ఆమె నన్ను వదిలి వెళ్ళిపోయింది.

Heart_Broken_by_Blackmago

She Broke My heart

ఆమె ఎప్పటిలానే నన్ను వదిలి వెళ్ళిపోయింది.

వీధి దీపాల్లో నేను వ్రాసే పిచ్చిరాతల్లో జీవితం లేదని వెళ్ళిపోయింది.

కళ్ళలో కోటి ఆశలు, ఏన్నో ఊహలు,కలలు

వీటిలో ప్రాక్టికాలిటీ లేదని వెళ్ళిపోయింది.

దూరంగా ఆకాశం, నేల కలిసిపోతుంటే

అనందంతో గంతులు వేస్తున్న నన్ను చూసి

వీడింతే లోకం తెలియని వెర్రివాడు అనుకుని వెళ్ళిపోయింది.

సంధ్య వేళలో కలిసిపోతున్న వెలుగు చీకట్లను

సంభ్రమంగా చూస్తున్న నన్ను చూసి

వీడొట్టి ఎమోషనల్ ఫెల్లో అని తేల్చేసి వెళ్ళిపోయింది.

తనకోసమే ఆలోచిస్తుంటే ఒక అడుగు

తనకోసం ఏడుస్తుంటే వంద అడుగులు

పిచ్చివాడిలా అరుస్తుంటే వేయి అడుగులు చొప్పున దూరంగా వెళ్ళిపోయింది.

తను నన్ను చూస్తుంటే దూరంగా అఘాధంలో.

నేను తనని చూస్తుంటే దగ్గరగా హృదయంలో .

ఈ ఊరికి ఆ ఊరు,ఆ ఊరికి ఈ ఊరు ఒకే దూరంలో లేవెందుకో?

19 comments అక్టోబర్ 12, 2009

ఆమె,నేను,కొన్ని ఊహలు..

nuvvu nenu vennela

నువ్వు నేను వెన్నెల

1.నువ్వు లేకుండా ఒక్కసారయినా వెన్నెలలో గోదావరి ఒడ్డున నడవాలనుకున్నా. గోదారమ్మ పున్నమినంతా కలిపి నీలా మార్చేసింది.
నాకు కోపం వచ్చి “ఏం తనులేకుండా నేను బ్రతకలేనా? ఒక్కరోజు తను లేని ఏకాంతం కావలని అన్నా గా. ఎందుకిలా చేసావ్?” కోపంగానే అడిగా గోదారమ్మని.
గోదారమ్మ నవ్వి “ఏకాంతం అంటే తను నీ పక్కనలేకపోవటం కాదు. నీ మనసు నుండి పక్కన పెట్టి చూడు” అని వెళ్ళిపోయింది.

2.దేవుడు నాకు ఒక పరీక్షపెడతా అన్నాడు.
ఒక పెద్ద మైదానంలో కోటి తారలని,అప్సరసలని,ప్రపంచ సుందరీమణులని,రాకుమారిలని తెచ్చి కూర్చోబెట్టి.
ఒకే ఒక్క అవకాశం ఇచ్చాడు.నువ్వు ఎక్కడున్నావో కనుక్కోమని.
నేను కళ్ళు మూసుకుని “నువ్వు లేకుండా ఒక్క క్షణమయినా బ్రతకలేనని తెలుసు కదరా. ఎక్కడున్నావు?” అని మనసులో అనుకున్నా.
మైదానం మధ్యలో ఒక స్పందన కనిపించింది. నువ్వు లేచి నిలబడ్డావు
దేవుడు నవ్వి “తను నీతో ఉండగా నిన్ను ఓడించటం నా వల్ల కాదు” అని వెళ్ళిపోయాడు.

3.చిన్నప్పుడు అమ్మ చందమామ రావో జాబిల్లి రావో అని అందమయిన అబద్దం చెప్పింది. అది నిజంకాదని తెలిసాక చాలా ఏడుపొచ్చింది.
చాలాసేపు కూర్చుని ఏడ్చాను. దేవుడొచ్చి ఏడవకయ్యా. నీకోసం ఒక చందమామ ఉందిలేవయ్యా అని తన చేతిలో నిన్ను చూపించాడు. అప్పటినుండి వెతికితే ఇప్పటికి కనిపించావు.

4.నా కళ్ళు మూయాలని నా వెనుకగా నువ్వు వస్తూ ఉంటే నీ పాదాల కదలికలకి నీ మువ్వలు చేసే సవ్వడి, ఆ అలికిడికి నేను వెనుకకు తిరిగితే దొరికిపొయానని నువ్వుపెట్టే బుంగమూతి.అలా నిన్ను హత్తుకోబోతే సిగ్గుతో దాచుకునే నీ మోము. నా భుజం పైన తల వాల్చేప్పుడు నీ మౌనం. ఇవి చాలు వేల సంవత్సరాలు దాచుకోవటానికి.

5.ఓటమిలో ఓ ఓడిలో చేరి ఏడ్వాలని వాలిపోతున్న నా తలని నిమిరే చేయి, గెలుపులో నా అనందాన్ని పదింతలు చేసే నీ కౌగిలి, తెల్లవారే ఉత్సాహాన్నిచ్చే నీ తొలిముద్దు, సాయంత్రం అలసి ఇంటికి వస్తే నన్ను సేదతీర్చే నీ చిరుముద్దు ఇంతకంటే ఏం కావాలి నువ్వు నాకోసమే పుట్టావని నమ్మటానికి. బదులుగా నేనేమివ్వను రా? మోకాళ్ళ పై వంగి నా సమస్తాన్ని నీ పాదాక్రాంతం చేసి నీకు దాసోహం అంటున్నా.

21 comments అక్టోబర్ 11, 2009

మళ్ళీమొదలయ్యింది

beauty

 

ఎందుకిలా అన్నిచోట్లా నువ్వే కనిపిస్తావ్?
ఈ పిల్లకి అసలు కుదురులేదంటారు.

*** *** ***

గడిచిన నిమిషంలో
నిన్ను ఒక్కసారే తలుచుకున్నా.
ఈ ఒక్కసారికి నన్ను మన్నించవా?

*** *** ***

ఈ ఒక్కరోజు నవ్వకుండా ఉండరాదూ?
ఒంటిమీద నగలన్ని వెలవెలబోతున్నాయి.

*** *** ***

దేవుడు నిన్ను ఆడిపోసుకుంటున్నాడు
ఏ మంత్రం వేసావో ఏ మాయ చేసావో అని
నేను గుడికి వెళ్ళి ఏడాది దాటిందిమరి.

*** *** ***

దోసిలిలో చినుకుల్ని దాచుకొచ్చా
నీ పెదాలనో లేదా పాదాలనో చేరి
ముత్యాలవుతాయని.

7 comments ఆగష్టు 31, 2009

నేను కవినా? కానా?

కోటి వెన్నెలల రాశి
కోటి వెన్నెలల రాశి

ఈ టైటిల్ కి సమాధానం చెప్పాలనుకున్న వాళ్ళకి నా గత టపాల టైటిల్ గుర్తుందని నమ్ముతూ. ఇక చదవండి.

ఈ రోజు అమావాస్యంట
ఆకాశం వైపు చూసారేమో
ఓ సారి నువ్వు కనబడిరాకూడదూ.

    *****

నెలగంటు పెట్టారంట
సాయంత్రం బయటకిపోకు
చంద్రుడివసలే దిష్టికళ్ళు.

    *****

వేసవిలో వాకిట్లో మంచం
నిదురలో నీ అందం చూస్తూ
సూర్యుడు ఉదయించటం మరిచిపోయాడు.

    *****

ఓ వర్షాకాలం సాయంత్రం నవ్వుతూ నువ్వు
చినుకులు కోటి అద్దాలు
నా కళ్ళముందు ఇంద్రధనస్సు.

    *****

పాడు శీతాకాలం మల్లెలు లేని నీ జడ
ఆకాశానికి కోపం వచ్చిందేమో
మంచుపూలు నీ వాకిట్లో.

10 comments ఆగష్టు 10, 2009

కాకి దిద్దిన కాఫురం (!?!)

“అకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఈ రోజు అదివారం సమయం మధ్యాహ్నం 9 గంటలు దాటి 9 గంటల 5 నిమిషాలు కావస్తుంది. ఈ రోజు ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చని విశాఖపట్నం వాతావరణశాఖ తెలిపింది. తీరప్రాంతంలో వేటకి వెళ్ళటం ప్రమాదమని మత్సకారులకు తెలిపింది.” ఎదురింటిలో పాతకాలం నాటి రేడియోలో గర గరలాడుతూ వినిపించింది. వెంటనే అదేదో టి.వి. లో “దంచవే మేనత్త కూతురా!” సీరియల్ లో అత్త కోడల్ని ఎలా చంపాలా అని ఆలోచిస్తూ రెండు ఎపిసోడ్లుగా సాంబారు వండుతున్న ఉత్కంట భరితమైన సన్నివేశంలో మునిగిపోయిన మా అమ్మ తొందరగా వెళ్ళి బట్టలు ఉతకటం ప్రారంభించింది. ఒక మూల మడత మంచం మీద ముసుగుతన్ని ముడుచుకు పడుకున్న మా బామ్మ ఎగిరి నేలమీద దూకి మూడు మొగ్గలేసి వంటగదిలో నుండి ఒకపాత్ర తీసుకుని  పాత సినిమాల్లో కృష్ణలాగ వెనుకనుండి డింగుమంటూ ఒక గెంతులో మా మేడ మీదకి ఎగిరి గుమ్మడి ఒడియాలు పెట్టడం మొదలుపెట్టింది. నాకు దగ్గర్లో పరీక్షలు కూడా ఉండటంతో బాలు బ్యాటు పట్టుకుని మా బ్యాచ్ కోసం ఎదురూచూస్తూ ఇంటి బయట నిలబడ్డా.

ఇంతలో మా బామ్మ కదనకుతూహలరాగంలో “ముక్కాల ముక్కాబులా..” పాట పాడుకుంటూ కిందకు వచ్చి నా చేతిలో బ్యాటును చూసి ఆగింది.

“ఏరా బ్యాటుతో కాకులను కొడతారట కదా! కాసేపు మేడ మీదకు వెళ్ళి కాకులను కొట్టకూడదూ” అంది. (మా బామ్మకి మా తాతయ్య కాకి రూపంలో ఉన్నాడని అనుమానం.)

“అబ్బా బామ్మ ఆ కాకులు ఈ కాకులు కాదే. అసలు ఆ బ్యాటు ఈ బ్యాటు కాదే.” అన్నాను చిరాగ్గా.

అప్పటికే కళ్యాణిరాగంలో “చికుబుకు చికుబుకు రైలే” పాటకి శృతి చేసుకుంటున్న బామ్మ “ఆ కాకులు ఈ కాకులు కానప్పుడు, ఈ బ్యాటు ఆ బ్యాటు కానప్పుడు, ఈ బ్యాటుతో ఈ కాకులను కొట్టచ్చుకదా” అంది.

నా ప్రేమకి “నో” చెప్పిన పక్కింటి పద్మ మీద ఒట్టేసి చెబుతున్నా. మా బామ్మ లాజిక్కేంటో ఇంకా నాకు అర్ధంకాలేదు. కానీ మరలా అడిగితే అసలే సూపర్ స్టార్ కృష్ణ అభిమాని గాల్లోకి ఎగిరి గంట వరకు నేల మీదకి దిగకుండా తంతుందేమో అని భయపడి కాసేపు మా తాత మిత్ర బృందంతో ఆడుకుందామని మేడమీదకి వెళ్ళాను. అప్పటి వరకూ మా మేడ వైపు కనీసం కన్నెత్తి ఛూడకుండా బాగా కునుకుతీస్తున్న కాకులన్నీ కాపలాగా నేను రావటం చూసి దాగుడు మూతలు, చెడుగుడు, కోతికొమ్మచ్చి, టెంకి మీద జెల్ల జాతీయ కాకి జట్టుల్ని పిలుచుకుని మరి నా మీదకి దండయాత్రకి వచ్చాయి.

కాకుల దండయాత్రకి కొంత భయం వేసి “తాత నా తప్పేం లేదు. బామ్మ పంపించింది.” అని ఏడుస్తూ అటూ ఇటూ చూస్తున్నా. మా ఇంటికి కాస్త దూరంలో వేరే మేడ మీద ఒక కొత్తమ్మాయి కనిపించింది. వెంటనే వండే సిరీస్ ఫైనల్ లో 57 బంతులాడి 7 పరుగులు చేసి పిచ్ మద్యలో గర్వంగా నిలబడ్డ ద్రావిడ్ లా ఫోజిచ్చా. నా వైపు అదోలా చూసి “కా కా” అని అరవటం మొదలుపెట్టింది. గిన్నెలో తీసుకు వచ్చిన అన్నం గోడమీద పెట్టి మ్యూజిక్ డైరెక్టర్ చక్రిలా శ్రావ్యంగా “కా కా” అని అరవటం కంటిన్యూ చేసింది. పాపం వాళ్ళింట్లో ఎవరుపోయారో కాస్త సాయం చేద్దామని నేను కూడా “కా కా” అన్నాను. కాకులన్నీ నా వైపు వెటకారంగా చూసి “ఓర్ని లసాకా బరాబర్” అని నవ్వుకుంటూ, అన్నంలో నంచుకోటానికి వడియాలు తీసుకుని పక్కింటికి వెళ్ళిపోయాయి. (తల్లి తోడు లసాకా బరాబర్ అంటే బూతు కాదు. 50 వేల సార్లు “కా కా” కి బరాబర్ అంటే సమానం. ఇందులో ఒక చిన్న పజిల్ ఉంది అదేంటో చెప్పుకోండి చూద్దాం.)

ఆ అమ్మాయి నిజంగా అన్నం కాకులు కు పెడుతుందా లేక దొంగముండ (ఫెమినిజం జిందాబాద్. ప్రపంచ స్త్రీలంతా నాకు అమ్మ,అక్క మరియు చెల్లెల్లు వారి వారి వయసుని బట్టి. ఆఫీస్ లో నా పక్కన కూర్చునే ఆశ తప్ప కుంజరహ) నా ముందు ఫోజు కొడుతుందా అని తన నోటి వైపు చూసా. ఏమనుకుందో ఏమో నా వైపు అసహ్యంగా చూసి “ఇది నిన్న పాచెక్కిన అన్నం మా నాన్న ఊరిలో లేడని కాకులకి పెడుతున్నా” అంది. నా చూపు అంత అందంగా ఉందని అర్దమయ్యి వెంటనే చూపు మార్చాను. ఆ అమ్మాయి అలా కాకులకి అన్నం పెడుతూ “చందమామ రావే జాబిల్లి రావే” పాట పాడుతుంటే నా మనసు పై ఫ్లోర్ నుండి స్విమ్మింగ్ పూల్ లోకి పడ్డ స్పీడులో ప్రేమలో పడింది. వెంటనే ఎ.అర్.రెహమాన్ మూటముళ్ళూ సద్దుకుని వచ్చి నా ముందు గిటార్ బూజు దులపటం మొదలుపెట్టాడు. ఎలాగో ఒకలా మాటకలపాలని “రేపు మెనూ ఏంటో” అన్నా. “నాదా కాకిదా” అని ఆడిగింది.
“అనంతపురం అడవిలో ఆరు రోజులుగా నీరులేక ఏడుస్తున్న అనాధ కాకి మొహం దానా” అని తిట్టాలని అనిపించినా కరీనా కపూర్ ని కత్రినా కైఫ్ ని కైమా కొడీతే వచ్చిన కన్నడ హీరోయిన్ లా ఉంది అనవసరంగా ఫీల్ అవుతుందేమో అని “కాకి దే” అన్నా.
“మటన్ బిరియాని” అని చెప్పి మాట్లాడకుండా వెళ్ళిపోయింది.
“బామ్మా రైతా వండటం ఎలానో చెప్పవే” అనుకుంటూ నేనూ కిందకి వెళ్ళిపోయా.

మరుసటి రోజు పొద్దున్నే తలకి స్నానం చేసి కొత్త బట్టలేసుకుని రైతా పట్టుకుని మేడ మీద కూర్చున్నా. అ అమ్మాయి వచ్చింది. వస్తూనే “మా ఇంట్లో పులిహోర చేస్తారని నీకెలా తెలుసు రైతా తెచ్చావ్” అని అడిగి నా చేతిలో రైతా లాగేసుకుని పులిహోరలో కలిపేసుకుని తినటం మొదలు పెట్టింది. పులిహోరలో రైతా ఏంటే నీ …. డైలీ సీరియల్ అంత తిట్టు మనసులో తిట్టుకున్నా. అంతా తినేసిందనుకునేరు, మధ్య మధ్యలో కాకులకి కూడా పెట్టింది. నేను కూడా ప్రేమగా కాకులకి పెట్టడం మొదలుపెట్టా. “మీకు కూడా కాకులంటే ఇష్టమా?” అని అడిగింది. “ఎంతమాటన్నారండి కాకి మాత్రం జీవి కాదా? అసలు మన జాతీయ పక్షిగా కాకిని పెట్టాలని నేను నా స్నేహితులతో కలిసి ఉద్యం చేద్దామనుకుంటున్నా. మా బామ్మకయితే మరీను. కాకుల్ని మా తాతతో సమానంగా చూస్తుంది.” అని చెప్పాను. కాకులన్నీ “కా కా” గోల చేసాయి. ఆ అమ్మాయి నా వైపు అనుమానంగా చూసింది. “మీరు నమ్మటం లేదు కదా కావాలంటే చిన్నప్పుడు నేను ఎంత అడిగినా ఇవ్వకుండా ఊరించుకుని కొబ్బరుండ తిన్న ఎదురింటి శీను గాడి మీద ఒట్టు” అన్నాను. పనిలో పనిగా “మీకెందుకండీ కాకులంటే అంత ఇష్టం” అని అడిగా. “ఇష్టమా? గుడ్డా? అదో స్టోరీ” అంది. “మూడున్నర ముక్కల్లో చెప్పటం కుదరదా” అడిగేసా.

