి ఆయనలో ఉన్న తత్వవేత్త కనిపిస్తాడు. కానీ అది మన మనస్సులోకి చొప్పించే ప్రయత్నంచేయడు. తన గజల్లోని దాగి ఉన్న మర్మాన్ని మాటల్లో అందంగా అరటిపండు తొక్కతీసినట్టుగా వివరించి మన చేతిలో పెడతారు. ఆపైన ఆరగించని వాడు, అరిగించుకోని వాడు శుద్ద వెధవాయి అని నే వేరేగా చెప్పాలా?
ఆయన మాతో మాట్లాడుతున్నప్పుడు ఏది మాటో ఏది పాటో తెలియలేదు. ఎందుకంటే ఆయన మాటలు, పాటలు మమేకమయిపోయి ఆ గాత్రం లో ఏంవిన్నా మాకు శ్రావ్యంగానే ఉంది. పైగా బొత్తిగా సంగీత ఙ్ఞానం లేదాయే. నావరకు చెవులకి ఇంపయినది ఏదయినా సంగీతమే ఆయన మాటయినా, పాటయినా. పైగా పాట అంటే స్వరాలు, అనుస్వరాలు, సంగతులు కాదు. సాహిత్యాన్ని స్పష్టంగా శృతిలో శ్రావ్యంగా సామాన్యునికి అర్ధమయ్యేలా ఉండాలి అంటారాయన. ఆయన చెప్పేది ఒక్కటే తాన్సేన్లా రాగాలాపన చేయండి, లేదా వాగ్గేయకారుల్లా కీర్తనలు పాడండి. అంతేగానీ మహానుభావుల సంకీర్తనలను రాగాలతో కలిపి ముక్కలు చేసి, సాగదీసి హింసిచవద్దు. బొత్తిగా స్వర ఙ్ఞానం, సంగీత ఙ్ఞానంలేని నాకు కూడా ఆయన భావం అర్ధమయ్యింది, తిరిగి వ్రాయగలుగుతున్నా. అది ఆయన మాటల్లో వివరణలో ఉన్న శక్తి, సామాన్యుని హృదయానికి సహితం పట్టుకుంటుంది. అందుకేనేమో ఆయన అంటారు పిల్లల్ని ప్రతి తల్లిడండ్రులు బుర్రతో చదవమంటారు కానీ దయచేసి ఇకనుండి హృదయంతో చదవమని చెప్పండి అని. పిల్లలు అంటే ఆయనకి ఎంత ప్రేమో నిన్న ఆయన్ని చూసాక అర్ధమయ్యింది. మాతో మాట్లాడుతూనే, మధ్యలో వచ్చిన వాళ్ళ పాపని ముద్దు చేస్తున్నారు. తన వారసురాలింక ఆ పాపే, పేరు సంస్కృతి. నేటి ఆధునిక సమాజంలో పెద్దలు పిల్లలతో ఎంత సమయం గడుపుతున్నారో ఆలోచించుకోండి అని సూటిగా ప్రశ్నిస్తారాయన. రోజులో పిల్లలతో మాట్లాడేది కేవలం గంట సమయమే అయితే 16-20 ఏళ్ళల్లో ఎన్ని గంటలు గడపగలం? అటువంటప్పుడు ప్రేమాభిమానాలు ఎలా ఉంటాయి అంటారు. బయటకి వచ్చి మాకు వీడ్కోలు పలికి తిరిగి వెళ్తూ అక్కడ ఏడుస్తున్న ఎవరో చంటి పాపని బుజ్జగించి ఇంటిలోకి వెళ్ళరాయన. అదిచూసి అనిపించింది మాటల్లో ఏం చెబుతారో అది ఆచరించే వ్యక్తి అని.
మాటల్లోనే కాదు పాటల్లో ఏం చెబుతారో అదికూడా ఆచరిస్తారు. ఎప్పుడో జనాభా నియంత్రణ గురించి పాట పాడిన ఆయన అది తనజీవితంలో విధిగా ఆచరించి చూపించారు. అందుకే ఒక్క సంతానానికే పరిమితమయ్యారు. ఆయన అమ్మ గజల్తో, అమ్మ ని అమ్మగా ప్రతీ ఆంధృనికీ పరిచయం చేసేదాక నిదుర పోలేదు. నాన్న గజల్తో, తెలుగునాట ప్రతి తండ్రీ పూజింపబడేలా చేసారు. తెలుగు గడ్డని వదిలి వెళ్ళిన తెలుగు వాడ్ని “ఓనమాలు దిద్దిన బడి శిధిలమవుతూ, నిన్ను సెలవడిగింది” గజల్ తో పిలిచి, ఆ రాముని గుడి, నీవు నడిచిన వీధిరోడ్డు నీ క్షేమం అడిగాయని కలవరపరచి ప్రవాసాంధ్రులను ఇంటికి రప్పించారు. జీవనసమరంలో పట్టణాలకు వలసపోయిన నాలాంటి వారిని కూడా విడిచి పెట్టలేదు “ఒక్క సారి ఊరుపోయి రా” అన్న గజల్తో తెలియని అలజడి కలిగించారు. తెలుగువాడి సంస్కృతి, సంప్రదాయాల్లో,జీవన విధానంలో ఆయన గజల్ స్పందించని అంశాలు గానీ, స్పృశించని పార్శ్వాలు గానీ లేవేమో? ఎంత చిన్న విషయమైనా కూడా వదిలిపెట్టలేదు. ఎలా అంటే “ఇల్లు ఇల్లు లానే లేదు, తను ఊరినుండి ఇంకా రానేలేదు” అన్న గజల్లో భార్య ఊరికి వెళ్తే ఎలా ఉంటుందో కళ్ళకి కట్టేలా వినిపిస్తారు. తెలుగు సంకీర్తనల కోసమే వెంకన్న అన్నమయ్యని పుట్టిస్తే, తెలుగు సంగీత, సాహిత్యాలు సామాన్యుని ఆర్తిని,జీవన శైలిని పూర్తిగా తమలో ఇముడ్చుకోలేకపోతున్నాయని సాక్షాత్తు శారదాదేవే ఈ సరస్వతీపుతృన్ని మన తెలుగునాట పుట్టించిందేమో? పాట గొంతుతో కాదు ఆత్మతో పాడాలంటాడు ఆ గానగంధర్వుడు. సామాన్యుని జీవితాన్ని ఇంకా పూర్తిగా ఆవిష్కరించలేకపోయానని ఆయన చెబుతున్నప్పుడు శూన్యంలోకి చూస్తున్న ఆయన కళ్ళలో ఒక నిరంతర శోధన కనిపిస్తుంది మనకి. సామాన్యుని ఆర్తి,భక్తి మన తిరుపతి వెంకన్నని కదిలించిందో లేదో గాని శ్రీనివాస్ని కరిగించింది. అందుకే ఆయన ఆర్తితో, ఆత్మనివేదనతో శ్రీ శ్రీనివాసం క్యాసెట్ రూపొందించారు. “పొడగంటి మయ్యా మిము పురుషోత్తమా..” అనలేని సామాన్యుని కోసం “ఒక్కసారి రావాలని స్వామీ ఎన్నాళ్ళుగ పిలుస్తుంటి స్వామీ. వేడి వేడి అన్నంలో వెన్నపూస వేసిస్తా, ఆవకాయతో కలిపి గోరుముద్ద తినిపిస్తా” అని పాడి సామాన్యుడి ప్రార్ధన ఇలానే ఉంటుంది. కేవలం అన్నమయ్యదే ఆత్మనివేదనకాదు ఎందరో సామాన్యులదీ ఆత్మనివేదనే వారి భావాలు కూడా స్వామి వింటాడు అని చెబుతారు.