“సరిగ్గా మూడేళ్ళ క్రితం నేను ఎంతో కష్టపడి “మీ పక్క ఊరి పెంట సారీ వంట” అనే కార్యక్రమం చూసి బంగాలదుంప,అరిటికాయ,క్యాబేజీ కలిపి కొత్తిమీర కారం పెట్టడం ఎలాగో నేర్చుకున్నా. మా ఇంట్లో బంగాలదుంపలు లేకపోవటంతో దాని బదులు బీరకాయ వేసి కూర వండాను. అదికాస్త రుచి చూపిద్దామంటే మా ఇంట్లో ఎవరూ లేరు. మా కుక్క జిమ్మీకి పెట్టాను. అది వాసన చూసి పెరుగు వెయ్యలేదన్న కోపం తో అనుకుంటా పక్కింటి టామీ తో లేచిపోయింది. చేసేదిలేక ఆకలిగా ఎదురుచూస్తున్న ఒక కాకి కి పెట్టాను. అది తిన్న కాకి ఆనందం తట్టుకోలేక గెంతులు వేస్తూ పాపం అదే అనందంలో గిన్నె (మనుషుల బాషలొ బాల్చీ) తన్నేసింది. అప్పటి నుండి కాకులంటే నాకు వల్లమాలిన అభిమానం” అని ముగించింది. “నీ యంకమ్మ.. అన్ని తెలుగు చానెల్స్ లో సీరియల్లు కలిపినంత పొడుగు తిట్టు మనసులో తిట్టుకుని. ఆ కాకి ఎలా ఉండేదండీ” అని అడిగా.
“నల్ల మొహం, నల్లని ముక్కు, నల్లని రెక్కలు” అని చెప్పటం మొదలుపెట్టింది.
“ఓహో ఆ కాక” అన్నాను.
“మీకు తెలుసా?” ఆత్రంగా అడిగింది.
“నీ.. తెలుగు వికీపీడియా అంత తిట్టూ”
“ఓ చాలా బాగా తెలుసు ఎంత అందంగా ఉండేదో” అన్నాను. కానీ ఆ కాకి చనిపోయిన విషయం మా బామ్మకి చెప్పాలని మనసులో అనుకున్నా. “రేపు మెనూ ఏంటో” మరలా అడిగా.
“నాదా కాకిదా” మరలా అదే ప్రశ్న.
“పెద్ద తేడా ఏముందిలే” అని మన్సులో అనుకుని “మీదే” అన్నాను.
“దద్దోజనం” అని చెప్పి వెళ్ళిపోయింది.

ఇది దద్దోజనం అందంటే ఖచ్చితంగా బిరియానీ తో వస్తుంది. దీనికి బిరియానీలో కొబ్బరి పచ్చడే నచ్చుతుంది అనుకుని కొబ్బరికాయ కొనటానికి బజారుకి బయలుదేరాను.

మరుసటి రోజు ఆ అమ్మాయి టేస్టుకి నచ్చినట్టు గులాబీరంగు ఫ్యాంటు మీద పసుపు పచ్చని షర్టు వేసుకుని కొబ్బరిచట్నీతో మేడ మీద రాత్రి వరకు ఎదురుచూసా. ఆ అమ్మాయి రాలేదు. విషయం కనుక్కుందామని వాళ్ళింటికి వెళితే ఇల్లు తాళం వేసి ఉంది. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న వ్రాసిన అకౌంట్స్ అర్ధంకాక మేనేజర్ కి పిచ్చేక్కి వాళ్ళావిడా చెవికొరికాడంట. దానితో మేనేజర్ బందువులంతా దీనికి కారణమయిన వాళ్ళ కుటుంబలో ఎవరయినా దొరికితే ముక్కు కొరుకుతామని ప్రతిఙ్ఞ్ చేసారంట. అందుకే రాత్రికి రాత్రే వాళ్ళ కుటుంబమంతా పారిపోయారు.

అప్పటి నుండి ఆ అమ్మాయికోసం వెతకని కాకి గూడులేదు. ఆ రోజు వండిన కొబ్బరి చట్నీ అలానే పట్టుకుని రాష్ట్రమంతా తిరుగుతున్నా. పేరు కూడా తెలియక “కా కా” అంటూ అరుస్తూ తిరుగుతున్నా. అదిగోండి అక్కడెవరో కాకులకి అన్నం పెడుతున్నట్టు ఉన్నారు. కాకి గోల వినిపిస్తుంది. మరలా కలుస్తా.. కా.. కా…హెలో కా..కా..

16 comments ఆగష్టు 6, 2009

నేను రచయిత కాదన్నవారిని రాయిచ్చుకు కొడతా..

best friends

best friends

ఏటి ఒడ్డున ఇసుక మేటలు
ఓ నాలుగు చేతులు
గంటలో రాములోరి గుడి.

ఊరి మధ్యలో రాములోరి గుడి
గుప్పిట్లో కొబ్బరి ముక్క ప్రసాదం
కాకి ఎంగిలి.

ఊరి చివర జాతర
చేరో చేతిలో రూపాయి
పుల్ల ఐసు, రంగులరాట్నం.

లెక్కల మాష్టారి కోపం
ఒక చేతి పై వాత
నాలుగు కళ్ళలో నీళ్ళు.

పుట్టినరోజు పండగ
నాన్న ఇచ్చిన క్యాడ్బరీ చాక్లెట్
సగం సగం.

ఊరిలోకొచ్చిన కొత్తమ్మాయి.
బాబాయి హీరో సైకిల్
చెరో రౌండ్.

వాచీ పాతబడింది
పదవతరగతి పరీక్షలు
చేరో రైలు బెంగులూరు, హైదరాబాద్.

జుత్తు నెరిసింది
పిల్లల పెళ్ళి
రెండు మనసుల్లో తడారిపోని స్నేహం.

19 comments ఆగష్టు 3, 2009

సత్తెమ్మ

నలుపుతెలుపులు అల్లుకున్న ఆ నాలుగు గోడల మధ్య ప్రపంచంలోని నలుపుని దూరంచేయటంకోసం యుగాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మానవీయ విలువలకోసం కొలమానాలు నిర్వచింపబడుతున్నాయి. కానీ చీకటి పడితే వెర్రితలలేసుకు విరుచుకుపడే రాక్షసత్వం మానవత్వాన్ని వెక్కిరిస్తూనే ఉంది. యుగాలు మత్తుగా మునగదీసుకుని పుస్తకాల్లో చేరి అల్మరాలో పడుకున్నాయి. నీతి లేని ఈ జాతిని, ఈ జుగుప్సని చూడలేక న్యాయ దేవత కళ్ళకి గంతలు కట్టుకుంది. అమాయకుల ఆర్తనాదాలు ఆమె చెవిన చేరినప్పుడు తను కార్చే కన్నీటిని మాత్రం ఆ గంతలు అడ్డుకోలేక పోతున్నాయి.

జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి అనసూయమ్మ అలసటగా కనిపిస్తుంది. ఎన్నో రోజులుగా నలుగుతున్న సత్తెమ్మ కేసు ఈ రోజు వాయిదా ఉంది. అప్పటికే ఉదయం నుండి వాయిదాలు వింటూ వస్తున్న అనసూయమ్మకి సత్తెమ్మ కేసు అంటేనే గుండె దడగా ఉంది. సత్తెమ్మ 20 ఏళ్ళ అమ్మాయి. పేదరికాన్ని, అవిద్యని మూటగట్టిన ఆమె ఆహార్యాన్ని పక్కనబెట్టి చూస్తే అనసూయమ్మకి సత్తెమ్మ తన కూతురిలా అనిపిస్తుంది.  సత్తెమ్మ ఒక ముద్దమందారమయితే, ఉన్నత విద్య కలిగి, విలాసమైన భవంతి లో తిరిగే అనసూయమ్మ కూతురు ఓ గులాబి అంతే తేడా.