అందుకే ఆయన్ని డాక్టరేట్లే కాదు లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా వరించాయి. వీటి గురించి చెప్పటం నా వల్లకాదు. ఎందుకంటే ఆ చిట్టా ఆంజనేయుని తోకంత అవుతుంది. ఆయనకే ఇంటిలో పెట్టుకునే స్థలం లేక అటకెక్కించిన సత్కార, పురస్కార పత్రాలు, ఙ్ఞాపికలు ఎన్నో మాకు చూపించారు. భాదపడ్డారు, వీటికి మా ఇంటిలో అవమానం జరుగుతుందండీ అని. ప్రస్తుతం గాంధీ తత్వాన్ని ప్రపంచానికి పంచే పనిలో ఉన్నారు. ఇటీవలే 150 భాషల్లో పాడి ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నారు. తెలుగుని, తెలుగు సాంప్రదాయాన్ని ఆయన ఎంత గౌరవిస్తారో తెలుసుకోవాలంటే ఆయన ఇంటిని చూస్తే చాలు ఇట్టే తెలిసిపోతుంది. ముగ్గువేసి మధ్యలో రాగిపాత్రలో పువ్వులతో అతిధులని ఆహ్వానించే ముంగిలి. ఇంటినిండా తెలుగుదనాన్ని నింపుకున్న మట్టి బొమ్మలు, గోడలమీద ఏ చిత్రకారుడో తన కుంచెని తెలుగుదనంలో రంగరించి రంగుల్లో ఆవిష్కరించిన తైలవర్ణచిత్రాలు. ఆ ఇష్టాన్ని అందరికీ పంచాలని తెలుగుదండు అని ఒక సైన్యాన్ని రూపొందిస్తున్నారు. త్వరలోనే ఆయన ఒక ఉద్యమంతో మన ముందుకి రాబోతున్నారు. ఎ-తెలుగు కి సహాయం అందించటానికి, బ్లాగుల ప్రచారానికి అయన తన సంసిద్ధత వ్యక్తం చేసారు. ఆయనకి భగవంతుడు చిరాయువునివ్వాలని, ఆయన సంకల్పించిన ప్రతి పనిలోని భగవంతుని దీవెన తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. నన్ను తమతో తీసుకు వెళ్ళిన సతీష్ యనమండ్ర గారికి, జీవితంలో కొత్తకోణం శ్రీనివాస్ గారికి నా కృతఙ్ఞతలు.

ఒక మధుర ఙ్ఞాపకం
జీవితంలో కొన్ని ఙ్ఞాపకాలు పాత పుస్తకాల్లోని గులాబీ రేకుల్లా, నెమలీకలా దాగి ఉంటాయి. కానీ ఈ ఙ్ఞాపకాలు వాటిలా జీవం కోల్పోవు. ఎప్పుడు తరచి చూసిన ఆ పరిమళం మన హృదయాలను చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తునే ఉంటుంది. ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తూ సెలవు….
గమనిక: గజల్ శ్రీనివాస్ని ఆయన,గారు అని సంభోదించలేదు కారణం “ప్రతి తెలుగువాడి గుండె గడపలో ముగ్గులేసి తెలుగు మీద ప్రేమని నింపుతా. ఏం చేయలేమంటారా? ” అన్నారు. ఆ మాటతోనే మాకు ఆప్తుడయిపోయాడు, మా ఇంటిలో ఒకడు అయిపోయాడు. ఇంక ఆయన్ని దూరం చేసుకోవటం నాకిష్టం లేదు.
11 comments ఫిబ్రవరి 10, 2009
ఈ ఉగాదికి ఏంచేద్దాం?
ఈ ఉగాదికి ఏంచేద్దాం? ఎప్పటిలాగా ఉగాది పచ్చడి తిని, పంచాంగం విని పడుకుందామా? లేదా కొత్తసంవత్సరం ఏదయినా కొత్త పనితో మొదలు పెడదామా? నేను నా కొత్తసంవత్సరాన్ని ఖచ్చితంగా కొత్తగా మొదలుపెట్టాలనుకుంటున్నా. ఒక సమావేశంలో కత్తి మహేష్ గారు చెప్పారు “తెలుగును కాపాడుకోవాలని ప్రయత్నిస్తే మనకి ఎదురయ్యే ఎన్నో ప్రశ్నలకి సమాధానం చెప్పి అందర్ని ఒప్పించాలి. అప్పటికీ తెలుగుని బ్రతికించుకోగలమా అంటే ఎమో చెప్పలేం. తెలుగుతనాన్ని బ్రతికించే ప్రయత్నం చేద్దాం. అప్పుడు తెలుగు ఖచ్చితంగా బ్రతుకుతుంది”. అక్షరలక్షలు చేసేమాట. కానీ ఎలా? ప్లేకార్డ్లు పట్టుకుని రోడ్డు మీద తిరగాలి, ఫ్లెక్స్ పెట్టాలి విస్తృత ప్రచారం చెయ్యాలి. ఇవన్నీ అపోహలు, ఇవన్నీ చేయనక్కరలేదు.