సత్తెమ్మ భారంగా నడుచుకుంటూ పంటి బిగువున భాదని దిగమింగి వస్తూ ఉంటే, అనసూయమ్మకి పొత్తు కడుపులో ఎవరో కాలితో తన్నినంత నొప్పిగా అనిపించింది. అధికారం తనని కట్టిపడేయకపోతే తనలోని మమకారం ఆ కోర్టులో ఆక్రోశించేది. సత్తెమ్మ వచ్చి జడ్జి ముందు నిలబడి “దండాలమ్మ” అని నీరసంగా అంది. ఇంతకష్టంలోనూ అమ్మా అని పిలిచి ఈ జాతి సిగ్గుపడేలా చేసింది ఈ చిన్నితల్లి అనుకుంది అనసూయమ్మ మనసులో. “ఆ అమ్మాయికి కుర్చీ వేయండి” అని ఆదేశించింది.ఆ గొంతులో అధికారం మాత్రమే ధ్వనించింది. మమకారం గుండెల్లోనే ఆగిపోయింది.

ప్రాసిక్యూటర్ అనంతలక్ష్మి రోజూ ఎన్నో కేసులు చూస్తూ ఉంటుంది. అందుకే యధాలాపంగా వచ్చి కేసు వివరాలు చెప్పుకుంటూ పోతుంది. అనసూయమ్మ సత్తెమ్మ వాలిపోతున్న కళ్ళ వైపే చూస్తుంది. మధ్య మధ్యలో పళ్ళ బిగువున భాదని ఓర్చుకుంటున్న సత్తెమ్మ కష్టం అనసూయమ్మ తప్ప ఎవరూ గమనించలేదు. సత్తెమ ఇప్పుడు పచ్చిబాలింతరాలు. రెండురోజుల ముందే ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులంటే అత్యంత శ్రద్ద చూపించే మన ప్రభుత్వ డాక్టర్లు ఆమెకు సిజేరియన్ చేసారు. పైసా కూడా ఇచ్చుకోలేని రోగి మీద సమయం వెచ్చించటం వృధా అని బియ్యపుసంచి కుట్టినట్టు కుట్టి పడేసారు. ఆ నొప్పితో ఆమె పడుతున్న భాదని ఊహించుకుంటేనే అనసూయమ్మకి కడుపులో ప్రేవుల్ని ఎవరో మెలితిప్పిన భావన కలుగుతుంది. కుర్చీలొ కుదురుగా కూర్చోలేక అసహనంగా కదులుతూ ఉంది.

సత్తెమ్మ ఒక సాదారణ రైతు కూలీ కిట్టయ్య కూతురు. ఊరులో ఉన్న ఒక్క ఎకరా పొలం పండక కూలీలుగా మారి మొత్తం కుటుంబం కష్టపడుతూ ఉండేది. సత్తెమ్మ చూడ చక్కని అమ్మాయి. హైదరాబాదులో ఒక అపార్ట్‌మెంట్లో వ్యాచ్‌మాన్‌గా పనిచేసే వీరిబాబు సత్తెమ్మని పెళ్ళి చేసుకుంటా అని అడిగాడు. దానికి బదులుగా పొలానికి కావాల్సిన విత్తనాలకి మిగిలిన పనుల మదుపుకి 10వేలిస్తాని కిట్టయ్యని వొప్పించి పెళ్ళి చేసుకున్నాడు. కొన్నాళ్ళు సంసారం సాఫీగానే సాగింది. సత్తెమ్మ ఆ అపార్ట్‌మెంట్లో కొన్ని ఇళ్ళకి పాచి పనులు చేసి ఎంతో కొంత తెచ్చేది. వీరిబాబు కి రోజులు గడుస్తున్న కొద్ది సత్తెమ్మ మీద మోజు తీరిపోయింది. తానిచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని లేకపోతే నీ కూతుర్ని ఏలుకోనని కిట్టయ్య కి కబురు పెట్టాడు. కిట్టయ్యకి ఆ సంవత్సరం కూడా కలిసి రాలేదు. అల్లుడిచ్చిన డబ్బు పొలం మీద పెడితే ఇంకా 5వేలు అప్పు మిగిలిందే తప్ప పైసా కూడా లాభం లేదు. తన నిస్సహాయతని పెద్దల ముందు చెప్పాడు. కుల పెద్దలు వీరిబాబుని పిలిచి మందలించి పంపారు.

అది జరిగిన తర్వాత వీరిబాబులో మంచి లక్షణాలు పూర్తిగా అడుగంటిపోయాయి. తాగి వచ్చి పెళ్ళాన్ని కొట్టడం లాంటివి చేసేవాడు. ఒకరోజు వీరిబాబు లేని సమయంలో సత్తెమ్మకి వాంతులయ్యాయి.డాక్టర్ తల్లివి కాబోతున్నావు అని చెప్పాడు. ఆ మంచివార్త చెబుదామని ఇంటికి వెళ్ళిన సత్తెమ్మకి ఇంట్లో స్నేహితులతో మందు తాగుతూ వీరిబాబు కనిపించాడు. అలా రాత్రి దాకా తాగి వీరిబాబు మత్తుగా పడిపోయాడు. లోపల ఒంటరిగా పడుకున్న సత్తెమ్మని వెనుకనుండి వచ్చి మూతికి గుడ్డకట్టి బలవంతంగా తెల్లారే దాకా అనుభవించి వీరిబాబు స్నేహితులు పారిపోయారు. తెల్లారితే నిజం తెలిసిన వీరిబాబు జరిగిన తప్పుకి తలొంచి ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్యం చేయించాడు. పోలిసులకి తెలిస్తే పరువుపోతుందని పిర్యాదు చెయ్యలేదు. మందుషాపు దగ్గర తరుచూ కనిపించి అప్పుడప్పుడు మందుపోయించే ఆ స్నేహితులు మరలా కనిపించలేదు. కానీ సత్తెమ్మని అబార్షన్ చేయించుకోమన్నాడు. తాను కుదరదని తెగేసి చెప్పి ఇంటికి వచ్చేసింది. రేపొద్దున సత్తెమ్మ కడుపులో బిడ్డ నాదంటే నాది అని స్నేహితులు గేలిచేస్తారని, లోకం నవ్వుతుందని భయపడ్డ వీరిబాబు  రాత్రిపూట సత్తెమ్మ గొంతులో బలవంతంగా నాటుమందుపోయటానికి ప్రయత్నిస్తుంటే తప్పించుకోవటానికి సత్తెమ్మ చేతికి దొరికిన కర్రతో వీరిబాబుని కొట్టింది. తగలరానిచోట తగిలిన వీరిబాబు చచ్చిపోయాడు. ఊరునుండి  వచ్చిన వీరిబాబు కుటుంబం సత్తెమ్మని అనుమానించి, వివాహేతర సంభందాన్ని అంటగట్టి పోలీసు కేసు పెట్టారు.

కొన్నాళ్ళు కేసునడిచాక కోర్టులో సత్తెమ్మకి శిక్ష ఖరారు చేసారు. కోర్టు చుట్టూ తిరగటం తప్పిందని అనుకుంటున్న సత్తెమ్మకి నెలలు నిండాయి. ఇప్పుడు బిడ్డని చేరదీసే దిక్కులేకుండా పోయింది. పుట్టింటోల్లు, అత్తింటివాళ్ళు ఎవరూ చేరదీయటానికి ముందుకు రాలేదు. కాదూ కూడదని పంచాయితీ చేస్తే పిల్లని తీసుకు వెళ్ళినట్టే తీసుకెళ్ళి చంపేస్తాం. ఈ పాపాన్ని మోసే శక్తిమాకులేదని ఖరాఖండీగా చెప్పేసారు. పుట్టిన బిడ్డని జైలులో ఉంచటం కుదరదని జైలు అధికారులు తేల్చి చెప్పారు. సత్తెమ్మ తనతో బిడ్డని జైలులో ఉంచమని న్యాయపోరటం మొదలు పెట్టింది. కోర్టు చుట్టూ తిరుగుతూ ఉండగానే ఒకరోజు నొప్పులుమొదలయ్యాయి. ఆసుపత్రిలో బిడ్డకి జన్మనిచ్చింది. అదిజరిగిన రెండురోజులకే కేసువాయిదా అసుపత్రినుండి కోర్టుకి వచ్చింది.