స్వాతంత్ర్యం ఎలా అయినా సంపాదించుకోవాలి అని ఆవేశంలో ఊగిపోతున్న భరతజాతికి ఆయుధంలా మారి అందరిని ఒక్కతాటి పైన నడిపించింది ఒకచిన్నమాట కాదు ఒక మహామంత్రం “వందేమాతరం”. అలాగే ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరిని ఒక్కటి చేసేది, చూడగానే తెలుగువాడిగా గుర్తింపునిచ్చేది ఏదయినా ఉందా? ఉంది మన కట్టూ,బొట్టూ. మన కట్టూ,బొట్టూ కార్పొరేట్ కంపేనీల్లో సాంప్రదాయ వస్త్రధారణ ఉత్సవాల్లో మాత్రమే కనిపిస్తుంది. ప్రపంచం మందిగా గుర్తించిన, గౌరవిస్తున్న మన వస్త్రధారణతోనే తెలుగుతనాన్ని చాటిచెబుదాం. ఆంధ్రులు ఆరంభశూరులని ఉన్న అపవాదుని చెరిపేసుకుందాం. మన కార్యక్రమాలకి ఇది కొనసాగింపేకానీ అదనపు భారంకాదని భావిస్తున్నా.
చేయాలనుకుంటున్న కార్యక్రమాలు :
1.ఉగాది రోజు అందరం తెలుగు సంప్రదాయ వస్త్రధారణని పాటిద్దాం. 10కె రన్, బత్తీబంద్లకి మద్దతునిచ్చిన ప్రసార మాధ్యమాలు, కార్పొరేట్ కంపెనీలు దీనికి కూడా మద్దతునిస్తాయని బలంగా నమ్ముతున్నా. ఇప్పట్నుండీ మీ కంపేనీల్లో సంభందిత వ్యక్తుల్ని సంప్రదించండి. ప్రతి ఉగాదికి చేసేదే కదా ఇందులో ఎముంది గొప్ప అనుకుంటున్నారా? ఇలానే ప్రతినెలలో ఒకరోజు పాటిద్దాం. శ్రీలంకలో ప్రతీ పౌర్ణమికి మా కంపెనీ సెలవిస్తుంది. కారణం ఆ రోజు వారికి సంప్రదాయదినం. గుడికి వెళ్ళటం ప్రార్ధనలు చెయ్యటం వంటివి చేస్తారంట. మనం అలానే ప్రతీనెలలో ఒకరోజు సంప్రదాయ దుస్తులని ధరిద్దాం. రాష్ట్రం మొత్తం ఒక్కరోజు మన సంప్రదాయ దుస్తుల్లో, లంగావోణీల్లో అమ్మాయిలు, పంచె కట్టులోనో లేదా కుర్తాల్లో అబ్బాయిలు అహా చూడాటానికి ఆ దృశ్యం ఎంత అందంగా ఉంటుందో
2.దీనికోసం మనం ప్రముఖ ప్రసారమాధ్యమాల మద్దతు లభిస్తుందేమో ప్రయత్నిద్దాం. ఖచ్చితంగా మద్దతు లభిస్తుందని భావిస్తున్నా.
3.”నేను తెలుగువాడిగా పుట్టినందుకు గర్విస్తున్నా.” అనే బ్యాడ్జి ధరిద్దాం. ఇవన్నీ తెలుగువారి జీవితంలో ఒకభాగం అయ్యేంతవరకు మనం ముందుకు తీసుకువెళ్ళాలి. తర్వాత తెలుగే మనల్ని నడిపిస్తుంది.
నేను పైన చెప్పిన పనులు చాలా చిన్నవి, సులువైనవి అని భావిస్తున్నా. నేను గతంలో గాని ఇప్పుడూ గాని ప్రతిపాదించినవి ఆచరణ సాధ్యమైనవి. మనకి మరింత బలాన్నిచ్చేవి. బ్లాగర్స్ డే చేసుకుంటే ఒక కొత్త ఉత్సాహం ఉంటుందని నా బ్లాగులో రాసినప్పుడు ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఈ రోజున ఈ-తెలుగు కార్యక్రమాలకి ఉత్సాహం మొదలయినది అక్కడే అని అందరికి తెలుసు. చివరిగా వీవెన్ గారు చెప్పినట్టు, “ఎవరికోసం ఎదురు చూడకు నువ్వు చేయాలనుకున్నది చేసెయ్”. అవును అందుకే నేను ఇది చెయ్యబోతున్నా. సోదరుడు సతీష్కుమార్ యనమండ్ర నాతో కలిసి నడిచేందుకు అంగీకరించారు. ఆయన తన కంపెనీ లోని ఉద్యోగస్తులకి ఆచరించమని కోరుతానన్నారు. ఇంక మీ సమాధానం మిగిలుంది. రండి కలిసి నడుద్దాం. తెలుగు విప్లవంలో పాలుపంచుకుందాం.