వాదనలన్నీ విన్నాక అనసూయమ్మ తనబిడ్డని జైలులో ఉంచటం కుదరదని, సత్తెమ్మ విడుదలయ్యేంతవరకు ప్రభుత్వ వసతి గృహంలో ఉంచమని ఆదేశించింది. బిడ్డకి తల్లిపాలు కొన్నాళ్ళ వరకు అవసరం కాబట్టి కొన్నిరోజులు జైలులో ఉంచటానికి అనుమతినిచ్చింది. చట్టం పరిదికి లోబడి తనతీర్పునిచ్చి వెళ్ళిపోతున్న అనసూయమ్మతో “20 ఏళ్ళు వచ్చిన నాకే ఆశ్రయం,రక్షణ దొరకని ఈ లోకంలో ఈ పసిదానికి దిక్కెవరమ్మా? నీ బిడ్డలాంటిదాన్ని కాస్త కరుణించమ్మా” అంటూ మోకాళ్ళ పైబడి సత్తెమ్మ బ్రతిమాలుతూ ఉంది. అంతలోనే నరాలు మెలేసినట్టు గావుకేక పెట్టింది. సిజేరియన్ కుట్లు ఊడి నొప్పితో నేలపైనబడి ఉండచుట్టుకుపోయింది. క్షణం బ్రతకటంకంటే చావే మేలేమో అనే భయంకరమైన నొప్పి. అనసూయమ్మ ఆగలేకపోయింది. పరిగెత్తి వెళ్ళి సత్తెమ్మని చేరుకుని ఒడిలోకి తీసుకుంది. సిబ్బంది సహాయంతో ఆసుపత్రికి పోన్ చేసి ఆంబులెన్స్ తెప్పించింది. తనుకూడా అంబులెన్స్ లో బిడ్డని చేతుల్లో పట్టుకొని ఎక్కింది. సత్తెమ్మ భాదకి “చచ్చిపోతున్నా, ఈ నొప్పి భరించటం నా వళ్ళ కాదు. నన్ను చంపేయమని” ఏడుస్తుంది. మరోపక్క రెండే రోజుల పసిబిడ్డ ఆకలితో పేగులు ఎండి ఏడుపు మొదలుపెట్టింది. అనసూయమ్మకి తన నిస్సాహయతని భరించటం కంటే ఈ క్షణంలో గుండె ఆగిపోతే బావుంటుందనిపించింది. సత్తెమ్మ అంతనొప్పిలోనూ పసిబిడ్డని దగ్గరకి తెమ్మని అడిగి పాలిచ్చింది.

ట్రాఫిక్‌లో అంబులెన్స్ ముందుకు వెళ్ళలేక ఆగింది. సత్తెమ్మ ఏడుపూ, ఊపిరి కూడా. పసిబిడ్డ ఇంకా పాలుత్రాగే ప్రయత్నం చేస్తూనే ఉంది. అనసూయమ్మ అ పసిబిడ్డని అందుకుంది. ఈ వయస్సులో ఒక ఆడపిల్లని పెంచే భాద్యతను భుజాలకెత్తుకుంది.

9 comments మే 20, 2009

నేను కవిని కాదన్నవాడ్ని కత్తితో పొడుస్తా.

 

ముగ్ధ మోహనం

ముగ్ధ మోహనం

అమావాస్య చీకటిలో
కారడవిలో నడవలేనా?
…..నీ నవ్వుందిగా నా వెంట!

   *********

అమృతం తో కలిపి అన్నింటినీ ఇచ్చేసి
నిన్ను మాత్రం దాచేసింది పాలకడలి
…..నా కోసం.

   *********

ఆ కొలనులో కలువలకి
నవ్వటం రాదు
…..నీ కళ్ళలా.

   *********

దేవుడికి ఇంకా అంతు పట్టలేదు
సప్తవర్ణాలు కాక ఏ వర్ణం తో చేసాడో
…..నిన్ను.

   *********

నీలా ఉండాలని ఆ చందమామకి ఎంత ఆశో!
పాపం నువ్వే ఒక్కరోజు తనలా ఉండకూడదూ.

35 comments ఏప్రియల్ 29, 2009

మలిసంధ్య

 ఆనందరావు గోదావరిలో హైదరాబాద్ బయలుదేరారు. చిన్న నాటి మితృడు శంకరరావు స్వచ్చంధ పదవీవిరమణ చేస్తూ తన అప్తులందరినీ ఆహ్వానించాడు. ప్రవాహగమనం లో పాయలుగా విడిపోయిన నదీ జలాలు, సముద్రంలో కలిసేచోట తనని తాను కనుగున్న అనుభూతి ఆనందరావుకి ఇప్పటికే మొదలయ్యింది. ఏరోజు విడిపోయే ప్రసక్తే లేదు, స్నేహమేరా జీవితం అని పాడుకొనే యవ్వనం చరిత్ర పుస్తకాల్లో సిరా చుక్కలుగా మారి రెండు దశాబ్దాలయ్యింది. జీవితంలో తలో దిక్కులో చేతనయిన వేగంలో పరిగెడుతూ, వగరుస్తూ ఎన్నో ఎత్తులూ, పల్లాలు చూసారు.పెళ్ళి, పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్ళిల్లు ఎన్నో మజిలీలు దాటిపోయాయి. కొన్నిసార్లు కొంతమంది మితృలు కలిసినప్పుడు క్లాసులో అందరిగురించి మాట్లాడుకోవటం, ఎవరు ఏంచేస్తున్నారో తెలుసుకోవటం చేయటం వలన అందరినీ కలుసుకోకపోయినా ఒకరి వివరాలు మరొకరికి తెలిసేవి. కానీ ఈనాటికి అందరూ ఒక్కచోట ఖచ్చితంగా కలుసుకోవాలని నిర్ణయించుకుని బయలుదేరారు. అమెరికాలో ఉన్న పావని, లండన్లో ఉన్న సోమశేఖర్ అందరూ వస్తున్నారు. వాళ్ళ హృదయాల్లో ఉప్పొంగుతున్న సున్నిత భావాల్ని ఘనీభవించి ఒక వేదికను చేయబోతున్నారు.

రాజమండ్రి బ్రిడ్జి మీదకు రాగానే లయబద్దంగా వినిపించే రైలు చప్పుడు వింటూ, తల్లి గోదారమ్మ పరవళ్ళు చూస్తూ గతం లోకి జారుకున్నాడు.

********************************************************************
శంకర్‌గాడంటేనే చిన్నఫ్ఫటి నుండి అందరికి ఒక ప్రత్యేకమైన ఇష్టం. వాడిని ఇష్టపడని అమ్మాయిలు, లెక్చరర్లు ఆ కాలేజీలో లేరు. అందుకు మిగిలిన అబ్బాయిలు కాస్తంత ఉడుక్కున్న వాడిని మాత్రం వదిలి ఉండేవారుకాదు. చదువుల్లో వాడు ఫస్టుకాదు, ఆటల్లో వాడు ఫస్టు కాదు కానీ అన్నింటిలో ప్రవేశం ఉంది, తనకంటూ ఒక ప్రత్యేకమైన తనదైన స్థానం ఉంది. ఇక వాడిది అంటూ తిరుగులేనిది కాలేజీ లో స్టేజ్. కాలేజీలో ఏ కార్యక్రమంచేసిన వాడు వ్రాసినవి, చేసినవి నాటకాలు, ఆటలు, పాటలు అన్ని ఉండాల్సిందే. అక్కడ మాత్రం వాడ్ని కొట్టేవాడు లేడు కాలేజీలో. అందుకే వాడికి ఆ ప్రత్యేక గుర్తింపు. శంకర్‌గాడి కాలేజీ రోజులు గురించి చెప్పేప్పుడు జ్యోతిర్మయి పేరు చెప్పకపోతే పూర్తికాదు. జ్యోతి నాన్న ఒక బడిపంతులు. తనకూతురికి చదువుసంధ్యలతో పాటు చక్కగా సంగీతం, నాట్యం నేర్పించాడు. జ్యోతి చాలా అందమయిన అమ్మాయి. కాలేజీ లో అడుగుపెట్టినది మొదలు ఆమెకి వచ్చిన ప్రేమలేఖలు ఫస్ట్ క్లాస్ క్రికెట్ రన్ రేట్ నుండీ 20-20 రన్ రేట్ లా పెరిగిపోయాయి. కానీ ఆమె ఒక నవ్వు నవ్వి మౌనంగా అన్నింటినీ చెత్త బుట్టలో పడేసింది.