4 comments జనవరి 31, 2009
e-తెలుగు విజయవాడ పర్యటన పై నివేదిక
నివేదిక ముందుగానే వ్రాయాల్సి ఉన్నా ప్రయాణ బడలిక, పని ఒత్తిడి వలన కాస్త ఆలస్యమయ్యింది. అయినా ఎదురుచూపులో ఉన్న హాయి మీకు తెలియనిదా? అసలు ఈ రెండు రోజుల్లో మేము విజయవాడనుండి మోసుకొచ్చిన అనుభూతులని మీతో పంచుకొని మరింతగా ఆస్వాదించాలని ప్రతీక్షణం అనుకుంటున్నా ఇప్పటికి కుదిరింది. అనుకున్న ప్రకారమే చదువరిగారు, చావా కిరణ్గారు కూకట్పల్లి నుండి ఇన్నోవా లో బయలుదేరారు. మార్గంలో శ్రీనివాసరాజు దాట్ల, నేను, సతీష్కుమార్ యనమండ్ర గారు, అరుణ పప్పు గారు వారిని కలిసాం. అందరం మంచి చాయ్ ఒకటి కొట్టి ప్రయాణం మొదలు పెట్టాం. మొదటి విడతలో ఆంధ్ర రాజకీయాలు, తెలుగు సినిమాల గురించి చర్చతో ప్రయాణం సాగించాం. అల్పాహారం తీసుకున్నాక చర్చని కాస్త మార్చి e-తెలుగు తదుపరి కార్యక్రమాలు ఏంటి? ఇప్పుడు మన మితృలలో కనిపిస్తున్న ఉత్సాహాన్ని నిర్మాణాత్మకంగా ఎలా వినియోగించుకోవాలి? గత కొద్దిరోజులలో తాబేలు నడకను వీడీ కుందేలులా దూకుతున్న మనప్రగతి నిర్లక్ష్యం లేదా నైరాశ్యంతో కుంటుపడకుండా ఈ స్పూర్తిని ఇదేస్థాయిలో కొనసాగించటానికి తీసుకోవాల్సిన నిర్ణయాల పై చర్చ జరిగింది. ఏకపక్షంగా కాక భిన్న వాదనల మధ్య కొనసాగిన చర్చ చివరికి ఏమార్గం లో నైనా అందరం కలిసే నడుద్దాం అన్న నిర్ణయం తో ముగిసింది. ఆ చర్చ వివరాలు త్వరలోనే మీ ముందుకు వస్తాయి. చర్చ ముగిసేంతలోనే విజయవాడ దగ్గరగా వచ్చేసాం. శ్రీకాంత్ గారికి ఫోన్ చేసి ఎక్కడకురావాలో వివరాలు తీసుకుని అక్కడకు చేరుకున్నాం. ఒక 5 నిమిషాల్లో శ్రీకాంత్గారు వచ్చేసారు. ఆయన రూపం బ్లాగులోని ఫోటోకి కాస్త భిన్నంగా ఉంది. ఫోటో చూసి యువకులేమో అనుకున్నాం కానీ మధ్యవయస్కులు (శ్రీకాంత్గారు మీకు కోపం రాదుకదా?
). శ్రీకాంత్గారు తమ ఇంటికి అందర్నీ సాదరంగా ఆహ్వానించారు. అద్భుతమయిన పాతడాబా ఇల్లు, పెద్దగా ఎత్తుగా ఉన్న ద్వారాలు, చెక్కమంచం, బీరువా నిండా పుస్తకాలు, ఇంటివెనక విరగ కాసిన ఉసిరిచెట్టు భలే అనిపించింది. నేను,చావాగారు ఎంతో ప్రయత్నం మీద నాలుగో ఐదో ఉసిరికాయలు తెంపాం. శ్రీకాంత్గారి ఇద్దరి పిల్లలూ ఎంతో ఒద్దికతో మమ్మల్ని వచ్చి పలకరించారు. శ్రీకాంత్గారి సతీమణి అన్నపూర్ణ గారు మాకు చల్లని మంచినీళ్ళతో ఆహ్వానం పలికారు. కాసేపు శ్రీకాంత్గారితో ముచ్చటించి, అందరం కాస్త సేదతీరాక భోజనాలు అవికానిచ్చి విజయవాడ ఆకాశవాణి కి చేరుకున్నాం.

శ్రీకాంత్గారి పుస్తకాల కొలువు
పద్మకళగారు వచ్చి అందర్ని ఆకాశవాణి లోకి తీసుకొని వెళ్ళారు. పేరు చూసి నడివయస్కులేమో అనుకున్నాం కానీ మళ్ళీ దెబ్బతిన్నాం. ఎన్నో ఏళ్ళ చరిత్రకలిగిన ఆకాశవాణిలో అడుగుపెడుతుంటే అందరిమనస్సుల్లో ఒక గొప్ప అనుభూతి కెరటంలా వెల్లువెత్తింది. “ఇప్పుడు సమయం 2 గంటలా 30 నిమిషాలు కావస్తుంది”, “మీరు వింటున్న ఈ పాట సాలూరు రాజేశ్వర్రావు స్వరసారధ్యంలో “,”ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ” ఇలా కొన్ని చిన్నప్పటి ఙ్ఞాపకాలు కళ్ళ ముందు కదిలాయి. ఎందరో గొప్ప సాహితీ వేత్తలు, కవులు, గాయకులు, రంగస్థలనటులు, కళాకరులని మనకి అందించిన ఆకాశవాణిలో మేము మాట్లాడటం రవ్వంత గర్వాన్ని కలిగించింది. ఈ ఘనత e-తెలుగు చరిత్ర లో ఒక మైలురాయి. ముందుగా ప్రణాళిక లేక పోవటం చేత పద్మకళగారితో అప్పటికప్పుడు చర్చించి కార్యక్రమం మొదలు పెట్టాం. చదువరిగారు e-తెలుగు లక్ష్యాలు,సాదించిన విజయాల్ని గణాంకాలతో సహా వివరించారు. e-తెలుగు భవిష్యత్తు ప్రణాలికలు చెప్పారు. చావా కిరణ్గారు తెలుగు వికిపీడియా గురించి, బ్లాగుల గురించి చక్కగా వివరించారు. బ్లాగుల వలన గృహిణులకి,విధ్యార్దులకి, విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి కావల్సిన ఎన్నో సలహాలు సూచనలిచ్చే బ్లాగులు తెలుగులో మనకు ఉన్నాయని,ముఖ్యంగా కనుమరుగయిపోతున్న ఆరోగ్యకరమయిన హాస్యాన్ని అందిచే బ్లాగులు ఎన్నో ఉన్నాయని చావాగారు వివరించారు. నేనుకూడా ఉడతసహాయంచేసాను. ఆవిధంగా అనుకున్నదానికంటే కూడా మంచిగా ఆ కార్యక్రమం ముగిసినది.