జ్యోతి మొట్ట మొదటిసారి శంకర్ తోనే మాట్లాడింది ఆ కాలేజీలో. ఒక కార్యక్రమంలో పాట పాడాలని. తనగాత్రం విని శంకర్ చాలా అభిమానించాడు. ఆ రోజు నుండి శంకర్,జ్యోతి చాలా గొప్ప మితృలయ్యారు. శంకర్ కి కేవలం మితృడిగా మిగిలి పోవాలని లేదు. ఆ అపురూప లావణ్యాన్ని, గాత్రాన్ని, నాట్యాన్ని వదులుకున్నవాడు పిచ్చివాడే అందులో సందేహం లేదు. కాలేజిలో అందరూ కూడా వీరిద్దరిదీ ముచ్చటయిన జంట అని కితాబునిచ్చారు. జ్యోతి పుట్టినరోజుకి శంకర్ తన ప్రేమ విషయం చెప్పాడు.  జ్యోతి మిగిలినవారిని తిరస్కరించినట్టు తిరస్కరించలేదు. అలా అని అంగీకరించలేదు. మా ఇంటిలో వాళ్ళు అంగీకరిస్తే చేసుకోవటానికి అభ్యంతరం లేదని చెప్పింది. శంకర్ దూకుడు జలపాతానికి ఏమాత్రం తీసిపోదు. వెంటనే వెళ్ళి జ్యోతి ఇంటిలో మాట్లాడాడు. వాళ్ళూ కూడా గతంలో శంకర్ గురించి విని ఉండటం వలన, శంకర్ కుటుంబ పరిస్థితులు కూడా తెలియటం వలన ఆనందంగా అంగీకరించారు.

శంకర్ ఆనందానికి హద్దుల్లేవు, అదే ఊఫూలో వెళ్ళి పరీక్షలన్నీ చాలా బాగా వ్రాశాడు. అనుకున్నట్టే మంచి ఫలితాలు వచ్చాయి. హైదరాబాద్ లో ఒక ఉన్నతమైన కంపెనీ లో ఉద్యోగం వచ్చింది. పెళ్ళి ముహుర్తాలకోసం కుటుంబంతో కలిసి జ్యోతి ఇంటికి వెళ్ళాడు శంకర్. జ్యోతి తండ్రి హైదరాబాద్ ఉద్యోగాన్ని ఇష్టపడలేదు. తన కూతురు దగ్గరలోనే అల్లుడితో చల్లగా కాపురం చేస్తే చూడాలన్న అతని కోరిక శంకర్ కి చెఫ్ఫాడు. శంకర్ తను భవిష్యత్తులో ఎక్కాల్సిన శిఖరాలకి ఈ ఉద్యోగం చక్కని అవకాశమని తాను బావిలో కప్పలాగా ఉండలేనని చెప్పాడు. అంతటితో శంకర్ జీవితంలో జ్యొతి అధ్యాయం ముగిసిపోయింది. జ్యోతి మొదట చెప్పినట్టుగా తండ్రి మాటనే అనుసరించింది. పంతంలో దూకుడులో శంకర్ ప్రళయ రుదృడే. ఇది జరిగిన వారంలో జ్యోతికంటే అందమయిన, చదువుకున్న పెద్దింటి సంభందం చూసి చేసుకున్నాడు. జీవితంలో ఓటమంటే ఏంటో తనకి తెలీదని నిరూపించాడు

పెళ్ళై హైదరాబాద్ వెళ్ళిన శంకర్ జీవితంలో మితృలంతా ఫోన్ నంబర్లుగా మిగిలారు. శుభకార్యాలకి గ్రీటింగులు, గిఫ్టులు, టెలీగ్రాములు సరిపోయేవి. మనిషే యంత్రాన్ని తయారు చేసాడు అని శంకర్ జీవితం చూసి చెప్పటం చాలా కష్టం. ముచ్చట పడి పెళ్ళికి కొనుకున్న గడియారం చుట్టూ శంకర్ పరిగెడుతూనే ఉన్నాడు. సంసారం పిల్లలు, చదువులు, పెళ్ళిల్లు అన్ని కూడా ఒక ఖరీదయిన నాటకంలా జీవితంలో గడిచిపోయాయి. పిల్లలు మంచి ఉద్యోగస్తులయ్యారు. మంచి ఇల్లు కట్టుకున్నాడు, కారు కొనుకున్నాడు. అసలు జీవితంలో అనుకున్నట్టే అన్నీ సాధించాడు. చిన్ననాటి మితృలు శంకర్ నే ఒక ఉదాహరణగా తమ పిల్లలకి చూపించే స్థాయిలో ఉన్నాడు. కాలేజీ రోజుల్లో తెలిసో తెలియకో ఏదో వాగి జీవితంలోని చివరి మజిలీ లో దాన్ని సాధించలేకపోతే ఉండే భాద సామాన్యమైనది కాదు. ఒక జీవితం మొత్తం వ్యర్ధమైపోయింది, ఇంకేమీ మిగల లేదు అనే భావన చాలా భయంకరమయింది. అలాంటి పరిస్థితి తనకి లేదని శంకర్ గర్వపడేవాడు.

కాలచక్రం తో బొంగరాలాడే పైవాడు ఇంకా ఆడుతూనే ఉన్నాడు. అదీ గిర్రున తిరుగుతూనే ఉంది. శంకర్ ఒక పెళ్ళికి రాజమండ్రి వెళ్ళాల్సి వచ్చింది. పెళ్ళిళ్ళకి బొత్తిగా వెళ్ళని శంకర్ వ్యాపార సంభందాలున్న మితృడి కొడుకు పెళ్ళి కావటంతో వెళ్ళక తప్పలేదు. పెళ్ళి లో కూర్చుని వచ్చేపోయే వార్ని గమనిస్తూ ఉన్నాడు. ఇంతలో ఎవరో వస్తున్నారని అందరూ వెళ్ళి పలకరించటంతో అటుగా చూసాడు. పరాకుగా చూసి ఎవరో తెలిసిన వాళ్ళనిపించి పరీక్షగా చూసాడు. జ్యోతి…. 20 ఏళ్ళ తర్వాత తను బాగా ఎరిగిన జ్యోతిని చూసి శంకర్ మనస్సు ఎగిసిపడింది. పట్టు చీరతో పెద్ద బొట్టు మెడ దగ్గర, చేతుల దగ్గర కనిపిస్తున్న పచ్చని చాయ నిండు ముత్తైదువు. సాక్షాత్తు గోదారమ్మ కొబ్బరి తోటల పచ్చదనాన్ని చీరగా కట్టి వచ్చినంత ఆహ్లాదంగా ఉంది. వెళ్ళి పలకరించాలా వద్దా? తను ఉన్న గొప్ప స్థానం తనకి చెప్పాలన్న ఆశ ఉన్నా ఏదో తెలియని అలజడి. అలా సందిగ్దంలో ఉండగా తనే చూసి పలకరించింది. తన వివరాలు చెప్పి వీలయితే ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళమని చెప్పి పెళ్ళి వేదిక వైపు వెళ్ళిపోయింది. తనని కాదన్న జ్యోతి ఎలాంటి స్థితిలో ఉందో చూడలన్న పంతానికి ప్రయాణం ఒక రోజు వాయిదా వేసుకున్నాడు శంకర్రావు.

చిరునామా చూపి మితృడిని అడిగాడు ఎలా వెళ్ళాలని. తానే స్వయంగా తీసుకు వెళతానని చెప్పి లాంచీ ఎక్కించి తీసుకెళ్ళాడు. లాంచీ దిగి కాస్త నడవగానే బృందావనం అని ఒక పెద్ద బోర్దు కనిపించింది. అందులోకి నడుస్తుంటే అందమయిన తోటల మధ్యలో ఇంకా అందమయిన కుటీరాలు. అన్ని రకాల పూలు, చెట్లతో నిజంగా బృందావనమేనేమో అనిపించేలా ఉంది. కమ్మని స్వరం వినిపించటంతో ఇద్దరూ అటుగా కదిలారు. అప్పటికే శంకర్ కి తాను ఉన్నది తను రోజూ బ్రతుకుతున్న భూమి మీదన లేక కలగంటున్నానా అనే అనుమానం వెంటాడుతుంది. పక్షుల అరుపులు, చల్లని గాలి, కళ్ళెదుటే గోదారమ్మ పరవళ్ళు జీవితం ఈ క్షణంలో స్థంబించిపోతే బాగుంటుంది అనే భావన. స్వరం వినిపించిన వైపు వెళితే జ్యోతి కొంతమంది పిల్లల్ని కూర్చో బెట్టుకుని ఆలాపిస్తుంది. శంకర్ తనని పిలిచే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే బృందావనంలో వేణుగానం వినే అవకాశం వస్తే వదులుకోవటం సాధ్యమా? తన ఆలాపన పరిసరాలలో మాధుర్యాన్ని నింపుతుంది. అలా సమయం తెలియకుండా చాలాసేపు నిలబడి పోయాడు శంకర్. జ్యోతితో మాట్లాడకుండానే వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఓటమిని అంగీకరించే శక్తి శంకర్ కి ఎప్పుడూ లేదు.మితృడి ద్వారా వివరాలు తెలుసుకున్నాడు.

జ్యోతి భర్త డిగ్రీ వరకు చదివి పెద్దలనుండీ వస్తున్న వ్యవసాయాన్నే ఎంచుకున్నాడు. సాంప్రదాయలని ఇష్టపడే ముచ్చటైన కుటుంబం వారిది. జ్యోతిలో ఉన్న కళ వ్యర్ధంకాకూడదని ఒక ఆశ్రమాన్ని కట్టించి వేసవి సెలవుల్లో పిల్లలకి నామ మాత్రం ఖర్చులతో సంగీతాన్ని, నాట్యాన్ని నేర్పించే ఏర్పాటు చేసాడు జ్యోతి భర్త. చిన్న పిల్లలకి నీతి కధలు, పురాణాలు చెఫ్ఫే ఏర్పాట్లు చేసాడు. వేసవిలో పిల్లలకి వినోదాన్ని, విఙ్ఞానాన్ని అందించే వారు. పిల్లలకి విపరీతంగా నచ్చి వేసవి సెలవులకోసం ఎదురుచూసేలా నడుస్తుంది ఆ ఆశ్రమం. మొత్తం తెలుసుకున్న శంకర్‌కి ఒక అలజడి మొదలయ్యింది. జీవితంలో ఏదో కోల్పోయాననే భావన ఎక్కువయ్యింది. నా తోటి వాళ్ళవద్ద ఓడిపోబోతున్నా అనే ఆలోచన వెంటాడింది. చాలా రోజులు తిండి, నిద్ర సహించలేదు. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తునే గడిపాడు. పనిమీదకి మనసు బొత్తిగా పోలేదు. ఇంటిలో కూడా అందరూ ఆందోళన పడ్డారు. అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. స్వచ్చంధ పదవీవిరమణ చేస్తున్నట్టుగా ఆఫీస్ లో అందరికీ చెప్పేసాడు.
*********************************************************************************

ఆనందరావ గోదావరి దిగి ఫోన్ చేసాడు. కారులో వచ్చి శంకర్ పెద్ద కొడుకు ఇంటికి తీసుకు వెళ్ళాడు. అక్కడనుండి శంకర్  ఊరు చివరకొత్తగా కట్టిన ఇంటికి తీసుకు వెళ్ళాడు. చుట్టూ తోట మధ్యలో ఇల్లు చాలా ఆహ్లాదంగా ఉంది. ఇల్లుకూడ చాలా వరకు పాత కాలం నాటి ఇల్లులా చాలావరకూ చెక్కతో కట్టిన మిద్దె ఇల్లు, కాంక్రీటు భూతం లా కాక ఆహా అనిపించేలా ఉంది. కానీ ఖరీదయిన భవంతుల్లో గడిపే స్థాయి ఉన్న శంకర్ ఇలాంటి ఇల్లు కట్టుకోవటం నమ్మలేకపోయాడు ఆనంద్. లోపల అడుగు పెడితే ఏ చక్రవర్తో మనసు పడి తన రాణీవాసంకోసం కట్టించిన కట్టడంలా అద్భుతంగా నగిషీలు చెక్కి ఉన్నాయి. ఒక గదిలో సంగీత పరికరాలు, గొప్ప గొప్ప సంగీత విద్వాంసుల పాటల సిడీలు, మరో గదిలో ఆధునిక, ప్రాచీన సాహిత్యంలో వెలువడిన పుస్తకాలు పెద్ద పెద్ద చెక్కబీరువాల్లో ఉన్నాయి. ఇంటి వెనుక గా ఒక చిన్న కృత్రిమ సరస్సు అందులో నిజమైన కలువలు. శంకర్ నిజంగా చాలా గొప్పవాడే వాడి శేష జీవితం కూడా మన తరాలకి ఉదాహరణ కాబోతుందని అనుకున్నాడు ఆనంద్.

అక్కడ నుండి కార్యక్రమ వేదిక వద్దకి అందరూ సమయానికి చేరుకున్నారు. ఊరిలో పెద్దలంతా వచ్చారు. ఏవో సాంస్కృతిక కార్యక్రమాలు సాగుతునే ఉన్నాయి. ఎన్నో ఏళ్ళ తర్వాత కల్సిన మితృల కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి, ఉద్వేగం, ఉద్రేకం అభిమానం, ఆనందం అన్నీ ఆక్కడే కనిపిస్తున్నాయి. అందరి జీవితాల్లోని కష్టాలు, సుఖాలు మాటల రూపంలో ఆ ప్రదేశంలో పొంగి పొర్లుతున్నాయి. వేదికనెక్కి అందరూ శంకర్ విజయాల గురించి, కాలేజి నుండి నేటి వరకు అతని విజయ వంతమైన జీవితం గురించి మాట్లాడుతూనే ఉన్నారు. కార్యక్రమం అధ్బుతంగా జరిగింది, అంతా ఒక కలలా జరిగి ముగింపుకి వచ్చింది. శంకర్ ఇద్దరు కొడుకులూ ఒక మంచి కారు కొని తెచ్చి శంకర్ కి బహుమతిగా ఇచ్చారు. అందులో శంకర్, శంకర్ భార్య ఎక్కి కొత్త ఇంటికి బయలుదేరి వెళ్ళాలని కొడుకులు పట్టుబట్టారు. శంకర్ పెదవులమీద ఒక గర్వంతో కూడిన నవ్వు. జీవితంలో తనకి ఎప్పటికీ ఓటమే లేదని మనసులో అనుకుంటూ కారు ఎక్కుతూ కుప్పకూలి పడిపోయాడు. ఆసుపత్రికి తీసుకు వెళ్ళేసరికే చనిపోయాడు. ఒక్కచోట చేరిన మితృలంతా హృదయ విదారకంగా ఏడ్చారు ఏడ్చారు ఏడుస్తునే ఉన్నారు. అన్నీ ముగిసాయి. గోదారమ్మ శంకర్ అస్థికలని తన ఒడిలో చేర్చుకుంది. ఒక్కొక్కరూ తలో మాట అనుకుంటూ భాదగా నిట్టూర్చి తిరుగు ప్రయాణమయ్యారు. “శంకర్ తెలివైనవాడు, సమర్ధుడు. ఒక మంచి అభిరుచి గలవాడీ జీవితం వ్యర్ధమయిపోయిందేమో? వాడు  తలచుకుంటే అతని జీవితం వెన్నెల్లో గోడరిలా ఉండేది కానీ నిరంతరం పరిగెట్టి నిజం తెలుసుకునే సరికే సమయం ముగిసిపోయింది” అన్నారెవరో. “వాడికేం రా? రాజాలా బ్రతికాడు లేని వాడు చెప్పే పనికిమాలిన ఓర్వలేని మాటలివి. ఇదో అల్ప సంతోషం”అన్నాడొకడు. ఎవరి జీవితాల పక్షి గూడులలోకి వాళ్ళు తిరిగి దూరిపోయారు.

మనలో చాలామంది జీవితాలు మొదలు కావటం ఒకేలా చిన్నగా ఉంటుంది. నది జన్మస్థలంలో నీటి ప్రవాహంలా. కానీ ప్రవాహం ముందుకు సాగుతున్న కొద్దీ ప్రతీ మలుపులో కొన్ని పాయలు విడిపోతుంటాయి. కానీ చివరికి చేరాల్సిన గమ్యం మహా సముద్రమే. మనకి కూడా జీవితంలో కొన్ని మలుపుల్లో మన జీవితాన్ని నిర్వచించే ఎంపికలు అనివార్యమవుతాయి. ఆలస్యం చెయ్యొద్దు, కొన్నిసార్లు జీవితంలో రెండో అవకాశం దొరకదు. ఇంతకి శంకర్ గెలిచాడా? ఓడాడా? మీ జీవితంలో మీ ఎంపికలే శంకర్ గెలిచాడో ఓడాడో మీ వరకు నిర్ణయిస్తాయి. ఎంతమంది చదివితే అన్ని ముగింపులు ఈ శంకర్ కధకి.

6 comments మార్చి 19, 2009

మనసున మనసై బ్రతుకున బ్రతుకై..