శ్రీనివాసరాజు, సతీష్ యనమండ్ర

అరుణ పప్పు, చావా కిరణ్

శ్రీనివాస కర గారు , శివరామప్రసాద్ గారు

పుస్తకప్రదర్శన ప్రాంగణం
ఆకాశవాణి లో చర్చ ముగిసినవెంటనే “వాక్ ఫర్ బుక్స్” ర్యాలీకి చేరుకొని, అప్పటికే మొదలయిన ర్యాలీ లో మధ్యలో దూరి e-తెలుగు బ్యానర్ ని ప్రదర్శిస్తూ నడక సాగించాం. అరుణగారు,చావాగారు ఒక జట్టుగా సతీష్గారు, శ్రీనివాస్ ఒక జట్టుగా బ్యానర్ పట్టుకొని కాస్త చొరవ తీసుకుని ర్యాలీ లో ముందుకు దూసుకుపోయి అందరి దృష్టిని ఆకర్షించారు. ర్యాలీ పుస్తక ప్రదర్శనకి చేరుకున్నాక అరుణగారు మనకోసం ఒక చిన్న స్టాలులా బల్లలతో ఏర్పాటు చేసారు. బ్యానర్ కట్టినప్పటినుండి మన కార్యక్రమం మొదలు పెట్టేంతవరకు వచ్చిన జనమంతా అడిగిమరీ కరపత్రాలు తీసుకొని, తమ సందేహాలను సహితం తీర్చుకొని వెళ్ళారు. కార్యక్రమం సమయం కంటే కాస్త ముందుగానే స్టాలు ని ముగించి “ప్రతిభ వేదిక” వద్దకి చేరుకున్నాం. మన కార్యక్రమానికి తగ్గ పేరుగల వేదిక చూసారా? శ్రీకాంత్గారు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు. కుర్చీలు వేయించటం, ప్రొజెక్టర్ ఏర్పాటులాంటివి చకచకా జరిగిపోయాయి. పద్మకళగారు మీడియా మితృలని పిలవటం, మన గురించి చెప్పటం, పరిచయం చేయటం వంటి పనులతో తీరికలేకుండా గడిపారు. కళగారి సహాయంతో 93.5 FM వారు, జీ న్యూస్ వారు మంచి కవరేజినిచ్చారు. ఉరుముల్లేని పిడుగులా జీవితంలో కొత్తకోణం శ్రీనివాస్గారు వచ్చారు. వస్తూనే ఆయన ఏర్పాట్లలో నిమగ్నమయిపోయారు. జీ న్యూస్ వారికి e-తెలుగు గురించి వివరించారు. చావా గారు, సతీష్ గారు 93.5 FM కి వివరాలు అందించారు.

e-తెలుగుస్టాలు

ఆదిత్యప్రసాద్ గారి పరిచయం

e-తెలుగు గురించి వివరిస్తున్న చదువరిగారు


బ్లాగుల గురించి వివరిస్తున్న చావాకిరణ్

జీన్యూస్ కి వివరాలు అందిస్తున్న శ్రీనివాస్ (జీవితంలో కొత్తకోణం)
ఆకాశవాణి సంచాలకులు ఆదిత్య ప్రసాద్ గారి వ్యాఖ్యానం తో కార్యక్రమం మొదలయ్యింది. చదువరిగారు ఆహుతలకి అర్దమయ్యేలా అంతర్జాలంలో తెలుగుని ఉపయోగించవచ్చని ఇది సులువైనది ఖర్చులేనిదని వివరించారు. అంతర్జాలంలో తెలుగు ఉపయోగాన్ని పెంచటమే e-తెలుగు లక్ష్యమని చెప్పారు. శ్రీధర్గారు రాకున్నా ఆయన వ్యాఖ్యానంతో ఉన్న వీడీయోల సహాయంతో కార్యక్రమం కొనసాగింది. చదువరి గారి సారధ్యం లో నేను కంప్యూటర్లో తెలుగు ఎనెబుల్ చేసుకోవటం, లేఖినిలో తెలుగు వ్రాయటం గురించి వివరించాను. చావాగారు బ్లాగు గురించి, బ్లాగులు ఎలా తయారు చేసుకోవాలి, తెలుగు వికిపీడీయా గురించి ఆసక్తికరంగా వివరించారు. శ్రీధర్గారు ఎంతో శ్రమతో తయరుచేసిన వీడీయోలు ప్రేక్షకులు ఆసక్తిగా చూసారు. కొందరు నోట్స్ వ్రాసుకోవటం కూడా కనిపించింది. కార్యక్రమం ముగిసిన వెంటనే అందరూ మా వద్దకి వచ్చి కరపత్రాలు తీసుకొని, అనేక సందేహాలని నివృత్తి చేసుకొని, వారి ఈ-మెయిల్ వ్రాసిచ్చి వెళ్ళారు. కొందరు చావాగార్ని అసలు వదిలిపెట్టనే లేదు. కార్యక్రమం ముగిసిన ఎంతోసేపటి వరకు మాతో మాట్లాడుతునే గడిపారు. ఇది నిజంగా మేమంతా ఆనందించిన విషయం. హైదరాబాద్ లో కంటే ఇక్కడ లభించిన స్పందన మాకు తృప్తిని మిగిల్చింది. అంతదూరం ప్రయాణం చేసి వెళ్ళినందుకు చాలా తృప్తికలిగింది. అక్కడితో అయిపోలేదు అంతవరకు హడావుడిగా సాగిన కార్యక్రమం, బ్లాగు మితృల ముచ్చట్లతో తేలిక పడింది. పుస్తకప్రదర్శన తిలకించటనికి వచ్చిన ఒక వ్యక్తికి e-తెలుగు బ్యానర్ కనపడింది మా వద్దకి వచ్చి పలకరించి తనని తాను పరిచయం చేసుకున్నారు. అప్పుడు తెలిసింది ఆయన మనందరికి చిరపరిచితుడైన గీతాచార్య అని. అందరం పోటో తీసుకుందాం అనుకునేంతలో హలో నేను కూడా బ్లాగర్నే నా బ్లాగు పేరు యువకుడు అంటు ఒక నవయువకుడు వచ్చాడు. అసలు ఊహించ కుండానే అంత మంది బ్లాగర్లు ఒకేసారి కలుసుకోవటం గమ్మత్తుగా అనిపించింది. కార్యక్రమం సాఫీగా జరగటానికి సహాయ పడిన శ్రీనివాస కర గారికి, శివరామ ప్రసాద్గారికి ఎంతో ఋణపడి ఉన్నాం. పుస్తక ప్రదర్శనలో అడుగుపెట్టినప్పటినుండి అన్ని పనులు తమ భుజానవేసుకుని నడిపించారు. వారికి మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మొత్తం కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించిన ఒక పెద్దాయన తన పేరు సుబ్బారావు అని తాను కొత్తపాళీ గరి మామ గారినని పరిచయం చేసుకున్నారు. అందరం ఆయన్ని ఆప్యాయంగా పలకరించాం. ఈ వయస్సులో ఇంత చలిలో మనకోసం వచ్చినందుకు ఆయనకి ఏవిధంగా మనం ధన్యవాదాలు చెప్పగలం? కళగారి మితృడు సాయి మన కార్యక్రమ వివరాలు తెలుసుకుని ఆసక్తి తో మనకి ఎంతో సహాయం చేసాడు. కరపత్రాలను పంచి ఓపికగా అందరివద్దకి వెళ్ళి ఈ-మెయిల్ తీసుకుని నింపి కార్యక్రమం ముగిసేవరకూ ఉండి వెళ్ళారు. ఆయనకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు

బ్లాగుమితృలు ఒక్కచోట చేరిన వేళ
ప్రముఖ రచయిత కేశవరెడ్డిగారిని కలిసి నేను,అరుణగారు e-తెలుగు కార్యక్రమాలు వివరించాము. ఆయన మన కృషికి అభినందనలు తెలిపారు. అలాగే చదువరిగారు పలువురు ప్రముఖులను కలిసి e-తెలుగు కార్యక్రమాలు వివరించారు. పుస్తకప్రదర్శనలో కార్యక్రమం ముగించుకొని శ్రీకాంత్గారి ఇంటికి చేరుకుని బడలిక తీర్చుకున్నాం. ఆరోజు సంగతులన్నీ ఒక్కసారి స్మరించుకున్నాం. శ్రీకాంత్దంపతుల వద్ద సెలవు తీసుకుని బయలుదేరాం. శ్రీకాంత్గారు మాకూడా బయటకు వచ్చి మేము అల్పాహారం తినే వరకు మాతోనే ఉన్నారు. ఆయనకి కళగారికి మనం ఋణపడిపోయాం. ఆ స్మృతలన్నీ మూటగట్టుకొని హైదరాబాద్ దారిపట్టాం.మొన్న ఎలా జరుగుతుందో అన్న ఊహ, నిన్న నమ్మలేని నిజంగా మాముందు ఆవిష్కరింపబడి నేటికి ఒక మధుర ఙ్ఞాపకంలా అనుభవాల పెట్టెలోకి చేరుకుంది. నివేదికకి చిత్రాలని అందించిన శ్రీనివాసరాజు దాట్లకి ధన్యవాదాలు. నేను మరిచిపోయిన వ్యక్తుల వివరాలు, సంఘటనలు ఏమయినా ఉంటే మితృలు వ్యాఖ్యలరూపంలో అందించండి.
13 comments జనవరి 7, 2009