మనసున మనసై బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము
నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నింపుటకు…

మహానుభావుడు ఎంత అద్భుతంగా వ్రాసాడండి. తోడు ఉంటే సరిపోదు నిన్ను నిన్నుగా అంగీకరించే తోడు. నిజం మనవాళ్ళు మనపక్కనే లేని జీవితం అన్నీ ఉన్నా ఏమీ తినలేని, నిద్రలేని ధనవంతుడి రోగంతో సమానం. ఒకతరం క్రితం ఎంత కష్టం వచ్చినా ఊరువదిలి వెళ్ళేవారు కాదు. ఎవరయినా ఉద్యోగరిత్యా వెళ్ళినా అందరూ భాదపడేవారు ఎంత కష్టం వచ్చింది ఊరువదిలిపోవాల్సి వస్తుందీ అని. పొట్టకూటికి ఎన్నిపాట్లు అని అందరూ జాలి పడేవారు. కానీ ఇప్పుడో మన నాయకులకు భాగ్యనగరం మీద ఉన్న ప్రేమ మనల్ని చచ్చినట్టు ఇక్కడికి రప్పిస్తుంది. తల్లిదండ్రులను, ప్రాణస్నేహితులను వదిలి రావటం. ఎంత కష్టం అండి. దూరాలు పెరిగి ప్రేమలు పెరిగే రోజులు పోయాయి, ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోయి వారి మధ్య ఒక తెలియని అగాధం ఎర్పడుతుంది. చాలాసార్లు నా చినప్పటి స్నేహితులు అనుకోకుండా కలిసినప్పుడు ఏమి మాట్లాడటానికి ఉండదు. ఎవో ఉద్యోగాల గురించి అడిగి ఊరుకుంటా. ప్రవర్తనలో కూడా చనువుపోవటం చూసాను.

నేను హైదరాబాద్ వచ్చినప్పుడు, నా చాలామంది స్నేహితులు నా కూడా వచ్చారు. అందరం ఒకే దగ్గర ఉండటం కొంత బాగుండేది. ఇంటిలో వాళ్ళని దూరమయ్యా అనే భాద ఉన్నా స్నేహితుల మధ్యే ఉండటం వలన మా ఊరిలోనే ఉన్నానేమో అనేట్టు ఉండేది. అయినా మనం ఇష్టపడే మన సొంత ఊరు, మనల్ని మనంగా గుర్తించే మన ఊరివాళ్ళని వదిలి మన ఉనికి మనకే తెలియని, మన ఉనికికి ఏమాత్రం ప్రాముఖ్యత లేని చోటకి రావటం ఏంటండి మన పిచ్చిగానీ.

ఇప్పుడు నా పరిస్థితి మరీ దారుణం. పెనంలో నుండి పొయ్యలో పడ్డట్టు అయ్యింది. ఆఫీసు పని మీద చద్దికూడూ తినే ఈ అమెరికాకి పొట్టకూటికి వచ్చా(ఈ వ్యాఖ్య ఎవరినయినా భాదిస్తే క్షమించండి). కనీసం నా పక్కనే ఉండే నా స్నేహితులు కూడా లేకపోయేసరికి నా మీద నాకే జాలి కలుగుతుంది. ఎంత పనికిమాలిన పసలేని జీవంలేని జీవితం గడుపుతున్నాను అని. మన ఇంటిలో ఇరుగు పొరుగు స్నేహితులతో తినే పచ్చడిమెతుకుల్లో ఉండే ఆనందం ఇక్కడ డాలర్లు పెట్టి కొనుక్కుతినే చద్దికూడు లో ఉంటుందా? పోనీ నా జీవితం లో వయస్సు 50 వచ్చేవరకు ఇలాగే కష్టపడి కడుపుకట్టుకుని, అందరికి దూరంగా నేను ఇష్టపడే నా ఊరికి దూరంగా ఉంటా, ఉండి 50 ఏళ్ళకి నేను దాచుకున్నదానితో ఏమి చెయ్యాలి? హాస్పిటల్కి కట్టాలి. ఎందుకంటే అప్పటికి ఖచ్చితంగా అన్ని రోగాలు వచ్చేస్తాయిగా.

నా స్నేహితులని, కుటుంబాన్ని ఎంతగా మిస్సవుతున్నానో నిన్న ఒక గంట ఏకాంతంలో కూర్చున్నప్పుడు తెలిసింది. అవును మనస్సుకి మొహమాటం ఎక్కువ అందరూ ఉన్నప్పుడు సందడిగా ఉన్నప్పుడు మాట్లాడదు. ఏకాంతంలో మాత్రమే మాట్లాడుతుంది.
అవును ఏకాంతం నీతో చాలా ఊసులాడుతుంది.
ఏకాంతం నీలో ఉన్న నిన్ను నీకు చూపిస్తుంది.
ఏకాంతం నీ వాళ్ళని నీకు పరిచయం చేస్తుంది.
ఏకాంతం నీ గత స్మృతులను మోసుకొస్తుంది.
ఏకాంతం నిన్ను ఏడిపిస్తుంది, ఓదారుస్తుంది.

పైన చెప్పినవన్నీ నిజాలు. నేను అనుభూతికి లోనవుతున్న భావాలు. లేకపొతే అక్కడ మనదేశంలో నా వాళ్ళందరూ ఘాడ నిద్రలో ఉంటే నేనెందుకు వారిగురించి ఆలోచిస్తున్నా. ఏకాంతంలో కూర్చుని నా ఫస్ట్ క్రష్ నుండి ప్రతీ ఒక్కరిని తలచుకుని ఎందుకు భదపడుతున్నా. నన్ను వదిలివెళ్ళిపోయిన వాళ్ళని సహితం ఒక్కసారి చూడాలని ఎందుకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒంటరితనం. మనకి మనమే తవ్వుకున్న గొయ్యలాంటి ఒంటరితనం. నేను అమెరికా వస్తే మా మురళీ అమెరికా వెళ్ళాడు అని నా స్నేహితులు కుటుంబ సభ్యులు గర్వంగా చెప్పుకుంటుంటే. నేను వాళ్ళకి “ఐ మిస్ యు” అని చాలా కృతకంగా. కృత్రిమంగా చెప్పాలా? చెబితే నన్నో చవటాయి లేదా కెరీర్ ఆబ్జెక్టివ్ లేని వెదవాయి అనుకుంటారు. అవకాశాలు చేతిలో ఉంచుకుని చంటిపిల్లాడిలా ఏంటిది అనుకుంటారు. అనుకోనివ్వండి ఇంతకు మించి నటించటం నావల్ల కాదు. ఇప్పటికే నేను మిమ్మల్నందరిని వదిలి ఉండలేకపోతున్నా అని చెప్పలేక ఇగోతో ఇంతకాలం నడిపించుకుంటూ వచ్చా. ఇక నావల్ల కాదు. గట్టిగా అరవాలని ఉంది నాకు డబ్బు అధికారం దర్పం కంటే మీరు కావాలి. మీ అభిమానం కావాలి.

నే ఇసుకతో ఇల్లు కడితేనే మురిసిపోయి నన్ను ఊరేగించిన భుజాల తోడుకావాలి.
అ ఆ లు రాస్తేనే సంబరపడి హత్తుకున్న చేతులు కావాలి.
గల్లీ క్రికెట్లో సిక్సర్ కొడితే అబ్బురపడి ప్రోత్సహించిన చప్పట్లుకావాలి.
ఏంచేసినా సై అని నావెంటే ఉండే అడుగులు కావాలి.
చింపిరి జుట్టుతో నే స్టైల్ కొట్టినా నా అమాయకపు ప్రేమని గుర్తించిన ఆ చిరునవ్వు కావలి.
ఇవన్నీ మనజీవితంలో రోజూ మరలా మరలా జరగటానికి తగినంత సమయం కావాలి.

ఏదో ఒకటి చేస్తాను ఇవన్నీ తెచ్చి మీకోసం ఎదురుచూస్తూ ఉంటాను…….

10 comments మార్చి 16, 2009

Previous Posts


మెటా

ఖజానాలు

ఇటీవలి జాబులు

మైలురాళ్ళు

ఉత్తమ టపాలు

ఇటీవలి అభిప్రాయములు

kangaaroo on కాకి దిద్దిన కాఫురం (!?!)
K.Rao on ఆమె,నేను,కొన్ని ఊహలు..
M. Nagarjuna on ఆమె,నేను,కొన్ని ఊహలు..
Toon India on ఆమె నన్ను వదిలి వెళ్ళిపోయ…
pavan on ఆమె నన్ను వదిలి వెళ్ళిపోయ…

లింకులు

Copy Right

Page copy protected against web site content infringement by Copyscape